వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన
రైలు, రహదారులు, నీరు, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు సహా పలు రంగాలకు చెందిన ప్రాజెక్టులు
బనారస్-పూణే (హడప్సర్), అయోధ్య-ముంబయి (లోకమాన్య తిలక్ టెర్మినస్) మార్గాల్లో రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం
హర్దోయ్‌లో 594 కిలోమీటర్ల పొడవైన, యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం
సుమారు రూ. 36,230 కోట్ల వ్యయంతో నిర్మించిన గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో మీరట్-ప్రయాగ్రాజ్ మధ్య గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం సుమారు 5 గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.

ఈ నెల 29న ఉదయం సుమారు 8:30 గంటలకు వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని ప్రధానమంత్రి దర్శించి, పూజలు నిర్వహిస్తారు. ఆ రోజున ఉదయం సుమారు 11:30 గంటలకు ప్రధానమంత్రి హర్దోయ్‌కు చేరుకుని గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.

వారణాసిలో ప్రధానమంత్రి పర్యటన

ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. రూ. 1,050 కోట్లకు పైగా విలువైన 48 ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వారణాసి-అజంగఢ్ రహదారి విస్తరణ పూర్తి చేయడం... కజక్‌పురా, కదిపూర్‌లలో కీలకమైన రైల్ ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభించడం... భగవాన్‌పూర్‌లో 55 ఎమ్ఎల్‌డీల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్‌టీపీ)ను ప్రారంభించడం వంటివి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయి.

సమాజ కేంద్రితమైన పలు ప్రాజెక్టులనూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. జల్ జీవన్ మిషన్ కింద 30 గ్రామీణ తాగునీటి పథకాలు, చంద్రావతి ఘాట్ పునరాభివృద్ధి, సారనాథ్ సమీపంలోని సారంగనాథ్ ఆలయ పర్యాటకాభివృద్ధి, నాగ్వాలోని సంత్ రవిదాస్ పార్క్ సుందరీకరణ, పునరుద్ధరణ పనులు వీటిలో భాగంగా ఉన్నాయి. ప్రజా సేవలు, క్రీడల రంగాలను మెరుగుపరచే పలు కార్యక్రమాలూ ఉన్నాయి. యూపీ కళాశాలలో సింథటిక్ హాకీ టర్ఫ్, రామ్‌నగర్‌లో 100 పడకల వృద్ధాశ్రమం, భేలుపూర్ నీటి శుద్ధి కర్మాగారంలో 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వీటిలో భాగంగా ఉన్నాయి. సాంప్రదాయిక వైద్య విధానాలను ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో అనుసంధానించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ... సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ టిబెటన్ స్టడీస్‌లో సోవా రిగ్పా భవన్, ఆసుపత్రినీ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

సుమారు రూ. 5,300 కోట్ల విలువైన 112కు పైగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిలో అమృత్ 2.0 కింద చేపట్టే 13 మురుగునీటి శుద్ధి, నీటి సరఫరా పథకాలు... శ్రీ శివ ప్రసాద్ గుప్తా డివిజనల్ జిల్లా ఆసుపత్రిలో 500 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి... భోజువీర్, సిగ్రాలో మార్కెట్ కాంప్లెక్స్‌లు, కార్యాలయాల నిర్మాణం... చెరువుల పునరుద్ధరణ, పునరుజ్జీవనం... 198 పడకల ఆసుపత్రి పునరాభివృద్ధి... 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం... అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, నమో ఘాట్ వంటి కీలక ఘాట్‌లలో పర్యాటక సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమాలు వీటిలో భాగంగా ఉన్నాయి. పరిపాలన, సామాజిక సంక్షేమ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు గానూ రామ్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్, నగర నిగమ్ కార్యాలయ భవనం, ప్రభుత్వ బాలల సంరక్షణ గృహం, జువెనైల్ జస్టిస్ బోర్డుకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. బనాస్ డెయిరీతో అనుబంధం ఉన్న ఉత్తరప్రదేశ్ పాల సరఫరాదారులకు రూ. 105 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రధానమంత్రి బోనస్‌గా బదిలీ చేయనున్నారు.

గంగా నదిపై రైలు-రోడ్డు వంతెన నిర్మాణం సహా, వారణాసి జంక్షన్ – పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ మూడో, నాల్గో రైల్వే లైన్ ప్రాజెక్టుకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు రైలు రద్దీని తగ్గించడం, రవాణా సామర్థ్యాన్ని పెంచడం, బహుళ రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం, సులభమైన ట్రాఫిక్ రాకపోకలను నిర్ధారించడం ద్వారా వారణాసి, చందౌలి జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది కాశీ విశ్వనాథ్ ధామ్, రామ్‌నగర్ ప్రాంతం, జాతీయ రహదారి-19కి ప్రవేశాన్ని మెరుగుపరచడంతో పాటు... తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్‌లతో రైలు అనుసంధానాన్నీ బలోపేతం చేస్తుంది.

బనారస్–పూణే (హడప్సర్), అయోధ్య–ముంబయి (లోకమాన్య తిలక్ టెర్మినస్) అనే రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ రైళ్లు సరసమైన, ఆధునిక ప్రయాణ సౌకర్యాలను అందించడంతో పాటు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. బనారస్–పూణే సర్వీస్ కాశీ విశ్వనాథ ధామ్‌కు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుండగా, అయోధ్య–ముంబయి సర్వీస్ శ్రీ రామ్ మందిర్ తీర్థ క్షేత్రానికి అనుసంధానాన్ని మెరుగుపరుస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది.

హర్దోయ్‌లో ప్రధానమంత్రి పర్యటన

దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి హర్దోయ్ జిల్లాలో ప్రారంభించనున్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే 594 కిలోమీటర్ల పొడవు, 6 లేన్‌లు (8 లేన్‌ల వరకు విస్తరించగలవి), యాక్సెస్-నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ హై-స్పీడ్ కారిడార్ కలిగి ఉంది. దీనిని సుమారు రూ. 36,230 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరట్, బులంద్‌షహర్, హాపూర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్‌బరేలి, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ వంటి 12 జిల్లాల గుండా వెళుతుంది. తద్వారా ఇది ఉత్తర ప్రదేశ్‌లోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలను ఒకే నిరంతరాయ హై-స్పీడ్ కారిడార్ ద్వారా అనుసంధానిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరట్, ప్రయాగరాజ్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం తీసుకునే 10-12 గంటలు..సుమారు 6 గంటలకు తగ్గుతుంది. దీని ద్వారా రవాణాలో సౌలభ్యం, సామర్థ్యం మెరుగుపడతాయని అంచనా.

ఈ ప్రాజెక్టులోని ఒక ముఖ్యమైన విశేషం... షాజహాన్‌పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల పొడవైన అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని (విమానాశ్రయాన్ని) ఏర్పాటు చేయడం. ఈ ద్వంద్వ ప్రయోజన మౌలిక సదుపాయం జాతీయ భద్రతా సంసిద్ధతను పెంపొందించి, ఆర్థిక ప్రయోజనాలకు మించి వ్యూహాత్మక విలువనూ చేకూరుస్తుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ఒక ప్రధాన ఆర్థిక కారిడార్‌గా భావిస్తున్నారు. దీని మార్గంలో ఉన్న 12 జిల్లాల్లో సుమారు 2,635 హెక్టార్లలో సమీకృత ఉత్పాదక, లాజిస్టిక్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచి, ఉత్పాదక రంగ సమర్థతనూ పెంచుతుంది.

మెరుగైన అనుసంధానం ద్వారా రైతులకు పట్టణాలు, ఎగుమతి మార్కెట్లు నేరుగా అందుబాటులోకి రానున్నాయి. ఇది వారి పంటలకు మంచి ధర లభించడానికి, గ్రామీణ ఆదాయాలు బలపడటానికి దోహదపడుతుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, కొత్త ఆర్థిక అవకాశాలను అందుబాటులోకి తేవడం, ఈ ప్రాంతం అంతటా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, జేవార్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే, ఫరూఖాబాద్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే, మీరట్ నుంచి హరిద్వార్ వరకు ప్రతిపాదిత పొడిగింపు సహా... ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న, ప్రణాళికలో ఉన్న అనేక అనుసంధాన కారిడార్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలోని విస్తృత ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌కు వెన్నెముకగా నిలవనుంది. అభివృద్ధి చెందుతున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే గ్రిడ్... ఉత్తర ప్రదేశ్ అంతటా తూర్పు నుంచి పశ్చిమానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి హై-స్పీడ్ రహదారి అనుసంధానాన్ని విస్తరింపజేసి, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ఒక రవాణా ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది రవాణా ఖర్చులను తగ్గించి, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి, వ్యవసాయ-గ్రామీణ ఆదాయాలను పెంచి, ఉపాధిని కల్పించి, రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ ఆర్థిక వృద్ధిని సాధించే ఒక పరివర్తనాత్మక కార్యక్రమం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi's ‘Dhurandhar’ Entry In Vadodara As ‘Aari Aari’ Plays During Arrival

Media Coverage

PM Modi's ‘Dhurandhar’ Entry In Vadodara As ‘Aari Aari’ Plays During Arrival
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the value and transformative power of knowledge
September 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting that wisdom teaches the art of living in harmony with society. He said that knowledge imparts wisdom and prosperity, fills the heart with joy and enhances one’s dignity.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”

The Subhashitam conveys that wisdom teaches the art of living in harmony with society. It grants knowledge and prosperity, fills the heart with joy, and raises one's dignity. Thus, wisdom is as precious as service to righteous governance, beloved by the heart, and a force that uplifts life.

The Prime Minister wrote on X;

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”