· 2035 నాటికి జీడీపీలో కర్బనోద్గారాల తీవ్రతను 2005 స్థాయులతో పోలిస్తే 47 శాతం తగ్గించేందుకు కట్టుబడి ఉన్న భారత్
· 2035 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో 60 శాతాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న భారత్
· 2005 స్థాయులతో పోలిస్తే.. అడవులు, పచ్చదనం ద్వారా 2035 నాటికి 3.5 నుంచి 4 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమైన కర్బన శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోనున్న భారత్
· 2047 నాటికి వికసిత భారత్, 2070 నాటికి కర్బనోద్గార రహిత లక్ష్యాలకు అనుగుణంగా భారత్ నిర్ణయాలు

భారత పర్యావరణ కార్యాచరణను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. 2031 నుంచి 2035 కాలానికి గాను దేశపు ‘జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్ల (ఎన్‌డీసీ)’కు ఆమోదం తెలిపింది. యూఎన్ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం దేశం తన పర్యావరణ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు సుస్థిరాభివృద్ధి, వాతావరణపరంగా న్యాయంపై నిబద్ధతను ఈ నిర్ణయంతో పునరుద్ఘాటించింది.

వికసిత భారత్ దార్శనికత ప్రాతిపదికగా, 2031-35 కాలానికి భారత ఎన్‌డీసీని నిర్ణయించారు. ఇది కేవలం 2047 నాటికి చేరుకోవాల్సిన గమ్యం మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల కోసం సంపన్నమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల భారతదేశ నిర్మాణం కోసం నేడే కార్యాచరణను ప్రారంభించాలన్న నిబద్ధత ఇది. భారత్ గతంలో ప్రకటించిన అనేక వాతావరణ లక్ష్యాలను నిర్ణీత సమయానికి ముందే సాధించింది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఆ నిబద్ధత ఆధారంగానే ప్రస్తుత లక్ష్యాలు కూడా రూపొందాయి. వాతావరణ పరిరక్షణ దిశగా భారత స్థిరమైన కార్యాచరణకు ఇది నిదర్శనం. దైనందిన జీవితంలోనూ పాలన వ్యవస్థల్లోనూ సుస్థిరతను భాగం చేయడం, వాతావరణ మార్పులను తట్టుకోగల అభివృద్ధి మార్గాలను ప్రోత్సహించడం, న్యాయమైన - సమ్మిళితమైన మార్పును సమాజంలోని అన్ని వర్గాలకూ అందించడం ఈ అయిదు గుణాత్మక లక్ష్యాల ముఖ్యోద్దేశం.

తొలి విజయం నుంచి ఉన్నత ఆశయాల వరకు:

పర్యావరణ పరిరక్షణ కోసం తలపెట్టిన సానుకూల చర్యల పట్ల నిబద్ధతను చాటుకుంటూ.. హరిత గృహ వాయు ఉద్గారాలను తగ్గించే విషయంలో తన లక్ష్యాలను భారత్ క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. 2022 అనంతరం, ఇప్పుడు 2031-35 కాలానికి గాను కొత్త లక్ష్యాలను ప్రకటించడం ద్వారా.. 2070 నాటికి కర్బనోద్గార రహిత లక్ష్యాన్ని చేరుకునే దిశగా కీలక ముందడుగు వేసింది.

2015లో సమర్పించిన భారత మౌలిక వాతావరణ కట్టుబాట్లు (ఎన్‌డీసీ) పటిష్టమైన పునాదిని వేశాయి. ఇందులో 2030 నాటికి జీడీపీలో కర్బనోద్గారాల తీవ్రతను 33 – 35 శాతం తగ్గించడం, విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యంలో శిలాజేతర వనరుల వాటాను 40 శాతానికి చేర్చడం లక్ష్యంగా పెట్టుకోగా, ఆ రెండింటినీ నిర్ణీత గడువు కన్నా.. ఒకదాన్ని 11 ఏళ్లు, మరొకదాన్ని 9 ఏళ్ల ముందుగానే సాధించడం విశేషం. వాతావరణ కట్టుబాట్ల విషయంలో విశ్వసనీయమైన, కార్యాచరణే ప్రాతిపదికగా ఉన్న మన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

2005 నుంచి 2020 మధ్య మన దేశ ఉద్గారాల తీవ్రత 36 శాతం తగ్గింది. ఇప్పుడీ లక్ష్యాన్ని 2035 నాటికి 47 శాతానికి పెంచారు. అలాగే స్థాపిత విద్యుత్‌శక్తి సామర్థ్యంలో శిలాజేతర ఇంధన వనరుల వాటాను పెంచాలన్న కొత్త ఎన్డీసీ లక్ష్యం విషయానికొస్తే.. 2026 ఫిబ్రవరి నాటికే దేశం ఇందులో 52.57 శాతం సామర్థ్యాన్ని సాధించింది. నిర్ణీత గడువు కన్నా అయిదేళ్ల ముందే లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. 2035 నాటికి స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యంలో శిలాజేతర ఇంధన వనరుల వాటాను 60 శాతానికి చేరుకునేలా ఇప్పుడీ లక్ష్యాన్ని విస్తరించారు. అలాగే అటవీ విస్తీర్ణం, పచ్చదనం ద్వారా అదనపు కర్బన శోషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ఎన్డీసీ లక్ష్యం దిశగా.. భారత్ 2021 నాటికే 2.29 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన సామర్థ్యాన్ని సాధించింది. అడవుల పెంపకం, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ చర్యలు గ్రామీణ జీవనోపాధికి చేయూతనిస్తూనే.. దేశ కర్బన శోషణ లక్ష్యాలను చేరుకోవడంలో నిరంతరం దోహదపడుతున్నాయి. అడవుల పెంపకంలో మన కృషిని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) వంటి స్వతంత్ర సంస్థలూ గుర్తించాయి. అటవీ విస్తీర్ణంలో నికర పెరుగుదల పరంగా మూడో స్థానాన్నీ, అటవీ విస్తీర్ణం పరంగా తొమ్మిదో స్థానాన్నీ భారత్‌కు ఎఫ్ఏవో ఇచ్చింది. అధిక జీడీపీ వృద్ధి రేటును కొనసాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థకూ, పర్యావరణానికీ మధ్య సమతౌల్యాన్ని భారత్ కాపాడుతోందనడానికి ఈ పురోగతి నిదర్శనం. ఇప్పుడు అడవులు, పచ్చదనం ద్వారా కర్బన శోషణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని నిర్ణయించుకున్నాం. 2005 స్థాయులతో పోలిస్తే, 2035 నాటికి 3.5 -4.0 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 

వాతావరణ మార్పులకు సంబంధించి భారత్ తీసుకుంటున్న చర్యలు స్థిరంగా, ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్నాయి. నిర్ణీత సమయం కన్నా ముందుగానే లక్ష్యాలను చేరుకోవటం మన ఘన చరిత్రను చాటిచెబుతోంది. భవిష్యత్ వాగ్దానాలను నెరవేర్చగలమనే బలమైన నమ్మకాన్ని కలిగించటమే కాక, పర్యావరణ పరిరక్షణ పట్ల భారతదేశ నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తుంది.

స్వచ్ఛ ఇంధనం, హరిత వృద్ధిని వేగవంతం చేయటం

భారీ స్థాయిలో పునరుత్పాదక ఇంధన విస్తరణ, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు, గ్రీన్ ఎనర్జీ కారిడార్లు, పర్యావరణహిత తయారీ రంగం, దేశవ్యాప్తంగా నమ్మకమైన, స్థిరమైన మౌలిక సదుపాయాలను కల్పించటం వంటి చర్యల ద్వారా భారత్ వాతావరణ వ్యూహాన్ని అమలు చేసింది.

సంస్థాగత సామర్థ్యం, ఆవిష్కరణల వ్యవస్థ, స్థానిక స్థాయిలో అనుకూలమైన చర్యలను బలోపేతం చేయటాన్ని ఇది స్పష్టం చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు, పీఎం-కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్), కార్బన్ క్యాప్చర్, వినియోగం, నిల్వ (సీసీయూఎస్), అణుశక్తి వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో వాతావరణ మార్పుల అంశాలను ఇది అంతర్భాగం చేస్తుంది. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ), విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్‌ఐ), గ్లోబల్ బయో-ఫ్యూయల్ అలయన్స్ (జీబీఏ), లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్-ఐటి) వంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల ద్వారా భాగస్వామ్యాలను కుదుర్చుకుంటూ పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన లక్ష్యాల దిశగా భారత్ పయనిస్తోంది.

వాతావరణ అనుకూలతను మెరుగుపరచటం

 

భారతదేశ వాతావరణ విధానం ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా, అనుకూలత విస్తరణపై దృష్టి సారిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని గుర్తించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో వాతావరణ అనుకూలతను, విపత్తుల నుంచి కోలుకునే సామర్థ్యాన్ని పెంపొందించటంపై దృష్టి సారించింది. అనుకూలత లక్ష్యాల సాధన దిశగా చేపట్టే కొన్ని కీలక చర్యల్లో.. మడ అడవుల పునరుద్ధరణ, తీరప్రాంత నియంత్రణ, వాతావరణ మార్పులను తట్టుకోగల మౌలిక సదుపాయాల ద్వారా సున్నితమైన తీరప్రాంతాల రక్షణ; తుఫాన్లు, తుఫాను ఉద్ధృతిపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు; హిమాలయ రాష్ట్రాల్లో హిమానీనదాల పర్యవేక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర జీవనోపాధుల లక్షిత కార్యక్రమాలు; కొండచరియలు విరిగిపడటం, హిమానీనదులు ఉప్పొంగి సంభవించి కలిగే వరద ప్రమాదాలను ఎదుర్కోవటానికి వాతావరణ మార్పులను తట్టుకోగల మౌలిక సదుపాయాలు; రాష్ట్రాల్లో వాతావరణ కార్యాచరణ ప్రణాళికల అమలు; సమాజ స్థాయిలో విపత్తు సంసిద్ధత, సుస్థిరతను నెలకొల‌్పే కార్యక్రమాల వంటివి ఉన్నాయి.

భారతదేశ వాతావరణ కార్యాచరణ ముసాయిదాలో భాగంగా జాతీయ వాతావరణ మార్పుల కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఏపీసీసీ), దాని పరిధిలోని తొమ్మిది జాతీయ మిషన్లు, రాష్ట్రాల వాతావరణ మార్పుల కార్యాచరణ ప్రణాళికల (ఎస్‌ఏపీసీసీ) ద్వారా భారతదేశ ఎన్‌డీసీ అమలవుతోంది. వాతావరణ మార్పులను తట్టుకోగల శక్తిని పెంపొందించటం, తక్కువ కార్బన్ ఉద్గారాలతో అభివృద్ధిని సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు, కార్యక్రమాలతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర విధానంతో ప్రభుత్వం ఈ కార్యాచరణను అమలు చేస్తోంది.

జల్ జీవన్ మిషన్, సుస్థిర వ్యవసాయంపై జాతీయ మిషన్, సుస్థిర ఆవాసాలు, మిష్టి (తీరప్రాంత ఆవాసాలు, స్పష్టమైన ఆదాయానికి మడ అడవుల కార్యక్రమం), జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక, మృత్తికా ఆరోగ్య కార్డు, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) వంటి వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా స్థానిక స్థాయిలో భారతదేశ వాతావరణ చర్యల అమలు జరుగుతోంది.

ప్రజా కేంద్రీకృత విధానం

"పర్యావరణం కోసం జీవనశైలి (లైఫ్)" సూత్రంపై భారత వాతావరణ పరిరక్షణ ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది సుస్థిర జీవనాన్ని జన చైతన్య ఉద్యమంగా మారుస్తోంది. మొక్కలు నాటటాన్ని ప్రజలే ముందుండి నడిపే కీలక కార్యక్రమంగా మార్చేందుకు 'ఏక్ పెడ్ మా కే నామ్' వంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది.

ఎన్‌డీసీ (2031-35) విధానం

2031-2035 కాలానికి సంబంధించి భారతదేశపు ఎన్‌డీసీని రూపొందించటంలో మొదటి గ్లోబల్ స్టాక్‌టేక్ (జీఎస్టీ) ఫలితాలు, సాధారణ సూత్రాలే కానీ విభిన్న బాధ్యతలు, సంబంధిత సామర్థ్యాలు (సీబీడీఆర్-ఆర్‌సీ), సమానత్వ దృక్పథం వంటి కీలక అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దేశంలోని వాస్తవ పరిస్థితులు, అభివృద్ధి ప్రాధాన్యతలు, ఇంధన భద్రత, వాతావరణ మార్పులపై మరింత ప్రాధాన్యత గల చర్యల అవసరాన్ని పారిస్ ఒప్పంద సుదీర్ఘ లక్ష్యాలకు అనుగుణంగా సమన్వయం చేయటమే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం.

భారతదేశం వరుసగా ప్రకటించిన వాతావరణ లక్ష్యాలు, విస్తృత స్థాయి భాగస్వాముల సంప్రదింపులు, నీతి ఆయోగ్‌లోని పది కార్యవర్గాలు నిర్వహించిన అధ్యయనాల ఫలితం. ఈ పది బృందాల్లో కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంబంధిత రంగాల నిపుణులు, పారిశ్రామిక సంస్థలు, పౌర సమాజ సంస్థలు ఉన్నాయి. ఇంధనం, పరిశ్రమలు, రవాణా, వ్యవసాయం, నీరు, పట్టణాభివృద్ధి వంటి రంగాల వారీగా అందిన సూచనలను అంచనా వేసి, తద్వారా సవరించిన ఈ లక్ష్యాలు ఉన్నతంగా, సాధించదగినవిగా, దేశీయ సామర్థ్యాలకు అనుగుణంగా రూపొందించారు. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలను వాతావరణ లక్ష్యాలతో అనుసంధానిస్తూ, ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసే విధానాన్ని ఈ ప్రక్రియ నిర్ధారిస్తుంది. ఈ సంప్రదింపుల విధానం వృద్ధి, జీవనోపాధి, ఇంధన, ఆహార భద్రతలను కాపాడుతూనే.. సమ్మిళిత, భాగస్వామ్య వాతావరణ విధాన రూపకల్పన పట్ల భారతదేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

భారతదేశం వరుసగా చేపడుతున్న వాతావరణ మార్పుల లక్ష్యాల ద్వారా యువతకు, మహిళలకు నూతన అవకాశాలను కల్పించే అవకాశముంది. తద్వారా పర్యావరణహిత మార్పుల్లో వారిని కీలక భాగస్వాములుగా మార్చవచ్చు.

బలమైన నిర్దేశిత విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధి, పర్యావరణ బాధ్యత.. రెండూ ఏకకాలంలో సాధ్యమని భారత్ నిరంతరం చాటిచెబుతోంది.

తక్కువ-కార్బన్, వాతావరణ మార్పులను తట్టుకోగల భవిష్యత్ దిశగా భారతదేశ ప్రయాణంలో.. 2031 నుంచి 2035 కాలానికి సంబంధించిన జాతీయ నిర్దేశిత సహకారానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం కీలక ఘట్టం. ఇది వాతావరణ కార్యాచరణలో ప్రపంచ నాయకుడిగా భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt

Media Coverage

EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi receives a telephone call from the US Vice President
August 08, 2026
PM and Vice President Vance review progress in the India-U.S. Strategic Partnership.
PM and Vice President Vance exchange views on regional and global developments.
PM warmly congratulates Vice President Vance and Ms. Usha Vance on the birth of their son.

Prime Minister Shri Narendra Modi received a telephone call today from the Vice President of the United States, Mr. J.D. Vance.

Prime Minister and Vice President Vance reviewed progress in the India-U.S. Comprehensive Global Strategic Partnership. They noted the sustained momentum in the high-level engagements and reaffirmed their commitment to further strengthening cooperation in trade, defence, critical and emerging technologies, energy security and critical minerals.

They also exchanged views on regional and global developments of mutual interest.

Prime Minister warmly congratulated Vice President Vance and Ms. Usha Vance on the birth of their son and conveyed best wishes to the family.