ఎల్లప్పుడూ జ్ఞాన యోగ మార్గానికే అంకితమైన భారత్.. వేల ఏళ్ల నాటి వేదాలు నేటికీ స్ఫూర్తి: పీఎం
ఆధ్యాత్మికత, సేవకు చిహ్నం భగవాన్ స్వామినారాయణ్: పీఎం
ప్రాచీన రాతప్రతులను సంరక్షించేందుకు జ్ఞాన భారతం మిషన్‌కు అందరూ సహకరించాలని పీఎం పిలుపు

జై స్వామినారాయణ్!

ఈరోజు మనమందరం ఒక ప్రత్యేక సందర్భానికి సాక్షులుగా నిలుస్తున్నాం. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతున్న ఈ ద్విశతాబ్ది వేడుకలు మనందరికీ దక్కిన అదృష్టం. ఈ పవిత్ర మహోత్సవంలో మనమందరం భాగస్వాములవ్వడం విశేషం. ఈ పుణ్యకాలంలో నేను సాధువులందరికీ ప్రణామం చేస్తున్నాను. ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా భగవాన్ స్వామినారాయణ్ కోట్లాది మంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా

భారత్ ఎల్లప్పుడూ జ్ఞాన యోగానికి అంకితమైన దేశం. వేల ఏళ్ల నాటి వేదాలు నేటికీ మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మన మునులు, రుషులు సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్పటి వ్యవస్థలను నిరంతరం అభివృద్ధి చేస్తూ వచ్చారు. వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు, ఉపనిషత్తుల నుంచి పురాణాల వరకు, శ్రుతులు, స్మృతులు, కథా పఠనం, సంకీర్తనలు.. ఇలా వైవిధ్యభరితమైన రూపాల్లో మన సంప్రదాయం నిరంతరం శక్తిమంతంగా మారుతూ వచ్చింది.

మిత్రులారా,

కాలక్రమేణా అవసరాలకు అనుగుణంగా, వివిధ కాలాల్లో మహాత్ములు, ఋషులు, ఆలోచనాపరులు ఈ సంప్రదాయానికి కొత్త అధ్యాయాలను అందించారు. భగవాన్ స్వామినారాయణ్ జీవిత ఘటనలు ప్రజా విద్యతోను, ప్రజా సేవతోను ముడిపడి ఉన్నాయని మనందరికీ తెలుసు. ఆయన తన అనుభవలను అత్యంత సరళమైన మాటల్లో వివరించారు. భగవాన్ స్వామినారాయణ్ శిక్షాపత్రి రూపంలో మన జీవితానికి మార్గనిర్దేశం చేసే అమూల్యమైన బోధనలను అందించారు.

 

మిత్రులారా,

నేడు జరుగుతున్న ఈ ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సందర్భం.. శిక్షాపత్రి నుంచి మనం ఏయే కొత్త విషయాలను నేర్చుకుంటున్నాం? దాని ఆదర్శాలను మన జీవితాల్లో ఎంతవరకు ఆచరిస్తున్నాం? అనే అంశాలను మనం ఆత్మపరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది.

మిత్రులారా,

భగవాన్ స్వామినారాయణ్ జీవితం ఆధ్యాత్మిక సాధనతో పాటు సేవా భావానికి ప్రతిరూపం. నేడు ఆయన అనుచరులు సమాజం, దేశం, మానవాళి సేవ కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్య, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాజెక్టులు, రైతు సంక్షేమం కోసం తీసుకున్న సంకల్పాలు, నీటి సంరక్షణకు సంబంధించిన ఉద్యమాలన్నీ నిజంగా ప్రశంసనీయం. సాధువులైన మీరు, హరి భక్తులు సామాజిక సేవ పట్ల మీ బాధ్యతలను నిరంతరం విస్తరించడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.

మిత్రులారా,

ఈ రోజు దేశం స్వదేశీ, పరిశుభ్రత వంటి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తోంది. ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత) అనే మంత్రం ప్రతి ఇంటికి చేరుతోంది. మీ ప్రయత్నాలు కూడా ఈ ప్రచారాలతో కలిస్తే శిక్షాపత్రి ద్విశతాబ్ది ఉత్సవాలు మరింత మరపురాని వేడుకగా మారతాయి. పురాతన తాళపత్ర గ్రంథాల సంరక్షణ కోసం దేశం జ్ఞాన్ భారత్ మిషన్‌ను ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ మహత్తర కార్యంలో మీలాంటి జ్ఞానవంతమైన సంస్థలు మరింతగా సహకరించాలని నేను  కోరుతున్నాను. మన దేశపు పురాతన జ్ఞానాన్ని కాపాడుకోవాలి. దాని ఉనికిని రక్షించుకోవాలి. ఈ దిశగా మీ సహకారం జ్ఞాన్ భారత్ మిషన్ విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది.

మిత్రులారా,

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనే సాంస్కృతిక మహోత్సవం కొనసాగుతోంది. సోమనాథ దేవాలయంపై జరిగిన తొలి విధ్వంసం నుంచి నేటి వరకు వెయ్యి సంవత్సరాల ప్రయాణాన్ని దేశం ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’గా జరుపుకుంటోంది. ఈ ఉత్సవంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని, దీని లక్ష్యాలను ప్రతి వ్యక్తికి చేరవేసేలా కృషి చేయాలని నేను కోరుతున్నాను. మీ ద్వారా దేశ అభివృద్ధి ప్రయాణానికి భగవాన్ స్వామినారాయణ్ ఆశీస్సులు ఇలాగే కొనసాగుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది.

మరోసారి సాధువులందరికీ, హరి భక్తులందరికీ, యాత్రికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

జై స్వామినారాయణ్!

చాలా చాలా ధన్యవాదాలు!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Cheese from India makes its mark globally’: PM Modi lauds Indian winners at Mundial do Queijo

Media Coverage

‘Cheese from India makes its mark globally’: PM Modi lauds Indian winners at Mundial do Queijo
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఏప్రిల్ 2026
April 23, 2026

Inclusive Innovation: Empowering Every Citizen in the New India Under the Leadership of PM Modi