వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను ఏప్రిల్ 26 ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అందించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్నుద్దేశించి ఆయన ప్రసంగం కూడా ఉంటుంది.
ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా.. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో 15వ రోజ్గార్ మేళాను నిర్వహించనున్నారు. సాధికారత సాధించడానికీ దేశాభివృద్ధికి విశేషంగా దోహదపడడానికీ అర్థవంతమైన అవకాశాలను ఇది యువతకు అందిస్తుంది.
దేశవ్యాప్తంగా కొత్తగా నియమితులైన వీరు కేంద్ర ప్రభుత్వంలో- రెవెన్యూ శాఖ, సిబ్బంది- ప్రజా ఫిర్యాదులు- పింఛన్ల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, ఉన్నత విద్యా శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, కార్మిక- ఉపాధి మంత్రిత్వ తదితర మంత్రిత్వ శాఖలు/విభాగాలలో చేరనున్నారు.


