అహ్మదాబాద్‌లో రూ.5400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవం,
పట్టణాభివృద్ధి, ఇంధనం, రోడ్లు, రైల్వే రంగాలకు ఉపయోగపడనున్న ప్రాజెక్టులు
భారత్‌లో తయారీ కార్యక్రమం విజయానికి ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచిపోయే సుజుకీ కంపెనీ
మొదటి గ్లోబల్ ఎలక్ట్రిక్ కారు ‘ఈ-విటారా’ను హన్సల్‌పూర్‌లో ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 25, 26 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 25న సాయంత్రం 6 గంటలకు అహ్మదాబాద్‌లోని ఖోడల్‌ధామ్ మైదానంలో రూ. 5,400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకింతం చేయటంతో పాటు కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నాను. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన మాట్లాడనున్నారు.

ఆగస్టు 26న ఉదయం 10:30 గంటలకు అహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తిని బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల 100 దేశాల ఎగుమతి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుసంధానతకు సంబంధించిన తన నిబద్ధతకు అనుగుణంగా.. రూ. 1,400 కోట్లకు పైగా విలువైన బహుళ రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో రూ. 530 కోట్ల వ్యయంతో 65 కి.మీ. మహేసానా-పాలన్‌పూర్ రైల్వే మార్గంలో వేసిన రెండో లైను.. రూ.860 కోట్లతో గేజ్ మార్పిడి చేసిన 37 కి.మీ. కలోల్-కాడి-కటోసన్ రోడ్ రైలు మార్గం.. రూ.860 కోట్లతో గేజ్ మార్చిన చేసిన 40 కి.మీ బెచ్రాజీ-రనుజ్‌ రైలు మార్గాలు ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతానికి బ్రాడ్-గేజ్ ప్రయోజనంతో పాటు సులభమైన, సురక్షితమైన, మరింత మెరుగ్గా ఉండే అనుసంధానతను అందిస్తాయి. ఇది రోజువారీ ప్రయాణికులతో పాటు పర్యాటకులు, వ్యాపారాలకు.. ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో ఆర్థికంగా ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తుంది. కటోసన్ రోడ్, సబర్మతి మధ్య ప్రారంభించనున్న రైలు వల్ల పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సులువు అవుతుంది. తద్వారా క్షేత్ర స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. బెచ్రాజీ నుంచి కార్లను తీసుకెళ్లే రైలు ప్రారంభోత్సవం వల్ల రాష్ట్ర పారిశ్రామిక కేంద్రాలకు అనుసంధానత పెరుగుతుంది. ఇది సరకు రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయటమే కాకుండా కాకుండా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

అనుసంధానతను మెరుగుపరచడం, ప్రయాణికుల భద్రతను పెంచడం, ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయాలనే తన దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రధాని.. విరామ్‌గామ్-ఖుదాద్-రాంపురా‌లో విస్తరించిన రహదారిని ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్-మెహ్సానా-పాలన్‌పూర్ రహదారిపై ఆరు వరుసల వాహన అండర్‌పాస్‌‌లకు, అహ్మదాబాద్-విరామ్‌గామ్ రహదారిపై రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయటమే కాకుండా రవాణా సామర్థ్యాన్ని, ఆర్థిక అవకాశాలను మెరుగుపరచనున్నాయి.

రాష్ట్ర విద్యుత్ రంగానికి ప్రధాని పర్యటనలో భారీ ఊతం లభించనుంది. అహ్మదాబాద్, మెహ్సానా, గాంధీనగర్‌లలో ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్‌కు (యూజీవీసీఎల్) చెందిన విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) కింద నష్టాలను తగ్గించడం, సరఫరా నెట్‌వర్క్‌ను ఆధునికీకరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టారు. రూ.1000 కోట్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్టులు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో విద్యుత్ సరఫరా వైఫల్యాలు, అంతరాయాలను తగ్గిస్తాయి. దీనితో పాటు ప్రజలకు మరింత భద్రతను అందిస్తాయి. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ ఏర్పడుతుంది. విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ విశ్వసనీయతను మెరుగుపరుస్తాయి.

పట్టణ పీఎంఏవై‌లోని మురికివాడల అభివృద్ధి అంశం (ఇన్ సిటు స్లమ్ రిహాబిలిటేషన్) కింద రామపిర్ నో టెక్రోలోని సెక్టార్ -3లో పునర్నిర్మించిన మురికివాడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ట్రాఫిక్‌ నిర్వహణను సులభతరం చేసేందుకు, అనుసంధానతను మెరుగుపరచడానికి అహ్మదాబాద్ చుట్టూ ఉన్న సర్దార్ పటేల్ రింగ్ రోడ్‌‌ ప్రధాన రహదారి విస్తరణ ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మంచి నీరు, మురుగు నీటి నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

పరిపాలనా సామర్థ్యాన్ని, ప్రజలకు సేవలకు అందించే తీరును మెరుగుపరుస్తూ గుజరాత్‍‌లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పౌర కేంద్రీకృత సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా అహ్మదాబాద్ పశ్చిమంలో కొత్త స్టాంపులు- రిజిస్ట్రేషన్ భవనం.. రాష్ట్రవ్యాప్తంగా సురక్షితమైన డేటా నిర్వహణ, డిజిటల్ పాలన సామర్థ్యాలను పెంపొందించడానికి గాంధీనగర్‌లో నిర్మించిన రాష్ట్ర స్థాయి డేటా స్టోరేజ్ కేంద్రం ఇందులో ఉన్నాయి.

ఆగస్టు 26న అహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్‌లోని సుజుకి మోటార్‌ ఉత్పత్తి కేంద్రంలో జరగనున్న రెండు చరిత్రాత్మక కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇవి ప్రపంచ హరిత రవాణా కేంద్రంగా భారత్‌ ఆవిర్భావాన్ని తెలియజేస్తాయి. దీనితో పాటు భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ పట్ల ప్రధానమంత్రి నిబద్ధతను ముందుకు తీసుకువెళ్తాయి.

భారత్‌లో తయారీ విజయానికి ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచే సంఘటన ఇక్కడ జరగనుంది. సుజుకీ కంపెనీకి సంబంధించిన మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ‘ఈ-విటారా’ను ఆయన ప్రారంభించనున్నారు. తన ప్రపంచ వ్యూహంలో భాగంగా సుజుకీ దీనిని తీసుకొచ్చింది. భారత్‌లో తయారైన ఈ కార్లు.. యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లతో పాటు వందకు పైగా దేశాలకు ఎగుమతి కానున్నాయి. సుజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ మారనుంది.

హరిత ఇంధన రంగంలో ఆత్మనిర్భర్‌గా మారే దిశగా ఒక పెద్ద ముందడుగు ప్రధాని పర్యటన సందర్భంగా పడనుంది. గుజరాత్‌లోని టీడీఎస్ లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రంలో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల స్థానిక ఉత్పత్తిని ఆయన ప్రారంభించనున్నారు. దీనితో భారత్‌లో బ్యాటరీలకు సంబంధించిన వ్యవస్థ తదుపరి దశ కూడా ప్రారంభం కానుంది. తోషిబా, డెన్సో, సుజుకిలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తోన్న ఈ కేంద్రం దేశీయ తయారీ, హరిత ఇంధన ఆవిష్కరణలను పెంచనుంది. ఈ కేంద్రం వల్ల బ్యాటరీ‌ల్లో 80 శాతానికి పైగా మన దేశంలోనే తయారవుతాయి. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves ₹1,570 crore ship repair facility at Vadinar, Gujarat

Media Coverage

Cabinet approves ₹1,570 crore ship repair facility at Vadinar, Gujarat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 మే 2026
May 06, 2026

New India, New Pride: When Self-Reliance Meets Results — A Tribute to PM Modi