ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గోవాలో జరుగుతున్న ఎనర్జీ వీక్ కొత్త సంచికలో దాదాపు 125 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఇంధన భద్రత, సుస్థిర భవిష్యత్తు గురించి చర్చించేందుకు వారు భారత్కు వచ్చారని చెబుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ స్వాగతం పలికారు.
అతి తక్కువ సమయంలో.. అంతర్జాతీయ చర్చ, కార్యాచరణ వేదికగా ఇండియా ఎనర్జీ వీక్ మారిందని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇంధన రంగంలో భారత్లో విస్తృత అవకాశాలున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని, అంటే.. దేశంలో ఇంధన ఉత్పత్తులకు గిరాకీ నిరంతరం పెరుగుతోందని దీని అర్థమని వివరించారు. అంతర్జాతీయ డిమాండ్ను తీర్చేందుకు భారత్లో గొప్ప అవకాశాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూ.. ప్రపంచంలోనే పెట్రోలియం ఉత్పత్తుల్లో అయిదు అగ్ర ఎగుమతిదారుల్లో భారత్ ఒకటిగా నిలిచిందని శ్రీ మోదీ చెప్పారు. భారత్కున్న ఈ సామర్థ్యం అందరికీ లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. భాగస్వామ్యాలను అన్వేషించడానికి ఎనర్జీ వీక్ మంచి వేదిక అని పేర్కొంటూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


