జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నవీకరణతోపాటు అయిదు (5) జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల (ఎన్‌సీవోఈ) ఏర్పాటు పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకంగా దీన్ని రూపొందించారు. భారత్‌లో వృత్తి విద్యలో విప్లవాత్మక మార్పుల దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు.

2024-25, 2025-26 బడ్జెట్లలో చేసిన ప్రకటన మేరకు జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల నవీకరణతోపాటు అయిదు (5) జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల (ఎన్‌సీవోఈ) ఏర్పాటు పథకాన్ని కేంద్ర ప్రాయోజిత పథకంగా రూ. 60,000 కోట్లతో (కేంద్రం వాటా: రూ. 30,000 కోట్లు, రాష్ట్ర వాటా: రూ. 20,000 కోట్లు, పారిశ్రామిక వాటా: రూ.10,000 కోట్లు) అమలు చేయనున్నారు. కేంద్ర వాటాలో 50% వరకు ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు సమానంగా నిధులందిస్తాయి.

అయిదు (5) జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థల్లో (ఎన్ఎస్టీఐలు) జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు సహా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సుల పునరుద్ధరణ, సామర్థ్య పెంపుదలతో 1,000 ప్రభుత్వ ఐటీఐల నవీకరణపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందుకోసం కేంద్రానుసంధిత (హబ్ అండ్ స్పోక్) విధానంలో ఏర్పాట్లు చేస్తారు.

ప్రభుత్వ యాజమాన్యంలో, పరిశ్రమల నిర్వహణ కింద ఉన్న అభిలషణీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలుగా ప్రస్తుత ఐటీఐలను నిలపడం ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సహకారం తీసుకుంటారు. పరిశ్రమల మానవ వనరుల అవసరాలను తీర్చే కోర్సుల ద్వారా అయిదేళ్ల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యం లభిస్తుంది. స్థానిక శ్రామిక శక్తి, పారిశ్రామిక అవసరాల మధ్య సమన్వయం సాధించడంపై ఈ పథకం దృష్టిపెడుతుంది. తద్వారా పనిచేయడానికి సంసిద్ధులుగా ఉన్న కార్మికులను పొందడంలో ఎంఎస్ఎంఈలు సహా పరిశ్రమలకు వెసులుబాటు కల్పిస్తుంది.

సంపూర్ణంగా ఐటీఐల నవీకరణ అవసరాలను తీర్చడానికి.. ముఖ్యంగా మౌలిక సదుపాయాల నిర్వహణ, సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడి అవసరాలను తీర్చడానికీ, అలాగే ఎక్కువ పెట్టుబడులు అవసరమయ్యే, అధునాతన వాణిజ్యాలకూ గతంలో వివిధ పథకాల కింద అందించిన ఆర్థిక సాయం సరిపోలేదు. దీనిని అధిగమించడం కోసం ఈ ప్రతిపాదిత పథకం కింద అవసరానికి తగిన పెట్టుబడి నిబంధనను చేర్చారు. దీనివల్ల ప్రతీ సంస్థకు సంబంధించి నిర్దిష్ట మౌలిక సదుపాయాలు, సామర్థ్యం, వాణిజ్య సంబంధిత అవసరాల ఆధారంగా నిధుల కేటాయింపునకు సౌలభ్యం లభిస్తుంది. ఐటీఐ నవీకరణ ప్రణాళిక, నిర్వహణలో శాశ్వత ప్రాతిపదికన దృఢమైన పారిశ్రామిక అనుసంధానాన్ని నెలకొల్పడానికి ఈ పథకం తొలిసారిగా ప్రయత్నిస్తోంది. ఫలితాల ఆధారంగా అమలు చేసే వ్యూహానికి అనుగుణంగా.. పరిశ్రమల నేతృత్వంలో ప్రత్యేక ప్రయోజన సంస్థల (ఎస్పీవీ) విధానాన్ని ఈ పథకం అవలంబిస్తుంది. ఐటీఐ వ్యవస్థను మెరుగుపరచడానికి గతంలో చేసిన ప్రయత్నాల కన్నా ఇది భిన్నమైనది.

శిక్షకుల సామర్థ్యాభివృద్ధి (టీవోటీ) కేంద్రాల అభివృద్ధి కోసం- భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లూథియానాల్లోని అయిదు జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థల్లో (ఎన్ఎస్టీఐ) మౌలిక సదుపాయాల నవీకరణను ఈ పథకం కింద చేపడతారు. అంతేకాకుండా, 50,000 మంది శిక్షకులకు వృత్తి పూర్వ, వృత్త్యంతర్గత శిక్షణను కూడా అందిస్తారు.

మౌలిక సదుపాయాలు, కోర్సు ఔచిత్యం, ఉపాధి, వృత్తిపరమైన శిక్షణకు సంబంధించి దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా ఐటీఐలను తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. తయారీ, సృజనాత్మక రంగాల్లో అంతర్జాతీయ శక్తి కేంద్రంగా నిలిచే దిశగా భారత ప్రస్థానానికి అనుగుణంగా దీన్ని రూపొందించారు. దీంతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వివిధ స్థాయిల్లో నైపుణ్యం కలిగిన కార్మికులు లభిస్తారు. తద్వారా వృద్ధికి ఎక్కువ అవకాశాలున్న ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో నైపుణ్యానికి ఉన్న కొరతను పరిష్కరిస్తుంది. మొత్తంగా ఈ ప్రతిపాదిత పథకం ప్రధానమంత్రి వికసిత భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి నైపుణ్యాభివృద్ధే కీలకంగా దోహదపడుతుంది.

నేపథ్యం:

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న ఆకాంక్షతో భారత్ తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నేపథ్యంలో.. వృత్తి విద్య, శిక్షణ అన్నవి ఆర్థికాభివృద్ధి, ఉత్పాదకతకు సంబంధించి విస్తృతమైన చోదక శక్తులుగా నిలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేస్తున్న పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు) 1950ల నుంచి దేశంలో వృత్తి విద్య, శిక్షణకు వెన్నెముకగా ఉన్నాయి. 2014 నుంచి ఐటీఐ నెట్వర్క్ దాదాపు 47 శాతం విస్తరించి 14,615కు చేరింది. సంస్థల్లో 14.40 లక్షల నమోదులు జరిగాయి. ఐటిఐల ద్వారా వృత్తిపరమైన శిక్షణ తక్కువ ఆశాజనకంగా ఉంది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి వ్యవస్థాగత కార్యక్రమాలు కూడా చేపట్టలేదు.

గతంలో ఐటీఐల నవీకరణకు దోహదపడే పథకాలు ఉన్నప్పటికీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పనతో.. నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని అందించే దిశగా ఐటీఐల పునర్నిర్మాణం కోసం జాతీయ స్థాయి కార్యక్రమం ద్వారా గత దశాబ్ధ కాలంగా జరుగుతున్న కృషిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయం. వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి దోహదపడే కీలకమైన అంశమిది.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
 PLI schemes attract over Rs 2.16 lakh crore investment, generate 14.39 lakh jobs

Media Coverage

PLI schemes attract over Rs 2.16 lakh crore investment, generate 14.39 lakh jobs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 మార్చి 2026
March 27, 2026

Relief, Revival & Rise: How PM Modi is Building a Modern, Rooted & Self-Reliant India