విజ్ఞాన్ భవన్లో ఈ రోజు నిర్వహించిన నారీశక్తి వందన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బైశాఖీ శుభసందర్భంగా, దేశంలోని చాలాచోట్ల నూతన సంవత్సర వేడుకలను చేసుకోనున్న తరుణంలో ఆయన మాట్లాడారు. జలియన్వాలా బాగ్ మారణకాండ అమరులకు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. ‘‘నారీ శక్తిపై భారత్ కృతనిశ్చయంతో ఉంది. 21వ శతాబ్దంలో అత్యంత కీలక నిర్ణయాల్లో ఇదొకటి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఇది చరిత్రాత్మక సందర్భమన్న ప్రధానమంత్రి.. గతకాలపు ఆకాంక్షలను, భవిష్యత్ సంకల్పాలను నెరవేర్చేలా దేశ పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించబోతోందన్నారు. సామాజిక న్యాయం ఆవశ్యకతను ఆయన వివరించారు. సామాజిక న్యాయమన్నది నినాదంగానే మిగిలిపోకుండా, మన పని సంస్కృతిలో అంతర్భాగంగా ఉండే సమసమాజ భారతాన్ని దేశం ఆకాంక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రాల శాసనసభల నుంచి దేశ పార్లమెంటు వరకు.. దశాబ్దాల నిరీక్షణ ఇక ముగియబోతోంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2023లో పార్లమెంటు కొత్త భవనంలో నారీ శక్తి వందన్ చట్టం ఆమోదాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా 2029 నాటికి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించడంతో, ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయాన్ని ప్రస్తావించారు. మహిళల భాగస్వామ్యం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా.. ‘నారీ శక్తి వందన్’ చట్టాన్ని సకాలంలో అమలు చేయాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అందుకోసం ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రత్యేక సెషన్ ప్రారంభమవుతుందని శ్రీ మోదీ వెల్లడించారు. ‘‘చర్చలు, సహకారం, భాగస్వామ్యం ద్వారా ఈ పని పూర్తి కావాలన్నదే మా ప్రయత్నం, దానికే మా ప్రాధాన్యం. పార్లమెంటు గౌరవాన్ని ఇది మరింత పెంచుతుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

ఈ అంశంపై దేశవ్యాప్తంగా మహిళల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయన్నారు. అసెంబ్లీలకు, లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలన్న తమ ఆకాంక్షలను మహిళలు బలంగా వినిపిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారి కలలకు కొత్త రెక్కలొచ్చాయని, దేశంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ మొత్తం ప్రక్రియలో మహిళలంతా క్రియాశీలురుగా భాగస్వామ్యం వహించాలి. తమ ఎంపీలను కలిసి అభిప్రాయాలను, అంచనాలను పంచుకోవాలని విన్నవిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి కోరారు.
స్వాతంత్ర్య పోరాటం నుంచి రాజ్యాంగ పరిషత్తు వరకు మహిళల సేవలను గుర్తుచేస్తూ.. స్వతంత్ర భారత నిర్మాణానికి పునాది వేయడంలో నారీశక్తి అత్యంత కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రాతినిధ్యావకాశాన్ని పొందిన మహిళలు దేశం కోసం అద్భుతంగా కృషి చేశారని కొనియాడారు. నేడు కూడా మన దేశంలో రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రి వరకు మహిళలు కీలక బాధ్యతల్లో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ‘‘రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు.. ఏ పదవిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేక పరంపరను మహిళలు సృష్టించుకున్నారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పంచాయతీరాజ్ సంస్థలు మహిళా నాయకత్వానికి అద్భుతమైన ఉదాహరణగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు దేశవ్యాప్తంగా స్థానిక ప్రభుత్వ సంస్థల్లో 14 లక్షలకు పైగా మహిళలు విజయవంతంగా పనిచేస్తున్నారని ఆయన వివరించారు. దాదాపు 21 రాష్ట్రాల్లో.. పంచాయతీల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరిందని తెలిపారు. ‘‘రాజకీయ, సామాజిక రంగాల్లో లక్షలాది మహిళల ఈ క్రియాశీల భాగస్వామ్యం.. ప్రపంచంలోని అగ్రదేశాల నేతలను, రాజకీయ నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత పెంచుతోంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
వివిధ అధ్యయనాలను ఉదహరిస్తూ... నిర్ణయాధికార ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే, అది వ్యవస్థల్లో సున్నితత్వాన్ని తీసుకొస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనివల్ల నీరు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి కీలక అంశాలపై మరింత అంకితభావంతో పనిచేసే వాతావరణం ఏర్పడిందన్నారు. ‘‘జల్ జీవన్ మిషన్ సాధించిన విజయమే దీనికి నిదర్శనం. పంచాయతీ స్థాయిలో మహిళల భాగస్వామ్యం ఇందులో కీలక పాత్ర పోషించింది’’ అని శ్రీ మోదీ అన్నారు.
స్థానిక సంస్థలు, వివిధ వ్యవస్థల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న లక్షలాది మహిళలకు ఇప్పుడు అపారమైన అనుభవం ఉందన్న ప్రధానమంత్రి.. మరింత పెద్ద బాధ్యతలను చేపట్టేందుకు వారు సిద్ధంగా, ఉత్సాహంగా ఉన్నారన్నారు. నారీ శక్తి వందన్ చట్టం అమలు అలాంటి మహిళలందరి జీవితాల్లో ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని తెలిపారు. ‘‘పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రయాణం ఇకపై మరింత సులభతరం కాబోతోంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
వికసిత భారత ప్రస్థానంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. మహిళల జీవితంలోని ప్రతి దశకూ తగిన పథకాలను 2014 నుంచి తమ ప్రభుత్వం రూపొందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పుట్టిన నాటి నుంచి తుది శ్వాస వరకు.. వివిధ పథకాలతో అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డలకు సేవలందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ‘‘భ్రూణ హత్యలను నివారించడం కోసం బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించాం. గర్భిణులకు సరైన పోషకాహారం అందేలా మాతృ వందన యోజన కింద రూ. 5,000 ఆర్థికసాయాన్ని అందిస్తున్నాం. అలాగే ఆడబిడ్డల విద్యకు అండగా నిలవడం లక్ష్యంగా.. అత్యధిక వడ్డీతో సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించాం’’ అని ప్రధానమంత్రి వివరించారు.

మహిళల కోసం ఏర్పాటు చేసిన సమగ్ర సహాయక వ్యవస్థను వివరిస్తూ.. సకాలంలో టీకాలు వేయించడం కోసం మిషన్ ఇంద్రధనుష్, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద టాయిలెట్ల నిర్మాణం, దాదాపు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు, ఖేలో ఇండియా పథకం ద్వారా ఆర్థిక ప్రోత్సాహాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. అంతేకాకుండా సైనిక పాఠశాలలు, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా ఆడబిడ్డలకు ప్రవేశాన్ని కల్పించామని గుర్తుచేశారు. జీవితంలో తర్వాతి దశలకు సంబంధించి... ఉజ్వల యోజన ద్వారా కోట్ల సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు, హర్ ఘర్ నల్ సే జల్ ద్వారా ఇంటింటికీ తాగునీరు, ఉచిత రేషన్ పథకం ద్వారా ఆహార భద్రత, ఆయుష్మాన్ యోజన కింద రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను అందిస్తున్నామని తెలిపారు. ‘‘ఔషధాలపై 80 శాతం వరకు రాయితీనిచ్చే జన్ ఔషధి కేంద్రాలు సహా.. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా మన అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
మహిళల సాధికారత పెరగాలంటే ఆర్థిక భాగస్వామ్యం పెరగడం అత్యావశ్యకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ ప్రతి నిర్ణయం, ప్రతీ పథకం ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చిందన్నారు. గతంలో కుటుంబ ఆస్తులు ప్రధానంగా పురుషుల పేరుమీదే నమోదయ్యేవన్నారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రాధాన్య క్రమంలో మహిళల పేరు మీదనే ఇళ్లను నమోదు చేస్తున్నామని తెలిపారు. ‘‘గడిచిన 11 ఏళ్లలో ఈ నిర్ణయం ద్వారా 3 కోట్లకు పైగా మహిళలకు లబ్ధి చేకూరింది. గృహాలకు వారు యజమానులయ్యారు. ఇది వారిని ఆర్థికంగా బలోపేతం చేసింది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఆర్థిక సమ్మిళితత్వం గురించి ప్రస్తావిస్తూ... 2014 నాటికి దేశంలో కోట్ల మంది మహిళలు కనీసం బ్యాంకు గడప తొక్కి ఉండరని ప్రధానమంత్రి గుర్తుచేశారు. జన్ధన్ యోజన ద్వారా 32 కోట్లకు పైగా మహిళలకు బ్యాంకు ఖాతాలను తెరిచామని పేర్కొన్నారు. ‘‘ముద్రా యోజన కింద మంజూరైన రుణాల్లో 60 శాతానికి పైగా మహిళలే పొందారు. నేడు మన ఆడబిడ్డలు సరికొత్త వ్యాపారాల్లో సత్తాచాటుతూ, ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
మహిళల నేతృత్వంలో అంకుర సంస్థల విప్లవాన్ని వివరిస్తూ... దేశంలో నమోదైన 45 శాతానికి పైగా అంకుర సంస్థల్లో కనీసం ఒక మహిళ డైరెక్టరుగా ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు. మహిళల కెరీర్కు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రసూతి సెలవులను 26 వారాలకు పొడిగించామని పేర్కొన్నారు. ‘‘ఏళ్ల కిందట ప్రారంభించిన స్కిల్ ఇండియా మిషన్ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేలాది మంది డ్రోన్ దీదీలు సాంకేతికతతో ఆధునిక వ్యవసాయాన్ని నేర్పిస్తూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు’’ అని శ్రీ మోదీ తెలిపారు.

గడిచిన 11 ఏళ్లలో సాధించిన అద్భుత విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దాదాపు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరారని ఆయన తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములైన 6 కోట్ల మంది అక్కాచెల్లెళ్లను లక్షాధికారులుగా (లాఖ్పతి దీదీలు) తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వారిలో 3 కోట్ల మందికి పైగా మహిళలు ఇప్పటికే లక్షాధికారులయ్యారని శ్రీ మోదీ వివరించారు. ‘‘ఈ మహిళలు వోకల్ ఫర్ లోకల్కు బ్రాండ్ అంబాసిడర్లవుతున్నారు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మహిళల నేతృత్వంలో అభివృద్ధి దృక్పథం.. పాత ఆలోచనా ధోరణులను సవాలు చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితమని భావించిన రంగాల్లో కూడా మహిళలు నేడు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మన ఆడబిడ్డలు ఫైటర్ పైలట్లుగా మారి నింగిని తాకుతున్నారని కొనియాడారు. ‘‘ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా.. మన దేశంలోనే మహిళా పైలట్ల శాతం ఎక్కువగా ఉంది’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు.
విద్యా రంగంలో మహిళల విజయాలను శ్రీ మోదీ కొనియాడారు. 2014తో పోలిస్తే పీహెచ్డీ ప్రవేశాల్లో ఆడబిడ్డల సంఖ్య రెండింతలైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధనల్లో దాదాపు సగం మంది మహిళలున్నారని తెలిపారు. గణితం, విజ్ఞానశాస్త్ర విద్యల్లోనూ మన ఆడబిడ్డల భాగస్వామ్యం దాదాపు 43 శాతానికి చేరిందని వివరించారు. ‘‘మన ఆడబిడ్డలకు అవకాశాల్లో పెరుగుతున్న విస్తృతిని ఈ విజయాలు ప్రతిబింబిస్తున్నాయి’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు మహిళా భద్రత గురించి ప్రస్తావిస్తూ... ఈ దిశగా ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి చెప్పారు. న్యాయ వ్యవస్థలో సున్నితత్వాన్ని పెంచడం, నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేయడం లక్ష్యంగా.. చట్టపరమైన సంస్కరణలను తీసుకొచ్చామని, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘భారతీయ న్యాయసంహిత మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఎక్కడి నుంచైనా ఇ-ఎఫ్ఐఆర్ లేదా జీరో-ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా ప్రక్రియలను సరళతరం చేశాం. అలాగే బాధితుల వాంగ్మూలాలను ఆడియో - వీడియో ద్వారా రికార్డు చేసేందుకు వీలు కల్పించాం’’ అని శ్రీ మోదీ వివరించారు.
దేశంలోని ప్రతి తల్లికీ, సోదరికీ, ఆడబిడ్డలందరికీ ప్రధానమంత్రి శ్రీ మోదీ భరోసా ఇచ్చారు. వారి ఆకాంక్షలను దేశం గుర్తిస్తోందని, వారి కలలను సాకారం చేసేందుకు అవసరమైన ప్రతి చర్యనూ ప్రభుత్వం తీసుకుంటోందని హామీ ఇచ్చారు. కృషి, ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో.. దేశంలోని నారీశక్తి కొత్త శిఖరాలను అధిరోహించిందని కొనియాడారు. ‘‘మనమంతా సమష్టిగా ఈ శక్తికి నవోత్తేజాన్ని అందించాలి. వారికోసం అవకాశాలను మరింత విస్తృతం చేయాలి’’ అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
వ్యక్తిగత కలుస్తూ, సోషల్ మీడియా ద్వారానూ.. నారీశక్తి వందన్ కార్యక్రమ చర్చలను మహిళలు దేశంలో ఊరూరికీ తీసుకెళ్లాలని ప్రధానమంత్రి ప్రత్యేకంగా విన్నవించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అతిపెద్ద నిర్ణయం గురించి దేశంలోని ప్రతి మహిళకూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఈ చట్టం శక్తి, తమ పాత్ర వారికి స్పష్టంగా అర్థమవుతాయన్నారు. ‘‘నారీశక్తికి తమ హక్కులు పూర్తిగా దక్కాలని, నిర్ణయ ప్రక్రియలో వారు పూర్తి భాగస్వాములు కావాలని మనమంతా సంకల్పిద్దాం - ఇదే మన ఉజ్వల భవితకు భరోసా’’ అంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
India's Nari Shakti has made immense contributions. pic.twitter.com/BxSbAHK67K
— PMO India (@PMOIndia) April 13, 2026
In our country, the Panchayati Raj institutions are a remarkable example of women's leadership. pic.twitter.com/7uNzwK3ySl
— PMO India (@PMOIndia) April 13, 2026
Supporting women at every stage of life. pic.twitter.com/mclimUNZ9i
— PMO India (@PMOIndia) April 13, 2026
Today, women are excelling even in sectors once considered male-dominated. pic.twitter.com/FFE9Dj820g
— PMO India (@PMOIndia) April 13, 2026
India's Nari Shakti have reached new heights through their hard work, courage and confidence.
— PMO India (@PMOIndia) April 13, 2026
Now, we must come together to empower them further by expanding opportunities. pic.twitter.com/vIaH6tRxx2


