పవిత్ర నగరమైన ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఒక గొప్ప ఐక్యతా మహాయజ్ఞం పూర్తయింది. ఒక జాతిలో చైతన్యం పురివిప్పినప్పుడు- శతాబ్దాల నాటి అణచివేత ధోరణికి సంబంధించిన సంకెళ్ల నుంచి విముక్తి కలిగినపుడు- ఉప్పొంగిన ఉత్సాహంతో అది స్వేచ్ఛా వాయువుల్ని ఆస్వాదిస్తుంది. గత నెల 13 నుంచి ప్రయాగరాజ్‌లో దిగ్విజయంగా సాగిన ఐక్యతా మహాకుంభ మేళా (ఏక్తా కా మహాకుంభ్) సరిగ్గా ఈ ఫలితానికి సాక్షిగా నిలిచింది.

గతేడాది జనవరి 22న, అయోధ్యలోని రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా, నేను దైవభక్తి గురించీ, దేశభక్తి గురించీ మాట్లాడుతూ దేవుడి పట్లా, దేశం పట్లా- భక్తి ఉండాలని చెప్పాను. ప్రయాగరాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు దేవుళ్లు, దేవతలతో పాటు, సాధువులు, మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు ఇలా అంతా ఒక్కచోటనే కలిశారు. జాతి చైతన్యం మేల్కొన్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూశాం. ఇది ఐక్యతా మహా కుంభమేళా. ఈ పవిత్ర సందర్భం కోసం 140 కోట్ల మంది భారతీయుల నమ్మకాలన్నీ ఒకే చోట, ఒకే సమయంలో ఏకమయ్యాయి.

ఈ పవిత్ర ప్రయాగరాజ్ ప్రాంతంలోనే శృంగవర్‌పూర్ అనే పవిత్ర ప్రాంతం ఉంది. ఇది ఐక్యత, సామరస్యం, ప్రేమకు గుర్తుగా ఈ పుణ్యభూమిలోనే ప్రభు శ్రీరాముడు, నిషధరాజు కలుసుకున్నారు. వారి కలయిక భక్తికీ, సద్భావనకూ ప్రతీక. నేటికీ, ప్రయాగరాజ్ అదే స్ఫూర్తిని మనలో నింపుతోంది.

45 రోజులుగా... దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రజలు ఈ సంగమ ప్రాంతానికి తరలిరావడాన్ని నేను చూశాను. సంగమం వద్ద భావోద్వేగాలు ఒక అలలా పెరుగుతూనే వచ్చాయి. ఈ త్రివేణీ సంగమంలో మునిగి పుణ్యస్నానాన్ని ఆచరించాలన్న ఏకైక లక్ష్యం ప్రతి భక్తుడిలోనూ ప్రతిఫలించింది. గంగా, యమునా, సరస్వతుల పవిత్ర సంగమం ప్రతి యాత్రికునిలో ఉత్సాహాన్నీ, శక్తినీ, ధైర్యాన్నీ నింపింది.

ఆధునిక మేనేజ్‌మెంటు నిపుణులు, ప్రణాళిక, విధాన నిపుణులకు ఈ మహా కుంభమేళా ఒక అధ్యయన అంశం. ప్రపంచంలో మరెక్కడా కూడా దీనికి సాటిరాగలదిగానీ, ఈ స్థాయిలో కనిపించే ఉదాహరణగానీ లేదు.

ఈ నదుల సంగమ తీరానికి కోట్లాది మంది ఎలా వచ్చారని ప్రపంచం ఆశ్చర్యంతో చూసింది. ఎప్పుడు వెళ్లాలన్న విషయంలో ప్రజలకు ఎలాంటి అధికారిక ఆహ్వానాలుగానీ, ముందస్తు సమాచారంగానీ ఏదీ లేదు... అయినా కోట్లాది మంది స్వచ్ఛందంగా మహా కుంభమేళాకు ప్రయాణం కట్టారు. సంగమానికి చేరుకుని, పుణ్య జలాల్లో మునక వేయడం ద్వారా అలౌకిక ఆనందాన్ని ఆస్వాదించారు.

పుణ్య జలాల్లో మునక తర్వాత… మాటలకు అందని ఆనందం, తృప్తితో నిండిపోయిన భక్తుల ఆ ముఖాల్ని మరిచిపోవడం అసాధ్యం. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన మన సోదరసోదరీమణులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈ పవిత్ర సంగమానికి చేరుకోగలిగారు.

ముఖ్యంగా భారత యువత భాగస్వామ్యం నాకు మరింత ఉత్సాహాన్ని అందించింది. మహా కుంభమేళాలో పాల్గొనడం ద్వారా మన అద్భుత సంస్కృతీ, వారసత్వాలకు మార్గదర్శకులుగా ఉంటామంటూ యువత మనకు గొప్ప సందేశాన్ని పంపింది. వాటి పరిరక్షణ దిశగా వారికున్న బాధ్యతలను గుర్తించి, వాటిని ముందుకు తీసుకుకెళ్లేందుకు సంకల్పించారు.

ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు కొత్త రికార్డులను సృష్టించారు. ఇక్కడికి వచ్చిన వారికి మించి, వివిధ కారణాలతో ఇక్కడికి రాలేకపోయినవారు సైతం ఈ పుణ్యకార్యంతో మానసికంగా అనుసంధానమయ్యారు. ఇక్కడి నుంచి వెళుతూ వెళుతూ భక్తులు తీసుకెళ్లిన త్రివేణీ సంగమ జలాలను లక్షలాది మందికి అలౌకిక ఆనందాన్ని అందించాయి. మహా కుంభమేళా యాత్ర చేసి వెనక్కి వచ్చిన వారికి ఊరంతా ఆహ్వానం పలికింది. సమాజం వారిని గౌరవించింది.

గత కొన్ని వారాలుగా జరిగిన ఈ మహా కార్యక్రమం అపూర్వం. రాబోయే శతాబ్దాలకు పునాది వేసింది.

ఎవరి ఊహలకూ అందని స్థాయిలో భక్తులు ప్రయాగరాజ్ కు తరలివచ్చారు. గతంలో జరిగిన కుంభమేళాల ఆధారంగా మాత్రమే అధికార యంత్రాంగం అంచనా వేసింది.

ఈ ఐక్యతా మహాకుంభమేళాలో సుమారుగా అమెరికా జనాభాకు రెండింతల మంది పాలుపంచుకున్నారు.

కోట్లాది భారతీయుల ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక పండితులు విశ్లేషిస్తే... భారత్ తన వారసత్వం పట్ల గర్విస్తోందనీ, కొత్తగా లభించిన చేతనతో వారంతా ముందుకు సాగుతున్నారనీ కచ్చితంగా తెలుసుకుంటారు. ఒక నవ శకం ఆవిష్కారం అయిందనీ, ఇది రేపటి భారతదేశపు నిర్మాణానికి దారులు వేస్తుందని నేను నమ్ముతున్నాను.

మహా కుంభమేళా భారత జాతీయతను వేల సంవత్సరాలుగా బలోపేతం చేసింది. పూర్ణ కుంభమేళా జరిగిన ప్రతిసారీ సాధువులు, పండితులు, మేధావులు ఒక చోటకు వచ్చి, ఆయా కాలాల్లోని సమాజ స్థితిగతుల గురించి చర్చించేవారు. వారి ఆలోచనలు దేశానికి, సమాజానికి దిశానిర్దేశం చేసేవి. ప్రతి ఆరేళ్లకోసారి జరిగే అర్ధకుంభ మేళాలో అప్పటి వరకూ చేసిన ఆలోచనలను సమీక్షించేవారు. 144 సంవత్సరాల పాటు జరిగిన 12 పూర్ణకుంభ మేళా కార్యక్రమాల తర్వాత- వాడుకలో లేని, కాలం చెల్లిన సంప్రదాయాలను రద్దు చేసేవారు. సరికొత్త ఆలోచనలను స్వీకరించేవారు. కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుట్టి, మారిన కాలంతోపాటు ప్రయాణం చేసేవారు.

144 ఏళ్ల తర్వాత... ఈ మహా కుంభమేళాలో, మన సాధువులు మరోసారి భారత అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త సందేశాన్ని అందించారు. అది ఏమంటే- అభివృద్ధి చెందిన భారతదేశం - వికసిత్ భారతం.

ఈ ఐక్యతా మహా కుంభమేళాకు ప్రతి యాత్రికుడు- ధనికులు కావచ్చు, పేదలు కావచ్చు.. యువకుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు.. గ్రామాలు కావచ్చు, నగరాలు కావచ్చు… తూర్పు పశ్చిమాలు, ఉత్తర దక్షిణాలు… కులం, మతం, భావజాలం అన్న భేదాలేమీ లేకుండా కలిసిపోయారు. ఇందులో సాకారమైన ఏక్ భారత్- శ్రేష్ఠతా భారత్ కోట్లాది మందిలో ధైర్యాన్ని ప్రోది చేసింది. ఇపుడు, ఇదే స్ఫూర్తితో అభివృద్ధి చెందిన భారతావని నిర్మాణం కోసం మనం చేరువ అవుదాం.

బాల్యంలో శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు బ్రహ్మాండమంతటినీ తన నోటిలో చూపిన సంగతి నాకు జ్ఞాపకానికి వచ్చేలా చేసింది. ఈ మహా కుంభమేళా- సమష్టిగా భారత దేశ ప్రజల అపారమైన శక్తిని ఇటు దేశానికీ, అటు ప్రపంచానికీ చూపించింది. మనం ఇప్పుడు ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం మనల్ని మనం అంకితం చేసుకోవాలి.

గతంలో భక్తి ఉద్యమానికి చెందిన ప్రబోధకులు మన సమష్టి సంకల్ప బలాన్ని గుర్తించి, ప్రోత్సహించారు. స్వామి వివేకానంద నుంచి శ్రీ అరబిందో వరకు, గొప్ప ఆలోచనాపరులంతా మన సమిష్టి సంకల్ప శక్తిని మనకు తెలియజెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ సైతం దీని ప్రభావాన్ని గుర్తించారు. అయితే దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రానంతరం ఈ సమిష్టి బలాన్ని సరిగ్గా గుర్తించి, అందరి సంక్షేమం కోసం ఉపయోగించినట్లయితే, కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశానికి గొప్ప శక్తిని అందించి ఉండేది. దురదృష్టవశాత్తూ ఇంతకు పూర్వం ఎవరూ చేసి ఉండలేదు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఇపుడు ఈ సమష్టి సంకల్ప బలం నా కళ్ల ముందు కనిపించడం పట్ల నా మనసు ఉల్లాసం చెందుతోంది.

వేదాల నుంచి వివేకానందుని బోధనల వరకు, ప్రాచీన గ్రంథాల నుంచి ఆధునిక ఉపగ్రహాల వరకు, భారతదేశానికి సంప్రదాయలు ఈ దేశాన్ని తీర్చిదిద్దాయి. మన పూర్వీకులు, మహారుషులు అందించిన జ్ఞాపకాల నుంచి మనం కొత్త స్ఫూర్తిని అందుకోవాలని ఒక పౌరుడిగా నా విజ్ఞప్తి. నూతన సంకల్పంతో ముందుకు సాగడానికి మనకు ఈ ఐక్యతా మహా కుంభమేళా సహాయపడొచ్చు. ఐక్యతను మన మార్గదర్శక సూత్రంగా చేసుకుందాం. దేశ సేవే- మాధవ సేవగా భావిస్తూ కలిసికట్టుగా పనిచేద్దాం.

వారణాసిలో ఎన్నికల ప్రచారంలో, "గంగామాత నన్ను పిలిచింది" అని నేను చెప్పాను. ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు. మన పవిత్ర నదుల పరిశుభ్రత పట్ల బాధ్యత కోసం ఇచ్చిన పిలుపు కూడా. ప్రయాగరాజ్‌లోని గంగా, యమునా, సరస్వతుల సంగమాన్ని దర్శించినప్పుడు నా సంకల్పం మరింత బలపడింది. మన నదుల పరిశుభ్రత మన జీవితాలతో లోతుగా ముడిపడి ఉంది. చిన్నవైనా, పెద్దవైనా మన నదులన్నింటినీ జీవదాతలుగా భావించి వాటిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ మహా కుంభమేళా మన నదుల పరిశుభ్రత కోసం మనం మన కృషిని కొనసాగించేందుకు స్ఫూర్తినిచ్చింది.

ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు. మా భక్తిలో ఏవైనా లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించమని గంగా, యమునా, సరస్వతి మాతలను నేను ప్రార్థిస్తున్నాను. జనతా జనార్ధనుడని చూస్తున్నాను. ప్రజలను నేను దైవ స్వరూపంగా భావిస్తాను. వారికి సేవ చేసే మా ప్రయత్నాల్లో ఏదైనా లోపం జరిగి ఉంటే, నేను అందుకు ప్రజలను సైతం క్షమాపణ కోరుతున్నాను.

మహాకుంభ్‌లో కోట్లాది మంది భక్తి భావంతో పాలుపంచుకున్నారు. వారికి సేవ చేసే బాధ్యతను సైతం అదే భక్తి భావంతో నిర్వహించాం. యోగి జీ నాయకత్వంలో, పరిపాలన యంత్రాంగం, ప్రజలు కలిసి ఈ ఐక్యతా మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి కలిసికట్టుగా పనిచేశారని ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యునిగా నేను గర్వంగా చెప్పగలను. రాష్ట్రం, కేంద్రం, పాలకులు లేదా నిర్వాహకులు అనే తేడాలేవీ లేకుండా ప్రతి ఒక్కరూ తమనుతాము సేవకులుగా భావించి అంకితభావంతో పనిచేశారు. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పడవలు నడిపేవారు, డ్రైవర్లు, ఆహారం అందించే వ్యక్తులు ఇలా అందరూ అవిశ్రాంతంగా పని చేశారు. ప్రత్యేకించి, అనేక అసౌకర్యాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రయాగరాజ్ ప్రజలు యాత్రికులను హృదయపూర్వకంగా స్వాగతించిన విధానం చాలా స్ఫూర్తిదాయకం. వారికి, ఉత్తరప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మన దేశ ఉజ్వల భవిష్యత్తుపై నాకు ఎప్పుడూ అచంచలమైన నమ్మకం ఉంది. ఈ మహా కుంభమేళాను వీక్షించడంతో నా దృఢ విశ్వాసం మరింత బలోపేతమైంది.

140 కోట్ల మంది భారతీయులు ఈ ఐక్యతా మహా కుంభమేళాను ప్రపంచస్థాయి కార్యక్రమంగా మార్చిన తీరు నిజంగా అద్భుతం. మన ప్రజల అంకితభావం, భక్తి, ప్రయత్నాలు నాకు ఎంతో సంతోషం కలిగించాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన శ్రీ సోమనాథుడిని త్వరలోనే దర్శించుకుంటాను. ఈ జాతీయ సమష్టి కృషి ఫలాలను ఆయనకు సమర్పిస్తాను. అలాగే ప్రతి భారతీయుడి క్షేమం కోసం ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తాను.

మహా కుంభమేళా భౌతికంగా మహాశివరాత్రి పర్వదినాన విజయవంతంగా ముగిసి ఉండవచ్చు. కానీ గంగానది శాశ్వత ప్రవాహంలా, మహాకుంభమేళా మేల్కొల్పిన ఆధ్యాత్మిక బలం, జాతీయ స్పృహ అలాగే ఐక్యత మనకు అనేక తరాల వరకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s manufacturing to rise 2.8x to $1.5 trn by 2035: Morgan Stanley

Media Coverage

India’s manufacturing to rise 2.8x to $1.5 trn by 2035: Morgan Stanley
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
భారతదేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం
July 06, 2026

ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు.


సురక్షిత, సుఖవంతమైన జీవితానికి లోటు లేని బాల్యం ఆయనది. శ్యామా ప్రసాద్‌ తండ్రి, సర్ అశుతోష్ ముఖర్జీ సమకాలీన అగ్రశ్రేణి విద్యావేత్తలలో.. మేధావులలో ఒకరు. అలాంటి సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. అంతటి తీవ్ర వ్యక్తిగత విషాదాలను చవిచూసినప్పటికీ దేశ సేవపై ఆయన సంకల్పం మరింత బలపడి, తిరుగులేని నిబద్ధతతో ముందుకే నడిపింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే- అవిభాజ్య భారత్‌ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్‌ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. చరిత్రలో కొన్ని క్షణాలుంటాయి.. అంతిమ శ్వాసలోనూ ఒక వ్యక్తి త్యాగం రాజకీయాలకు అతీతంగా జాతీయ స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటువంటి క్షణాల్లో డాక్టర్ ముఖర్జీ జీవన ప్రస్థానం ఒకటిగా మిగిలింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు- తాను విశ్వసించిన ఆదర్శం కోసం డాక్టర్ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్‌ 370, 35(ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.


డాక్టర్ ముఖర్జీ సదా దేశానికే ప్రథమ స్థానమిచ్చారు... భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణంగా ఆనాటి సంప్రదాయ ఆలోచనలకు సవాలు విసురుతూ సంస్థల, వ్యవస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా- “భవిష్యత్‌ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి” అని కుండబద్దలు కొట్టారు.


డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం అనేక విధాలుగా ముందంజ వేసింది. ఆయన హయాంలో గ్రంథాలయ మౌలిక సదుపాయాల మెరుగుదల, విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు ప్రోత్సాహం, పురావస్తు అధ్యయనం, వ్యవసాయంలో కొత్త కోర్సులకు శ్రీకారం వంటి విశిష్ట కృషి కొనసాగింది. క్రీడలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల సంక్షేమం తదితరాలపైనా ఆయన ఏకకాలంలో దృష్టి సారించారు. ప్రస్తుత-పూర్వ విద్యార్థులలో తమ విశ్వవిద్యాలయంపై సగర్వ భావనను ప్రోది చేస్తూ, ఏటా జనవరి 24న విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, విశ్వవిద్యాలయంపై ఒక పాట రాయాల్సిందిగా గురుదేవులు రవీంద్ర నాథ్‌ టాగోర్‌ను ఆయన అభ్యర్థించారు.


ఈ స్ఫూర్తికి మరో ఉదాహరణ ఆయన జీవిత చరమాంకంలో కనిపిస్తుంది. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్‌’ను రూపుదిద్దాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమయాన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ఎంచుకోవడం గమనార్హం. ప్రమిద ఎంత చిన్నదైనా, దాని వెలుగు స్వల్పమే అయినా తన పరిధికి మించి చీకటిని పారదోలగల శక్తి దానికి ఉంటుందని భావించారు. తదనంతర క్రియాశీల మనుగడలోనూ జనసంఘ్ ఇదేవిధంగా ముందడుగు వేసింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు-పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, అసాధారణ నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో పారిశ్రామిక రంగాన్ని దేశానికి గౌరవం, అవకాశాలు, విశ్వాసాలను పునరుద్ధరించే సాధనంగా ఆయన పరిగణించారు. తదనుగుణంగా సంపద సృష్టిని, విలువ జోడింపును గౌరవించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళాకారులు, వస్త్ర కార్మికులందరూ ఆయనలో అసమాన నిబద్ధతగల మద్దతుదారును కనుగొన్నారు.


ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డాక్టర్ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాబోదు.


సంభాషణలను, చర్చలను ప్రోత్సహించడం భారత నాగరిక సంప్రదాయంలో అనాదిగా అంతర్భాగం. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి డాక్టర్ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్రూ మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు.


పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డాక్టర్ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. అటుపైన 50 ఏళ్ల కిందట ఉదార ప్రజాస్వామ్య విలువల మూలాలపై మరోసారి దెబ్బకొడుతూ 42వ సవరణ చట్టం తెచ్చారు.


మానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ డాక్టర్ ముఖర్జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరువు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్‌ మన్వంతర్‌’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.


ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ- “మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా... క్షుణ్ణంగా... అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్థాంతరంగా వదిలేయకండి... అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి.. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి” అని డాక్టర్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్‌ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో నేటి యువత దృక్పథం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, నేటి సందర్భానికి తగినట్లు వారంతా డాక్టర్‌ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.