రూ. 34,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం.. శంకుస్థాపన
స్వయం-సమృద్ధ భారత్‌తోనే ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు
చిప్స్ అయినా.. ఓడలైనా దేశంలోనే తయారీ
భారత సముద్ర రంగ బలోపేతం కోసం పెద్ద నౌకలను

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. 'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ఈ నెల 17న తనకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు గొప్ప బలమన్నారు. దేశంలో విశ్వకర్మ జయంతి నుంచి గాంధీ జయంతి వరకు అంటే ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. గత 2-3 రోజుల్లో గుజరాత్‌లో అనేక సేవా కార్యక్రమాలు.. వందలాది ప్రదేశాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారన్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మంది రక్తదానం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. అనేక నగరాల్లో నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమాల్లో లక్షలాది మంది పౌరులు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,000 కి పైగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామనీ, ప్రజలకు.. ముఖ్యంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మొదట స్వర్గీయ కృష్ణకుమార్‌సిన్హ్ కి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి.. ఆయన గొప్ప వారసత్వాన్ని గుర్తుచేసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్ష్యానికి అనుగుణంగా భారత ఐక్యతకు కృష్ణకుమార్‌సిన్హ్ గారు ఎంతో కృషి చేశారన్నారు. అటువంటి గొప్ప దేశభక్తుల స్ఫూర్తితో దేశం ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తూనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమష్టి ప్రయత్నాల ద్వారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ సంకల్పం మరింత బలోపేతం అవుతోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

పవిత్ర నవరాత్రి పండుగ ప్రారంభం కానున్న సమయంలో తాను భావ్‌నగర్‌కు వచ్చానని ప్రస్తావించిన శ్రీ మోదీ.. జీఎస్టీ తగ్గింపు కారణంగా మార్కెట్లలో మరింత ఉత్తేజం.. పండుగ ఉత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ పండుగ సంబరాలతో పాటుగా మన దేశం సముద్ర సే సమృద్ధి పండుగనూ గొప్పగా నిర్వహిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు భారత్.. సముద్రాన్ని అవకాశాలకు ప్రధాన మార్గంగా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పుడే ప్రారంభించుకున్నామనీ.. నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధి వేగవంతం కోసం పలు శంకుస్థాపనలూ చేసినట్లు శ్రీ మోదీ తెలిపారు. క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ముంబయిలోని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ ఈ రోజు ప్రారంభమైందన్నారు. భావ్‌నగర్, గుజరాత్‌తో అనుసంధానమైన పలు అభివృద్ధి ప్రాజెక్టులూ ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంలో గుజరాత్ పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 

"ప్రపంచంతో సోదరభావ స్ఫూర్తిని భారత్ కొనసాగిస్తోంది. ప్రపంచంలో ప్రస్తుతం మన దేశానికి ప్రధాన శత్రువు ఎవరూ లేరు. దేశానికి అతిపెద్ద శత్రువు నిజానికి ఇతర దేశాలపై ఆధారపడటమే" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని సమష్టిగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశాలపై ఆధారపడటం ఎక్కువగా జాతీయ వైఫల్యానికి దారితీస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం స్వయం-సమృద్ధిని సాధించడం తప్పనిసరి అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇతరులపై ఆధారపడటం జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును బాహ్య శక్తులకు వదిలేయలేమనీ.. జాతి అభివృద్ధి సంకల్పం కోసం విదేశాలపై ఆధారపడకూడదని శ్రీ మోదీ స్పష్టం చేశారు. రాబోయే తరాల భవిష్యత్తును ప్రమాదంలో పడేయకూడదన్నారు. వంద సమస్యలకు పరిష్కారం స్వయం-సమృద్ధ భారత్‌ను నిర్మించడమేనని ఆయన ప్రకటించారు. దీనిని సాధించడానికి దేశం సవాళ్లను ఎదుర్కోవాలి.. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలి.. నిజమైన స్వయం-సమృద్ధిని సాధించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

భారత్‌లో ఎప్పుడూ సామర్థ్య లోపం లేదని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. స్వాతంత్య్రానంతరం అధికారంలోకి వచ్చిన పార్టీ దేశ స్వాభావిక బలాలను నిరంతరం విస్మరించిందని విమర్శించారు. ఫలితంగా ఆరు నుంచి ఏడు దశాబ్దాల తర్వాత కూడా భారత్ తన సామర్థ్యానికి తగిన విజయాన్ని సాధించలేకపోయిందన్నారు. లైసెన్స్-కోటా పాలనలో దీర్ఘకాలిక సమస్యలు, ప్రపంచ మార్కెట్లలో ఒంటరి కావడం దీనికి ప్రధాన కారణాలుగా శ్రీ మోదీ వివరించారు. ప్రపంచీకరణ యుగం వచ్చినప్పుడు అప్పటి పాలక ప్రభుత్వాలు దిగుమతులపైనే దృష్టి సారించాయనీ.. ఇది వేల కోట్ల కుంభకోణాలకు దారితీసిందని ఆయన తెలిపారు. ఈ విధానాలు భారత యువతకు ఎంతో హాని కలిగించాయన్న ప్రధానమంత్రి.. మన దేశపు అసలైన సామర్థ్యం వెలుగులోకి రాకుండా ఇవి నిరోధించాయన్నారు.

లోపభూయిష్ట విధానాల వల్ల కలిగే నష్టానికి భారత జలరవాణా రంగాన్ని ఒక ప్రధాన ఉదాహరణగా ఉటంకించిన ప్రధానమంత్రి.. భారత్ చరిత్రాత్మకంగా ఒక ప్రముఖ సముద్ర శక్తిగా, ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రాల్లో ఒకటిగా ఉందని వ్యాఖ్యానించారు. భారత తీరప్రాంత రాష్ట్రాల్లో నిర్మించిన నౌకలు ఒకప్పుడు దేశీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి ఊతమిచ్చాయని తెలిపారు. యాభై సంవత్సరాల కిందట కూడా భారత్ దేశీయంగా నిర్మించిన నౌకలనే ఉపయోగించిందన్నారు. 40 శాతానికి పైగా దిగుమతి-ఎగుమతులు వాటి ద్వారానే జరిగాయని శ్రీ మోదీ తెలియజేశారు. తరువాతి కాలంలో వారి తప్పుడు విధానాలకు జలరవాణా రంగం బలైపోయిందన్నారు. దేశీయ నౌకానిర్మాణాన్ని బలోపేతం చేయడానికి బదులుగా వారు విదేశీ నౌకలకు సరుకు రవాణా చార్జీలు చెల్లించడానికే మొగ్గుచూపారని ప్రధానమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష పార్టీని విమర్శించారు. ఇది భారత నౌకానిర్మాణ రంగం పతనానికి, విదేశీ నౌకలపై బలవంతంగా ఆధారపడటానికి దారితీసిందని శ్రీ మోదీ వివరించారు. ఫలితంగా వాణిజ్యంలో భారతీయ నౌకల వాటా 40 శాతం నుంచి కేవలం 5 శాతానికి పడిపోయిందన్నారు. భారత్ వాణిజ్యంలో 95 శాతం విదేశీ నౌకలపై ఆధారపడిందనీ.. ఇది దేశానికి గణనీయ నష్టాన్ని కలిగించిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

 

దేశ ప్రజలకు కొన్ని గణాంకాలను వెల్లడిస్తూ.. ప్రతి సంవత్సరం విదేశీ షిప్పింగ్ కంపెనీలకు భారత్ దాదాపు 75 బిలియన్ డాలర్లు అంటే సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం భారత ప్రస్తుత రక్షణ బడ్జెట్‌కు దాదాపు సమానమని ప్రధానమంత్రి తెలిపారు. గత ఏడు దశాబ్దాలుగా భారత్ సరుకు రవాణా కోసం ఇతర దేశాలకు ఎంత డబ్బు చెల్లించిందో ఒకసారి ఊహించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ నిధుల ప్రవాహం విదేశాల్లో లక్షలాది ఉద్యోగాలను సృష్టించిందన్నారు. ఈ ఖర్చులో ఒక చిన్న భాగాన్ని మునుపటి ప్రభుత్వాలు భారత జలరవాణా రంగంలో పెట్టుబడి పెట్టి ఉంటే.. నేడు ప్రపంచమంతా భారత నౌకలను ఉపయోగిస్తుండేదని తెలిపారు. భారత్ జలరవాణా సేవల ద్వారా లక్షల కోట్లు ఆదాయమూ పొందేదని శ్రీ మోదీ అన్నారు.

"2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే స్వయం-సమృద్ధిని సాధించాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయం లేదు. దీనికోసం 140 కోట్ల మంది పౌరులంతా ఒకే సంకల్పానికి కట్టుబడి ఉండాలి. చిప్స్ అయినా.. ఓడలు అయినా.. అవి భారత్‌లోనే తయారు కావాలి" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దార్శనికతతో భారత సముద్ర రంగం ఇప్పుడు తదుపరి తరం సంస్కరణల వైపు పయనిస్తోందని వ్యాఖ్యానించారు. నేటి నుంచి దేశంలోని అన్ని ప్రధాన ఓడరేవులు అనేక పత్రాల అవసరాలు.. సంక్లిష్ట ప్రక్రియల నుంచి విముక్తి పొందుతాయని ఆయన ప్రకటించారు. 'ఒకే దేశం, ఒకే పత్రం', 'ఒకే దేశం, ఒకే ఓడరేవు' ప్రక్రియ అమలుతో వ్యాపార వాణిజ్యాలు సులభతరం అవుతాయన్నారు. వలసరాజ్యాల కాలం నుంచి అమలవుతున్న కాలం చెల్లిన అనేక చట్టాలను ఇటీవలి పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా సవరించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేశారు. సముద్ర రంగంలో వరుస సంస్కరణలు ప్రారంభించామనీ.. అయిదు సముద్ర చట్టాలను కొత్త రూపంలో ప్రవేశపెట్టామని ఆయన తెలియజేశారు. ఈ చట్టాలు జలరవాణా, ఓడరేవుల నిర్వహణలో ప్రధాన మార్పులను తీసుకువస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

శతాబ్దాలుగా భారత్ పెద్ద నౌకలను నిర్మించే నైపుణ్యం కలిగి ఉందనీ.. తదుపరి తరం సంస్కరణలు ఈ మరుగునపడిన వారసత్వాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో 40కి పైగా నౌకలు, జలాంతర్గాములను నావికాదళంలో చేర్చామనీ.. వాటిలో ఒకటీ-రెండు తప్ప అన్నీ భారత్‌లోనే తయారైనవని శ్రీ మోదీ తెలిపారు. భారీ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ కూడా దేశంలోనే తయారైందనీ.. దాని నిర్మాణంలో ఉపయోగించే అత్యంత నాణ్యమైన ఉక్కు కూడా భారత్‌లోనే ఉత్పత్తి అయిందన్నారు. భారత్ సామర్థ్యాన్నీ, మంచి నైపుణ్యాన్నీ కలిగి ఉందన్న ప్రధానమంత్రి.. పెద్ద నౌకలను నిర్మించడానికి అవసరమైన రాజకీయ సంకల్పమూ దృఢంగా ఉందని ఆయన దేశానికి భరోసానిచ్చారు.

 

భారత సముద్ర రంగ బలోపేతం కోసం నిన్న ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపిన శ్రీ మోదీ.. ఒక కీలక విధాన సంస్కరణను ప్రకటించారు. దీని కింద పెద్ద నౌకలకు ఇప్పుడు మౌలిక సదుపాయాల హోదా కల్పించారు. ఒక రంగానికి మౌలిక సదుపాయాల గుర్తింపు లభించినప్పుడు, అది గణనీయమైన ప్రయోజనాలను పొందుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఓడ నిర్మాణ సంస్థలు ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు పొందడమూ సులభం అవుతుందనీ.. తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం కూడా ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌తో సంబంధం ఉన్న అన్ని ప్రయోజనాలు ఇప్పుడు ఈ నౌకా నిర్మాణ సంస్థలకూ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ నిర్ణయం భారత జలరవాణా కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ప్రపంచ మార్కెట్‌తో మరింత సమర్థంగా పోటీ పడటానికి ఇది సహాయపడుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

భారత్‌ను నౌకా వాణిజ్యంలో ఒక ప్రధాన శక్తిగా మార్చేందుకు ప్రధానంగా మూడు పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా చెప్పారు. ఈ కార్యక్రమాలు నౌకా నిర్మాణ రంగంలో ఆర్థిక సహాయాన్ని మరింత సులభతరం చేస్తాయని.. నౌకాశ్రయాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటాన్ని, డిజైన్- నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ పథకాల ద్వారా రూ. 70,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేశారు.

2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో నౌకా నిర్మాణ అవకాశాల గురించి ఒక సెమినార్ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ.. ఆ కాలంలోనే నౌకా నిర్మాణ వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు గుజరాత్ రాష్ట్రం మద్దతిచ్చిందని అన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నౌకానిర్మాణం సాధారణ పరిశ్రమ కాదన్న ఆయన.. పలు రకాల అనుబంధ రంగాల వృద్ధిని ఇది నడిపిస్తుందని, ఈ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా "పరిశ్రమలకు తల్లి"గా పిలుస్తారని తెలిపారు. ఉక్కు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, పెయింట్లు, ఐటీ వ్యవస్థలు వంటి పరిశ్రమలన్నీ సరకు రవాణా రంగం ద్వారా మద్దతు పొందుతున్నాయని అన్నారు. ఇది చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తోందని పేర్కొన్నారు. నౌకా నిర్మాణంలో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి దాదాపు రెట్టింపు ఆర్థిక రాబడిని ఇస్తుందన్న పరిశోధన నివేదికలను ఆయన ప్రస్తావించారు. నౌకాశ్రయంలో సృష్టించే ప్రతి ఉద్యోగం సరఫరా వైపు ఆరు నుంచి ఏడు కొత్త ఉద్యోగాలకు దారితీస్తుందని తెలిపారు. దీన్నిబట్టి నౌకా నిర్మాణంలో 100 ఉద్యోగాలు సంబంధిత రంగాల్లో 600 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దారితీస్తాయన్న ఆయన.. ఇది నౌకానిర్మాణ పరిశ్రమ చూపించే ఎన్నో రెట్ల ప్రభావాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. 

 

నౌకా నిర్మాణానికి అవసరమైన నైపుణ్యాలను పెంచేందుకు పనులు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఈ కార్యక్రమాల్లో దేశంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐ) కీలక పాత్ర పోషిస్తాయని, మారిటైమ్ విశ్వవిద్యాలయం పరిధి మరింత పెరుగుతుందని తెలిపారు. ఇటీవల సంవత్సరాలలో తీరప్రాంతాలలో నౌకాదళం, ఎన్‌సీసీల మధ్య సమన్వయం ద్వారా కొత్త పని విధానం తయారైనట్లు చెప్పారు. ఎన్‌‌సీసీ కేడెట్లు ఇప్పుడు నావికా దళానికి సంబంధించిన బాధ్యతలను మాత్రమే కాకుండా సముద్ర వాణిజ్య రంగంలో కూడా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారని ఆయన అన్నారు.

నేటి భారతదేశం ఒక ప్రత్యేకమైన ఉత్తేజంతో ముందుకు సాగుతోందనీ, దేశం ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాకుండా వాటిని నిర్దేశించున్న సమయానికంటే ముందుగానే సాధిస్తోందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సౌర విద్యుత్ రంగంలో నాలుగు నుంచి అయిదు సంవత్సరాల కంటే ముందుగానే భారత్ లక్ష్యాలను చేరుకుంటోంది. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి విషయంలో పదకొండు సంవత్సరాల కిందట నిర్దేశించుకున్న లక్ష్యాలను అద్భుతంగా సాధిస్తున్నట్లు తెలిపారు. పెద్ద నౌకల కోసం దేశవ్యాప్తంగా భారీ ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన.. సాగరమాల వంటి కార్యక్రమాల ద్వారా అనుసంధానతను పెంచుతున్నట్లు తెలియజేశారు.

గత పదకొండు సంవత్సరాలలో భారతదేశంలో ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు అయిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేశారు. 2014కి ముందు భారత్‌లో ఓడల తిరుగు ప్రయాణ సమయం సగటున రెండు రోజులుగా ఉండేదని.. నేడు ఒక రోజు కంటే తగ్గిందని తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్త, పెద్ద ఓడరేవులను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. కేరళలో ఉన్న దేశంలోని మొట్టమొదటి డీప్-వాటర్ కంటైనర్ ట్రాన్స్-షిప్మెంట్ ఓడరేవు ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిదన్నారు. మహారాష్ట్రలోని వాధవన్ ఓడరేవును రూ. 75,000 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఇది ప్రపంచంలోని పది పెద్ద ఓడరేవులలో ఒకటిగా నిలుస్తుందని ప్రకటించారు.

 

ప్రస్తుత ప్రపంచ సముద్ర వాణిజ్యంలో భారత్‌ 10 శాతం వాటాను కలిగి ఉందని తెలిపిన మోదీ.. దీనిని పెంచాల్సిన అవసరాన్ని చెప్పారు. 2047 నాటికి ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దేశం వాటాను మూడు రెట్లు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. భారత్‌ దీనిని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సముద్ర వాణిజ్యం విస్తరిస్తోన్న కొద్దీ భారతీయ నావికుల సంఖ్య కూడా పెరుగుతోందని ప్రధాని అన్నారు. ఈ నిపుణులను ఓడలను నడిపే, ఇంజిన్లు- యంత్రాలను నిర్వహణను చూసుకునే, సముద్రంలో సరకు లోడింగ్- అన్‌లోడ్ కార్యకలాపాలను పర్యవేక్షించే విషయంలో కష్టపడి పనిచేస్తారని తెలిపారు. దశాబ్దం కిందట భారత్‌లో 1.25 లక్షల కంటే తక్కువ మంది నావికులు ఉన్నారు. నేడు ఈ సంఖ్య మూడు లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో నావికులను అందించే దేశాల్లో భారత్‌ ఇప్పుడు మొదటి మూడు దేశాల్లో ఒకటిగా ఉందని చెప్పారు. భారత నౌకానిర్మాణ పరిశ్రమ వృద్ధి చెందటం వల్ల ప్రపంచానికి కూడా ఉపయోగం ఉంటుందన్నారు.

సముద్రాల విషయంలో గొప్ప వారసత్వాన్ని భారత్‌ కలిగి ఉందన్న ఆయన.. మత్స్యకారులు, పురాతన ఓడరేవు నగరాలు దీనికి ప్రతీకగా నిలుస్తున్నాయని ప్రముఖంగా ప్రస్తావించారు. భావ్‌నగర్, సౌరాష్ట్ర ప్రాంతాలు ఈ  ఘన వారసత్వానికి ప్రముఖ ఉదాహరణలని తెలిపారు. ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలు, ప్రపంచం కోసం సంరక్షించడం, ప్రదర్శించటం అనే అంశాలకు ఉన్న ప్రాముఖ్యతను చెప్పారు. లోథాల్‌లో ప్రపంచ స్థాయి సముద్ర మ్యూజియం ఏర్పాటవుతోందని ఆయన.. ఇది కూడా ఐక్యతా విగ్రహం మాదిరిగా భారతదేశ గుర్తింపుకు కొత్త చిహ్నంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

"భారత్‌ తీరప్రాంతాలు జాతీయ శ్రేయస్సుకు ముఖద్వారాలుగా మారతాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గుజరాత్ ‌సముద్ర తీరం మరోసారి ఈ ప్రాంతానికి ఒక వరంలా మారతోందన్న ఆయన.. దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఓడరేవు ఆధారిత అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం కొత్త ప్రామాణికతను నిర్దేశిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో సముద్ర మార్గాల ద్వారా వచ్చే సరుకులో 40 శాతం గుజరాత్ ఓడరేవుల నుంచే వెళ్తోందన్న ఆయన.. ఈ ఓడరేవులు త్వరలో రానున్న ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ద్వారా ప్రయోజనం పొందుతాయని ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ కారిడార్.. వస్తువులను దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా తరలించడానికి వీలు కల్పించటంతో పాటు ఓడరేవు సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.

 

నౌకలను తుక్కుగా మార్చే బలమైన వ్యవస్థ ఈ ప్రాంతంలో తయారువుతోందని తెలిపిన ఆయన.. అలంగ్‌లో ఉన్న నౌకా విధ్వంసక యార్డ్ (షిప్ బ్రేకింగ్ యార్డ్) దీనికి ప్రధాన ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు. ఈ రంగం యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలంటే అన్ని రంగాలలో వేగవంతమైన పురోగతి అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్‌కు మార్గం స్వావలంబనేనని పునరుద్ఘాటించారు. కొనుగోలు చేసే వాటితో పాటు విక్రయించేవి కూడా స్వదేశీనే అయి ఉండాలన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. "ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి" అని రాసి ఉన్న బోర్డులను దుకాణాల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు విన్నవించారు. ఈ సమష్టి కృషి.. ప్రతి పండుగను భారతదేశ శ్రేయస్సుకు సంబంధించిన వేడుకగా చేస్తుందని చెబుతూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్.. కేంద్ర మంత్రులు శ్రీ సీ.ఆర్.పాటిల్, శ్రీ సర్బానంద సోనోవాల్, డాక్టర్ మన్సుఖ్ మాండవియా, శ్రీ శంతనూ ఠాకూర్, శ్రీమతి నిముబెన్ బంభానియా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

సముద్ర వాణిజ్య రంగానికి భారీ ఊతాన్నిస్తూ ప్రధానమంత్రి రూ.34,200 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందిరా డాక్‌లో ముంబయి ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంలో కొత్త కంటైనర్ టెర్మినల్, అనుబంధ సదుపాయాలను.. పరదీప్ ఓడరేవులో కొత్త కంటైనర్ బెర్త్, కార్గో నిర్వహణ సదుపాయాలు, సంబంధిత అభివృద్ధి పనులు.. ట్యూనా టెక్రా మల్టీ-కార్గో టెర్మినల్.. ఎన్నోర్‌లోని కామరాజర్ ఓడరేవులో అగ్నిమాపక సదుపాయాలు, ఆధునిక రహదారి అనుసంధానత.. చెన్నై ఓడరేవులో సముద్ర గోడలు, రివెట్‌మెంట్‌లతో సహా ఇతర తీరప్రాంత రక్షణ పనులు.. కార్ నికోబార్ ద్వీపంలో సముద్ర గోడ నిర్మాణం… కాండ్లాలోని దీన్‌దయాళ్ ఓడరేవులో బహుళ అవసరాలకు ఉపయోగపడే కార్గో బెర్త్, హరిత బయో-మెథనాల్ కేంద్రం.. పాట్నా, వారణాసిలలో ఓడల మరమ్మతు కేంద్రాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

 

సమగ్ర సుస్థిరాభివృద్ధి సాధించాలన్న నిబద్ధతకు అనుగుణంగా గుజరాత్‌లో వివిధ రంగాలకు సంబంధించిన రూ. 26,354 కోట్లకు పైగా విలువైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఛరా పోర్టులో హెచ్‌పీఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్, గుజరాత్ ఐఓసీఎల్ రిఫైనరీలో యాక్రిలిక్స్- ఆక్సో ఆల్కహాల్ ప్రాజెక్ట్, సామర్ధ్యాన్ని పెంచేందుకు వీలున్న 600 మెగావాట్ల హరిత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్, పీఎం-కుసుమ్ సీ విభాగం కింద చేపట్టిన 475 మెగావాట్ల ఫీడర్ స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్ట్, 45 మెగావాట్ల బదేలి సౌర విద్యుత్ పీవీ ప్రాజెక్ట్, ధోర్డో గ్రామ సౌర విద్యుదీకరణ మొదలైన వాటిని ఆయన ప్రారంభించారు. భావ్‌నగర్‌లోని సర్ టీ. జనరల్ ఆస్పత్రి.. జామ్‌నగర్‌లోని గురు గోవింద్ సిన్హ్ ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణ, 70 కి.మీ జాతీయ రహదారులను నాలుగు వరుసలకు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు ఎల్ఎన్‌జీ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు.. తీరప్రాంత రక్షణ, రహదారులు, ఆరోగ్య సంరక్షణ, పట్టణ రవాణా ప్రాజెక్టులకు ఆయన పునాది రాయి వేశారు.

సుస్థిర పారిశ్రామికీకరణ, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఇతివృత్తంతో గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక నగరంగా నిర్మించిన ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం (ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్- డీఎస్ఐఆర్) వైమానిక సర్వేను కూడా ప్రధాని నిర్వహించారు. భారతదేశ ప్రాచీన సముద్ర సంప్రదాయాలను వేడుక చేసుకునేందుకు, వాటిని సంరక్షించేందుకు.. పర్యాటకం, పరిశోధన, విద్య, నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా పనిచేసేందుకు ఉద్దేశించిన లోథాల్‌లోని నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్‌హెచ్ఎంసీ) పనులను స్వయంగా సమీక్షించారు. దీనిని రూ. 4500 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Pays Tribute to the Martyrs of the 2001 Parliament Attack
December 13, 2025

Prime Minister Shri Narendra Modi today paid solemn tribute to the brave security personnel who sacrificed their lives while defending the Parliament of India during the heinous terrorist attack on 13 December 2001.

The Prime Minister stated that the nation remembers with deep respect those who laid down their lives in the line of duty. He noted that their courage, alertness, and unwavering sense of responsibility in the face of grave danger remain an enduring inspiration for every citizen.

In a post on X, Shri Modi wrote:

“On this day, our nation remembers those who laid down their lives during the heinous attack on our Parliament in 2001. In the face of grave danger, their courage, alertness and unwavering sense of duty were remarkable. India will forever remain grateful for their supreme sacrifice.”