దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సేవా తీర్థ్, కర్తవ్య భవన్ నిర్మాణం: ప్రధానమంత్రి
మనం వికసిత్ భారత్ వైపు పయనిస్తున్న వేళ.. వలసవాద మనస్తత్వానికి సంబంధించిన ప్రతి జాడను భారత్‌ తొలగించుకోవడం చాలా ముఖ్యం: ప్రధానమంత్రి
రేస్ కోర్స్ రోడ్డు పేరు లోక్ కల్యాణ్ మార్గ్‌గా మార్పు.. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, అధికార గర్వంతో కూడిన మనస్తత్వాన్ని సేవా స్ఫూర్తిగా మార్చే ప్రయత్నం: ప్రధానమంత్రి
కొత్త ప్రధానమంత్రి కార్యాలయానికి సేవా తీర్థ్‌గా నామకరణం.. సేవ, సేవా స్ఫూర్తి అనేది దేశ ఆత్మ, అది భారత్‌ గుర్తింపు: ప్రధానమంత్రి

న్యూఢిల్లీలో నేడు జరిగిన సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనమందరం ఒక కొత్త చరిత్ర సృష్టిని వీక్షిస్తున్నామని పేర్కొన్నారు. 2082 విక్రమ సంవత్సరం నాడు ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి శుభ సందర్భంగా మాఘ 24, ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం 2026 ఫిబ్రవరి 13న ఉన్న శక సంవత్సరం 1947న భారత్‌ తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త ఆరంభానికి సాక్షిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రాల ప్రకారం విజయ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ రోజున తీసుకున్న సంకల్పం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన భారత్‌ అనే సంకల్పంతో మనమందరం నేడు సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్యంలో విజయానికి దైవిక ఆశీస్సులు మనకు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా తీర్థ్, ఈ కొత్త భవనాల నిర్మాణానికి గానూ ప్రధానమంత్రి కార్యాలయ బృందానికి, మంత్రివర్గ సచివాలయం, వివిధ శాఖల ఉద్యోగులతో సహా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మిక మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు, విధానాలు దక్షిణ బ్లాక్, ఉత్తర బ్లాక్ వంటి భవనాల నుంచే జరిగాయని ప్రధానమంత్రి తెలిపారు. ఆ కట్టడాలు బ్రిటీష్ సామ్రాజ్యానికి చిహ్నాలుగా నిర్మాంచారని,దేశాన్ని శతాబ్దాల పాటు బానిసత్వంలో బంధించి ఉంచాలనే ఉద్దేశంతో వాటిని నిర్మించారని ఆయన అన్నారు.

ఒకప్పుడు కోల్‌కతా దేశ రాజధానిగా ఉండేదని, అయితే 1905 బెంగాల్ విభజన సమయంలో అది బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలకు బలమైన కేంద్రంగా మారిందని శ్రీ మోదీ గుర్తు చేశారు. అందువల్ల 1911లో బ్రిటిష్ వారు రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత వలస పాలన అవసరాలు, మనస్తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తర బ్లాక్, దక్షిణ బ్లాక్ నిర్మాణాన్ని ప్రారంభించారని వివరించారు. రైసినా హిల్స్‌లోని భవనాలను ప్రారంభించినప్పుడు నాటి వైస్రాయ్ ఈ కొత్త కట్టడాలను బ్రిటిష్ చక్రవర్తి ఇష్టానుసారం నిర్మించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. బానిసత్వంలో ఉన్న భారత గడ్డపై బ్రిటన్ రాజు ఆలోచనలను రుద్దడానికి అవి ఒక మాధ్యమంగా ఉండేవని చెప్పారు. ఈ భవనాలు అన్నింటికంటే ఎత్తులో ఉండాలని, ఏదీ వాటికి సమానంగా ఉండకూడదనే ఉద్దేశంతో రైసినా హిల్స్‌ను ఎంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా, కొత్త సేవా తీర్థ్ సముదాయం కాంప్లెక్స్ కొండపై కాకుండా నేలకు (ప్రజలకు) మరింత దగ్గరగా అనుసంధానంగా ఉందని అన్నారు. వలసవాద మనస్తత్వాన్ని అమలు చేయడానికి దక్షిణ బ్లాక్, ఉత్తర బ్లాక్ నిర్మించగా.. నేడు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లు నిర్మించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ఏ రాజు ఆలోచనలనో ప్రతిబింబించవని, 140 కోట్ల మంది పౌరుల నిరీక్షణలను ముందుకు తీసుకెళ్లే పునాదిగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.. ఈ స్ఫూర్తితోనే ప్రధానమంత్రి సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లను దేశ ప్రజలకు అంకితం చేశారు.

 

21వ శతాబ్దపు తొలి త్రైమాసికం పూర్తయిందని, వికసిత్ భారత్‌ దృక్పథం కేవలం విధానాలు, పథకాల్లోనే కాకుండా.. పని ప్రదేశాల్లో, భవనాల్లో కూడా ప్రతిబింబించడం అత్యవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశాన్ని పరిపాలించే ప్రదేశాలు సమర్థవంతంగా, ఉత్తేజకరంగా, ఆకట్టుకునేలా, స్పూర్తిదాయకంగా ఉండాలని తెలిపారు. కొత్త సాంకేతికతలు వేగంగా పుట్టుకొస్తున్న తరుణంలో మౌలిక సదుపాయాల విస్తరణకు, కొత్త సాధనాలను అలవర్చుకోవడానికి పాత భవనాలు సరిపోవట్లేదని వివరించారు. దక్షిణ బ్లాక్, ఉత్తర బ్లాక్‌లలో స్థల సమస్యలు, పరిమిత సౌకర్యాలు ఉన్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దాదాపు వంద ఏళ్ల నాటివి కావడంతో అవి లోపల నుండి శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటితో పాటు ఇతర సవాళ్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సవాళ్ల గురించి దేశానికి నిరంతరం తెలియజేయడం ముఖ్యమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ప్రభుత్వానికి చెందిన అనేక మంత్రిత్వ శాఖలు ఢిల్లీలోని 50కి పైగా వేర్వేరు ప్రాంతాల నుంచి పనిచేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ మంత్రిత్వ శాఖల భవనాల అద్దె కోసమే ప్రతి ఏటా రూ. 1,500 కోట్లు ఖర్చు అవుతున్నాయని, అలాగే కార్యాలయాల మధ్య తిరిగే 8,000 నుంచి 10,000 మంది ఉద్యోగుల కోసం రోజువారీ రవాణా ఖర్చులు అవుతున్నాయని చెప్పారు. సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌ల నిర్మాణంతో ఈ ఖర్చులు తగ్గడమే కాకుండా ఉద్యోగుల సమయం కూడా ఆదా అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ మార్పుల మధ్య పాత భవనాల్లో గడిపిన సంవత్సరాల జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని శ్రీ మోదీ తెలిపారు. దేశానికి దిశానిర్దేశం చేస్తూ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఎన్నో కీలక నిర్ణయాలు అక్కడే తీసుకున్నట్లు ఆయన గుర్తుచేశారు. ఆ ప్రాంగణాలు భారత చరిత్రలో అమర భాగమని స్పష్టం చేశారు. అందుకే ఆ పాత భవనాన్ని దేశం కోసం ఒక మ్యూజియంగా అంకితం చేయాలని, దానిని యుగే యుగీన్ భారత్ మ్యూజియంలో భాగంగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ భవనం రాబోయే తరాలకు స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుందని, యువత ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చారిత్రక వారసత్వం వారికి మార్గనిర్దేశం చేస్తుందని ఆయన చెప్పారు.

 

అభివృద్ధి చెందిన భారత దేశ ప్రయాణంలో వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొంది ముందుకు సాగడం అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వలస పాలన చిహ్నాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ప్రధానమంత్రి నివాసాన్ని ‘రేస్ కోర్స్ రోడ్’ అని పిలిచేవారని.. ఉపరాష్ట్రపతికి ప్రత్యేక నివాసం ఉండేది కాదని, ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే రహదారిని ‘రాజ్‌పథ్’ అని పిలిచేవారని తెలిపారు. ప్రాణత్యాగం చేసిన సైనికుల కోసం గానీ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది కోసం గానీ స్వతంత్ర దేశంలో ఎటువంటి స్మారక చిహ్నాలు లేవని గుర్తు చేశారు. ఒక స్వేచ్ఛా దేశ రాజధాని ఇప్పటికీ వలసవాద ఆలోచనల్లోనే చిక్కుకుపోయిందని, ఢిల్లీలోని భవనాలు, బహిరంగ ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు అటువంటి చిహ్నాలతో నిండిపోయాయని శ్రీ మోదీ అన్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వలసవాద మనస్తత్వాన్ని ఇకపై కొనసాగించకూడదని 2014లో దేశం సంకల్పించిందని పేర్కొన్నారు. ఈ మనస్తత్వాన్ని మార్చడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించామని, దాని ఫలితంగానే అమరవీరుల గౌరవార్థం జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని, పోలీసుల ధైర్యసాహసాలను గుర్తించేందుకు పోలీసు స్మారక చిహ్నాన్ని నిర్మించామని ఆయన తెలిపారు. రేస్ కోర్స్ రోడ్ పేరును లోక్ కల్యాణ్ మార్‌గా మార్చడాన్ని ఆయన గుర్తు చేస్తూ.. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదని, అధికార గర్వంతో కూడిన వైఖరిని సేవా స్ఫూర్తిగా మార్చే ప్రయత్నమని వివరించారు.

ఈ నిర్ణయాల వెనుక లోతైన భావోద్వేగం, దార్శనికత ఉన్నాయని, ఇవి దేశ వర్తమానాన్ని, గతంతో, భవిష్యత్తుతో జాతీయ గర్వంతో అనుసంధానిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. ఒకప్పుడు రాజ్‌పథ్ అని పిలిచే ప్రదేశంలో సాధారణ పౌరులకు తగిన సౌకర్యాలు, ఏర్పాట్లు లేవని.. ఇప్పుడు కర్తవ్య పథ్‌గా మార్చడంతో అక్కడ కుటుంబాలు, పిల్లలు, పౌరుల కోసం ఒక శక్తిమంతమైన బహిరంగ ప్రదేశంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఇదే సముదాయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించామని, తద్వారా దేశ రాజధాని ఇప్పుడు గొప్ప వీరులను గౌరవిస్తూ, కొత్త తరానికి స్పూర్తినిస్తుందని తెలిపారు. రాష్ట్రపతి భవన్ సముదాయంలో కూడా మార్పులు చేశామని, మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చామని శ్రీ మోదీ గుర్తుచేశారు. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించినప్పుడు పాత భవనాన్ని మరచిపోలేదని దానికి రాజ్యాంగ సదన్‌గా కొత్త గుర్తింపునిచ్చామని వ్యాఖ్యానించారు. మంత్రిత్వ శాఖలన్నింటినీ ఒకే సముదాయంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ భవనాలకు ‘కర్తవ్య భవన్’ అని పేరు పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ పేరు మార్పులు కేవలం పదాల మార్పు మాత్రమే కాదని.. వలసవాద గుర్తుల నుంచి విముక్తి పొంది, సొంత గుర్తింపుతో కూడిన స్వతంత్ర భారతదేశం అనే నిరంతర సైద్ధాంతిక ఆలోచనను ప్రతిబింబిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రధానమంత్రి నూతన కార్యాలయానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టామనీ... ఈ సేవా స్ఫూర్తి భారత ఆత్మను, నిజమైన గుర్తింపును స్పష్టం చేస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. శివుని జ్ఞానంతో మానవాళికి సేవ చేయడం కేవలం ఆధ్యాత్మిక ఆలోచన మాత్రమే కాదనీ, జాతి నిర్మాణ తత్వమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. పాలన అంటే సేవ అని, బాధ్యత అంటే అంకితభావమని ఈ భవనం అందరికీ నిరంతరం గుర్తు చేస్తుందన్నారు. సేవ అనేది అత్యున్నత కర్తవ్యం అని బోధించే "సేవా పరమో ధర్మః" అనే సూక్తి ప్రధానమంత్రి కార్యాలయం, ప్రభుత్వ దార్శనికతను సూచిస్తుందని శ్రీ మోదీ ధ్రువీకరించారు. సేవా తీర్థ్ కేవలం ఒక పేరు కాదు సేవా సంకల్పం అని ఆయన పేర్కొన్నారు. పౌరులకు సేవ చేయడం ద్వారా ఈ పవిత్ర స్థలం సేవా ప్రతిజ్ఞను నెరవేర్చే పవిత్ర ప్రదేశంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. తీర్థం అంటే విముక్తి కలిగించేది, లక్ష్యాలను సాధించడంలో సహాయపడే సామర్థ్యం కలిగినది అనే అర్థం ఉందని ఆయన వివరించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడం, స్వయం-సమృద్ధి సాధించడం, లక్షలాది మందిని పేదరికం నుంచి విముక్తి చేయడం, దేశాన్ని వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి చేయడం వంటి లక్ష్యాలను కలిగి ఉందన్న ప్రధానమంత్రి... ఇవన్నీ సేవా శక్తి ద్వారానే సాకారమవుతాయని వ్యాఖ్యానించారు.

 

భారత్ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో దూసుకెళ్తున్నప్పుడు, అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నప్పుడు, వాణిజ్య ఒప్పందాల ద్వారా కొత్త ద్వారాలు తెరుస్తున్నప్పుడు, సంతృప్త లక్ష్యాల దిశగా వేగంగా పురోగమిస్తున్నప్పుడు... పనుల్లో సరికొత్త వేగంతో పాటు సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లపై పెరిగిన విశ్వాసం జాతీయ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ప్రతి శుభకార్యానికి ముందు సంక్షేమం కోసం సంకల్పం చేసుకోవాలని, అన్ని దిశల నుంచి వచ్చే గొప్ప ఆలోచనల ద్వారా మార్గనిర్దేశం జరగాలని భారతీయ సంస్కృతి బోధిస్తుందన్న ప్రధానమంత్రి... భారత్ వంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆలోచనలే నిజమైన బలం... వారి కలలే నిజమైన మూలధనం... వారి అంచనాలే ప్రాధాన్యం... వారి ఆకాంక్షలే మార్గదర్శక కాంతిగా ఉంటాయన్నారు. ఈ భావనే ఈ భవనపు ఆత్మ కావాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ప్రజల కలలను అర్థం చేసుకున్నప్పుడే విధానాలు సజీవంగా మారుతాయి. వారి ఆకాంక్షలను అనుభవించినప్పుడే నిర్ణయాలు ప్రభావవంతంగా మారుతాయి. అందుకే ఈ భావాలకు, భవనానికి మధ్య ఎటువంటి గోడలు, దూరం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.

గత పదకొండు సంవత్సరాల కాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో పౌరులే కేంద్రబిందువుగా ఉండే ఒక కొత్త పాలనా నమూనా ఉద్భవించిందని ప్రధానమంత్రి తెలిపారు. "నాగరిక్ దేవో భవ" అనేది కేవలం ఒక పదబంధం కాదనీ, పని సంస్కృతి అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ఈ కొత్త భవనాల్లోకి ప్రవేశించగానే ఈ స్ఫూర్తిని స్వీకరించాలి. సేవా తీర్థంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, కదిలిన ప్రతి దస్త్రం, గడిపిన ప్రతి క్షణం 140 కోట్ల మంది పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి అంకితం కావాలని శ్రీ మోదీ ప్రకటించారు. ప్రతి అధికారి, ఉద్యోగి, కర్మయోగి భవనంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ రోజు తాము చేసే పని లక్షలాది మంది పౌరుల జీవితాలను సులభతరం చేస్తుందా అని తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు. ఈ ఆత్మపరిశీలన ఈ స్థలానికి గొప్ప బలం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

 

గత పదకొండు సంవత్సరాల కాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో పౌరులే కేంద్రబిందువుగా ఉండే ఒక కొత్త పాలనా నమూనా ఉద్భవించిందని ప్రధానమంత్రి తెలిపారు. "నాగరిక్ దేవో భవ" అనేది కేవలం ఒక పదబంధం కాదనీ, పని సంస్కృతి అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ఈ కొత్త భవనాల్లోకి ప్రవేశించగానే ఈ స్ఫూర్తిని స్వీకరించాలి. సేవా తీర్థంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, కదిలిన ప్రతి దస్త్రం, గడిపిన ప్రతి క్షణం 140 కోట్ల మంది పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి అంకితం కావాలని శ్రీ మోదీ ప్రకటించారు. ప్రతి అధికారి, ఉద్యోగి, కర్మయోగి భవనంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ రోజు తాము చేసే పని లక్షలాది మంది పౌరుల జీవితాలను సులభతరం చేస్తుందా అని తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు. ఈ ఆత్మపరిశీలన ఈ స్థలానికి గొప్ప బలం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

మనం అధికారాన్ని ప్రదర్శించడానికి కాదు... బాధ్యతను నెరవేర్చడానికి వచ్చామని స్పష్టం చేస్తూ... పరిపాలన సేవా స్ఫూర్తితో నడిచినప్పుడే ఫలితాలు అసాధారణంగా ఉంటాయని శ్రీ మోదీ అన్నారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడిన తీరును, మన ఆర్థిక వ్యవస్థ కొత్త ఊపును పొందిన తీరునూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

అభివృద్ధి చెందిన భారత్-2047 కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదనీ... ప్రపంచం ఎదుట భారత్ చేసిన ప్రతిజ్ఞ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అందువల్ల ఇక్కడ తీసుకునే ప్రతి విధానం, నిర్ణయం నిరంతర సేవా స్ఫూర్తితో ప్రేరణ పొందాలన్నారు. అధికారులు పదవీ విరమణ చేసినప్పుడు, ఈ భవనం నుంచి వెళ్లిపోయినప్పుడు... వారు ఇక్కడ తమకు గల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారన్నారు. సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లో పనిచేసిన ప్రతి క్షణం పౌరులకు సేవ చేయడానికి అంకితమైందనీ, ఇక్కడ తీసుకున్న ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాల కోసం మాత్రమేనని గుర్తుచేసుకుని వారు ఎంతో మంచి అనుభూతిని పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది వారి గొప్ప విజయం, వ్యక్తిగత మూలధనం అవుతుంది. వారి జీవితాలను గర్వంతో నింపుతుంది అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

కర్తవ్యమనే పునాది ద్వారా హక్కులనే గొప్ప భవనం నిర్మితమవుతుందనే మహాత్మా గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి... విధి నిర్వహణలో అతి పెద్ద సవాళ్లనూ ఎదుర్కోవచ్చు, పరిష్కరించవచ్చని వ్యాఖ్యానించారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు కర్తవ్యానికి బలమైన ప్రాధాన్యమిచ్చారనీ, కోట్లాది మంది పౌరుల కలలు ఈ పునాదిపైనే ఆధారపడి ఉన్నాయని శ్రీ మోదీ గుర్తు చేశారు. కర్తవ్యం అనేది ప్రారంభం, జీవనాడి అని... కరుణ, శ్రద్ధలతో ఇది కట్టుబడి ఉంటుందని... తీర్మానాల ఆశ అని... కృషికి పరాకాష్ట అని... ప్రతి సమస్యకు పరిష్కారమనీ... అభివృద్ధి చెందిన భారత్ నమ్మకమూ ఇదేనని శ్రీ మోదీ వివరించారు. కర్తవ్యం సమానత్వం అని, కర్తవ్యం అనురాగం అని, కర్తవ్యం సార్వత్రికమైనది, సర్వవ్యాప్తమైనదని, "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్" స్ఫూర్తితో అల్లుకున్నదని ఆయన ప్రకటించారు. దేశం పట్ల అంకితభావం, ప్రతి జీవితాన్ని వెలిగించే సంకల్ప శక్తి, స్వయం-సమృద్ధ భారత్ ఆనందం, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు హామీ, భరతమాత శక్తి పతాకధారి, "నాగరిక్ దేవో భవ" స్ఫూర్తిని మేల్కొలిపే మార్గంగా కర్తవ్యాన్ని ఆయన ఆయన అభివర్ణించారు. ఈ అత్యున్నత కర్తవ్య స్ఫూర్తితో అందరూ సేవా తీర్థ్‌లోకి, కొత్తగా నిర్మించిన సముదాయాల్లోకి ప్రవేశించాలని ఆయన కోరారు.

 

సరికొత్త శిఖరాలు, నూతన యుగం దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి... రాబోయే సంవత్సరాల్లో భారత గుర్తింపు దాని ఆర్థిక వ్యవస్థ ద్వారా మాత్రమే కాకుండా, పాలన నాణ్యత, విధానాల స్పష్టత, కర్మయోగుల అంకితభావం ద్వారా నిర్వచితమవుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లో తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం ఒక దస్త్రానికి ఆమోదం మాత్రమే కాదనీ, అభివృద్ధి చెందిన భారత్-2047 దార్శనికత సాకారానికి దిశను రూపొందిస్తుందని ఆయన తెలిపారు. 2047 కేవలం తేదీ మాత్రమే కాదనీ... 140 కోట్ల మంది కలల కాలక్రమన్నారు. ఇక్కడ ప్రతి సంస్థ, ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి, ప్రతి కర్మయోగి ముఖ్యమైనవారని ఆయన గుర్తు చేశారు. సేవా తీర్థ్ సున్నితమైన పాలనకు చిహ్నంగా, పౌర కేంద్రిత పరిపాలన ఆదర్శంగా మారాలనీ... ఇక్కడ అధికారం కంటే సేవ గొప్పదిగా, పదవి కంటే నిబద్ధత గొప్పదిగా, అధికారం కంటే బాధ్యత గొప్పదిగా ఉండాలనే తన దార్శనికతను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. ఈ సంకల్పం సరికొత్త చరిత్రను లిఖిస్తుందని, సమష్టి కృషి రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేస్తుందని ఆయన తన విశ్వాసాన్ని ధ్రువీకరించారు. "ఇది సరైన సమయం, ఇదే సరైన సమయం" అని ఎర్రకోట నుంచి తాను చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రతి క్షణాన్ని "దేశం ముందు" అనే స్ఫూర్తితో ఉపయోగించుకోవాలని శ్రీ మోదీ కోరారు. తద్వారా భారత్ తన విధిని పునర్నిర్వచించుకుని, వెయ్యి సంవత్సరాల ఉజ్వల భవిష్యత్తు దిశగా తొలి అడుగు వేసిన సమయం ఇదేనని భవిష్యత్తు శతాబ్దాలు చెబుతాయన్నారు. ఈ దృఢ నిశ్చయంతో, అందరికీ మరోసారి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, భారత ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందుగా సేవా తీర్థ్ భవన సముదాయం పేరును ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 లను అధికారికంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవం భారత పాలనా రంగంలో ఒక పరివర్తనాత్మక మైలురాయిని సూచిస్తుంది. ఆధునిక, సమర్థమైన, అందరికీ అందుబాటులో ఉండే, పౌర-కేంద్రిత పాలనా వ్యవస్థను నిర్మించాలనే ప్రధానమంత్రి నిబద్ధతనూ ప్రతిబింబిస్తుంది.

 

దశాబ్దాలుగా, అనేక కీలక ప్రభుత్వ కార్యాలయాలు,మంత్రిత్వ శాఖలు సెంట్రల్ విస్టా ప్రాంతంలోని బహుళ ప్రదేశాల్లో విస్తరించి ఉన్న శిథిలమైన, పురాతన మౌలిక సదుపాయాల నుంచే పనిచేస్తున్నాయి. ఇది కార్యాచరణ అసమర్థతలు, సమన్వయ సవాళ్లు, నిర్వహణ ఖర్చులు పెరగడం, అనుకూలత లేని పని వాతావరణాల వంటి సమస్యలకు దారితీసింది. ఆధునికమైన, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండే సౌకర్యాల్లో పరిపాలనా విధులను ఏకీకృతం చేయడం ద్వారా కొత్త భవన సముదాయాలు ఈ సమస్యలను పరిష్కరిస్తాయి.

సేవా తీర్థ్‌లో ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సచివాలయం, మంత్రివర్గ సచివాలయం ఉన్నాయి. ఇవన్నీ గతంలో వేర్వేరు ప్రదేశాల్లో ఉండేవి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖ, చట్టం-న్యాయ మంత్రిత్వ శాఖ, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహా అనేక కీలక మంత్రిత్వ శాఖలు కర్తవ్య భవన్-1, 2 లలో ఉన్నాయి.

రెండు భవన సముదాయాల్లో డిజిటల్‌గా సమీకృత కార్యాలయాలు, నిర్మాణాత్మక పబ్లిక్ ఇంటర్‌ఫేస్ జోన్‌లు, కేంద్రీకృత రిసెప్షన్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ లక్షణాలు సహకారం, సామర్థ్యం, సజావైన పాలన, పౌరుల భాగస్వామ్యం, ఉద్యోగుల శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. 4-స్టార్ గృహ (జీఆర్ఐహెచ్ఏ) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ సముదాయాలు పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, నీటి సంరక్షణ చర్యలు, వ్యర్థాల నిర్వహణ పరిష్కారాలు, మెరుగైన-పనితీరు గల భవన కవచాలను కలిగి ఉంటాయి. ఈ చర్యలు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతూనే పర్యావరణంపై ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. భవన సముదాయాల్లో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌లు, నిఘా నెట్‌వర్క్‌లు, అధునాతన అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాల వంటి సమగ్ర భద్రత, రక్షణ విధానాలూ ఉన్నాయి. ఇవి అధికారులు, సందర్శకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభూతిని నిర్ధారిస్తాయి.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting determination, perseverance, and continuous effort in overcoming life's challenges
August 13, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the power of determination, perseverance, and courage in overcoming life's challenges and turning adverse circumstances into favorable ones.

The Prime Minister wrote on X;

"दैवं पुरुषकारेण यः समर्थः प्रबाधितुम्।

न दैवेन विपन्नार्थः पुरुषः सोऽवसीदति॥"

A person who possesses the determination, perseverance and courage to turn adverse circumstances into favorable ones is never defeated by the challenges of life. Instead, through continuous effort and unwavering resolve, he moves forward and ultimately achieves success.