మన గొప్ప బోడో సంప్రదాయాలను గౌరవిస్తున్న ‘బగురుంబా ధహోవ్’: ప్రధానమంత్రి
ఏళ్ల నాటి ఘర్షణలకు ముగింపు పలికిన 2020 నాటి బోడో శాంతి ఒప్పందం: ప్రధానమంత్రి
దీని తర్వాత మళ్లీ నమ్మకం ఏర్పడి హింసను వీడి ప్రధాన స్రవంతిలో చేరిన వేలాది మంది యువకులు: ప్రధానమంత్రి
నేడు అస్సాం సాంస్కృతిక రాయబారులుగా ఎదుగుతున్న ప్రతిభావంతులైన బోడో యువత: ప్రధానమంత్రి

నమస్కారం! ఖులుంబై!

ఏమిటి సంగతులు..? ముందుగా మాఘ బిహు పర్వదినం.. మాఘ దోమాహి సందర్భంగా మీకందరికీ హృదయపూర్వక, ప్రేమాన్విత శుభకామనలు!

అస్సాం గవర్నర్‌ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, శాసనసభ స్పీకర్‌ శ్రీ బిశ్వజిత్ దైమరీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పబిత్రా మార్గిరిటా, బోడోలాండ్ ప్రాదేశిక పాలన మండలి ముఖ్య కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ హగ్రామా మోహిలరి, రాష్ట్ర మంత్రులు, అస్సాంలోని నా విశిష్ట సోదరీసోదరులారా!

అస్సాం సంస్కృతిని, బోడో సంప్రదాయాలను సన్నిహితంగా పరిశీలించే అవకాశం కలగడం నిజంగా నా అదృష్టం. ఈ రాష్ట్రంలో అత్యధికంగా పర్యటించిన ప్రధానమంత్రి ఇంతకుముందు మరెవరూ లేరు. అస్సాం కళాసాంస్కృతిక రంగాలకు ఒక ప్రధాన వేదిక లభించాలన్నది ఎప్పటినుంచో నా ఆకాంక్ష. వైభవోపేత కార్యక్రమాల నిర్వహణ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ రాష్ట్రానికి తగిన గుర్తింపు లభించాలి. ఈ దిశగా లోగడ ఎంతగానో కృషి చేశాం. భారీ స్థాయిలో నిర్వహించే బిహు వేడుక సంబంధిత కార్యక్రమాలైనా, ఝుమైర్ బినోదిని ప్రదర్శన అయినా, ఏడాదింబావు కిందట ఢిల్లీలో నిర్వహించిన భారీ బోడోలాండ్ ఉత్సవం లేదా ఇతర సాంస్కృతిక కార్యక్రమం ఏదైనప్పటికీ, అస్సాం కళాసంస్కృతుల అద్భుత సమ్మేళనాన్ని ఆస్వాదించే ఏ ఒక్క అవకాశాన్నీ నేను జారవిడవను. అందుకే, బోడో ప్రతిష్ఠకు సజీవ నిదర్శనమైన ఇవాళ్టి బకురుంబా ఉత్సవంలో భాగస్వామినయ్యాను. బోడో సమాజంతోపాటు అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ఈ వేడుక ఒక గౌరవం. ఇందులో పాలుపంచుకుంటున్న ప్రజలందరికీ, ముఖ్యంగా కళాకారులకు నా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను.

 

మిత్రులారా!

‘బకురుంబా దహోవ్’ ఒక పండుగకు పరిమితం కాదు... ఇదొక మాధ్యమం- మన సుసంపన్న బోడో సంప్రదాయాన్ని గౌరవించే, ఈ సమాజంలోని గొప్ప వ్యక్తులను సంస్మరించుకునే మాధ్యమం. బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ, గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ, రూపనాథ్ బ్రహ్మ, సతీష్ చంద్ర బసుమతారి, మొరదం బ్రహ్మ, కంకేశ్వర్ నార్జరీ వంటి ఎందరెందరో మహనీయులు సామాజిక సంస్కరణలకు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి, రాజకీయ చైతన్యానికి ఎనలేని శక్తిని చేకూర్చారు. ఈ నేపథ్యంలో ఆ మహానుభావులందరికీ నా గౌరవపూర్వక నమస్సులు.

మిత్రులారా!

అస్సాం సంస్కృతిని యావద్భారతానికి గర్వకారణంగా బీజేపీ పరిగణిస్తుంది. అస్సాం గతం, చరిత్రతోనే ఈ దేశ చరిత్ర పరిపూర్ణం కాగలదనడంలో సందేహం లేదు. కాబట్టే, బీజేపీ ప్రభుత్వ హయాంలో బకురుంబా దహొ వంటి గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. బిహు వేడులకు జాతీయ గుర్తింపు లభించడం తథ్యం. ఇప్పటికే మన కృషివల్ల ‘చరాయిదేవ్ మొయిదాం’ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించింది. అలాగే, అస్సామీ భాషకు ప్రాచీన భాష హోదా లభించింది.

సోదరీసోదరులారా!

బోడో భాషకు మేం అస్సాం రాష్ట్ర సహ-అధికార భాష హోదా కూడా ఇచ్చాం. ఈ భాషలో విద్యాబోధనను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రత్యేక డైరెక్టరేట్‌ను కూడా ఏర్పాటు చేశాం. మా నిబద్ధత ఫలితంగా బాథౌ మతానికి సగౌరవ గుర్తింపు లభించడమేగాక బాథౌ పూజ రోజును రాష్ట్ర సెలవుదినంగా ప్రకటించాం. ఏ ప్రభుత్వ హయాంలోనైతే అసమాన స్వాతంత్ర్యసమర యోధుడు లచిత్ బోర్ఫుకాన్ భారీ విగ్రహం ప్రతిష్ఠితమైందో, బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ జరిగిందో అది కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా శ్రీమంత శంకరదేవ్ భక్తి-సామాజిక సామరస్య సంప్రదాయం, జ్యోతి ప్రసాద్ అగర్వాలా కళ-చైతన్యం ఒక్కటేమిటి... అస్సాం సంబంధిత ప్రతి వారసత్వాన్ని, ప్రతిష్ఠను గౌరవించే అదృష్టం తనకు దక్కిందని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. యాదృచ్ఛికంగా ఈ రోజు శ్రీ జ్యోతి ప్రసాద్ అగర్వాలా వర్ధంతి కూడా.. ఈ సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళి అర్పిస్తున్నాను.

 

మిత్రులారా!

నేనివాళ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో నా మదిలో ఎన్నో ఆలోచనలు మెదలుతున్నాయి! నా అస్సాం రాష్ట్రం ఇంతగా ముందడుగు వేస్తుండటాన్ని తలచుకుంటే నాలో ఆనందోద్వేగాలు పొంగుతున్నాయి. ఒకనాడు నిత్య రక్తసిక్త ప్రాంతంగా పేరుపడిన ఈ రాష్ట్రంలో నేడు సంస్కృతీ సప్తవర్ణ రంజితమై, అందర్నీ రంజింపజేస్తోంది! ఒకప్పటి తుపాకుల మోత సద్దుమణిగి- సుమధుర ఖామ్, సిఫుంగ్ వాద్యనాదాలు వీనులవిందుగా వినిపిస్తున్నాయి. ఆనాటి కర్ఫ్యూ వాతావరణంలో నిశ్శబ్దం తాండవించిన చోట, ఇవాళ సంగీత స్వరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. నాటి అశాంతి, అస్థిరతల స్థానంలో  ఈ రోజున బకురుంబా వంటి ఆకర్షణీయ ఉత్సవాల సందడి నెలకొంది. ఇంత గొప్ప కార్యక్రమం అస్సాం విజయం మాత్రమే కాదు.. ఇది యావద్భారతానికీ చెందుతుంది. అస్సాంలో వచ్చిన ఈ మార్పులు చూసి దేశంలోని ప్రతి పౌరుడూ గర్విస్తున్నాడు.

మిత్రులారా!

ఈ విషయంలో నా అస్సామీ ప్రజలు.. నా బోడో సోదరీసోదరులు నాపై విశ్వాసం ప్రకటించడం నాకెంతో సంతృప్తినిస్తోంది. శాంతి, ప్రగతి సాధన కోసం మీరు మా ద్వంద్వ సారథ్య ప్రభుత్వానికి అప్పగించిన బాధ్యతను మీ ఆశీస్సులతో మేం నెరవేర్చాం. రాష్ట్రంలో ఇరవయ్యేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణకు 2020 నాటి బోడో శాంతి ఒప్పందం భరతవాక్యం పలికింది. ఈ ఒప్పందం అనంతరం ప్రజల్లో నమ్మకం పునఃప్రతిష్టితమై వేలాది యువత హింసా మార్గం వీడి జనజీవన ప్రధాన స్రవంతిలో భాగమయ్యారు. ఈ ఒప్పందం తర్వాత బోడో ప్రాంతంలో అభివృద్ధికి, విద్యావ్యాప్తికి కొత్త అవకాశాలు అందివచ్చాయి. శాంతియుత వాతావరణ శాంతిభద్రతలకు మాత్రమే పరిమితం కాకుండా దైనందిన జీవితంలో అందర్భాగమైంది. ఈ విజయంలో ఆద్యంతం మీరంతా చేసిన కృషి అత్యంత కీలక పాత్ర పోషించింది.

 

మిత్రులారా!

అస్సాం శాంతికి, అభివృద్ధికి, ప్రతిష్ఠకు కేంద్ర బిందువుగా ఉన్నదెవరంటే- సాక్షాత్తూ అస్సాం యువతరమే. శాంతి స్థాపన కోసం వారెంచుకున్న పరిష్కారాన్ని మనమంతా ఒక్కటై ఉజ్వల భవిత వైపు నడిపించాలి. అందుకే, శాంతి ఒప్పందం కుదిరిన నాటినుంచీ బోడోలాండ్ అభివృద్ధికి మా ప్రభుత్వం నిరతం కృషి చేస్తోంది. ముందుగా పునరావాస ప్రక్రియను వేగిరపరచి, వేలాది యువతకు రూ.కోట్లలో ఆర్థిక సహాయం అందించడంతో వారంతా కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగారు!

మిత్రులారా!

బీజేపీ ప్రభుత్వ కృషి ఫలితం నేడు మనందరి కళ్లముందు కనిపిస్తోంది. ప్రతిభావంతులైన నా బోడో యువతరం నేడు అస్సాం సాంస్కృతిక రాయబారులయ్యారు. క్రీడా రంగంలోనూ వారు దేశానికి కీర్తిని సముపార్జించారు. సరికొత్త స్వప్నాలను ఆత్మవిశ్వాసంతో ఊహించగలగడమే కాకుండా వాటిని సాకారం చేసుకుంటూ, అస్సాం పురోగమన వేగం పెంచుతున్నారు.

మిత్రులారా!

అస్సాం కళా-సంస్కృతులను, ప్రతిష్ఠను మనం గౌరవించడం చూసి, కొందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్రానికి గౌరవం దక్కడాన్ని ఇష్టపడని పార్టీ ఏదో మీకందరికీ తెలుసు కదా? నిజమే... అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే! శ్రీ భూపేన్ హజారికాకు ‘భారతరత్న’ పురస్కరాన్ని వ్యతిరేకించింది... కాంగ్రెస్ పార్టీ! అస్సాంలో సెమీకండక్టర్ యూనిట్‌ ఏర్పాటుకు ఇచ్చగించనిది ఎవరు? కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి కుమారుడే!

మిత్రులారా!

నేనివాళ ఈ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే గమోచా (కండువా)ను మెడలో ధరించడం చూసి అస్సాంను అపహాస్యం చేసేది ఏ పార్టీ...? కాంగ్రెస్ పార్టీయే.

 

సోదరీసోదరులారా!

అస్సాం, బోడోలాండ్ ప్రాంతం దశాబ్దాలుగా ప్రధాన ప్రగతి స్రవంతికి దూరమైందంటే అందుకు బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాజకీయ ప్రయోజనాల కోసం అస్సాంలో అస్థిరతను సృష్టించి, రాష్ట్రాన్ని హింసాగ్రిగుండంలోకి తోసింది. స్వాతంత్ర్యం తర్వాత కూడా అస్సాం ఎన్నో సవాళ్లతో కునారిల్లింది! కానీ, వాటి పరిష్కారానికి కాంగ్రెస్ చేసిందేమిటి? వాటిని తీర్చడానికి బదులు తన రాజకీయ పబ్బం గడిచే నిమిత్తం వాడుకుంది. ప్రజల మధ్య విశ్వాసం పెంచాల్సిన అవసరాన్ని పక్కకు నెట్టి, విభజనకు ఆజ్యం పోసింది. చర్చలు అవసరమైన సమయంలో సౌహార్ద సంభాషణ మార్గాలను మూసివేసింది! ముఖ్యంగా.. బోడోలాండ్ ప్రజల గళాన్ని ఎన్నడూ వినిపించుకున్నది లేదు. తన ప్రజల గాయాలను మాన్పాల్సిన స్థితిలో, వారికి సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి, చొరబాటుదారులకు అస్సాం తలుపులు తెరిచింది.

మిత్రులారా!

అస్సాం ప్రజలను కాంగ్రెస్‌ తమవారుగా పరిగణించదు సరికదా... వారికి విదేశీ చొరబాటుదారులంటేనే ఎంతో ఇష్టం. ఎందుకంటే- ఆ చొరబాటుదారులే కాంగ్రెస్‌కు గట్టి ఓటు బ్యాంకుగా మారుతున్నారు. కాబట్టే, ఆ పార్టీ పాలనలో విదేశీ చొరబాటుదారుల ప్రవాహానికి అడ్డుకట్టలు లేనేలేవు. వీరంతా అస్సాంలోని లక్షల ఎకరాల భూమిని ఆక్రమించుకుంటుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ వచ్చింది. కానీ, ఇవాళ శ్రీ హిమంత ప్రభుత్వం లక్షల ఎకరాల భూమిని చొరబాటుదారుల నుంచి విముక్తం చేసి, అస్సాం ప్రజలకు అప్పగించడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.

మిత్రులారా!

అస్సాంపై కాంగ్రెస్ సదా శీతకన్ను వేసింది... ఆ మాటకొస్తే ఈశాన్య ప్రాంతం మొత్తాన్నీ తన ఉదాసీనతకు బలిచేసింది. ఈ ప్రాంత అభివృద్ధి అవశ్యమని భావించని ఆ కాంగ్రెస్ పార్టీకి అస్సాం ప్రగతిపై శ్రద్ధ ఎందుకుంటుంది? బోడో ప్రజల ఆశలు, ఆకాంక్షల గురించి ఆలోచించే తీరిక వారికెక్కడిది? కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతాన్ని సమస్యల్లోకి నెట్టాయి.

 

సోదరీసోదరులారా!

కాంగ్రెస్‌ హయాంనాటి పాపాలను మా ద్వంద్వ సారథ్య ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇవాళ అభివృద్ధి వేగం ఎలాంటిదో మీ కళ్ల ముందే ఉంది. బోడో-కచారి సంక్షేమ స్వయంప్రతిపత్తి మండలిని మేం ఏర్పాటు చేశాం. ఆ ప్రాంతంలో  అభివృద్ధిని వేగిరపరుస్తూ రూ.1500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. కోక్రాఝార్‌లో వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రారంభమయ్యాయి. తముల్పూర్‌లో వైద్య కళాశాల నిర్మాణం కూడా వేగం పుంజుకుంది. నర్సింగ్ కళాశాలలు, పారా-మెడికల్ సంస్థల ఏర్పాటుతో యువతకు కొత్త అవకాశాలు అందివస్తున్నాయి. గోబర్ధన, పర్బత్‌ఝారా, హొరిసింగా వంటి ప్రాంతాల్లో పాలిటెక్నిక్, సాంకేతిక శిక్షణ సంస్థలు కూడా నిర్మితమయ్యాయి.

మిత్రులారా!

బోడోలాండ్ కోసం ప్రత్యేక సంక్షేమ శాఖతోపాటు బోడోలాండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీని కూడా ఏర్పాటు చేశాం. బోడో సమాజ సంక్షేమం కోసం మెరుగైన విధానాల రూపకల్పనలో ఇది తోడ్పాటునిస్తుంది.

మిత్రులారా!

బీజేపీ ప్రభుత్వం హృదయాల మధ్య అంతరాన్ని మాత్రమే కాదు... అస్సాం-ఢిల్లీ మధ్య దూరాన్ని కూడా తగ్గించింది. మౌలిక సదుపాయాల మెరుగు ద్వారా అస్సాంలో వివిధ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గిస్తోంది. మునుపటి దుర్గమ ప్రాంతాల్లో నేడు జాతీయ రహదారులు నిర్మాణం సాగుతోంది. ఈ రహదారులన్నిటి వల్లా కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. కోక్రాఝార్‌ను భూటాన్ సరిహద్దుతో కలిపే బిష్మురి-సరళ్పారా రహదారి నిర్మాణానికి రూ.కోట్లలో నిధులు కేటాయించాం. కోక్రాఝార్ నుంచి భూటాన్‌లోని గెలెఫు వరకూ ప్రతిపాదిత రైలు మార్గం కూడా మరో కీలక ముందడుగు. దీన్ని మేమొక ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించి, ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక భాగం చేశాం. ఇది పూర్తయితే వాణిజ్యం, పర్యాటక రంగాలు రెండింటికీ ప్రోత్సాహం లభిస్తుంది.

మిత్రులారా!

ఒక సమాజం తన మూలాలకు అనుసంధానితమై, చర్చలు-విశ్వాసం బలోపేతమై, ప్రతి వర్గానికీ  సమాన అవకాశాలు లభించినపుడు సానుకూల మార్పులు తథ్యం. నేడు అస్సాం, బోడోలాండ్ ప్రయాణం ఆ దిశలోనూ సాగుతోంది. అస్సాం ఆత్మవిశ్వాసం.. సామర్థ్యం.. పురోగమనం నుంచి దేశవృద్ధి ప్రస్థానానికి సరికొత్త బలం చేకూరుతోంది. దేశంలో వేగంగా పురోగమించే రాష్ట్రాల్లో ఈ రోజు అస్సాం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుండగా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటోంది. ఈ అభివృద్ధిలో.. ఈ రూపాంతరీకరణలో బోడోలాండ్ సహా అస్సాం ప్రజలంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి ఈ కార్యక్రమంపై మీకందరికీ మరోసారి అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతూ, ధన్యవాదాలు అర్పిస్తున్నాను.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India a ‘front-runner’ market, plans to deepen AI and manufacturing presence: Ericsson CEO

Media Coverage

India a ‘front-runner’ market, plans to deepen AI and manufacturing presence: Ericsson CEO
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister speaks with Amir of Qatar
March 03, 2026

The Prime Minister, Shri Narendra Modi spoke with H.H. Sheikh Tamim bin Hamad Al Thani, the Amir of Qatar.

During the conversation, the Prime Minister conveyed that India stands firmly in solidarity with Qatar and strongly condemns any violation of its sovereignty and territorial integrity.

The two leaders emphasized the urgent need to restore peace and stability in the region through dialogue and diplomacy.

The Prime Minister also conveyed his appreciation for the continued support and care extended by the Qatari leadership to the Indian community in Qatar during this challenging time.

The Prime Minister wrote on X;

“Spoke with my brother, H.H. Sheikh Tamim bin Hamad Al Thani, the Amir of Qatar. We stand firmly in solidarity with Qatar and strongly condemn any violation of its sovereignty and territorial integrity. We emphasized the urgent need to restore peace and stability in the region through dialogue and diplomacy. I also conveyed my appreciation for his continued support and care for the Indian community in Qatar during this challenging time.

@TamimBinHamad”