క్రీడాకారులు... వారి కుటుంబాలతో అనధికారిక.. ఆకస్మిక సమావేశం;
135 కోట్ల భారతీయుల శుభాకాంక్షలే దేశం నుంచి మీకు ఆశీర్వాదాలు: ప్రధానమంత్రి;
ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ శిబిరాలు.. పరికరాలు..
అంతర్జాతీయ క్రీడా తోడ్పాటు కల్పించబడ్డాయి: ప్రధానమంత్రి;
Fదేశం మొత్తం నేడు తమలో ప్రతి ఒక్కరితోనూ ఓ కొత్త ఆలోచనతో... సరికొత్త విధానంతో ఏ విధంగా మద్దతిస్తున్నదో క్రీడాకారులకు ప్రత్యక్షంగా తెలుసు: ప్రధానమంత్రి;
ఇంతపెద్ద సంఖ్యలో... పలు క్రీడల్లో ఆటగాళ్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి: ప్రధానమంత్రి;
భారతదేశం తొలిసారి అర్హత సాధించిన క్రీడలు అత్యధికం: ప్రధానమంత్రి;

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. ఈ క్రీడల్లో వారు పాల్గొనబోతున్న నేపథ్యంలో వారిలో ఉత్తేజం నింపే కృషిలో భాగంగా ప్రధానమంత్రి వారితో ముచ్చటించారు. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌, సహాయమంత్రి శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

   క్రీడాకారులతో అప్పటికప్పుడు సాగిన ఈ అనధికారిక సమావేశంలో ప్రధానమంత్రి వారిలో  ఉత్తేజం నింపడంతోపాటు వారి కుటుంబాలు చేస్తున్న త్యాగాలకుగాను కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా దీపికా కుమారి (ఆర్చరీ)తో మాట్లాడుతూ- ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించినందుకు అభినందించారు. విల్లంబులతో మామిడి కాయలు పడగొట్టడం ద్వారా క్రీడా పయనం ప్రారంభించి అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగిన ఆమె ప్రస్థానం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో క్రీడాపథం వీడని ప్రవీణ్‌ జాదవ్‌ (ఆర్చరీ)ను ప్రధానమంత్రి కొనియాడారు. అంతేకాకుండా ప్రవీణ్‌ కుటుంబంతో మరాఠీ భాషలో ముచ్చటిస్తూ అతని ఎదుగుదలలో వారి కృషిని ప్రశంసించారు.

   నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో)తో మాట్లాడుతూ భారత సైన్యంలో ఆ క్రీడాకారుడి అనుభవం గురించి, గాయం నుంచి అతడు కోలుకోవడం గురించి ప్రధానమంత్రి వాకబు చేశారు. తనపైగల అంచనాల ఒత్తిడిని అధిగమించి అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. అనంతరం ద్యుతీచంద్‌ (పరుగు పందెం)తో సంభాషణ ఆరంభించిన సందర్భంగా- ఆమె పేరుకు ‘కాంతి’ అనే అర్థముందని వివరిస్తూ, దానికి తగినట్లే తన క్రీడా నైపుణ్యంతో వెలుగులు విరజిమ్ముతున్నందుకు అభినందించారు. భారతదేశం మొత్తం క్రీడాకారులకు వెన్నుదన్నుగా ఉన్నదని, ఎలాంటి భయసంకోచాలు లేకుండా ముందుకు సాగాలని ప్రధానమంత్రి ఆమెకు సూచించారు. ఆశీష్‌ కుమార్‌ (బాక్సింగ్‌)తో మాట్లాడుతూ... ఈ క్రీడను ఎంచుకోవడానికి కారణమేమిటని ప్రధానమంత్రి ఆరాతీశారు. అలాగో కోవిడ్‌-19తో పోరాడుతూ కట్టుదిట్టంగా శిక్షణ కొనసాగించిన తీరును అడిగి తెలుసుకున్నారు. తండ్రిని కోల్పోయిన దుఃఖాన్ని అధిగమించి లక్ష్యసాధనకు ఉద్యుక్తుడు కావడంపై ప్రధానమంత్రి అతన్ని కొనియాడారు. ఈ సందర్భంగా తాను కోలుకోవడంలో కుటుంబంతోపాటు బంధుమిత్రుల సమూహం ఇచ్చిన తోడ్పాటును ఆ క్రీడాకారుడు గుర్తు చేసుకున్నాడు. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇలాంటి పరిస్థితుల్లోనే తండ్రిని కోల్పోవడాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ గుర్తుచేశారు. అయితే, మైదానంలో ప్రతిభా ప్రదర్శనద్వారా ఆయన తన తండ్రికి ఎంతో ఘనంగా నివాళి అర్పించాడని ప్రశంసించారు.

   అనేకమంది క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలిచారంటూ మేరీ కోమ్‌ (మహిళా బాక్సర్‌)ను ప్రధానమంత్రి కొనియాడారు. ఒకవైపు కుటుంబంపై శ్రద్ధ చూపుతూనే... ముఖ్యంగా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తన క్రీడపైనా అంకితభావం చూపడం ఎలా సాధ్యమైందని ఆయన వాకబు చేశారు. అలాగే తనకు ఇష్టమైన ‘పంచ్‌’, ఇష్టమైన క్రీడాకారుల గురించి ప్రధానమంత్రి ఆమెను అడిగారు. ఆమె అన్నివిధాలా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పి.వి.సింధు (బ్యాడ్మింటన్‌)తో మాట్లాడుతూ- హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో క్రీడా వ్యాసంగం ఎలా సాగిందంటూ ప్రధానమంత్రి ఆరాతీశారు. తన శిక్షణ సందర్భంగా ఆహార ప్రాముఖ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అటుపైన ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతూ- తమ పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని భావించే తల్లిదండ్రులకు ఎలాంటి సలహా ఇస్తారంటూ వారిని ప్రశ్నించారు. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులందరికీ విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ, వారు స్వదేశం చేరాక స్వాగతం పలికే సమయంలో సింధుతో కలసి ‘ఐస్‌క్రీమ్‌’ తీసుకుంటానని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

   అనంతరం ఇలవేణిల్‌ వాళరివన్‌ (షూటింగ్‌)తో మాట్లాడుతూ- ఈ క్రీడపై ఆమెకు ఆసక్తి ఎలా కలిగిందంటూ ప్రధానమంత్రి వాకబు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పెరిగిన ఆమె జీవన గమనాన్ని ప్రస్తావిస్తూ, ఆమె తల్లిదండ్రులను శ్రీ మోదీ తమిళంలో పలుకరించారు. ఆనాడు తన రాజకీయ జీవితం తొలినాళ్లలో తాను మణినగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు. ఆమె తన చదువును, క్రీడాసక్తిని ఏ విధంగా సమన్వయం చేసుకోగలుగుతున్నదీ అడిగి తెలుసుకున్నారు.

   ఆ తర్వాత సౌరభ్‌ చౌదరి (షూటింగ్‌)తో ప్రధానమంత్రి మాట్లాడారు. మానసిక దృఢత్వం, ఏకాగ్రత మెరుగుదలలో యోగా ఎలాంటి పాత్ర పోషించిందీ అడిగి తెలుసుకున్నారు. అలాగే అనుభవంగల క్రీడాకారుడు శరత్‌ కమల్‌ (టేబుల్‌ టెన్నిస్‌)తో ప్రధానమంత్రి మాట్లాడుతూ- మునుపటి, ప్రస్తుత ఒలింపిక్స్‌ మధ్య వ్యత్యాసం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రస్తుత సమయంలో మహమ్మారి ప్రభావం ఎలా ఉన్నదని వాకబు చేశారు. అతని విస్తృతానుభవం భారత క్రీడాకారులందరికీ ఎంతగానో తోడ్పడుతుందని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరో దిగ్గజం మణికా బాత్రా (టేబుల్‌ టెన్నిస్‌)తో ప్రధానమంత్రి మాట్లాడుతూ- ఈ క్రీడలో పేదల పిల్లలకు శిక్షణ ఇవ్వడంపై ఆమెను విశేషంగా ప్రశంసించారు. ఆమె త్రివర్ణం చేతధరించి టేబుల్‌ టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేయడాన్ని కొనియాడారు. తన క్రీడా వ్యాసంగంలో ఒత్తిడిని అధిగమించేందుకు నాట్యంపై ఆమెకుగల అభిరుచి తోడ్పడుతున్నదా? అని అడిగి తెలుసుకున్నారు.

   ప్రధానమంత్రి ఆ తర్వాత వినేష్‌ ఫోగత్‌ (రెజ్లింగ్‌)తో మాట్లాడుతూ- కుటుంబ వారసత్వం నేపథ్యంలో ఆమెపై పెరిగిపోతున్న అంచనాల ఒత్తిడిని ఎలా తట్టుకోగలుగుతున్నదీ వాకబు చేశారు. ఆమె ముందున్న సవాళ్లను ప్రస్తావిస్తూ వాటిని ఏ విధంగా అధిగమించిందీ ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆమె తండ్రితో మాట్లాడుతూ- అందరికీ ఆదర్శప్రాయంగా కుమార్తెలను పెంచిన విధానం గురించి తెలుసుకున్నారు. అలాగే సాజన్‌ ప్రకాష్‌ (స్విమ్మింగ్‌)తో మాట్లాడుతూ- అతడు తీవ్ర గాయం నుంచి ఎలా కోలుకున్నదీ అడిగి తెలుసుకున్నారు. అటుపైన మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ)తో మాట్లాడుతూ- అతనితో ముచ్చటిస్తుంటే మేజర్‌ ధ్యాన్‌చంద్‌ వంటి హాకీ దిగ్గజాలు గుర్తుకొస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. వారి వారసత్వాన్ని భారత హాకీ జట్టు సజీవంగా కొనసాగించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

   ప్రధానమంత్రి ఆ తర్వాత సానియా మీర్జా (టెన్నిస్‌)తో మాట్లాడుతూ- ఈ క్రీడకు ప్రాచుర్యం పెరుగుతుండటం గురించి ప్రస్తావించారు. ఈ మేరకు కొత్త క్రీడాకారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమెను కోరారు. తన టెన్నిస్‌ క్రీడా భాగస్వామితో సమన్వయం గురించి ఈ సందర్భంగా ఆమెను వాకబు చేశారు. గడచిన 5-6 సంవత్సరాల్లో క్రీడల్లో వచ్చిన మార్పుల గురించి ఆమెతో ముచ్చటించారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత క్రీడారంగం అద్భుమైన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నదని, మన క్రీడాకారుల ప్రతిభా ప్రదర్శనలో అది ప్రతిబింబించగలదని సానియా మీర్జా పేర్కొన్నారు.

   ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- మహమ్మారి పరిస్థితుల కారణంగా భారత క్రీడాకారుల బృందానికి ఆతిథ్యం ఇవ్వలేకపోవడంపై చింతిస్తున్నానని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. మహమ్మారి వారి ప్రాక్టీస్‌ను కూడా దెబ్బతీయడమేగాక ఒలింపిక్స్‌ కూడా ఏడాదిపాటు వాయిదాపడేలా చేసిందని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల తరఫున నినదించాల్సిందిగా తన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేయడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ మేరకు ‘ఛీర్‌ ఫర్‌ ఇండియా’ (#Cheer4India) నినాదానికి లభించిన విశేష ప్రాచుర్యాన్ని గుర్తుచేశారు. దేశం మొత్తం వారికి వెన్నుదన్నుగా ఉన్నదని, ప్రజలందరి ఆశీర్వాదాలు వారికి మెండుగా లభిస్తాయని ఆయన చెప్పారు. కాగా, ‘ప్రజలంతా ‘నమో’ యాప్‌ (NaMo)ద్వారా మన క్రీడాకారుల కోసం నినదించాలని, దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని ఆయన తెలిపారు. “క్రీడా మైదానంలోకి ప్రవేశించే ముందు 135 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలే మీకందరికీ శతకోటి ఆశీర్వాదాలు” అని ప్రధానమంత్రి ప్రకటించారు.

   ఆత్మవిశ్వాసం, ధైర్యం, సానుకూల దృక్పథం.. ఈ మూడూ క్రీడాకారులందరిలో సహజంగా కనిపించే ప్రధాన లక్షణాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే క్రమశిక్షణ, అంకితభావం, దీక్ష.. ఇవి మూడూ కూడా క్రీడాకారులలో సర్వసాధారణంగా కనిపించే సుగుణాలని ఆయన చెప్పారు. అంతేకాకుండా పట్టుదల, పోటీతత్వం కూడా క్రీడాకారులలో సహజమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇదే తరహాలో అన్ని సుగుణాలూ నవభారతానికి సొంతమని, క్రీడాకారులు ఈ నవభారతాన్ని ప్రతిబింబిస్తూ జాతి భవిష్యత్తుకు చిహ్నాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. దేశం మొత్తం నేడు ఓ కొత్త ఆలోచనతో, సరికొత్త విధానంతో తమకు ఏ విధంగా మద్దతిస్తున్నదీ  క్రీడాకారులలో ప్రతి ఒక్కరికీ ప్రత్యక్షంగా తెలుసునని ప్రధానమంత్రి అన్నారు. దేశానికి ఇవాళ మీరిచ్చే ఉత్తేజం ఎంతో ముఖ్యమని క్రీడాకారులనుద్దేశించి అన్నారు. క్రీడాకారులు స్వేచ్ఛగా, పూర్తి సామర్థ్యంతో తమ క్రీడా నైపుణ్యానికి పదును పెట్టుకుంటూ ముందడుగు వేసేందుకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. క్రీడాకారులకు మద్దతుగా ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చిన మార్పుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.

   క్రీడాకారులకు మెరుగైన శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు, మంచి పరికరాలు సమకూర్చడానికి అన్నివిధాలా కృషి చేశామని ప్రధానమంత్రి చెప్పారు. అదేవిధంగా క్రీడాకారులదరికీ అంతర్జాతీయ క్రీడారంగ తోడ్పాటు కూడా కల్పించబడ్డాయని తెలిపారు. క్రీడారంగానికి చెందినవారి సూచనల మేరకు క్రీడా సంబంధ వ్యవస్థలన్నీ స్పందించి అగ్రప్రాధాన్యం ఇచ్చినందున స్వల్ప కాలంలోనే వినూత్న మార్పులు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్స్‌కు తొలిసారి ఇంత పెద్ద సంఖ్యలో భారత క్రీడాకారులు అర్హత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘సుదృఢ భారతం’, ‘ఖేలో ఇండియా’ వంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన చెప్పారు. అదేవిధంగా భారతదేశం నుంచి తొలిసారిగా అత్యధిక క్రీడల్లో మనవాళ్లు పాల్గొంటున్నారని, ఆ మేరకు వాటిలో పాల్గొనేందుకు క్రీడాకారులు కూడా తొలిసారి అర్హత సాధించగలిగారని ఆయన వెల్లడించారు.

   యువ భారత శక్తిసామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం చూస్తుంటే నవభారతానికి విజయం త్వరలోనే ఒక అలవాటుగా మారగలదన్న నమ్మకం తనకున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఈ విశ్వాసానికి అనుగుణంగా క్రీడాకారులందరూ తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచిస్తూ- వారిలో ఉత్సాహం నింపేలా “ఛీర్‌4ఇండియా” నినాదాన్ని అందుకోవాలని దేశ ప్రజలందరికీ ఆయన పిలుపునిచ్చారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features

Media Coverage

In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 సెప్టెంబర్ 2026
September 03, 2026

A- Rating to Third-Largest Wind Producer: How Modi’s Policies Are Rewriting India’s Global Rank