మహిళలు దేన్నైనా మరచిపోగలరు కానీ.. తమ గౌరవానికి జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మరచిపోరు: పీఎం
పార్లమెంటులో నారీశక్తి వందన్ అధీనియం సవరణను వ్యతిరేకించిన పార్టీలు మహిళాశక్తిని తేలికగా తీసుకుంటున్నాయి: పీఎం
21 వ శతాబ్దపు మహిళలకు సాధికారత కల్పించే మహాయజ్ఞమే నారీశక్తి వందన్ అధీనియం చట్ట సవరణ: పీఎం
కుటుంబ రాజకీయ పార్టీల భయమే నారీశక్తి వందన్ అధీనియంను వ్యతిరేకించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి: పీఎం
దేశంలో నారీశక్తి ఆశీర్వాదాలు 100 శాతం మాకున్నాయి: పీఎం
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని మేం తొలగిస్తాం: పీఎం
మహిళల హక్కులను లాక్కున్న ఈ వ్యక్తులు బల్లలను చరుస్తున్నారు.. ఇది మహిళల గౌరవం, ఆత్మాభిమానంపై జరిగిన దాడి: పీఎం
మహిళల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పాపానికి ప్రతిపక్షానికి శిక్ష పడుతుంది: పీఎం

మిత్రులారా!

నేనివాళ మీతో అత్యంత ముఖ్యమైన అంశంమీద.. ప్రధానంగా దేశంలోని తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలనుద్దేశించి మాట్లాడుతున్నాను! నారీశక్తి ప్రస్థానాన్ని కొందరు ఎలా అడ్డుకున్నారో ఈ రోజున  భారత పౌరులందరూ ప్రత్యక్షంగా చూశారు. మేమెంతగా ప్రయత్నించినా వారి కలలను నిర్దాక్షిణ్యంగా అణచివేసే వారిని నిలువరించడంలో విజయం సాధించలేకపోయాం. నారీశక్తి వందన్ చట్టానికి సవరణపై ఆమోదం పొందలేకపోయాం! ఇందుకుగాను తల్లులు, అక్కచెల్లెళ్లు నన్ను క్షమించాలని కోరుతున్నాను.

మిత్రులారా!

దేశ ప్రయోజనాలే మనకు సర్వోన్నతం... కానీ, కొందరికి తమ స్వార్థమే సర్వస్వమైనపుడు.. జాతి ప్రయోజనాలకన్నా పార్టీ ప్రయోజనాలే గొప్పవైనప్పుడు... నారీశక్తి, జాతీయ ప్రయోజనాలు ఇలాంటి దుష్పరిణామాలను సహించాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా జరిగింది ఇదే. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ వంటి పార్టీల స్వార్థ రాజకీయాలు దేశంలోని నారీశక్తికి ఎంతో నష్టం చేశాయి.

మిత్రులారా!

దేశంలోని కోట్లాది మహిళల కళ్లు నిన్న పార్లమెంటులో సాగుతున్న చర్చలపైనే కేంద్రీకృతమయ్యాయి. మహిళా లోకానికి మేలు చేసే ఈ ప్రతిపాదన వీగిపోవడాన్ని నారీశక్తి స్వయంగా గమనించింది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ వంటి అనువంశిక పార్టీలు ఆనందంతో కరతాళ ధ్వనులు చేయడం నాకెంతో వేదన కలిగించింది. మహిళల హక్కులను అణచివేసే వారు బల్లలు చరుస్తూ హర్షామోదాలు ప్రకటించారు. వారు బాదింది బల్లలను కాదు... మహిళల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఘోరంగా దెబ్బతీశారు. మహిళలు ఏదైనా మరిచిపోవచ్చుగానీ, తమకు జరిగిన అవమానాన్ని మాత్రం ఎన్నటికీ మరువరు. పార్లమెంటులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ప్రవర్తన కలిగించిన బాధ మహిళల హృదయాలను ఎప్పటికీ మెలిపెడుతూంటుంది. తమతమ ప్రాంతాలలో ఈ పార్టీల నాయకులను చూసినప్పుడల్లా మహిళా రిజర్వేషన్లకు మోకాలు అడ్డుపెట్టి, పార్లమెంటులో సంబరం చేసుకున్నది వీరేనని గుర్తుపట్టి చీదరించుకుంటారు. నిన్న పార్లమెంటులో నారీశక్తి వందన్ సవరణను వ్యతిరేకించిన పార్టీలకు నేనిదే చెబుతున్నా... నారీశక్తిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు... నేటి 21వ శతాబ్దపు మహిళలు దేశంలో జరిగే ప్రతి సంఘటననూ నిశితంగా గమనిస్తున్నారని, వాటి వెనుక ఉన్నవారి ఉద్దేశాలను గ్రహిస్తున్నారని, వాస్తవాలను పూర్తిగా అర్థం చేసుకున్నారని మీరు మరచిపోతున్నారు. అయితే, మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించి, పాపానికి ఒడిగట్టినందుకు నారీశక్తి చేతిలో మీకు శిక్ష తప్పదని ప్రతిపక్షాలకు స్పష్టం చేస్తున్నాను. ఈ పార్టీలు చివరకు రాజ్యాంగ రూపకర్తల అభీష్టాన్ని కూడా కాలదన్ని, వారిని అవమానించాయి. ఏదిఏమైనా ప్రజలు వేసే శిక్ష నుంచి వారెన్నటికీ తప్పించుకోలేరు.

మిత్రులారా!

నారీశక్తి వందన్ సవరణ ఎవరి నుంచీ.. ఏదీ లాక్కోవడానికి ఉద్దేశించినది కాదు. ఇది ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఇవ్వడం కోసం సంకల్పించినది. ఈ సవరణ.. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి 40 ఏళ్లుగా మహిళలకు దక్కాల్సిన హక్కును వారికి దఖలు పరిచేందుకే ఉద్దేశించినది.

దేశంలోని 21వ శతాబ్దపు మహిళల ఆకాంక్షలకు కొత్త రెక్కలు తొడిగి, వారి పురోగమన మార్గంలోని అవరోధాలను తొలగిస్తూ మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చేసిన గొప్ప ప్రయత్నమే నారీశక్తి వందన్ సవరణ. జనాభాలో సగభాగానికి హక్కులు దఖలుపరచే విస్పష్ట ఉద్దేశంతో, నిజాయితీగా చేసిన పవిత్ర కృషి విది. దేశ ప్రగతి ప్రస్థానంలో మహిళలను భాగస్వాములను చేయడానికి, ప్రతి ఒక్కరినీ మమేకం చేసుకోవడానికి చేసిన ప్రయత్నమిది. నారీశక్తి వందన్ సవరణ నేటి తక్షణావసరం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ అనే తేడాలేవీ లేకుండా ప్రతి రాష్ట్రం బలాన్ని సమానంగా పెంచే ప్రయత్నమే నారీశక్తి వందన్ సవరణ. పార్లమెంటులో ప్రతి రాష్ట్ర గళానికి మరింత బలం చేకూర్చే క్రమంలో ప్రతిపాదించిన సవరణ ఇది. రాష్ట్రం చిన్నదా.. పెద్దదా... జనాభా తక్కువా.. ఎక్కువా.. అనే అంశాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి బలాన్నీ సమ నిష్పత్తిలో పెంచాలనే ప్రయత్నంలో ఇదొక భాగం. ప్రభుత్వం నిజాయితీగా చేపట్టిన ఈ కృషిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పార్లమెంటులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భ్రూణహత్య వంటి పాపిష్టి చర్యకు పాల్పడ్డాయి. ‘కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే’ ఈ పాతకానికి ఒడిగట్టాయి. వారంతా దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే నేరస్థులు.. దేశంలోని నారీశక్తి ఎదుగుదల ఇచ్చగించని నేరస్థులు మాత్రమే!

మిత్రులారా!

మహిళా రిజర్వేషన్లంటేనే కాంగ్రెస్ పార్టీకి ద్వేషం... అందుకే వాటిని అడ్డుకోవడానికి నిత్యం కుట్ర పన్నుతూనే వచ్చింది. ఈ సంకల్ప సాకారానికి ఎన్ని సార్లు... ఎంతగా కృషి చేసినా, ప్రతి సారి  కాంగ్రెస్ మోకాలడ్డింది. అదే తరహాలో ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్లను నిరోధించడంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో అవాస్తవాలను ఉటంకించాయి. కొన్నిసార్లు గణాంకాలను ఏకరవు పెడతాయి... మరికొన్ని సందర్భాల్లో ఇతరత్రా మార్గాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయి. తద్వారా భారత నారీశక్తి సమక్షంలో ఈ పార్టీలు ముసుగు తొలగించి, తమ వికృత స్వరూపాన్ని తామే బట్టబయలు చేసుకున్నాయి.

 

మిత్రులారా!

కాంగ్రెస్‌ పార్టీ దశాబ్దాల నాటి తన తప్పిదాన్ని సరిదిద్దుకుంటుందని వ్యక్తిగతంగా నేను ఆశించాను. తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈసారి పశ్చాత్తాపం వ్యక్తం చేసుందని భావించాను. అయితే, నారీశక్తికి అండగా నిలిచే చరిత్రాత్మక అవకాశాన్ని కాంగ్రెస్ నిస్సందేహంగా కోల్పోయింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయింది. ప్రాంతీయ పార్టీల అండతో పరాన్నజీవిలా నెట్టుకొస్తోంది. వాస్తవానికి తనను బలపరచే ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావడం కాంగ్రెస్‌కు ఇష్టం ఉండదు. అందుకే, ఈ సవరణను వ్యతిరేకించేలా చేసి ఆయా పార్టీల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే రాజకీయ కుట్రలో భాగంగానే నేడింతటి ఘాతుకానికి ఒడిగట్టింది.

మిత్రులారా!

కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే, టీఎంసీ తదితర పార్టీలన్నీ ఏళ్ల తరబడి ప్రతి సారి అవే సాకులు, తప్పుదోవ పట్టించే వాదనలతో సదా ఏదో ఒక సాంకేతిక అడ్డంకిని సృష్టిస్తూ మహిళల హక్కులను హరించాయి. దేశం ఈ వికృత రాజకీయ క్రీడను, దానిలోని అంతరార్థాన్ని ఇప్పుడు లోతుగా అర్థం చేసుకుంది.

సోదరీసోదరులారా!

నారీశక్తి వందన్ చట్ట సవరణపై నేటి వ్యతిరేకతకు అసలు కారణం ఈ కుటుంబ ఆధారిత పార్టీల్లో నెలకొన్న భయాందోళనలే. మహిళలకు సాధికారత సిద్ధిస్తే, ఈ అనువంశిక పార్టీల నాయకత్వం కూలిపోయే ముప్పు ఉంటుందన్నదే వారి భయం. తమ కుటుంబాల్లోని వారు మినహా ఇతర మహిళలు ముందడుగు వేయడం వీరికి ఎన్నడూ ఇష్టముండదు. ఈ రోజున పంచాయతీలు, స్థానిక స్వపరిపాలన సంస్థలలో వేలాది, లక్షలాది మహిళలు తమ సామర్థ్యం నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు వారు లోక్‌సభ, శాసనసభల స్థాయికి ఎదిగి దేశానికి సేవ చేయాలనే సంకల్పం ప్రకటిస్తే ఈ కుటుంబ పార్టీలు అభద్రత భావనకు లోనవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళలకు మరిన్ని సీట్లు లభిస్తాయి. వారి స్థాయి, హోదా పెరుగుతాయి... కాబట్టే, వీరు నారీశక్తి వందన్ సవరణను వ్యతిరేకించారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన కాంగ్రెస్‌ను, దాని మిత్రపక్షాలను దేశంలోని మహిళా శక్తి ఎన్నటికీ క్షమించదు.

ప్రియమైన దేశవాసులారా!

నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పదేపదే, అనునిత్యం అబద్ధాలు వల్లిస్తున్నాయి. ఏవేవో సాకులతో వారు విభజన విద్వేషాగ్నిని రగిలించాలని యత్నిస్తున్నారు. ఎందుకంటే, “విభజించి పాలించు” అనే రాజనీతి బ్రిటిష్ పాలన నుంచి కాంగ్రెస్‌ పార్టీకి వారసత్వంగా సంక్రమించింది. ఇప్పటికి ఏడు దశాబ్దాలు దాటినా కాంగ్రెస్ పోకడలు నేటికీ అదేవిధంగా కొనసాగుతున్నాయి. దేశంలో చీలిక తెచ్చే భావజాలాన్ని కాంగ్రెస్ సదా రెచ్చగొడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన కొన్ని రాష్ట్రాలకు హాని చేస్తుందనే అవాస్తవాన్ని విస్తృతంగా  వ్యాపింపజేసింది! అయితే, ఏ రాష్ట్రంలోనూ భాగస్వామ్య నిష్పత్తి మారదని, ఎవరి ప్రాతినిధ్యమూ తగ్గదని కేంద్ర ప్రభుత్వం తొలి రోజు నుంచే స్పష్టం చేస్తూవస్తోంది. అన్ని రాష్ట్రాల సీట్లు సమ నిష్పత్తిలో పెరుగుతాయన్నది వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు ఈ నిజాన్ని అంగీకరించేందుకు ఇచ్చగించడం లేదు.

మిత్రులారా, 

ఈ సవరణ బిల్లు అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాలకు ఒక గొప్ప అవకాశం. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే  తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు పెరిగేవి. కానీ తమ స్వార్థ రాజకీయాల వల్ల ఈ పార్టీలు తమ సొంత రాష్ట్ర ప్రజలకే నమ్మకద్రోహం చేశాయి. ఉదాహరణకు ‘డీఎంకే’కి ఎక్కువ మంది తమిళులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసి తమిళనాడు గొంతుకను బలోపేతం చేసే అవకాశం ఉండేది! కానీ అది ఆ అవకాశాన్ని కోల్పోయింది. అలాగే టీఎంసీ‌కి కూడా బెంగాల్ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఉండేది. కానీ టీఎంసీ కూడా ఆ అవకాశాన్ని వదులుకుంది. సమాజ్‌వాదీ పార్టీ‌కి తనపై ఉన్న మహిళా వ్యతిరేక ముద్రను తొలగించుకునే అవకాశం ఉండేది. కానీ ఎస్పీ దానిని కూడా వదులుకుంది. ఎస్పీ ఇప్పటికే లోహియా గారిని మర్చిపోయింది. 'నారీ శక్తి వందన్' సవరణను వ్యతిరేకించడం ద్వారా ఎస్పీ లోహియా గారి ఆశయాలన్నింటినీ అడుగుల్లో తొక్కివేసింది. ఎస్పీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం.. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్, దేశంలోని మహిళలు ఎప్పటికీ మర్చిపోరు.

మిత్రులారా, 

మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ మరోసారి ఒక విషయాన్ని నిరూపించింది. కాంగ్రెస్ ఒక సంస్కరణల వ్యతిరేక పార్టీ. 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన భారత్ కోసం ఏ నిర్ణయాలు, ఏ సంస్కరణలు అవసరమో దేశం తీసుకునే ఆ నిర్ణయాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది.. తిరస్కరిస్తుంది.. అడ్డుకుంటుంది. ఇదే కాంగ్రెస్ చరిత్ర.. ఇదే కాంగ్రెస్ అనుసరించే ప్రతికూల రాజకీయాలు.

మిత్రులారా, 

కాంగ్రెస్ ఒక సంస్కరణల వ్యతిరేక పార్టీ. జన్ ధన్–ఆధార్–మొబైల్ త్రయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇది. కాంగ్రెస్ డిజిటల్ చెల్లింపులను వ్యతిరేకించింది. కాంగ్రెస్ జీఎస్టీని వ్యతిరేకించింది. జనరల్ క్యాటగిరిలోని పేదలకు రిజర్వేషన్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. యూనిఫాం సివిల్ కోడ్ అవసరమని మన రాజ్యాంగం, మన కోర్టులు చెప్పాయి. కానీ కాంగ్రెస్ దానిని కూడా వ్యతిరేకిస్తోంది. సంస్కరణ అనే మాట ఎత్తగానే కాంగ్రెస్ నిరసన ప్లకార్డులతో పరుగులు తీస్తుంది. దేశాన్ని బలోపేతం చేసే ఏ పనినైనా  అందులో అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ తన శక్తినంతటినీ ఉపయోగిస్తుంది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్'ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దేశం నుంచి చొరబాటుదారులను పంపించే ప్రయత్నాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఓటర్ల జాబితా శుద్దీకరణ అయిన సర్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. వక్ఫ్ బోర్డులో సంస్కరణలను కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.

మిత్రులారా, 

శరణార్థులకు భద్రత కల్పించే సీఏఏ చట్టాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. అబద్ధాలు చెప్పి వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా దేశంలో అలజడిని సృష్టించింది. మావోయిస్టు-నక్సలైట్ హింసను అంతం చేయడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ అడ్డుపడుతోంది. ఎప్పుడు సంస్కరణలు వచ్చినా అబద్ధాలు చెప్పడం గందరగోళాన్ని సృష్టించడం అనేది కాంగ్రెస్‌కు ఒకే ఒక పద్ధతి ఉంది. చరిత్రనే సాక్షి.. కాంగ్రెస్ ఎప్పుడూ ఈ ప్రతికూల మార్గాన్నే ఎంచుకుంది.

 

మిత్రులారా, 

దేశానికి ఏ నిర్ణయం అవసరమైనా కాంగ్రెస్ దానిని మూలన పడేస్తుంది. కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి కారణంగానే భారత్‌ చేరుకోవాల్సిన అభివృద్ధి శిఖరాలను అందుకోలేకపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మనతో పాటే అనేక దేశాలకు కూడా స్వాతంత్ర్యం లభించింది. ఆ దేశాల్లో చాలా వరకు మనకంటే ఎంతో ముందుకెళ్లాయి.. దానికి కారణం కాంగ్రెస్ ప్రతి సంస్కరణను అడ్డుకుంటూనే రావడం. జాప్యం, తప్పుదోవ పట్టించడం, అడ్డంకులు సృష్టించడం.. ఇదే కాంగ్రెస్ సూత్రం- ఇదే కాంగ్రెస్ పని సంస్కృతి. పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను కాంగ్రెస్ వాయిదా వేసింది. పాకిస్థాన్‌తో నీటి పంపిణీ వివాదాలను కాంగ్రెస్ ఆలస్యం చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని కాంగ్రెస్ 40 ఏళ్ల పాటు వాయిదా వేసింది. సైనికుల కోసం 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్'ను కాంగ్రెస్ 40 ఏళ్ల పాటు ఆలస్యం చేసింది.

మిత్రులారా, 

కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి దేశానికి ఎప్పుడూ గొప్ప నష్టాన్ని కలిగించింది. కాంగ్రెస్ చేసిన ప్రతి వ్యతిరేక ప్రతి అనిశ్చిత నిర్ణయం ప్రతి మోసం వల్ల దేశం నష్టపోయింది. దేశంలోని తరతరాలు బాధపడ్డాయి. నేడు దేశం ముందున్న ప్రధాన సవాళ్లన్నీ కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి నుండే ఉద్భవించాయి. అందుకే ఈ పోరాటం కేవలం ఒక చట్టానికి సంబంధించినది మాత్రమే కాదు. ఈ పోరాటం పూర్తిగా ప్రతికూలతతో నిండిన కాంగ్రెస్ సంస్కరణ-వ్యతిరేక మనస్తత్వానికి వ్యతిరేకమైంది. కాంగ్రెస్‌కు ఉన్న ఈ మనస్తత్వానికి దేశంలోని మహిళలు, కుమార్తెలు గట్టి సమాధానం ఇస్తారన్న విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు.

మిత్రులారా, 

దేశంలోని మహిళల కలలు భగ్నం కావడాన్ని కొందరు ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ విషయం ఎప్పుడూ విజయం లేదా వైఫల్యానికి సంబంధించింది కాదు.. క్రెడిట్ గురించి అసలే కాదు. ‘దేశంలోని సగం జనాభాకు వారి హక్కులు దక్కనివ్వండి- వారి ఫోటోలన్నింటినీ ప్రకటనల్లో ముద్రించి క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే ఇస్తాను అని’ నేను పార్లమెంటులో కూడా చెప్పాను.. కానీ మహిళలను పాతకాలపు ఆలోచనలతో చూసేవారు ఇప్పటికీ తమ అబద్ధాలకే కట్టుబడి మొండిగా వ్యవహరిస్తున్నారు!

 

మిత్రులారా, 

మహిళలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే పోరాటం దశాబ్దాలుగా జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఆ కృషిలో నేను కూడా ఒకడిగా భాగస్వామినయ్యాను. ఎంతోమంది మహిళలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఎంతోమంది సోదరీమణులు నాకు లేఖలు రాసి తమ ఆవేదనను వివరించారు. నా దేశపు తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు.. మీరందరూ ఈ రోజు బాధపడుతున్నారని నాకు తెలుసు. మీ దుఃఖంలో నేను కూడా భాగస్వామినే. ఈ రోజు బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన 66 శాతం ఓట్లు రాలేదనేది నిజమే కావచ్చు.. కానీ దేశంలోని నూటికి నూరు శాతం మహిళా శక్తి మాకు ఆశీస్సులను అందించిందని నేను నమ్ముతున్నాను. దేశంలోని ప్రతి మహిళకు నేను హామీ ఇస్తున్నాను.. మహిళా రిజర్వేషన్ల మార్గంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని మేము తొలగిస్తాం. మా ధైర్యం గొప్పది.. మా సంకల్పం దృఢమైనది.. మా నిశ్చయం అచంచలమైనది. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలు పార్లమెంటు- శాసనసభలలో మహిళల భాగస్వామ్యం పెరగకుండా ఎప్పటికీ అడ్డుకోలేవు. ఇది కేవలం సమయం మాత్రమే. మహిళా శక్తి సాధికారత పట్ల బీజేపీ-ఎన్డీయే సంకల్పం చెక్కుచెదరలేదు. నిన్న మనకు సంఖ్యాబలం లేకపోవచ్చు కానీ అంతమాత్రాన మనం ఓడిపోయినట్లు కాదు. మన అంతర్గత శక్తి అజేయమైనది. మన ప్రయత్నం ఆగదు.. మన ప్రయత్నం విరామం తీసుకోదు. భవిష్యత్తులో మనకు మరిన్ని అవకాశాలు వస్తాయి. దేశ జనాభాలో సగభాగమైన మహిళల కలల కోసం, దేశ భవిష్యత్తు కోసం ఈ సంకల్పాన్ని మనం నెరవేర్చి తీరాలి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Moving beyond Western paradigms: The geopolitical lesson of India’s multi-alignment

Media Coverage

Moving beyond Western paradigms: The geopolitical lesson of India’s multi-alignment
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in a mishap in Surat, Gujarat
June 02, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today expressed deep pain over the tragic mishap in Surat district, Gujarat. He extended his heartfelt condolences to those who have lost their loved ones and prayed for the earliest recovery of the injured. The Prime Minister noted that rescue operations are underway and authorities are providing all possible assistance at the accident site.

The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) for the next of kin of each deceased. Shri Modi also noted that Rs. 50,000 would be provided to those who sustained injuries in the incident.

The Prime Minister posted on X:

"Deeply pained to hear about a mishap in Surat district, Gujarat. My condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance at the accident site.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM"