ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఐక్య రాజ్య సమితి లో యునైటెడ్ స్టేట్స్ శాశ్వత ప్రతినిధి మరియు రాయబారి నికీ హేలీ ఈ రోజు సమావేశమయ్యారు.
అధ్యక్షులు శ్రీ ట్రంప్ వద్ద నుండి శుభాకాంక్షల సందేశాన్ని ప్రధాన మంత్రి కి ఆమె అందజేశారు. ప్రధాన మంత్రి తన తరఫున శుభాకాంక్షలను అధ్యక్షులు శ్రీ ట్రంప్ కు అందజేయవలసిందంటూ ఆమెను అభ్యర్థించారు. ఇదివరకు తాము ఉభయుల మధ్య జరిగిన సమావేశాలను మరియు సంభాషణలను ప్రధాన మంత్రి ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకొన్నారు.

భారతదేశం మరియు యుఎస్ ల మధ్య గాఢతరం అవుతున్న సంబంధాలను, మరీ ముఖ్యంగా వ్యూహాత్మక రంగాలలోను, రక్షణ రంగంలోను బలపడుతున్న సంబంధాలను గురించి రాయబారి హేలీ ప్రస్తావించారు. ఉగ్రవాద నిరోధం మరియు బహుళదేశాలకు సభ్యత్వం గల సంస్థలలో పరస్పరం సహకరించుకోవడం సహా భారతదేశం- యుఎస్ సహకారాన్ని మరింతగా పెంపొందించుకొనే మార్గాలను గురించి ప్రముఖులు ఇరువురూ చర్చించారు. ప్రపంచ శాంతి మరియు సమృద్ధి ల పరిరక్షణ లో భారతదేశం- యుఎస్ ల మధ్య దృఢమైన భాగస్వామ్యం ఒక ముఖ్యమైన అంశంగా ఉంటూనే ఉంటుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.
అధ్యక్షులు శ్రీ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి దక్షిణ ఆసియా వ్యూహాన్ని మరియు ఇండో- పసిఫిక్ ప్రాంత వ్యూహాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. కొరియా ద్వీపకల్ప ప్రాంతాన్ని పరమాణు ఆయుధ రహితంగా మార్చేందుకు శ్రీ ట్రంప్ తీసుకొంటున్న చొరవ ను కూడా ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.


