కొత్తగా కొత్తగా రిక్రూట్ అయిన సుమారు 51,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌ల పంపిణీ
"రిక్రూట్ అయినవారు సేవకు అంకితం అవ్వడం ద్వారా దేశం తన లక్ష్యాలను సాధించగలుగుతుంది"
"నారీశక్తి వందన్ అధినియం కొత్త పార్లమెంటులో దేశానికి కొత్త ప్రారంభం"
"సాంకేతికత... అవినీతిని కట్టడి చేసింది, మెరుగైన విశ్వసనీయత, తగ్గిన సంక్లిష్టత, సౌకర్యాన్ని పెంచింది"
"ప్రభుత్వ విధానాలు కొత్త ఆలోచనా విధానం, నిరంతర పర్యవేక్షణ, మిషన్ మోడ్ అమలు, సామూహిక భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటాయి, ఇవి చిరస్థాయిగా ఉండే లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమం చేస్తాయి"

నమస్కార్, 
నేటి రోజ్  గార్  మేళాలో ప్రభుత్వోద్యోగాలకు నియామక పత్రాలు అందుకుంటున్న అభ్యర్థులందరికీ నా హృద‌యపూర్వక  శుభాకాంక్షలు. ఎంతో కఠిన శ్రమ అనంతరం మీరందరూ ఈ విజయం సాధించారు. లక్షలాది  మంది పోటీదారులను ఎదుర్కొని మీరు ఈ విజయం సాధించినందున మీ జీవితంలో ఇది అత్యంత ప్రత్యేకమైనది.

మిత్రులారా,
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి పండుగ వేడుగ్గా నిర్వహించుకుంటున్నారు. ఈ పవిత్ర సమయంలో మీరు మీ జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నారు. భగవాన్  గణేశుడు విజయాన్ని అందించే దేవుడు. సేవ చేయాలన్న మీ సంకల్పం జాతీయ లక్ష్యాల  సాధనకు దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,
నేడు మన దేశం చారిత్రక విజయాలు, నిర్ణయాలు చూస్తోంది. కొద్ది రోజుల క్రితమే నారీ శక్తి వందన్  అధినియమ్  పేరిట దేశ జనాభా కొత్త ఉత్తేజం పొందింది. 30 సంవత్సరాలుగా పెండింగ్  లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును రికార్డు ఓట్ల మద్దతుతో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. 
ఇది ఎంత పెద్ద విజయమో మీరే ఆలోచించండి. మీరందరూ కనీసం పుట్టని సమయంలోనే ఈ డిమాండు ప్రారంభమయింది. దేశ కొత్త పార్లమెంటు ప్రారంభమైన రోజునే ఈ నిర్ణయం వెలువడింది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త  పార్లమెంటుతో కొత్త భవిష్యత్తుకు బీజం పడింది. 

 

మిత్రులారా, 
నేడు ఈ రోజ్  గార్  మేళాలో మన కుమార్తెలు కూడా భారీ  సంఖ్యలో నియామక పత్రాలు అందుకున్నారు. నేడు భారతదేశ పుత్రికలు అంతరిక్షం నుంచి  క్రీడల వరకు భిన్న రంగాల్లో ఎన్నో రికార్డులు సాధిస్తున్నారు. ఈ మహిళా శక్తి విజయానికి నేనెంతో గర్వపడుతున్నాను. ప్రభుత్వ విధానాలు మహిళా సాధికారతకు కొత్త ద్వారాలు తెరిచాయి. మన పుత్రికలు సాయుధ దళాల్లో కూడా చేరి సేవా మార్గంలో ముందడుగేస్తున్నారు. కొత్త ఉత్తేజంతో ప్రతీ రంగంలోను మహిళా శక్తి కొత్త మార్పు ఎలా తెచ్చిందో మనం చూశాం. సత్పరిపాలనకు సంబంధించిన కొత్త ఆలోచనలతో మనందరం పని చేయాలి. 

మిత్రులారా, 
21వ శతాబ్ది ఆకాంక్షలు; సమాజం, ప్రభుత్వ ఆశలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. నవభారతం ప్రస్తుతం సాధిస్తున్న అద్భుతమైన విజయాలు మీరే చూడవచ్చు. కొద్ది రోజుల క్రితమే భారతదేశం చంద్రమండలంపై త్రివర్ణ పతాకం ఎగురవేసింది. ఈ నవభారతం ఆశలు చాలా ఉన్నతమైనవి. 2047 నాటికి భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశం కావాలన్న సంకల్పం చేసుకుంది. 
రాబోయే కొద్ది  సంవత్సరాల్లో మనది ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశంలో ఎన్నో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్న నేటి కాలంలో ప్రతీ ఒక్క ప్రభుత్వోద్యోగి పాత్ర కూడా కీలకం. పౌరులే ప్రథమం అనే స్ఫూర్తితో మీరంతా పని చేయాలి. మీరంతా టెక్నాలజీ దశదిశలుగా విస్తరించిన కాలంలో ఉన్నారు. మీ తల్లిదండ్రులకు ఎలా ఆపరేట్  చేయాలో కూడా తెలియని గాడ్జెట్లను మీరు ఆటబొమ్మల వలె ఉపయోగిస్తున్నారు. 

నేడు మీ కార్యాలయాల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటోంది. టెక్నాలజీని ఉపయోగించి పాలనలో కొత్త మెరుగుదలలు తెచ్చే దారులను మనం అన్వేషించాలి. టెక్నాలజీని ఉపయోగించి మీరు పని చేస్తున్న విభాగాల్లో మీ సమర్థతను ఎలా మెరుగుపరచాలో కూడా మీరు పరిశీలించవచ్చు.

మిత్రులారా, 
సాంకేతిక పరివర్తన కారణంగా గత 9 సంవత్సరాల కాలంలో పరిపాలన ఎంతగా తేలిక అయిందో మీరే చూశారు. గతంలో రైల్వే టికెట్ల కోసం బుకింగ్  కౌంటర్ల వద్ద భారీ క్యూల్లో ఎదురు చూడాల్సి వచ్చేది. టెక్నాలజీ ఆ ప్రక్రియను సులభం చేసింది. ఆధార్  కార్డు, డిజిటల్ లాక్, ఇ-కెవైసి వంటివి డాక్యుమెంటేషన్  లో సంక్లిష్టతలను తొలగించాయి. గ్యాస్  సిలిండర్ల బుకింగ్  నుంచి విద్యుత్  బిల్లుల చెల్లింపు వరకు అన్నీ నేడు యాప్  ల ద్వారానే జరుగుతున్నాయి. డిబిటి ద్వారా నేడు ప్రభుత్వ స్కీమ్ ల నిధులు నేరుగా ప్రజలను చేరుతున్నాయి. డిజియాత్ర మన ప్రయాణాన్ని వేగం చేసింది. అంటే టెక్నాలజీ అవినీతిని, సంక్లిష్టతలను తగ్గించి విశ్వసనీయతను, సౌకర్యాన్ని పెంచింది. 

ఈ దిశగా మీరు మరింత ఎక్కువగా పని చేయాలి. టెక్నాలజీని ఉపయోగించి పేదల ప్రతీ అవసరాలు ఎలా తీర్చవచ్చు, ప్రభుత్వ పనుల్లో ప్రతీ ఒక్కటీ ఎలా సరళం చేయాలి అని ఆలోచించాలి. మీ పనుల్లో కొత్త మార్గాలు, కొత్త విధానాల కోసం ప్రయత్నిస్తూ మరింత ముందడుగేయాలి.

 

మిత్రులారా,
గత 9 సంవత్సరాలుగా మా విధానాలన్నీ పెద్ద లక్ష్యాల సాధనకు మార్గం సుగమం చేశాయి. మా విధానాలన్నీ కొత్త ఆలోచనా ధోరణి, నిరంతర పర్యవేక్షణ, ఉద్యమ స్ఫూర్తి అమలు, ప్రజా భాగస్వామ్యం లక్ష్యంగా సాగుతున్నాయి. గత 9 సంవత్సరాల కాలంలో మా విధానాలన్నీ ఉద్యమ స్ఫూర్తితోనే అమలుజరుగుతున్నాయి. స్వచ్ఛ భారత్  కావచ్చు, జల్ జీవన్  మిషన్  కావచ్చు...అన్ని పధకాలు నూరు శాతం లక్ష్యసాధన దిశలోనే నడుస్తున్నాయి. ప్రభుత్వంలో ప్రతీ ఒక్క స్థాయిలోనూ పథకాల పర్యవేక్షణ జరుగుతోంది. 

ప్రగతి వేదికగా ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న పురోగతిని నేను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు అమలు జరుగుతున్న నేపథ్యంలో అవి సక్రమంగా అమలుచేయాల్సిన బాధ్యత కొత్తగా ప్రభుత్వోద్యోగానికి నియమితులైన ప్రతీ ఒక్కరిపై ఉంది. మీ వంటి లక్షలాది మంది యువత ప్రభుత్వ సర్వీసులో చేరడం వల్ల ప్రభుత్వ విజయాల అమలులో వేగం, పరిధి కూడా పెరుగుతుంది. దీని వల్ల ప్రభుత్వం వెలుపల కూడా ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుంది. దీనికి తోడు కొత్త పని సంస్కృతి కూడా అలవడుతుంది.

మిత్రులారా, 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ భారత జిడిపి వేగంగా పెరుగుతోంది. మన ఉత్పత్తి, ఎగుమతులు రెండూ అద్భుతంగా పెరుగుతున్నాయి. నేడు ఆధునిక మౌలిక వసతులపై తొలిసారిగా ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. నేడు దేశంలో కొత్త రంగాలు విస్తరిస్తున్నాయి. నేడు పునరుత్పాదక ఇంధనం, ఆర్గానిక్ వ్యవసాయం, రక్షణ, పర్యాటక రంగాల్లో అసాధారణ వృద్ధి నమోదవుతోంది. 
మొబైల్  ఫోన్ల నుంచి విమానవాహక నౌకల వరకు, కరోనా వ్యాక్సిన్  నుంచి ఫైటర్ జెట్ విమానాల వరకు అన్నీ ఆత్మనిర్భర్  భారత్ అభియాన్  శక్తిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. 2025 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక రంగం రూ.60 వేల కోట్లు దాటి విస్తరిస్తుందని అంటున్నారు. దేశంలోని యువతకు కొత్త అవకాశాలు, ఉపాధి అవకాశాలు నిరంతరాయంగా పెరుగుతున్నాయి.

 

మిత్రులారా, 
రాబోయే 25 సంవత్సరాలు ‘‘ఆజాదీ కా అమృత్’’ సమయం కావడం వల్ల మీ రాబోయే 25 సంవత్సరాల కెరీర్ అత్యంత కీలకమైనది. మీరంతా టీమ్  వర్క్  కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. జి-20 సమావేశాలు ఈ నెలలో దేశంలో ఎంత విజయవంతంగా ముగిశాయో మీరే చూశారు. ఢిల్లీ  సహా దేశంలోని 60 నగరాల్లో 200కి పైగా సమావేశాలు జరిగాయి. 

ఈ సమావేశాల సమయంలో విదేశీ అతిథులు మన దేశ వైవిధ్యపు వర్ణాలను ప్రత్యక్షంగా తిలకించారు. జి-20 సందర్భంగా జరిగిన కార్యక్రమాలు మన సాంప్రదాయం, సంకల్పం, ఆతిథ్యాలను ప్రతిబింబించాయి. జి-20 శిఖరాగ్ర  విజయం ప్రభుత్వ  శాఖలు, ప్రయివేటు రంగ విజయానికి కూడా దర్పణం పడుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రతీ ఒక్క టీమ్ ఎంతో శ్రమించి పని చేసింది. నేడు మీరు కూడా టీమ్  ఇండియా  ప్రభుత్వోద్యోగుల్లో భాగం అవుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. 

మిత్రులారా,
దేశాభివృద్ధి ప్రయాణంలో ప్రభుత్వంతో కలిసి ప్రత్యక్షంగా ని చేసే అవకాశం మీ అందరికీ కలిగింది. ఈ ప్రయాణంలో నేర్చుకునే అలవాటును మీరంతా కొనసాగించాలి. ‘‘ఐగాట్  కర్మయోగి’’ ఆన్ లైన్ లెర్నింగ్  పోర్టల్  ద్వారా మీరు ఎంపిక చేసుకున్న కోర్సులో చేరే అవకాశం మీకు కలిగింది. 

 

ఈ సదుపాయాన్ని మీరు ఉఫయోగించుకోవాలని నేను కోరుతున్నాను. మరోసారి మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. మీరంతా భారత సంకల్పం ఫలవంతం చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నా హృద‌యపూర్వక అభినందనలు. రాబోయే 25 సంవత్సరాలు దేశ పురోగతికి, మీ పురోగతికి కూడా మీరు పని చేయాలి. ఇలాంటి అవకాశాలు ఎవరికైనా అరుదుగా వస్తాయి. అలాంటి అవకాశం మీకు వచ్చింది.

మిత్రులారా రండి, మనందరం ప్రతిన బూని ముందుకు సాగుదా. దేశం కోసం జీవించండి; దేశం కోసం ఏదైనా చేయండి, మీ అందరికీ శుభాకాంక్షలు.
ధన్యవాదాలు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Semiconductors to clean energy: Inside PM Modi’s high-profile meeting with 16 Dutch CEOs in The Hague

Media Coverage

Semiconductors to clean energy: Inside PM Modi’s high-profile meeting with 16 Dutch CEOs in The Hague
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi and Prime Minster of Sweden exchange special gifts celebrating the shared cultural legacy of Rabindranath Tagore
May 17, 2026