సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం ప్రధానమంత్రి రాజస్థాన్ను సందర్శించి రూ.1,22,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:45 గంటలకు బన్స్ వారాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే సమయంలో పీఎం కుసుం పథకం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు.
మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్పై తన నిబద్ధతకు నిదర్శనంగా.. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
"సర్వం ఇక్కడే లభ్యం’’ ఇతివృత్తంతో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు ఈ వాణిజ్య ప్రదర్శన జరుగుతుంది. ఆవిష్కరణ, ఏకీకరణ, అంతర్జాతీయీకరణ అనే మూడు అంశాల ప్రధాన లక్ష్యంగా సాగుతుంది. ఇది మూడు స్థాయిల్లో అంతర్జాతీయ కొనుగోలుదారులు, దేశీయ వ్యాపారులు-వ్యాపారులు, వ్యాపారులు-వినియోగదారులు ప్రాతిపదికన కొనుగోలుదారులను ఆకర్షిస్తారు. ఇది ఎగుమతిదారులు, చిన్న వ్యాపారాలు వినియోగదారులకు సమాన అవకాశాలను అందిస్తుంది.
యూపీఐటీఎస్-2025 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ సంప్రదాయ హస్తకళలు, ఆధునిక పరిశ్రమలు, శక్తిమంతమైన ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలందరూ ఒకే వేదికపై ప్రదర్శిస్తారు. ఇందులో హస్తకళలు, వస్త్రాలు, తోళ్లు, వ్యవసాయం, ఆహార శుద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆయుష్ మొదలైనవి ఉన్నాయి. ఇది ఉత్తరప్రదేశ్ గొప్ప కళా సంపద, సంస్కృతీ వైభవం, సంప్రదాయ వంటకాలను కూడా ఒకే చోట ప్రదర్శిస్తారు.
ఈ కార్యక్రమంలో రష్యా భాగస్వామ్య దేశంగా పాల్గొంటుంది. ఇది రెండు దేశాల మధ్య వ్యాపారం, సాంకేతిక మార్పిడి, దీర్ఘకాలిక సహకారం వంటి అంశాలకు వ్యూహాత్మక ప్రాధాన్యతను అందిస్తుంది. ఈ వాణిజ్య ప్రదర్శనలో 2,400 కంటే ఎక్కువ మంది ప్రదర్శనకారులు, 1,25,000 మంది బీ2బీ సందర్శకులు, 4,50,000 మంది బీ2సీ సందర్శకులు పాల్గొంటారు.
రాజస్థాన్లో ప్రధానమంత్రి
బన్స్ వారాలో రూ. 1,22,100 కోట్ల విలువైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు.
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో, నమ్మదగిన, స్థిర విద్యుత్ సరఫరాను అందించే దిశగా విద్యుత్ రంగాన్ని మార్చాలన్న తన లక్ష్యానికి అనుగుణంగా.. అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ చేపట్టనున్న మాహీ-బన్స్ వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్ట్కు (4x700 మెగావాట్లు) ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీని విలువ సుమారు రూ. 42,000 కోట్లు. ఇది దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కర్మాగారాల్లో ఒకటిగా రూపుదిద్దుకోనుంది. ఇది అందుబాటులో ఉండే ఆధార శక్తిని నిత్యం సరఫరా చేస్తూ, పర్యావరణ పరిరక్షణలో భారత్ స్థానాన్ని బలపరచనుంది. అలాగే అణుశక్తి రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతికి ఒక మైలురాయిగా నిలవనుంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని మరింత పెంచుతూ.. మహీ-బన్స్వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టులో రూపొందించిన, అభివృద్ధి చేసిన అధునాతన భద్రతా ప్రమాణాలతో నాలుగు స్వదేశీ 700 మెగావాట్ల ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఉన్నాయి. ఈ కార్యక్రమం భారత్ చేపట్టిన ‘‘ఫ్లీట్ మోడ్’’ కార్యక్రమంలో భాగంగా అమలవుతోంది. ఇందులో ఒకే రూపకల్పన, ఒకే కొనుగోలు ప్రణాళికతో దేశవ్యాప్తంగా పది 700 మెగావాట్ల అణు రియాక్టర్లను నిర్మిస్తున్నారు.
భారతదేశ క్లీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలకు గణనీయమైన ప్రోత్సాహంగా రాజస్థాన్లో దాదాపు రూ. 19,210 కోట్ల విలువైన హరిత శక్తి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఫలోడి, జైసల్మేర్, జలోర్, సీకర్ మొదలైన ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బికనీర్లో కొత్త సౌర విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లోని రామగిరిలో నిర్మించబోయే సోలార్ పార్క్కి కూడా శంకుస్థాపన చేస్తారు. ఇవి దేశ క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంపొందించడంతో పాటు, అధిక మొత్తంలో హరిత విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. వీటి ద్వారా లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేస్తుంది.
2030 నాటికి ఎనిమిది రాష్ట్రాల్లో 181.5 గిగావాట్ల పునరుత్పదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా .. రూ. 13,180 కోట్ల విలువైన మూడు విద్యుత్ ప్రసార ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇవి భారత ప్రభుత్వం చేపట్టిన పునరుత్పాదక ఇంధన వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా అమలవుతున్నాయి. ఈ పునరుత్పత్తి విద్యుత్ను లోడ్ కేంద్రాలకు సమర్థవంతంగా పంపిణీ చేయడానికి, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి, పవర్గ్రిడ్ సంస్థ ఈ ముఖ్యమైన ట్రాన్స్మిషన్ వ్యవస్థలను అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా రాజస్థాన్లోని బీవార్ నుంచి మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ వరకూ 765 కేవీ సరఫరా వ్యవస్థ, అనుబంధ సబ్స్టేషన్ల విస్తరణ, రాజస్థాన్లోని సిరోహి నుంచి మాండ్సౌర్, మధ్యప్రదేశ్లోని ఖాండ్వా వరకు సరఫరా లైన్లు, సిరోహి సబ్స్టేషన్ వద్ద ట్రాన్స్ఫర్మేషన్ సామర్థ్యం పెంపు, మాండ్సౌర్, ఖండ్వా సబ్స్టేషన్ల విస్తరణ, రాజస్థాన్లోని బికనీర్ నుంచి హర్యానాలోని శివానీ, ఫతేహాబాద్-పంజాబ్లోని పత్రాన్ వరకూ 765 కేవీ అండ్ 400 కేవీ సరఫరా లైన్లు, బికనీర్లోలో కొత్త సబ్స్టేషన్, శివానిలో విస్తరణ పనులు ఉన్నాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టులు రాజస్థాన్లోని జనరేషన్ హబ్ల నుంచి 15.5 గిగా వాట్ల హరిత విద్యుత్ను దేశంలోని డిమాండ్ ఉన్న లబ్దిదారు కేంద్రాలకు సజావుగా బదిలీ చేయడానికి దోహదపడతాయి.
జైసల్మేర్-బికనీర్ల మూడు 220 కేవీ గ్రిడ్ సబ్స్టేషన్లు, అనుబంధ లైన్లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. బార్మర్ జిల్లాలోని శివ్ ప్రాంతంలో నిర్మించిన 220 కేవీ జీఎస్ఎస్ను ప్రారంభించనున్నారు. రూ. 490 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు రాజస్థాన్ ప్రాంతంలో విద్యుత్ భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తాయి.
రైతులను శక్తిమంతం చేయాలనే తన నిబద్ధతకు అనుగుణంగా.. పీఎం కుసుం పథకం కింద రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.16,050 కోట్లకు పైగా విలువైన 3517 మెగావాట్ల ఫీడర్ లెవల్ సోలరైజేషన్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. విద్యుత్ ఖర్చులు, నీటిపారుదల ఖర్చులను తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన స్వావలంబనను ప్రోత్సహించడం ద్వారా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతులకు సరసమైన, నమ్మదగిన, స్థిరమైన నీటి పంపిణీని, విద్యుత్ సరఫరాను అందించేందుకు వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను సోలార్ ఆధారితంగా మార్చుతున్నారు.
రాంజల్ సేతు లింక్ ప్రాజెక్టుకు భారీ ప్రాధాన్యత ఇస్తూ.. నీటి భద్రతపై తన దృక్పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజస్థాన్లో రూ.20,830 కోట్ల విలువైన బహుళ జల వనరుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారు. ఇసార్డా నుంచి వివిధ ఫీడర్ల నిర్మాణం, అజ్మీర్ జిల్లాలో మోర్ సాగర్ కృత్రిమ జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీని ఫీడర్ చిత్తోర్గఢ్ నుంచి నిర్మిస్తున్నారు. బిసాల్పూర్ ఆనకట్ట వద్ద ఇన్టేక్ పంప్ హౌస్ నిర్మాణం, ఖారీ ఫీడర్ పునరుద్దరణ, అనేక ఇతర ఫీడర్ కాల్వల అభివృద్ధి పనులు ఉన్నాయి. ఇసార్డా ఆనకట్ట, ధోల్పూర్ లిఫ్ట్ ప్రాజెక్ట్, తక్లీ ప్రాజెక్ట్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.
ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీరు అందించాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా.. 5,880 కోట్ల విలువైన ప్రధాన తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇవి అమృత్ 2.0 పథకం కింద బన్స్వారా, దుంగర్పూర్, ఉదయ్పూర్, సవాయి మాధోపూర్, చురు, అజ్మీర్, భిల్వారా జిల్లాల్లో నిర్మిస్తారు.
రహదారి మౌలిక సదుపాయాలను ప్రోత్సాహిస్తూ.. భరత్పూర్ నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణం, బనాస్ నదిపై వంతెన నిర్మాణం, 116 అటల్ ప్రగతి పథ్ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు. బార్మర్, అజ్మీర్, దుంగర్పూర్ జిల్లాలలోని జాతీయ, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. 2,630 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రోడ్డు కనెక్టీవిటీని మెరుపరచడమే కాకుండా ట్రాఫిక్ను తగ్గించి రోడ్డు భద్రతను పెంచుతాయి.
మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా భరత్పూర్లో 250 పడకల ఆర్బీఎం ఆసుపత్రి, జైపూర్లో ఐటీ అభివృద్ధి, ఈ-గవర్నెన్స్ సెంటర్, మక్రానా నగరంలో శుద్ది కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లతో సహా మురుగునీటి వ్యవస్థను ప్రారంభించనున్నారు. మాండవా జున్జున్ జిల్లాలో మురుగునీటి, తాగునీటి సరఫరా ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తూ.. మూడు కొత్త రైళ్లు- బికనీర్, ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, ఉదయపూర్ సిటీ – చండీగఢ్ ఎక్స్ప్రెస్- లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. రాజస్థాన్ను ఇతర ఉత్తరాది రాష్ట్రాలతో ఈ రైలు సర్వీసులు అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరచనున్నాయి. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్న ప్రధాని దృష్టిని ముందుకు తీసుకెళ్తూ.. రాజస్థాన్లోని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 15,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వీరిలో 5770 మందికి పైగా పశుసంరక్షణ సహాయకులు, 4190 జూనియర్ అసిస్టెంట్లు, 1800 జూనియర్ బోధకులు, 1460 జూనియర్ ఇంజినీర్లు, 1200 తృతీయ శ్రేణి స్థాయి 2 ఉపాధ్యాయులు ఉన్నారు.


