అద్భుతమైన పుదుచ్చేరి ప్రజల మధ్య ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. నేడు జీవన సౌలభ్యాన్ని పెంచే, ఈ ప్రాంత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నాం: ప్రధాని
నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ‘బెస్ట్ పుదుచ్చేరి’ సూత్రాన్ని ఇచ్చాను. బెస్ట్ అంటే వ్యాపారం, విద్య, ఆధ్యాత్మికత, పర్యాటకం. గత నాలుగైదు ఏళ్లుగా ఈ దార్శనికత అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది: ప్రధాని
సుపరిపాలనతో పాటు అభివృద్ధిని సాధించిన పుదుచ్చేరి: ప్రధాని
దృఢమైన, సాధికారత కలిగిన యువత మన వృద్ధికి పునాది. వారి కలలకు మద్దతు ఇచ్చే దిశగా మేం కృషి చేస్తున్నాం: ప్రధాని
ఎన్ఐటీ కరైకల్‌లో కొత్తగా నిర్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ బ్లాక్, ఆధునిక హాస్టల్ వసతులు ఎంతో మంది విద్యార్థుల సాంకేతిక విద్యను బలోపేతం చేస్తాయి: ప్రధాని
పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పనులు చేపట్టాం: ప్రధాని
ఆరోగ్య సంరక్షణ అనేది తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండాలని మేం అనుకుంటున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల కుటుంబాల విషయంలో ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తోంది: ప్రధాని
వైద్య పర్యాటక కేంద్రంగా పుదుచ్చేరి మారుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. పుదుచ్చేరిలో ఇప్పటికే తొమ్మిది వైద్య కళాశాలలు... జిప్మెర్‌లోని ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం ఆధునికీకరణ ద్వారా వైద్య సేవలు మరింత విస్తరిస్తాయి: ప్రధాని

   పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాస నాథన్, స్పీకర్ శ్రీ ఆర్.సెల్వం, ముఖ్యమంత్రి శ్రీ ఎన్.రంగసామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ మన్సుఖ్ మాండవీయ, పుదుచ్చేరి హోంశాఖ మంత్రి శ్రీ ఎ.నమశ్శివాయం, ఇతర నాయకులుసహా ప్రియమైన సోదరీసోదరులారా...  వణక్కం! (నమస్కారం)

మిత్రులారా!

అనేకమంది సిద్ధులు, సాధువులు, కవులు, స్వాతంత్ర్య సమరయోధులకు పుట్టినిల్లయిన పుదుచ్చేరిలో నేనివాళ పర్యటించడం నాకు దక్కిన భాగ్యంగా పరిగణిస్తున్నాను. జాతీయ వాదాన్ని రగిలించిన మహాకవి సుబ్రహ్మణ్య భారతికి జన్మనిచ్చిన నేల ఇది. శ్రీ అరబిందో, మాత ఇక్కడి నుంచే సరికొత్త ఆధ్యాత్మిక దృక్కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

మిత్రులారా!

లోగడ నేనిక్కడికి వచ్చిన సందర్భంలో- ‘బెస్ట్’ పుదుచ్చేరి అనే సూత్రాన్ని మీకు సూచించాను. ‘బెస్ట్’ అంటే- బిజినెస్‌ (బి-వ్యాపారం), ఎడ్యుకేషన్‌ (ఇ-విద్య) స్పిరిచ్యువాలిటీ (ఎస్‌-ఆధ్యాత్మికత) టూరిజం (టి-పర్యాటకం). ఆ దార్శనికత గత నాలుగున్నరేళ్లలో సత్ఫలితాలిచ్చింది. తదనుగుణంగా పుదుచ్చేరి సత్పరిపాలన, సమగ్రాభివృద్ధిని సాధించింది. కేంద్రంతోపాటు ఈ కేంద్రపాలిత ప్రాంతం ఒకే దృక్కోణం, అంకిత భావంతో కృషి చేస్తే మెరుగైన ఫలితాలు సత్వరమే లభిస్తాయి. ఆ మేరకు పుదుచ్చేరి తలసరి ఆదాయం రీత్యా అద్భుత పురోగమనం సాధించింది. సామాజిక పురోగమన సూచీలో దేశంలోనే ఇది అత్యధిక స్థాయిని సాధించింది. ఇప్పుడిక డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం పుదుచ్చేరి ప్రగతికి నవ్యోత్తేజమిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ రూ.2,700 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే జన జీవనం పరిణామాత్మకంగా రూపొందుతుంది.

 

మిత్రులారా!

దేశవ్యాప్తంగా అత్యున్నత, నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు మేమెంతో ప్రాధాన్యమిచ్చాం. ఈ మేరకు ప్రస్తుత బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రికార్డు స్థాయిలో రూ.12 లక్షల కోట్లు కేటాయించాం. దీనివల్ల పుదుచ్చేరి ప్రజలకూ ప్రయోజనం కలుగుతుంది. లోగడ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక సహాయ రాష్ట్రాల మూలధన పెట్టుబడి పథకం కింద పుదుచ్చేరికీ స్థానం కల్పించాం. మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులివ్వడమంటే మెరుగైన రోడ్లు, నీటి సరఫరా, తీరప్రాంత మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి హామీ. ఈ సౌకర్యాలు జన జీవనాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి.

మిత్రులారా!

బలమైన, సాధికార యువతరమే మన దేశాభివృద్ధికి పునాది. వారి కలలకు మద్దతివ్వడం లక్ష్యంగా  మేమెంతో కృషి చేస్తున్నాం. ఈ మేరకు కారైకల్‌లోని ‘ఎన్‌ఐటీ’లో ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ బ్లాక్, ఆధునిక హాస్టల్ సౌకర్యాలు కల్పించాం. ఇవి ఎందరో విద్యార్థుల కోసం సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేస్తాయి. పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలన్నీ  మెరుగుపడ్డాయి. కొత్త లెక్చర్ హాళ్లు, బాలికల హాస్టళ్లు, ఇతర సదుపాయాలు సమకూరాయి. పుదుచ్చేరి ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో వేలాది ఖాళీలు భర్తీ అయ్యాయని నాకు సమాచారం అందింది. ఈ ఉద్యోగాలలో అధిక శాతం నింపేందుకు దశాబ్దాలుగా ప్రత్యక్ష నియామక పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆ కలను సాకారం చేసింది. ఈ విధంగా జన సేవా ప్రదానానికి ముందుకొచ్చిన యువతరాన్ని నా అభినందనలు.

మిత్రులారా!

ప్రపంచమంతా నేడు కాలుష్య రహిత రవాణా రంగం వైపు దృష్టి మళ్లించింది. ఎలక్ట్రిక్ వాహనాలు మన జీవితంలో ఓ విడదీయరాని భాగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య  తగ్గించగల ఎలక్ట్రిక్ బస్సులు పుదుచ్చేరి వంటి పర్యాటక కూడలి ప్రగతి పయనాన్ని కీలక మలుపు తిప్పగలవు. కాబట్టే, ‘పీఎం ఇ-బస్‌’ కార్యక్రమం కింద ఈ కేంద్రపాలిత నగరానికి ఎలక్ట్రిక్ బస్సులను సమకూరుస్తున్నాం. మరోవైపు నేటి ఈ కార్యక్రమంలో భాగమైన గృహనిర్మాణ ప్రాజెక్టులు పేద కుటుంబాలకు జీవన స్థిరత్వం, ఆత్మగౌరవాన్నిస్తాయి. పుదుచ్చేరి, కారైకల్, మహే, యానాం అంతటా రూపుదిద్దుకోనున్న  రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు జనజీవన సౌలభ్యం కల్పిస్తాయి. నిర్లవణీకరణ ప్లాంట్ల ద్వారా  స్వచ్ఛమైన తాగునీటికి భరోసా లభిస్తుంది. అలాగే సరికొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్లతో వ్యర్థాల నిర్వహణ మెరుగవుతుంది. వర్షాకాలంలో వరదల ప్రభావం తగ్గింపుతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ముప్పు తొలగించేందుకూ ప్రభుత్వం కృషి చేస్తోంది. పుదుచ్చేరి ప్రజలకు జీవన సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా మేం కృషి చేస్తున్నాం. కొందరు బాలలు నాకు బహుమతిగా అద్భుతమైన పెద్ద చిత్రాలను పట్టుకొచ్చారు. “ఎస్పీజీ సిబ్బంది వాటిని కాస్త అందుకోవాలి. నా కోసం బహుమతి తెచ్చిన మిత్రులారా!. ధన్యవాదాలు.. చాలా ధన్యవాదాలు. దయచేసి అన్ని కానుకలనూ సేకరించండి.”

 

మిత్రులారా!

మానవ మూలధనం ఆరోగ్యకరంగా ఉంటేనే ఏ దేశమైనా ప్రగతి సాధించగలదు. అందుకే, ఆరోగ్య సంరక్షణమా ఆదినుంచీ మా అగ్ర ప్రాథమ్యంగా ఉంటోంది. ఆరోగ్య సంరక్షణ అందరికీ చేరువగా, చౌకగా సులభంగా లభ్యమయ్యేదిగా ఉండాలని మేం విశ్వసిస్తాం. ఈ మేరకు ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ ఇప్పటికే మా దార్శనికతను సాకారం చేస్తోంది. చికిత్స కోసం పుదుచ్చేరిలో ఏ పౌరుడూ సుదూరం వెళ్లే అవసరం లేకుండా చేయడమేగాక, ఇతర ప్రాంతాల వారు వైద్యం కోసం ఇక్కడికి వచ్చేలా చూడాలన్నది మా ఆకాంక్ష. తదనుగుణంగా ఈ నగరం వైద్య పర్యాటక కూడలిగానూ మారగలదని నా ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఇప్పటికే 9 వైద్య కళాశాలలు ఉన్న నేపథ్యంలో ‘జిప్‌మెర్‌’లోని ప్రాంతీయ కేన్సర్ కేంద్రం ఆధునీకరణతో ఆరోగ్య సంరక్షణ సామర్థ్యం మరింత విస్తృతం కాగలదు. ఇక ‘పీఎం-ఏబీహెచ్‌ఐఎం’ కింద ప్రాణాంతక వ్యాధుల చికిత్స కోసం మూడు క్రిటికల్ కేర్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. పుదుచ్చేరి, కారైకల్‌ నగరాల్లో నిర్మించే ఈ భవనాలు అత్యవసర చికిత్స సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరిస్తాయి. సిద్ధ వైద్యం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ విధానాలకు పుదుచ్చేరి ఎంతో ప్రసిద్ధి. ఈ మేరకు కారైకల్‌లోని కొత్త సమీకృత ఆయుష్ ఆస్పత్రి ప్రజల ఆరోగ్య సంరక్షణకు హామీ ఇస్తుంది.

మిత్రులారా!

దేశ పురోగమనానికి అనుసంధానం వెన్నెముక వంటిది. కాబట్టే, గ్రామీణ-పట్టణ మౌలిక సదుపాయాల కల్పనపై మేం నిశితంగా దృష్టి సారించాం. ఈ మేరకు పుదుచ్చేరిలో వందల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు వేస్తుండటంతో విద్యార్థులు, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారాలకు అవి సంధానాన్ని మెరుగుపరుస్తున్నాయి. అదే సమయంలో రద్దీ తగ్గించేందుకూ మేమెంతో కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా పుదుచ్చేరి నగరంలో రూ.1000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను మేము ప్రకటించాం. ఇందులో రూ.450 కోట్లకు పైగా విలువైన ఫ్లైఓవర్ కూడా ఒకటి.

మిత్రులారా!

తూర్పు తీర రహదారి, గ్రాండ్ సదరన్ ట్రంక్ జాతీయ రహదారిలో ఉన్నతీకరణ ద్వారా చెన్నైకి అనుసంధానం మెరుగవుతోంది. తద్వారా పుదుచ్చేరి-చెన్నై మధ్య ప్రయాణ సమయం దాదాపు 1.5-2 గంటల దాకా తగిపోతుంది. ఇక పుదుచ్చేరి-కడలూర్ జాతీయ రహదారి ఇప్పటికే పూర్తవగా, కారైకల్ జాతీయ రహదారి ఉన్నతీకరణ పనులు సాగుతున్నాయి. తూర్పు తీర కారిడార్‌లో కన్యాకుమారి దాకాగల రహదారి ప్రాజెక్టులలో మేం రూ.30 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నాం. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్ వంటి ప్రధాన ఆర్థిక కూడళ్లతో ఇవి పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలను అనుసంధానిస్తాయి. తద్వారా పర్యాటక, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు గణనీయంగా పురోగమిస్తాయి.

 

మిత్రులారా!

పుదుచ్చేరికిగల శక్తిమంతమైన ప్రగతి సాధనాల్లో పర్యాటకం ఒకటి. వారాంతపు విహార కూడలిగా, ఇది ఇప్పటికే వేలాది మందిని ఆకర్షిస్తోంది. ఇక్కడికొచ్చే రైళ్లు, విమానాలు ఎప్పుడూ ప్రయాణికులతో నిండుగా కనిపిస్తుంటాయి. పర్యాటకులపై పుదుచ్చేరి ప్రజల ఆదరాభిమానాలే ఇందుకు కారణం. తదనుగుణంగా ఆధ్యాత్మిక, పర్యావరణ, ఆరోగ్య పర్యాటకం వంటి వాటిలో పెట్టుబడులతో పుదుచ్చేరి పురోగమనాన్ని మేం మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాం. ప్రసాద్ పథకం కింద వివిధ ఆలయాలలో తీర్థయాత్రా సదుపాయాల కల్పన ఊపందుకుంది. ‘ఆరోవిల్లె’ను శ్రీ అరబిందో, మాతృమూర్తి ఒక సార్వత్రిక విశ్వ చైతన్య నగరంగా పరిగణించారు. ఇక్కడ నేడు ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ప్రారంభం అవుతోందని తెలిసి నాకెంతో సంతోషం కలిగింది. ప్రాంతాలు, మతాలకు అతీతంగా ఇటువంటి సమ్మేళనాలు ప్రజానీకాన్ని ఏకం చేస్తాయి.

మిత్రులారా!

ద్వంద్వ చోదక ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను అభినందించడం ఎంతో ముఖ్యం. అయితే, గతంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఈ సందర్భంగా ఓసారి గుర్తుకు తెచ్చుకోవడం అవసరం. కాంగ్రెస్-డీఎంకే కూటమి పాలనలో పుదుచ్చేరి ప్రజలు ఎన్నో బాధలు పడ్డారు. ఆ కాలం రాజకీయ అస్థిరత, అవినీతి, నేరాలు, పేదల అగచాట్లకు మారుపేరుగా మారింది. రేషన్ దుకాణాలున్నా బియ్యం రావు. ప్రభుత్వం నడుస్తున్నా సకాలంలో జీతాలందవు. వీధుల్లో గూండాలు-మాదకద్రవ్య మాఫియాల  వీరంగం నిత్యకృత్యంగా ఉండేది.

మిత్రులారా!

ఢిల్లీలోని ఓ కుటుంబానికి ‘ఏటీఎం’గా పుదుచ్చేరిని కాంగ్రెస్‌ పార్టీ మార్చేసింది. ఇక డీఎంకే విషయానికొస్తే- తమిళనాడులో కుంభకోణాల జాబితా ఎంత పొడవుగా ఉంటుందో మీరే చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు  పుదుచ్చేరి పురోగమన పథంలో అడ్డంకులుగా మారాయి. ఇప్పుడు కూడా అదే శక్తులు మళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్నాయి. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి… పుదుచ్చేరి మళ్లీ అవినీతి-నేరాల కాలానికి మళ్లాలా? కానీ, ఇక్కడి ప్రజానీకం ఆ పీడకలను పూర్తిగా మరచిపోవడానికే ప్రయత్నిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను.

మిత్రులారా!

భారత స్వాతంత్ర్య పోరాటంలో పుదుచ్చేరిది చాలా కీలక పాత్ర. నాటి పోరులో పాల్గొన్న అనేకమంది నాయకులకు ఇదే పురిటిగడ్డ. కొందరు ఈ నగరానికి వచ్చి, ఇక్కడి నుంచి పోరాటంలో పాల్గొన్నారు. పరాయి పాలన నుంచి 1947లో మనకు విముక్తి లభించడంలో ఈ నేల పోషించిన పాత్ర అద్వితీయం. ఇప్పుడిక 2047 నాటికి మనం వికసిత పుదుచ్చేరిని, తద్వారా వికసిత భారత్‌ను సృష్టించాలి. ఈ ఉద్యమంలో పుదుచ్చేరి ద్వంద్వ చోదక ప్రభుత్వం మీకు వెన్నుదన్నుగా ఉంటూ ‘బెస్ట్‌’ పుదుచ్చేరి కోసం కృషిని కొనసాగిస్తుందని మీకు హామీ ఇస్తున్నాను.

ఎల్లోరుక్కుం నండ్రి! (అందరికీ ధన్యవాదాలు)

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Synergy of steel & software: How Indian Railways got on the digital track

Media Coverage

Synergy of steel & software: How Indian Railways got on the digital track
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights youth-led development and India's thriving innovation ecosystem
June 13, 2026
PM emphasizes the remarkable contributions of Yuva Shakti across diverse sectors and their growing impact on the global stage

Prime Minister Shri Narendra Modi today stated that the Government is strongly working towards youth-led development. He noted that one of the defining features of the last 12 years has been the confidence with which India’s youth have pursued their aspirations.

Shri Modi highlighted that through initiatives such as Startup India, Digital India, Skill India, and Atal Innovation Mission, an ecosystem has emerged that encourages innovation, entrepreneurship, and enterprise. The Prime Minister pointed out that today, India is among the world’s leading StartUp destinations and many of these success stories are being scripted by our Yuva Shakti, and that too from smaller towns and villages.

The Prime Minister observed that India’s youth are making their mark across various sectors, from science and technology to manufacturing, space, semiconductors, and drones. He expressed that it is heartening to see young Indians contributing to areas that will shape the future of the nation and the world.
Shri Modi emphasized that our youth have also brought immense glory to the nation in the field of sports, consistently enhancing national pride in numerous international competitions. He further stated that a stronger sporting ecosystem, better infrastructure, and greater support for athletes are creating new opportunities for young talent and encouraging them to pursue sports.

In a series of posts on X, the Prime Minister shared:

"The NDA Government is one that is strongly working towards youth-led development. One of the defining features of the last 12 years has been the confidence with which India’s youth have pursued their aspirations.

Through initiatives such as Startup India, Digital India, Skill India and Atal Innovation Mission, an ecosystem has emerged that encourages innovation, entrepreneurship and enterprise.

Today, India is among the world’s leading StartUp destinations and many of these success stories are being scripted by our Yuva Shakti and that too from smaller towns and villages.

#12YearsOfYuvaShakti”

“India’s youth are making their mark across various sectors, from science and technology to manufacturing, space, semiconductors and drones. It is heartening to see young Indians contributing to areas that will shape the future of our nation and the world.

Our youth have also brought immense glory to the nation in the field of sports. In numerous international competitions, young Indian athletes have consistently enhanced national pride.
At the same time, a stronger sporting ecosystem, better infrastructure and greater support for athletes are creating new opportunities for young talent and encouraging them to pursue sports.

#12YearsOfYuvaShakti"