ప్రధానమంత్రి లేఖ

Published By : Admin | September 22, 2025 | 17:23 IST

నా దేశ ప్రజలారా,

నమస్కారం!

దేశంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ శుభవేళ మీకు, మీ కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్నీ, సంతోషాన్నీ, సమృద్ధినీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఈ ఏడాది, పండుగ సమయాల్లో ఆనందం రెట్టింపయ్యేందుకు మరో కారణం ఉంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణల అమలు ప్రారంభమైంది. దీంతో దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ పొదుపు ఉత్సవం’ లేదా ‘జీఎస్టీ పొదుపు పండుగ’ కూడా మొదలైంది.

ఈ సంస్కరణలు పొదుపును పెంచుతాయి. రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులూ ఎంఎస్ఎంఈలూ... ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ నేరుగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అవి అభివృద్ధినీ పెట్టుబడులనూ ప్రోత్సహిస్తూ.. ప్రతీ రాష్ట్ర, ప్రాంత పురోగతిని వేగవంతం చేస్తాయి.

ప్రధానంగా 5 శాతం, 18 శాతం శ్లాబులు ఉండటం ఈ కొత్త జీఎస్టీ సంస్కరణల్లో ముఖ్యాంశం.

ఆహారం, ఔషధాలు, సబ్బులు, టూత్‌ పేస్టులు, బీమా వంటి రోజువారీ నిత్యావసరాలు, అనేక ఇతర వస్తువులు ఇప్పుడు పన్ను రహితంగానో, లేదా కనిష్ఠ శ్లాబు 5 శాతం పరిధిలోకో వస్తాయి. గతంలో 12 శాతం పన్ను విధించిన వస్తువులు దాదాపుగా 5 శాతం పరిధిలోకి వచ్చాయి.

పన్నులు- సంస్కరణలకు ముందు, ఆ తర్వాత అంటూ తేదీలను సూచించేలా అనేక మంది దుకాణదారులు, వర్తకులు ‘నాడు, నేడు’ పేరుతో బోర్డులు పెట్టడం సంతోషాన్నిస్తోంది.

గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు. దీంతో ఆశావహమైన నయా మధ్యతరగతి ఏర్పడింది.

అంతేకాకుండా, ఆదాయపు పన్నును భారీగా తగ్గించడం ద్వారానూ మన మధ్యతరగతిని బలోపేతం చేశాం. రూ. 12 లక్షల వరకూ వార్షికాదాయంపై పన్ను ఉండబోదు.

ఆదాయపు పన్ను మినహాయింపులు, కొత్త జీఎస్టీ సంస్కరణలను కలిపి చూస్తే.. వాటి వల్ల ప్రజలకు దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయి.

మీ ఇంటి ఖర్చులు తగ్గుతాయి. ఇల్లు కట్టుకోవాలనో, వాహనం కొనుక్కోవాలనో, గృహోపకరణాలను కొనుక్కోవాలనో, బయట తినాలనో అనుకుంటున్నా, లేదా కుటుంబంతోపాటు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా... ఇప్పుడవన్నీ సులభంగా నెరవేరుతాయి.

2017లో మన దేశ జీఎస్టీ ప్రయాణం ప్రారంభమైంది. మన ప్రజలను, వాణిజ్యాలను అనేక పన్నుల ఉచ్చు నుంచి విముక్తులను చేసే దిశగా ఇదొక కీలక మలుపు. జీఎస్టీ దేశాన్ని ఆర్థికంగా ఏకం చేసింది. ‘ఒక దేశం, ఒకే పన్ను’.. ఇది ఏకరూపతనూ ఉపశమనాన్నీ అందించింది. కేంద్రం - రాష్ట్రాలు రెండింటి క్రియాశీల భాగస్వామ్యం ఉన్న జీఎస్టీ కౌన్సిల్.. అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంది.

ఇప్పుడీ కొత్త సంస్కరణలు మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. వ్యవస్థను సరళీకృతం చేస్తూ, ధరలను తగ్గిస్తాయి. ప్రజలు మరింతగా పొదుపు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి.

మన చిన్న పరిశ్రమలు, దుకాణదారులు, వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకూ కూడా వాణిజ్య సౌలభ్యంతోపాటు నిబంధనల అనుసరణ కూడా సరళతరం అయింది. తక్కువ పన్నులు, తక్కువ ధరలు, సరళమైన నియమాల ద్వారా.. అమ్మకాలు పెరగడమే కాకుండా అనుమతుల భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగంలో అవకాశాలు పెరుగుతాయి.

2047 నాటికి వికసిత్ భారత్ సాధన మనందరి లక్ష్యం. దానిని సాకారం చేసుకునేందుకు ఆత్మనిర్భర మార్గంలో ప్రయాణించడం కీలకం. ఈ సంస్కరణలు మన స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయి. దాంతో ఆత్మనిర్భర భారత్ దిశగా మార్గం సుగమం అవుతుంది.

ఇందుకోసం ఈ పండుగ వేళ.. భారత్‌లో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని కూడా సంకల్పిద్దాం. అంటే.. బ్రాండ్‌తోనూ వాటిని తయారు చేసిన కంపెనీతోనూ నిమిత్తం లేకుండా భారతీయులు చెమటోడ్చి, శ్రమించి తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం.

మన కళాకారులు, కార్మికులు, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తిని మీరు కొంటున్నారంటే.. అనేక కుటుంబాలు జీవనోపాధిని పొందేందుకు మీరు దోహదపడుతున్నారన్నమాట. మన యువతకు ఉద్యోగ అవకాశాలనూ కల్పించినవారవుతారు.

భారత్‌లో తయారైన ఉత్పత్తులనే విక్రయించాలని మన దుకాణదారులు, వ్యాపారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

గర్వంగా చెబుదాం – స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేద్దాం.

గర్వంగా చెబుదాం – స్వదేశీ వస్తువులనే విక్రయిద్దాం.

పరిశ్రమలను, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని, పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను.

మరోసారి మీకు, మీ కుటుంబాలకు నవరాత్రి శుభాకాంక్షలు. ఈ పండుగ సమయం మీ అందరిలో సంతోషాన్ని నింపాలని, ‘జీఎస్టీ పొదుపు పండుగ’ మీ ఆదాయాన్ని విశేషంగా పెంపొందించాలని కోరుకుంటున్నాను.

ఈ సంస్కరణలు ప్రతి భారతీయ కుటుంబంలోనూ మరింత సమృద్ధిని తీసుకురావాలని కాంక్షిస్తున్నాను.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report

Media Coverage

India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
భారతదేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం
July 06, 2026

ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు.


సురక్షిత, సుఖవంతమైన జీవితానికి లోటు లేని బాల్యం ఆయనది. శ్యామా ప్రసాద్‌ తండ్రి, సర్ అశుతోష్ ముఖర్జీ సమకాలీన అగ్రశ్రేణి విద్యావేత్తలలో.. మేధావులలో ఒకరు. అలాంటి సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. అంతటి తీవ్ర వ్యక్తిగత విషాదాలను చవిచూసినప్పటికీ దేశ సేవపై ఆయన సంకల్పం మరింత బలపడి, తిరుగులేని నిబద్ధతతో ముందుకే నడిపింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే- అవిభాజ్య భారత్‌ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్‌ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. చరిత్రలో కొన్ని క్షణాలుంటాయి.. అంతిమ శ్వాసలోనూ ఒక వ్యక్తి త్యాగం రాజకీయాలకు అతీతంగా జాతీయ స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటువంటి క్షణాల్లో డాక్టర్ ముఖర్జీ జీవన ప్రస్థానం ఒకటిగా మిగిలింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు- తాను విశ్వసించిన ఆదర్శం కోసం డాక్టర్ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్‌ 370, 35(ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.


డాక్టర్ ముఖర్జీ సదా దేశానికే ప్రథమ స్థానమిచ్చారు... భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణంగా ఆనాటి సంప్రదాయ ఆలోచనలకు సవాలు విసురుతూ సంస్థల, వ్యవస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా- “భవిష్యత్‌ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి” అని కుండబద్దలు కొట్టారు.


డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం అనేక విధాలుగా ముందంజ వేసింది. ఆయన హయాంలో గ్రంథాలయ మౌలిక సదుపాయాల మెరుగుదల, విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు ప్రోత్సాహం, పురావస్తు అధ్యయనం, వ్యవసాయంలో కొత్త కోర్సులకు శ్రీకారం వంటి విశిష్ట కృషి కొనసాగింది. క్రీడలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల సంక్షేమం తదితరాలపైనా ఆయన ఏకకాలంలో దృష్టి సారించారు. ప్రస్తుత-పూర్వ విద్యార్థులలో తమ విశ్వవిద్యాలయంపై సగర్వ భావనను ప్రోది చేస్తూ, ఏటా జనవరి 24న విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, విశ్వవిద్యాలయంపై ఒక పాట రాయాల్సిందిగా గురుదేవులు రవీంద్ర నాథ్‌ టాగోర్‌ను ఆయన అభ్యర్థించారు.


ఈ స్ఫూర్తికి మరో ఉదాహరణ ఆయన జీవిత చరమాంకంలో కనిపిస్తుంది. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్‌’ను రూపుదిద్దాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమయాన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ఎంచుకోవడం గమనార్హం. ప్రమిద ఎంత చిన్నదైనా, దాని వెలుగు స్వల్పమే అయినా తన పరిధికి మించి చీకటిని పారదోలగల శక్తి దానికి ఉంటుందని భావించారు. తదనంతర క్రియాశీల మనుగడలోనూ జనసంఘ్ ఇదేవిధంగా ముందడుగు వేసింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు-పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, అసాధారణ నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో పారిశ్రామిక రంగాన్ని దేశానికి గౌరవం, అవకాశాలు, విశ్వాసాలను పునరుద్ధరించే సాధనంగా ఆయన పరిగణించారు. తదనుగుణంగా సంపద సృష్టిని, విలువ జోడింపును గౌరవించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళాకారులు, వస్త్ర కార్మికులందరూ ఆయనలో అసమాన నిబద్ధతగల మద్దతుదారును కనుగొన్నారు.


ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డాక్టర్ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాబోదు.


సంభాషణలను, చర్చలను ప్రోత్సహించడం భారత నాగరిక సంప్రదాయంలో అనాదిగా అంతర్భాగం. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి డాక్టర్ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్రూ మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు.


పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డాక్టర్ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. అటుపైన 50 ఏళ్ల కిందట ఉదార ప్రజాస్వామ్య విలువల మూలాలపై మరోసారి దెబ్బకొడుతూ 42వ సవరణ చట్టం తెచ్చారు.


మానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ డాక్టర్ ముఖర్జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరువు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్‌ మన్వంతర్‌’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.


ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ- “మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా... క్షుణ్ణంగా... అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్థాంతరంగా వదిలేయకండి... అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి.. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి” అని డాక్టర్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్‌ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో నేటి యువత దృక్పథం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, నేటి సందర్భానికి తగినట్లు వారంతా డాక్టర్‌ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.