మాననీయులైన…

ప్రధానమంత్రి శ్రీ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా,

విశిష్ట అతిథులు, మీడియా మిత్రులారా…

నమస్కారం!

   ప్రధానమంత్రి శ్రీ దేవ్‌బా గారిని భారత పర్యటనకు ఆహ్వానించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇవాళ పవిత్ర భారత కొత్త సంవత్సరాది, నవరాత్రి వేడుకల నేపథ్యంలో శ్రీ దేవ్‌బా మన దేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు భారత, నేపాల్‌ పౌరులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

   దేవ్‌బా గారు భారతదేశానికి చిరకాల మిత్రులు, ప్రధానమంత్రి హోదాలో ఆయన భారత్‌ను సందర్శించడం ఇది ఐదోసారి. భారత-నేపాల్‌ సంబంధాల అభివృద్ధిలో దేవ్‌బా గారు చాలా కీలక పాత్ర పోషించారు.

మిత్రులారా!

   భారత-నేపాల్‌ స్నేహం, మన రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల వంటి ఉదాహరణ ప్రపంచంలో మరెక్కడా కానరాదు. మన నాగరకత, సంస్కృతి, ఆదానప్రదానాలు ప్రాచీన కాలం నుంచి పరస్పరం ముడిపడి ఉన్నవే. అనాదిగా మనం సుఖదుఃఖాల్లో భాగస్వాములుగా ఉన్నాం. మన ప్రజలు, వారిమధ్య ఆదానప్రదానాలే ఈ భాగస్వామ్యానికి పునాది. మన సంబంధాలకు ఎనలేని శక్తినిచ్చి, అవి నిరంతరం కొనసాగేందుకు దోహదం చేస్తున్నది ఇవే. ముఖ్యంగా నేపాల్‌ విషయంలో భారత విధానాలకు, కృషికి స్ఫూర్తినిస్తున్నది ఈ అంశమే. శాంతి, అభివృద్ధి, ముందంజ వైపు నేపాల్‌ పయనంలో భారత్‌ సదా స్థిరమైన భాగస్వామిగా ఉంటోంది.

మిత్రులారా!

   ఇప్పుడు నేను పేర్కొన్నవాటితోపాటు అనేక ప్రధానాంశాలపై ఇవాళ దేవ్‌బా గారితో నా చర్చలు ఫలవంతంగా సాగాయి. మన రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించి విభిన్న అంశాలంపై మేం చర్చించాం. అనేక ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించి, భవిష్యత్‌ ప్రణాళిక గురించి కూడా చర్చించాం.  విద్యుత్‌ రంగంలోగల అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మేం నిర్ణయానికి వచ్చాం. విద్యుత్‌ కార్పొరేషన్‌పై మా సంయుక్త భవిష్యత్‌ ప్రకటన రాబోయే సహకార వ్యవస్థకు మార్గదర్శని కానుంది. పంచేశ్వర్‌ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడానికిగల ప్రాధాన్యాన్ని మేం నొక్కిచెబుతున్నాం. ఈ ప్రాంతం ముందంజ వేయడంలో సదరు ప్రాజెక్టు చాలా కీలక పాత్ర పోషించనుంది. నేపాల్‌లో జలవిద్యుదుత్పాదన అభివృద్ధికి సంబంధించి భారత కంపెనీలు మరింత భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన అవసరంపై  మేం అంగీకారానికి వచ్చాం. నేపాల్‌ తన అదనపు విద్యుత్తును భారతదేశానికి ఎగుమతి చేయడం సంతోషదాయకం. నేపాల్‌ ఆర్థిక ప్రగతికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. నేపాల్‌ నుంచి విద్యుత్‌ దిగుమతిపై మరిన్ని ప్రతిపాదనలకు ఆమోదం లభించనుందని ఈ సందర్భంగా ప్రకటించడంపై నేనెంతో సంతోషిస్తున్నాను. అంతర్జాతీయ సౌరకూటమిలో నేపాల్‌ సభ్యత్వం స్వీకరించడం ఆనందదాయకం. దీనివల్ల ఈ ప్రాంతంలో సుస్థిర, చౌక, పరిశుభ్ర విద్యుత్‌ లభ్యత మెరుగుపడుతుంది.

మిత్రులారా!

   రెండు దేశాలమధ్య సరిహద్దు అనుసంధానం, వాణిజ్యం సంబంధిత చర్యలకు అన్నివిధాలా ప్రాధాన్యం ఇవ్వాలని నేను, ప్రధాన మంత్రి దేవ్‌బా గారు నిర్ణయించాం. జయానగర్-కుర్త రైలు మార్గం కూడా ఇందులో భాగమే. ఇలాంటి పథకాలు రెండు దేశాల ప్రజల మధ్య ఎలాంటి అవాంతరాలు లేని సజావైన ఆదానప్రదానాలకు దోహదం చేస్తాయి. అలాగే నేపాల్‌లో రూపే కార్డ్ ప్రవేశం వల్ల మన ఆర్థిక అనుసంధానంలో కొత్త అధ్యాయం అవుతుంది. నేపాల్ పోలీస్ అకాడమీ, నేపాల్‌గంజ్‌లోని సమీకృత తనిఖీ కేంద్రం, రామాయణ సర్క్యూట్ తదితర ఇతర ప్రాజెక్టులు కూడా రెండు దేశాలనూ మరింత సన్నిహితం చేస్తాయి.

మిత్రులారా!

   భారత-నేపాల్ సరిహద్దులను అవాంఛిత శక్తులు దుర్వినియోగం చేయడంపైనా మేం ఇవాళ చర్చించాం. ఈ నేపథ్యంలో ఉభయ దేశాల రక్షణ-భద్రత వ్యవస్థల మధ్య సన్నిహిత సహకారం కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని దృఢ సంకల్పం పూనాం. భారత-నేపాల్ సంబంధాల భవిష్యత్తులో భవిష్యత్తులో మరింత బలోపేతం అయ్యే దిశగా ప్రతిష్టాత్మక లక్ష్యాల నిర్దేశంలోనూ నేటి మా చర్చలు కచ్చితంగా ప్రభావం చూపగలవని నేను విశ్వసిస్తున్నాను.

దేవ్‌బా గారూ!

   మీరు రేపు కాశీ నగరంలో పర్యటిస్తారు. నేపాల్‌—బెనారస్‌ల మధ్య బంధం శతాబ్దాల నాటిది. ఈ నేపథ్యంలో సర్వాంగ సుందరంగా రూపుదాల్సిన సరికొత్త కాశీ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకోగలదని నా దృఢ విశ్వాసం. మీకు, మీ ప్రతినిధి బృందానికి మరొకసారి భారతదేశంలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను.

అనేకానేక ధన్యవాదాలు!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Infra spend up six-fold since 2014, crosses Rs 12 lakh crore: PM Modi

Media Coverage

Infra spend up six-fold since 2014, crosses Rs 12 lakh crore: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 ఏప్రిల్ 2026
April 15, 2026

From Temples to Turbines: PM Modi’s Blueprint for a Culturally Rooted, Economically Explosive Viksit Bharat