ఈ బడ్జెటు 2047కల్లా వికసిత్ భారత్ వైపు మనం చేస్తున్న ప్రయాణంలో అతి కీలకం అవుతుంది: ప్రధానమంత్రి
ఈ సంవత్సరపు బడ్జెటు భారత్ రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త శక్తినీ, కొత్త వేగాన్నీ అందిస్తుంది: ప్రధానమంత్రి
అమిత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉండటంతోనే భారత్ సంతోషించడం లేదు.. ప్రపంచంలో
మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని భారత్ కోరుకుంటోంది: ప్రధాని
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు కొత్త జోరును అందించడానికి ఒక చక్కని బాటను వేస్తోంది ఈ సంవత్సరపు బడ్జెటు: ప్రధాని
ఈ సంవత్సర బడ్జెటులో ఎమ్ఎస్ఎమ్ఈలు అందుకున్న మద్దతు దేశ స్థాయి నుంచి విదేశీ స్థాయికి ఎదగడానికి వాటికి కొత్త బలాన్నిస్తుంది: ప్రధాని
ఈ బడ్జెటు, యువ శక్తిని దృష్టిలో పెట్టుకొన్న బడ్జెటు.. దీనిలోని ప్రతిపాదనలు వివిధ రంగాల్లో నాయకుల్నీ, నూతన ఆవిష్కర్తల్నీ, సృజనకారుల్నీ తయారు చేస్తాయి: ప్రధాని
మహిళలే ఏర్పాటు చేసి, నిర్వహించే స్వయంసహాయ బృందాల ఆధునిక అనుబంధ విస్తారిత వ్యవస్థకు బడ్జెటులో పెద్ద పీట.. సమృద్ధి ఇంటింటికి చేరాలనేదే దీని లక్ష్యం: ప్రధాని

2026 కేంద్ర బడ్జెటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అభిప్రాయాల్ని ఈ రోజు వీడియో సందేశంలో ప్రజలతో పంచుకున్నారు. ఇవాళ్టి బడ్జెటు చరిత్రాత్మకమైందనీ, దేశ మహిళల సాధికార భావనకు ఇది అద్దం పడుతోందనీ వర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మహిళా ఆర్థిక మంత్రిగా వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెటును ప్రవేశపెట్టి, రికార్డును నెలకొల్పారని ఆయన చెప్పారు. అనేక అవకాశాలకు రాచబాటను వేసింది ఈ బడ్జెటు..ఇది భారత వర్తమాన కలల్ని నెరవేర్చడంతో పాటు, ఉజ్వల భవితకు బలమైన పునాదిని కూడా వేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్‌కు ఈ బడ్జెటు రెక్కలు తొడుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
భారత్‌లో ప్రస్తుతం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోందనీ, ఈ బడ్జెటుతో ఈ ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తినే కాకుండా ఓ కొత్త జోరును కూడా అందుకొంటుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇంతవరకు చేపట్టనటువంటి సంస్కరణల్ని చేపట్టినందువల్ల, భారత్‌లో వృద్ధి లోకి రావాలని తపించిపోతున్న, ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు వారు ఉవ్వెత్తున ఎగరడానికి విశాల గగనాన్ని బడ్జెటు వారి ఎదుట ఆవిష్కరించిందని ఆయన అన్నారు. నమ్మకమైన పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యాన్నిచ్చే ఆర్థిక ప్రణాళిక.. ఈ  రెండు దృష్టికోణాలనూ బడ్జెటు సాకారం చేసిందని కూడా ఆయన చెప్పారు. ద్రవ్య లోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. వీటిపై దృష్టిని కేంద్రీకరించిన అద్వితీయ బడ్జెటు ఇదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
 

భారత్ ప్రపంచంలో పోషించాల్సిన సరికొత్త పాత్రకు ఈ బడ్జెటు దన్నుగా నిలుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతోనే భారత్‌లోని 140 కోట్ల మంది పౌరులు సంతృప్తి చెందడం లేదనీ, త్వరలో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని దేశ ప్రజలు దృఢంగా తీర్మానించుకొన్నారనీ ఆయన స్పష్టం చేశారు. ఇది లక్షలాది భారతీయుల ఉమ్మడి సంకల్పమని ఆయన అన్నారు. నమ్మదగ్గ ప్రజాస్వామ్య భాగస్వామిగానూ, మంచి నాణ్యత కల వస్తుసేవల సరఫరాదారు దేశంగానూ భారత్ భూమిక అంతకంతకూ విస్తరిస్తోందని ప్రధాని వెల్లడించారు. భారత్ ఇటీవల కుదుర్చుకున్న ప్రధాన వాణిజ్య ఒప్పందాల లక్ష్యం దేశ యువతకూ, చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థలకూ గరిష్ఠ ప్రయోజనాల్ని అందించాలన్నదేననీ, ఆ దిశగా ముందు ముందుకు సాగిపోవడానికి ఈ బడ్జెటులో ముఖ్య నిర్ణయాలు తీసుకొన్నారనీ ఆయన వివరించారు.
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమాలకు మరింత జోరును అందించడానికి బడ్జెటు రాజమార్గాన్ని పరిచిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. గొప్పగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగాలకు ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత మద్దతును ఇవ్వడమైందనీ, వాటిలో బయోఫార్మా శక్తి మిషన్, సెమీకండక్టర్ మిషన్ 2.0లతో పాటు ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీము, రేర్ ఎర్త్ కారిడార్‌కు రూపకల్పన, కీలక ఖనిజాల రంగాన్ని పటిష్ఠం చేయడం, వస్త్ర రంగంలో కొత్త పథకాలు, ఉన్నత సాంకేతికతను కలిగి ఉండే సాధనాల తయారీకి ప్రోత్సాహాన్ని ఇవ్వడం, దేశ వర్తమాన, భావి కాల అవసరాలను తీర్చగలిగేలా మెరికల్లాంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎమ్ఎస్ఎమఈస్)ను తీర్చిదిద్దడం వంటివి కొన్ననీ శ్రీ మోదీ వివరించారు.  చిన్న, కుటీర పరిశ్రమలు సహా ఎమ్ఎస్ఎమఈలకు అందిస్తున్న మద్దతుతో ఆయా సంస్థలు స్థానిక అవసరాలను తీర్చడమే కాక ప్రపంచ దేశాలతో సై అంటే సై అని పోటీపడగల స్తోమతను సమకూరుస్తాయని ప్రధానమంత్రి వర్ణించారు.
మౌలిక సదుపాయాల కల్పనను బలపరిచేందుకు బడ్జెటులో అనేక ప్రధాన నిర్ణయాలు ఉన్నాయని కూడా శ్రీ మోదీ తెలిపారు. వాటిలో అచ్చంగా సరుకుల రవాణాకే కేటాయించిన కారిడార్, దేశవ్యాప్తంగా జలమార్గాల విస్తరణ, హై-స్పీడ్ రైల్ కారిడార్, 2వ అంచె 3వ అంచె నగరాల అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధతో పాటు నగరాలకు బలమైన ఆర్థిక పునాదిని వేసే దృష్టితో మ్యునిసిపల్ బాండ్లను ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు  కలిసి ఉన్నాయన్నారు. ఈ చర్యలన్నీ వికసిత్ భారత్ దిశగా పయనాన్ని వేగవంతం చేసేవేనని ఆయన ఉద్ఘాటించారు.
 

ఏ దేశానికైనా ఆ దేశ పౌరులే అతి గొప్ప పెట్టుబడి వనరు అని ప్రధానమంత్రి వర్ణించారు. ఇటీవల కొన్నేళ్లుగా ప్రభుత్వం, పౌరుల సామర్థ్యాలను పెంపొందించడానికి ఇదివరకు ఎప్పుడూ లేనంత స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని ఆయన గుర్తుచేశారు. ఇది యువజనులకు శక్తినిచ్చే బడ్జెటన్న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాటల్ని ప్రధాని శ్రీ మోదీ పునరుద్ఘాటిస్తూ, బడ్జెటులో పొందుపరిచిన ప్రతిపాదనలు వివిధ రంగాల్లో నాయకుల్నీ, నూతన ఆవిష్కర్తల్నీ, సృజనకారుల్నీ తీర్చిదిద్దుతాయని స్పష్టం చేశారు. వైద్య కూడళ్లు, ఆరోగ్య రంగ సంబంధిత వృత్తినిపుణులకు తోడ్పాటు, సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం, గేమింగ్, పర్యటన రంగాలతో పాటు ఖేలో ఇండియాకు దన్నుగా నిలవడం.. ఇవన్నీ యువతీయువకులకు కొత్త కొత్త అవకాశాల్ని అందిస్తాయని ఆయన తెలిపారు. భారత్‌ను ప్రపంచానికి డేటా సెంటర్ కూడలిగా నిలబెట్టడానికి ఒక ప్రధానమైన పన్ను రాయితీని ప్రకటించిన సంగతిని ప్రధాని ప్రస్తావించారు.  యువతకు విశేష అభినందనల్ని అందజేస్తూ, ఉపాధికల్పనకు ఈ బడ్జెటు గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. పర్యటన రంగాన్ని..ముఖ్యంగా దేశ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటన అవకాశాల్ని ప్రోత్సహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకున్నారనీ, వివిధ రాష్ట్రాలకు సాధికారతను కల్పిస్తూ సమతౌల్య అభివృద్ధి సాధన యత్నాలను బలపరుస్తుండడం హర్షణీయమనీ ప్రధానమంత్రి అన్నారు.  
స్వయంసహాయ బృందాలతో 10 కోట్ల మంది కన్నా ఎక్కువ మంది మహిళలు కలిసి పనిచేస్తున్నారని శ్రీ మోదీ చెబుతూ, మహిళల నాయకత్వంలో మహిళలే నిర్వహించే స్వయంసహాయ బృందాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఒక ఆధునిక అనుబంధ విస్తారిత వ్యవస్థను నిర్మించడానికి బడ్జెటులో పెద్దపీట వేసినట్లు వివరించారు. ప్రతి కుటుంబమూ సమృద్ధమవ్వాలన్నదే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క జిల్లాలోనూ బాలికల కోసం కొత్త హాస్టళ్లను నిర్మించడానికి ఉద్దేశించిన ఒక ఉద్యమం.. విద్యను మరింత మందికి అందుబాటులోకి తీసుకు వస్తుందని ఆయన వెల్లడించారు.
వ్యవసాయం, పాడి రంగం, చేపల పెంపకం ప్రభుత్వ అగ్ర ప్రాధాన్య రంగాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కొబ్బరి, జీడిపప్పు, కోకో, చందనం  సాగులో నిమగ్నమైన రైతుల కోసం ఈ బడ్జెటులో కీలక చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. భారత్ విస్తార్ ఏఐ సాధనం రైతులకు వారి సొంత భాషలో సమాచారాన్ని అందించి వారికి ఎనలేని మేలు చేస్తుందని ప్రధాని చెప్పారు. మత్స్య రంగంలోనూ, పశు సంవర్ధక రంగంలోనూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండదండలను అందించడం వల్ల పల్లెటూళ్లలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ బడ్జెటు అభివృద్ధి కోసం తపిస్తున్న బడ్జెటు, ఇది దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుందని చెబుతూ ప్రధానమంత్రి తన స్పందనను ముగించారు. ఈ సందర్భంగా.. ముందుచూపు కలిగి ఉన్న బడ్జెటునూ, ప్రజల ఆశలను అర్థం చేసుకున్న బడ్జెటునూ, పేదలు, రైతులు, గ్రామాల సంక్షేమానికి అంకితమైన బడ్జెటునూ సమర్పించినందుకుకేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కూ, ఆమె జట్టుకూ  మరో సారి ఆయన అభినందనలు తెలిపారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi, Guterres Stress Multipolarity, Need To Reform UN Institutions Including UNSC

Media Coverage

PM Modi, Guterres Stress Multipolarity, Need To Reform UN Institutions Including UNSC
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister offers prayers to Bhagwan Shri Ganesh during Ganpati Darshan at Union Minister Piyush Goyal’s residence
September 14, 2026

The Prime Minister, Shri Narendra Modi has visited the residence of Union Minister Shri Piyush Goyal for Ganpati Darshan.

The Prime Minister prayed for the blessings of Bhagwan Shri Ganesh for everyone.

The Prime Minister wrote on X;

“Went for Ganpati Darshan at the residence of Union Minister Shri Piyush Goyal Ji.

May Bhagwan Shri Ganesh bless everyone!

@PiyushGoyal”