* భారత్‌లో సంప్రదాయం ఆవిష్కరణలతో, ఆధ్యాత్మికత శాస్త్రంతో, ఆసక్తి సృజనాత్మకతతో మిళితమవుతాయి; శతాబ్దాలుగా భారతీయులు ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు... పెద్ద ప్రశ్నలు సంధిస్తున్నారు: పీఎం
* లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఖగోళ పరిశోధన శాలల్లో ఒకటి సముద్రమట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో.. నక్షత్రాలు చేతికి అందేంత దగ్గరగా ఉంది: పీఎం
* శాస్త్రీయ ఆసక్తిని ప్రోత్సహించడానికి, యువ మేధను శక్తిమంతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది: పీఎం
* ఈ విశ్వాన్ని మనం అన్వేషిస్తున్నప్పుడు.. భూమిపై ఉన్న ప్రజల జీవితాలను అంతరిక్ష శాస్త్రం ఎలా మెరుగుపరచగలదో ఆలోచించాలి: పీఎం
* అంతర్జాతీయ సహకార శక్తిని భారత్ విశ్వసిస్తుంది, ఆ స్ఫూర్తి ఈ ఒలింపియాడ్‌లో ప్రతిబింబిస్తుంది: పీఎం

గౌరవ అతిథులు, విశిష్ట ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మార్గనిర్దేశకులు, నా ప్రియమైన, ఉత్సాహవంతులైన యువ స్నేహితులకు, నమస్కారం!

64కి పైగా దేశాలకు చెందిన 300కి పైగా యువ మేధావులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. 18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌లో పాల్గొనడానికి భారత్ వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. భారత్‌లో: సంప్రదాయం ఆవిష్కరణలతో, ఆధ్యాత్మికత శాస్త్రంతో, ఆసక్తి సృజనాత్మకతతో మిళితమవుతాయి. శతాబ్దాలుగా, భారతీయులు ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు. పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు, ఐదో శతాబ్దంలో, ఆర్యభట్ట సున్నాను కనుగొన్నారు. భూమి తన అక్షం ఆధారంగా తిరుగుతుందని మొదట చెప్పింది ఆయనే. సున్నా నుంచి ప్రారంభించిన ఆయన చరిత్రను సృష్టించారు.

ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఖగోళ పరిశోధనశాలల్లో ఒకటి లదాఖ్‌లో ఉంది. సముద్రమట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో.. నక్షత్రాలు చేతికి అందేంత దగ్గరగా ఉంది! పుణేలో ఉన్న మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన రేడియో టెలిస్కోప్‌లలో ఒకటి. ఇది పల్సర్లు, క్వాసార్లు, గెలాక్సీల రహస్యాలను ఛేదించడంలో సాయపడుతోంది!

స్క్వేర్ కిలోమీటర్ అర్రే, లిగో ఇండియా లాంటి అంతర్జాతీయ మెగా సైన్స్ ప్రాజెక్టులకు భారత్ సగర్వంగా తన సహకారాన్ని అందిస్తోంది. రెండేళ్ల క్రితం మన చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని విజయంతంగా మొదటిసారి దిగింది మనమే. ఆదిత్య-ఎల్1 సోలార్ అబ్జర్వేటరీతో సూర్యునివైపు మన దృష్టిని సారించాం. సౌర జ్వాలలు, తుఫానులు, సూర్యునిలో వచ్చే మార్పులను ఇది గమనిస్తుంది. గత నెలలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన చరిత్రాత్మక మిషన్‌ను పూర్తి చేశారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం. మీ లాంటి యువ పరిశోధకులకు స్ఫూర్తిదాయకం.

మిత్రులారా,

శాస్త్రీయ ఆసక్తిని ప్రోత్సహించడానికి, యువ మేధను శక్తిమంతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. అటల్ టింకరింగ్ ప్రయోగశాలల ద్వారా 10 మిలియన్ల మందికి పైగా విద్యార్థులు స్టెమ్ అంశాలను ప్రయోగాత్మకంగా అర్థం చేసుకుంటున్నారు. ఇది అభ్యాసం, ఆవిష్కరణ సంస్కృతిని రూపొందిస్తోంది. జ్ఞానాన్ని అందరికీ అందించేందుకు వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకాన్ని మేం ప్రారంభించాం. ఇది మిలియన్ల మంది విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాతీయ జర్నళ్లను  ఉచితంగా అందిస్తుంది. స్టెమ్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉందని తెలిస్తే మీరు సంతోషిస్తారు. పరిశోధనా వ్యవస్థలో వివిధ కార్యక్రమాల ద్వారా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీలాంటి యువ మేధావులను భారత్‌లో చదువుకోవడానికి, పరిశోధనలు చేయడానికి, సహకారం అందించడానికి మేము ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి భాగస్వామ్యాల నుంచి అతి పెద్ద శాస్త్రీయ పురోగతి వస్తుందేమో! ఎవరు ఊహించగలరు?

మిత్రులారా,

మీరు చేపట్టే అన్ని ప్రయత్నాల్లోనూ, మానవాళికి ఉపయోగపడేలా ఎలా పనిచేయాలో ఆలోచించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ విశ్వాన్ని మనం అన్వేషిస్తున్నప్పుడు.. భూమిపై ఉన్న ప్రజల జీవితాలను అంతరిక్ష శాస్త్రం ఎలా మెరుగుపరుస్తుంది? రైతులకు మెరుగైన వాతావరణ సమాచారం ఎలా అందించాలి? మారుమూల ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ ఎలా ఏర్పాటు చేయాలి? ప్రకృతి విపత్తులను మనం ముందుగానే అంచనా వేయగలమా? అటవీ అగ్ని ప్రమాదాలు, కరిగిపోతున్న హిమానీ నదాలను మనం పర్యవేక్షించగలమా? అని ప్రశ్నించుకోవాలి. సైన్స్ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. అది ఊహ, కరుణతో ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో కనిపిస్తుంది. ‘‘అక్కడ ఏముంది?’’ అని ప్రశ్నించాలని, అది ఇక్కడ ఎలా సహాయపడుతుందో ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నాను.

మిత్రులారా,


అంతర్జాతీయ సహకార శక్తిని భారత్ విశ్వసిస్తుంది. ఆ స్ఫూర్తి ఈ ఒలింపియాడ్‌లో ప్రతిబింబిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఇదే అతి పెద్ద ఒలింపియాడ్ అని నాకు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సుసాధ్యం చేసిన హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చికు నా ధన్యవాదాలు. ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోండి. పెద్ద కలలు కనండి. అలాగే భారత్‌లో ఆకాశమే హద్దు కాదని, అదే ప్రారంభమని విశ్వసిస్తామని గుర్తుంచుకోండి.

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year

Media Coverage

IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఏప్రిల్ 2026
April 28, 2026

From Orchids to Expressways: PM Modi’s Blueprint for a Self-Reliant, Connected & Proud India