ఖతార్ అమీర్ గౌరవ షేక్ తమీన్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు.
దోహాలో దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్టేట్ ఆఫ్ ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ప్రధానమంత్రి ఖండించారు. గాజాలో కాల్పుల విరమణతో పాటు బందీల విడుదల కోసం మధ్యవర్తిత్వ పాత్ర పోషించడం సహా ప్రాంతీయ శాంతి, సుస్థిరత్వ సాధనకు కూడా ఖతార్ కృషి చేస్తుండడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
అన్ని అంశాలనూ చర్చలు, దౌత్యంతో పరిష్కరించడాన్నే భారత్ సమర్థిస్తుందనీ, ఉద్రిక్తతను నివారించాల్సిన అవసరం ఉందనీ ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత్వ స్థాపన ప్రయత్నాలకు భారత్ వెన్నంటి నిలుస్తుందనీ, ఉగ్రవాదాన్ని అడ్డుకోవాల్సినదేనని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
స్టేట్ ఆఫ్ ఖతార్ ప్రజలకు సంఘీభావాన్ని తెలిపినందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీకి ఖతార్ అమీర్ శ్రీ షేక్ తమీమ్ ధన్యవాదాలు తెలిపారు.
భారత్-ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతి కనిపించడంపై ఇద్దరు నేతలూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇరు పక్షాల హితం ముడిపడి ఉన్న అన్ని రంగాల్లోను పరస్పర సహకారాన్ని ఇప్పటి కన్నా మరింత పెంచుకొందామంటూ నేతలు నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఒకరితో మరొకరు తరచుగా సంప్రదించుకునేందుకు కూడా వారు సమ్మతించారు.


