దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే మనకు గర్వకారణం, మన వారసత్వం: ప్రధానమంత్రి
దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే అనేక పథకాల అమలులో సంతృప్త స్థాయికి చేరుకున్నాయి: ప్రధాని
జన ఔషధి అంటే తక్కువ ఖర్చుతో వైద్యానికి భరోసా!
జన ఔషధి మంత్రం... తక్కువ ధరలు, ప్రభావవంతమైన మందులు: ప్రధాని

కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు సిల్వస్సాలో నమో ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానం కావడానికి, సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడి అంకితభావం కలిగిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి ప్రజలతో తనకు ఉన్న సాన్నిహిత్యం, దీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ ప్రాంతంతో తన అనుబంధం దశాబ్దాల నాటిదని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే సామర్థ్యాన్ని ఆధునికత, పురోగతి దిశగా మార్చిన విధానాన్ని ఆయన వివరించారు.

"సిల్వస్సా సహజ అందాలు, అలాగే దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే ప్రజల ప్రేమ - మీతో నా సంబంధం ఎంతకాలంగా ఉందో మీ అందరికీ తెలుసు. దశాబ్దాల నాటి ఈ బంధం, నేను ఇక్కడికి వచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని మీరు, నేను మాత్రమే అర్థం చేసుకుంటాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. మొదటిసారి తాను ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చాలా భిన్నంగా ఉండేదని, ఒక చిన్న తీర ప్రాంతం ఏమి సాధించగలదనే ప్రశ్న ప్రజల్లో ఉండేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాంత ప్రజలపై, వారి సామర్థ్యాలపై తనకు ఎప్పుడూ పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ నాయకత్వంలో, ఈ విశ్వాసం పురోగతిగా రూపాంతరం చెందిందని, సిల్వస్సాను కాస్మోపాలిటన్ నగరంగా మార్చిందని, తన నివాసితులందరికీ కొత్త అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

తొలినాళ్లలో చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న సింగపూర్ కు సంబంధించిన ఒక ఉదాహరణను కూడా శ్రీ మోదీ పంచుకున్నారు. సింగపూర్ ప్రజల దృఢ సంకల్పబలం వల్లే ఇప్పటి మార్పు సాధ్యమైందని ఆయన ఉద్ఘాటించారు. ఈ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి కోసం ఇదే విధమైన సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు, అయితే ముందుకు సాగడానికి వారు కూడా చొరవ తీసుకోవాలన్నారు.

“దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేవలం కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే కాదు. అది గర్వకారణమే గాక, వారసత్వ సంపద కూడా. అందుకే ఈ ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధికి పేరొందిన ఆదర్శ రాష్ట్రంగా మారుస్తున్నాం'' అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలు, ప్రపంచశ్రేణి విద్యాసంస్థలు, , పర్యాటకం, నీలి ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక ప్రగతి యువతకు కొత్త అవకాశాలు, అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యానికి ఈ ప్రాంతం గుర్తింపు పొందాలని తాను ఆశిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.

శ్రీ ప్రఫుల్ పటేల్ నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఈ ప్రాంతం ఈ లక్ష్యాల దిశగా వేగంగా పురోగమిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గత పదేళ్లలో అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించామని అన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పరంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ జాతీయ పటం పై ఉద్భవిస్తోంది. వన్ నేషన్ - వన్ రేషన్ కార్డ్, జల్ జీవన్ మిషన్, భారత్‌నెట్, ప్రధానమంత్రి జనధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్షా బీమా వంటి వివిధ ప్రభుత్వ పథకాలు ప్రజలకు, ముఖ్యంగా బడుగు, బలహీన, గిరిజన సముదాయాలకు గణనీయమైన ప్రయోజనాలను అందించాయని ప్రధానమంత్రి తెలిపారు.

స్మార్ట్ సిటీస్ మిషన్, సమగ్ర శిక్ష, పీఎం ముద్ర యోజన వంటి కార్యక్రమాల్లో 100 శాతం లక్ష్యాన్ని సాధించడమే తదుపరి లక్ష్యమని ప్రధానమంత్రి ప్రకటించారు. తొలిసారిగా ఈ సంక్షేమ పథకాలతో ప్రభుత్వం నేరుగా ప్రజలకు చేరువవుతోందని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా చూస్తున్నామని తెలిపారు.

 

మౌలిక సదుపాయాలు, విద్య, ఉపాధి, పారిశ్రామికాభివృద్ధిలో దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేల మార్పును ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గతంలో ఈ ప్రాంతానికి చెందిన యువత ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ నేడు ఈ ప్రాంతంలో ఆరు జాతీయ స్థాయి సంస్థలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. వీటిలో నమో మెడికల్ కాలేజ్, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, ఐఐఐటీ డయ్యూ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, డామన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఈ సంస్థలు సిల్వస్సాను, ఈ ప్రాంతాన్ని కొత్త విద్యాకేంద్రంగా మార్చాయి. “యువతకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఈ సంస్థల్లో వారికి సీట్లు కేటాయించారు. ఇది హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ అనే నాలుగు మాధ్యమాల్లో విద్యను అందించే ప్రాంతం అని ఇంతకు ముందు నేను సంతోషించాను. ఇప్పుడు, ఇక్కడ ప్రాథమిక, జూనియర్ పాఠశాలల్లోని పిల్లలు స్మార్ట్ తరగతి గదుల్లో చదువుతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను" అని శ్రీ మోదీ అన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో, ఆధునిక ఆరోగ్య సంరక్షణ సేవలు ఈ ప్రాంతంలో గణనీయంగా విస్తరించాయని శ్రీ మోదీ అన్నారు. '2023లో నమో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. వీటితో పాటు 450 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రిని కూడా నేను నేడు ప్రారంభించాను. సిల్వస్సాలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఈ ప్రాంతంలోని గిరిజన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి" అని శ్రీ మోదీ చెప్పారు.

జన ఔషధి దివస్ ను పురస్కరించుకుని నేడు ప్రారంభించిన ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. జన్ ఔషధి తక్కువ ఖర్చుతో చౌకైన చికిత్సను అందిస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం నాణ్యమైన ఆస్పత్రులు, ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత చికిత్స, జన ఔషధి కేంద్రాల ద్వారా చౌకగా మందులు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 15,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 80% వరకు తక్కువ ధరలకు మందులను అందిస్తున్నాయి. దాదాపు 40 జన ఔషధి కేంద్రాలు దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుండి, దాదాపు రూ.6,500 కోట్ల విలువైన తక్కువ ధర మందులను అవసరమైన వారికి అందించామని, పేద, మధ్యతరగతికి రూ.30,000 కోట్లకు పైగా ఆదా చేశామని చెప్పారు. “ఈ చొరవ అనేక క్లిష్టమైన వ్యాధుల చికిత్సను మరింత చౌకగా చేసింది, ఇది సాధారణ పౌరుల అవసరాల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుంది" అని శ్రీ మోదీ చెప్పారు.

 

ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమించిన జీవనశైలి వ్యాధులు, ముఖ్యంగా ఊబకాయంపై పెరుగుతున్న ఆందోళనను ప్రధానమంత్రి ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడతారని ఒక తాజా నివేదిక అంచనా వేసిన విషయాన్ని ఆయన ఉటంకించారు. “ఈ ఆందోళన కలిగించే గణాంకాలు చూస్తే, ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరికి ఊబకాయం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతక పరిస్థితిగా మారే అవకాశం కూడా ఉంది,” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దీన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ స్థూలకాయాన్ని తగ్గించే ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రధాని కోరారు. వంట నూనె వినియోగాన్ని ప్రతి నెలా 10% తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ రోజువారీ వంటలలో 10% తక్కువ నూనెను ఉపయోగించడానికి కట్టుబడి ఉండాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి, ఊబకాయాన్ని నివారించడానికి ప్రతిరోజూ కొన్ని కిలోమీటర్లు నడవడం వంటి క్రమం తప్పని శారీరక వ్యాయామాలను చేర్చాలని ఆయన ఉద్బోధించారు. “అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యసాధనకు దేశం కట్టుబడి ఉంది. ఆరోగ్యవంతమైన దేశం మాత్రమే అటువంటి లక్ష్యాన్ని చేరుకోగలదు" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

గత దశాబ్ద కాలంలో దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలో చోటు చేసుకున్న వేగవంతమైన పారిశ్రామిక వృద్ధిని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన మిషన్ మానుఫ్యాక్చరింగ్ పథకం ద్వారా ఈ ప్రాంతానికి భారీగా లాభాలు చేకూరనున్నాయని తెలిపారు. “ఇప్పటికే వందలాది కొత్త పరిశ్రమలు ప్రారంభమయ్యాయి, ఇంకా అనేక ప్రస్తుత పరిశ్రమలు విస్తరించాయి. తద్వారా వేలాది కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి” అని ఆయన వివరించారు. ఈ పరిశ్రమలు ముఖ్యంగా గిరిజన సమాజానికి, మహిళలకు, అట్టడుగు వర్గాలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి. “ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళల సాధికారత కోసం గిర్ ఆదర్శ్ జీవిక యోజనను అమలు చేశామని, చిన్న డెయిరీ ఫామ్ ల ఏర్పాటుతో కొత్త స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని” శ్రీ మోదీ తెలిపారు.

పర్యాటక రంగం కూడా ప్రధాన ఉపాధి వనరుగా అవతరించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలోని బీచ్ లు, గొప్ప వారసత్వ ప్రదేశాలు దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రామసేతు, నమో పథ్, డామన్ లోని టెంట్ సిటీ, పాపులర్ నైట్ మార్కెట్ వంటి కొత్త మార్పులు ఈ ప్రాంతం ఆకర్షణను పెంచుతున్నాయి. ఒక పెద్ద పక్షుల అభయారణ్యం ఏర్పాటు చేశామని, దుధానిలో ఎకో రిసార్ట్ కోసం ప్రణాళికలు జరుగుతున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. డయ్యూలో తీరప్రాంత విహారయాత్ర, బీచ్ అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు. "2024 లో జరిగిన డయ్యూ బీచ్ గేమ్స్ బీచ్ క్రీడలపై ఆసక్తిని పెంచాయి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తో డయ్యూలోని ఘోగ్లా బీచ్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. డయ్యూలో ఒక కేబుల్ కార్ ప్రాజెక్ట్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది అరేబియా సముద్ర అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది, ఇది ఈ ప్రాంతాన్ని భారతదేశ అగ్ర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా చేస్తుంది" అని శ్రీ మోదీ అన్నారు.

 

దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలో కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడిన అంశాన్ని ప్రస్తావిస్తూ, దాద్రా సమీపంలో బుల్లెట్ రైలు స్టేషన్ ను నిర్మిస్తున్నారని, ముంబయి-ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వే సిల్వస్సా మీదుగానే వెళుతుందని ప్రధానమంత్రి తెలిపారు. గత కొన్నేళ్లుగా అనేక కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించారని, ప్రస్తుతం వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 500 కిలోమీటర్లకు పైగా రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా ఈ ప్రాంతం కూడా లబ్ది ప్రయోజనం పొందుతోంది. కనెక్టివిటీని పెంచడానికి స్థానిక విమానాశ్రయాన్ని అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.


 

దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే అభివృద్ధికి, సుపరిపాలనకు, జీవన సౌలభ్యానికి నమూనాలుగా నిలుస్తున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లలో ఒక్క క్లిక్ తో చాలా వరకు ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి చేయగలుగుతున్నారన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేసింది. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఇందుకుగాను శ్రీ ప్రఫుల్ పటేల్ ను, ఆయన బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. “ఈరోజు ప్రారంభించిన విజయవంతమైన అభివృద్ధి ప్రాజెక్టులకు గాను దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే ప్రజలకు నా అభినందనలు. కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతం, ఆప్యాయత, గౌరవానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని ప్రధానమంత్రి ముగించారు.

 

నేపథ్యం

దేశంలోని అన్ని మూలల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పెంపొందించడంపై ప్రధానమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా సిల్వస్సాలో నమో హాస్పిటల్ (ఫేజ్ 1)ను ఆయన ప్రారంభించారు. రూ.460 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ 450 పడకల ఆసుపత్రి కేంద్ర పాలిత ప్రాంతంలో ఆరోగ్య సేవలను గణనీయంగా బలోపేతం చేస్తుంది. ఇది ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా గిరిజన వర్గాలకు అత్యాధునిక వైద్య సేవలను అందిస్తుంది.

 

సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో వివిధ గ్రామ రహదారులు, ఇతర రహదారుల మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆరోగ్య, వెల్నెస్ సెంటర్లు, పంచాయతీ, పరిపాలనా భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, నీటి సరఫరా, మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. కనెక్టివిటీని మెరుగుపరచడం, పారిశ్రామిక వృద్ధిని పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఈ ప్రాంతంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెంచడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మైనారిటీలు, దివ్యాంగులకు చెందిన మహిళలకు చిన్న పాల కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక మార్పులతో ఆర్థిక సాధికారతను పెంపొందించడం గిర్ ఆదర్శ్ ఆజీవిక యోజన లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా వీధి వ్యాపారులను ప్రోత్సహించే సిల్వన్ దిదీ పథకం కింద వారి వ్యాపారాలకు సౌకర్యవంతమైన బండ్లు అందిస్తారు.. ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఈ పథకానికి నిధులు అందిస్తారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi becomes first world leader to cross 100 million Instagram followers

Media Coverage

PM Modi becomes first world leader to cross 100 million Instagram followers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Condoles the Passing of Shri Maroof Raza Ji
February 26, 2026

Prime Minister Narendra Modi has expressed grief over the passing of Shri Maroof Raza Ji, honoring his legacy in the fields of journalism.

The Prime Minister stated that Shri Maroof Raza Ji made a rich contribution to the world of journalism. He noted that Shri Raza enriched public discourse through his nuanced understanding of defence, national security, and strategic affairs.

Expressing his sorrow, the Prime Minister said he is pained by his passing and extended his condolences to his family and friends.
The Prime Minister shared on X:

“Shri Maroof Raza Ji made a rich contribution to the world of journalism. He enriched public discourse with his nuanced understanding of defence, national security as well as strategic affairs. Pained by his passing. Condolences to his family and friends”