ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తల బృందం ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి సీజన్ ప్రారంభమయ్యే ముందు అన్ని వివరాలతో ఆధునిక వ్యవసాయం గురించిన సమాచారాన్ని రైతులకు అందిస్తారు: ప్రధానమంత్రి
ఈ కార్యక్రమం భారత వ్యవసాయాన్ని వికసిత్ భారత్‌కు ప్రధానాధారం చేయాలన్న సంకల్పంతో పనిచేస్తుంది: ప్రధాని
భారత్‌ తన సొంత అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ప్రపంచ ఆహార సరఫరాదారుగా కూడా ఎదగాలి: ప్రధాని
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ వ్యవసాయంలో ఆధునీకరణకు చోదకశక్తిగా ఉంటూ

ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత కృషి సంకల్ప్ అభియాన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వికసిత కృషి సంకల్ప్ అభియాన్ రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. వర్షాకాలం దగ్గరపడుతున్న కొద్ది, ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లు చేయటం మొదలవుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే 12 నుంచి 15 రోజుల పాటు 2000 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రగతిశీల రైతులతో కూడిన బృందాలు 700 లకు పైగా జిల్లాల్లో సందర్శించి లక్షల మంది రైతులను చేరుకుంటారని తెలిపారు. ఈ బృందాల్లో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన భారత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు వారికి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.

వ్యవసాయం సాధారణంగా రాష్ట్రానికి సంబంధించిన అంశమని.. ప్రతి రాష్ట్రం రైతుల సంక్షేమం విధానాలను, కార్యక్రమాలను రూపొందించాయని.. వేగంగా మారుతోన్న ప్రస్తుత కాలానికి అనుగుణంగా భారత వ్యవసాయ రంగంలో మార్పు అవసరమని అన్నారు. భారత రైతులు రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించి ధాన్యం నిల్వలను పెంచుతున్నారని, అయితే మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు, రైతుల భాగస్వామ్యంతో వ్యవసాయానికి సంబంధించి ఆధునిక సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ బృందాలు ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు తరలి రైతులకు సమగ్ర సమాచారాన్ని ఇచ్చి, వారికి అధునాతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిస్తాయని ప్రధానంగా పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు రైతులకు సహాయం చేయడానికి ఈ బృందాలు సిద్ధంగా ఉంటాయని అన్నారు. 

దశాబ్దాలుగా భారత వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధన విషయంలో సాధించిన గణనీయమైన పురోగతి తెలియజేస్తూ అవి చూపించిన సానుకూల ప్రభావాన్ని ప్రధానంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్త పద్ధతులను విజయవంతంగా ప్రయోగించి, అద్భుతమైన దిగుబడిని సాధించిన ప్రగతిశీల రైతులను ఆయన  ప్రశంసించారు. శాస్త్రీయ పరిశోధన, విజయవంతమైన వ్యవసాయ పద్ధతులు విస్తృత వ్యవసాయ వర్గానికి చేరేలా చూసుకునే ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, వాటిని నూతన ఉత్తేజంతో వేగవంతం చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. “ ఈ జ్ఞానానికి సంబంధించిన అంతరాన్ని తగ్గించేందుకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఒక విలువైన అవకాశాన్ని అందిస్తోంది. ఇది రైతులకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతుల నుంచి ప్రయోజనం చేకూరుస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.

వికసిత్ భారత్ కోసం భారతదేశ వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని, వ్యవసాయ రంగాన్ని మార్చటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన అనేక కీలక అంశాలను ప్రధానంగా తెలియజేశారు. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు అందేలా చూసుకోవటం, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, జాతీయ అవసరాలకు అనుగుణంగా పంట ఉత్పత్తిని చేపట్టటం వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. "భారత్‌ తన సొంత అవసరాలను తీర్చుకోవటమే కాకుండా ప్రపంచ ఆహార సరఫరాదారుగా కూడా ఎదగాలి" అని వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కోవడం, తక్కువ నీటి వినియోగంతో ధాన్యం ఉత్పత్తిని పెంచడం, హానికరమైన రసాయనాల నుంచి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ క్షేత్రాల్లో ఉపయోగించటం చాలా అవసరమని అన్నారు. గత 10-11 సంవత్సరాలుగా  ప్రభుత్వం ఈ దిశగా విస్తృతమైన పనులు చేసిందని ప్రధానంగా చెప్పారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల విషయంలో పురోగతిపై రైతులకు అవగాహన పెంచాలని కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.

సాధారణ వ్యవసాయం కాకుండా రైతులకు అదనపు ఆదాయం అందించే మార్గాలను చూపించే ప్రాముఖ్యతను ప్రధానంగా చెబుతూ.. రైతులకు ఈ దిశగా పలు అవకాశాలను కల్పించే లక్ష్యంగా పెట్టుకున్న కీలక కార్యక్రమాలను తెలియజేశారు. వ్యవసాయ క్షేత్రాల సరిహద్దుల వెంట సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం వల్ల అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు. తీపి విప్లవం(స్వీట్ రివల్యూషన్) ప్రభావాన్ని గుర్తించిన ఆయన తేనెటీగల పెంపకం రైతులకు ప్రయోజనం చేకూరుస్తోందని, ఎక్కువ మంది ఇందులోకి వచ్చేలా చూడాలని అన్నారు. వ్యవసాయ వ్యర్థాలను శక్తి వనరుగా మార్చడం, వ్యర్థాలను సంపదగా మార్చటం అవసరాన్ని కూడా ప్రధానమంత్రి ప్రధానంగా పేర్కొన్నారు.  'శ్రీ అన్న'ను పండించడానికి అనువైన ప్రాంతాలను గుర్తించడం, వ్యవసాయ ఉత్పత్తులలో విలువ జోడింపును పెంచే ప్రాముఖ్యతను కూడా ప్రధానంగా చెప్పారు. పాలు ఇవ్వని పశువులు కూడా గోబర్ధన్ యోజన ద్వారా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయని, ఇది ఆదాయ వనరుగా మారుతుందని పేర్కొన్నారు. ఎక్కువ మంది భాగస్వాములయ్యేలా, ప్రయోజనం పొందేలా ఈ ఆవిష్కరణల గురించి రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.


 

ఈ మిషన్‌కు ఉన్న ప్రాముఖ్యతను ప్రధానంగా చెబుతూ  "దేశ వ్యవసాయం అభివృద్ధి చెందిన భారత్‌కు మూలస్తంభంగా మారాలి" అని వ్యాఖ్యానించారు. తమ వద్దకు వచ్చే శాస్త్రవేత్తలతో చురుకుగా మాట్లాడి, ప్రశ్నలు అడిగి విలువైన వివరాలు తెలుసుకోవాలని రైతులను ఆయన కోరారు. శాస్త్రవేత్తలు, అధికారులు ఈ మిషన్ ప్రాముఖ్యతను గుర్తించాలని విన్నవించారు. వారి నిబద్ధత సాధారణంగా చేసే ప్రభుత్వ పనికి మించి జాతీయ సేవా స్ఫూర్తిని ప్రతిబింబించాలని అన్నారు. రైతుల సందేహాలకు సమగ్రంగా స్పందించాలని, వారి విలువైన సూచనలను కూడా నమోదు చేసుకోవాలని వారిని కోరారు. "వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ దేశ రైతులకు పురోగతికి కొత్త ద్వారాలను తెరుస్తుంది. వ్యవసాయంలో ఆధునికీకరణను ప్రోత్సహిస్తుంది" అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలోని అందరు భాగస్వాములకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Second consignment of 37.5 tonnes HADR aid reaches flood-hit Nepal; India sends 47.5 tonnes of relief material in total

Media Coverage

Second consignment of 37.5 tonnes HADR aid reaches flood-hit Nepal; India sends 47.5 tonnes of relief material in total
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఆగష్టు 2026
August 28, 2026

India’s Growth Story, Grounded: Inclusion, Exports, and Infrastructure Under One Vision of PM Modi