గౌరవనీయ, ప్రధాన మంత్రి డోనాల్డ్ టస్క్,

రెండు దేశాల ప్రతినిధులు

మీడియా మిత్రులారా,


నమస్కారం.
 

అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


సుదీర్ఘకాలంగా మీరు భారత్‌కు మిత్రుడు. ఇరుదేశాల బంధానికి మీరు ఎనలేని సహకారం అందించారు.

మిత్రులారా,

భారతదేశం, పోలండ్ మధ్య సంబంధాలలో ఈరోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.



నలభై ఐదేళ్ల తర్వాత ఈ రోజే తొలిసారిగా భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించారు.



మా ప్రభుత్వ మూడవ హయాంలో నాకు ఈ అవకాశం వచ్చింది.


ఈ సందర్భంగా పోలండ్ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


2022 ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించడంలో మీరు చూపిన ఔదార్యాన్ని భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు.

 

మిత్రులారా,


ఈ సంవత్సరం మేము మా దౌత్య సంబంధాల డెబ్బయవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము.


ఈ సందర్భంగా ఈ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నాం.

 

భారతదేశం, పోలండ్ మధ్య సంబంధాలు ప్రజాస్వామ్యం, చట్టాల అనుసారంగా పాలన వంటి భాగస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయి.

 

ఈ రోజు మనం ఈ సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేసేందుకు అనేక కార్యక్రమాలను గుర్తించాము.


రెండు ప్రజాస్వామ్య దేశాలుగా మన పార్లమెంటుల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ప్రోత్సహించాలి.


ఆర్థిక సహకారాన్ని మరింత విస్తృతపరిచేందుకు ప్రైవేట్ రంగాన్ని అనుసంధానించే కృషి జరుగుతున్నది.



ఆహార శుద్ధి రంగంలో పోలండ్ ప్రపంచంలో అగ్రగామిగా ఉంది.


భారతదేశంలో నిర్మిస్తున్న మెగా ఫుడ్ పార్క్‌లలో పోలిష్ కంపెనీలు చేరాలని మేము కోరుకుంటున్నాము.


భారతదేశంలో జరుగుతున్న వేగవంతమైన పట్టణీకరణ నీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల వంటి రంగాలలో మన సహకారానికి కొత్త అవకాశాలను కల్పిస్తున్నది.


క్లీన్ కోల్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక శక్తి, కృత్రిమ మేధ కూడా మన ఉమ్మడి ప్రాధాన్యతా అంశాలుగా ఉన్నాయి.


మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్‌లో భాగస్వాములు కావడానికి మేము పోలిష్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాము.


 

ఫిన్ టెక్, ఫార్మా, అంతరిక్షం వంటి రంగాల్లో భారత్ ఎన్నో విజయాలు సాధించింది.


 

ఈ రంగాలలో మా అనుభవాన్ని పోలండ్‌తో పంచుకోవడం మాకు సంతోషం కలిగిస్తుంది.

 

రక్షణ రంగంలో మన సన్నిహిత సహకారం మన లోతైన పరస్పర విశ్వాసానికి ప్రతీక.


ఈ రంగంలో పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుంది.


ఆవిష్కరణలు, ప్రతిభ మన రెండు దేశాల యువశక్తి ప్రత్యేకతలు.


నైపుణ్యం కలిగిన సిబ్బంది, కార్మికుల సంక్షేమం కోసం, మొబిలిటీని ప్రోత్సహించడానికి, ఇరుపక్షాల మధ్య సామాజిక భద్రతా ఒప్పందం కుదిరింది.

 

మిత్రులారా,


అంతర్జాతీయ వేదికపై భారత్, పోలండ్ కూడా అత్యంత సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.


 

ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు అవసరం అని మేము ఇరువురం అంగీకరిస్తున్నాము.

 


ఉగ్రవాదం మనకు పెద్ద సవాలు.


 

మానవత్వాన్ని విశ్వసించే భారతదేశం, పోలండ్ వంటి దేశాలతో ఇటువంటి సహకారం మరింత అవసరం.



అదేవిధంగా, వాతావరణ మార్పు మా ఇరు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్య అంశం.



మేమిద్దరం మా సామర్థ్యాలను మిళితం చేస్తూ కలిసికట్టుగా హరిత భవిష్యత్తు కోసం కృషి చేస్తాము.



2025 జనవరి నెలలో యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవిని పోలండ్ చేపట్టనుంది.



మీ సహకారం భారతదేశం, ఈయూ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.



మిత్రులారా,



ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయం.



యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని భారత్ దృఢంగా విశ్వసిస్తోంది.



సంక్షోభం ఏదైనా, అమాయకులు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికి అతిపెద్ద సవాలుగా మారింది.



శాంతి, సుస్థిరతలు త్వరగా పునరుద్ధరించడం కోసం చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించుటకు మా మద్దతు ఉంటుంది.



ఇందుకోసం భారత్ తన మిత్ర దేశాలతో పాటు అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది.



మిత్రులారా,


ఇండాలజీ, సంస్కృతం అనే అత్యంత ప్రాచీనమైన, గొప్ప సంప్రదాయం పోలండ్‌లో ఉంది.



భారత నాగరికత, భాషల పట్ల గల అత్యంత ఆసక్తి వల్ల మా సంబంధాలకు బలమైన పునాది ఏర్పడింది.

 

మా ఇరు దేశాల ప్రజల సన్నిహిత సంబంధాల కోసం స్పష్టమైన ఉదాహరణను నేను నిన్న చూశాను.


ఇండియన్ పోల్స్ "డోబ్రే మహారాజా", కొల్హాపూర్ మహారాజుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక చిహ్నాలకు నివాళులు అర్పించే గౌరవం నాకు దక్కింది.


ఈనాటికి కూడా పోలండ్ ప్రజలు అతని ఔదార్యాన్ని, దాతృత్వాన్ని గౌరవిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.


వారి జ్ఞాపకార్థం చిరస్థాయిగా నిలిచిపోయేలా, భారత్ మరియు పోలండ్ మధ్య మేము జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్ ప్రారంభించబోతున్నాము.



ప్రతి సంవత్సరం పోలండ్ నుండి 20 మంది యువకులు భారతదేశంలో పర్యటిస్తారు.


మిత్రులారా,


ప్రధాన మంత్రి టస్క్, ఆయన స్నేహానికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


మరియు, మా సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లడం పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము.


చాలా ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Tractor sales cross 10 lakh mark in FY26 on strong rural demand, GST cut

Media Coverage

Tractor sales cross 10 lakh mark in FY26 on strong rural demand, GST cut
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఏప్రిల్ 2026
April 12, 2026

Trust, Technology & Transformation: How India is Building a Viksit Bharat Under PM Modi