సర్వతోముఖాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి
నేడు అజ్మీర్ నుంచి దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా ప్రచారాన్ని ప్రారంభించడంతోపాటు.. అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, యువతకు నియామక లేఖలు పంపిణీ చేసే అదృష్టం నాకు లభించింది: ప్రధానమంత్రి
హెచ్‌పీవీ టీకా ప్రచారం అజ్మీర్ నుంచి ప్రారంభమైంది. ఇది దేశంలోని మహిళా శక్తిని శక్తిమంతం చేసే దిశగా ఒక కీలక అడుగు: ప్రధానమంత్రి
రాజస్థాన్ వారసత్వం, అభివృద్ధి రెండింటినీ మేళవించి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది: ప్రధానమంత్రి
మా ప్రభుత్వం ప్రారంభించిన నదుల అనుసంధాన ఉద్యమం రాజస్థాన్‌కు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది: ప్రధానమంత్రి
రాజస్థాన్‌లో సూర్యరశ్మికి కొరత లేదు, ఈ ఎండ సామాన్యులకు పొదుపు, ఆదాయ వనరుగా మారుతోంది: ప్రధానమంత్రి
రాజస్థాన్ తలరాతను మార్చే శక్తి పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకానికి ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది: ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అజ్మీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా సుర్సురాలోని తేజాజీ ధామ్ వంటి ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రాలకు, హైఫా విముక్తిలో కీలక పాత్ర పోషించిన మేజర్ దల్పత్ సింగ్ వీరత్వానికి నివాళులర్పించారు. మేజర్ దల్పత్ సింగ్ ధైర్యసాహసాలు నేటికీ ఇజ్రాయెల్‌లో గౌరవం పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.

రాజస్థాన్‌లోని ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ రెండు సంవత్సరాల వేగవంతమైన పురోగతిని పూర్తి చేసుకోవడంపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు సేవ చేసేందుకు ఏ అభివృద్ధి హామీలతో అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాటిని క్రమంగా నెరవేరుస్తోంది. ఈ అభివృద్ధి ఉద్యమన్ని మరింత వేగవంతం చేసే రోజు ఇది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. రోడ్లు, విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య వంటి వివిధ రంగాలలో సుమారు రూ. 17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇవి రాజస్థాన్ ప్రజల సౌకర్యాలను పెంచడమే కాకుండా, యువతకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.

 

నేడు 21,000 మందికి పైగా కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయడం ద్వారా రాష్ట్ర యువతకు కొత్త శకం ప్రారంభమైందని శ్రీ మోదీ అన్నారు. దేశవ్యాప్త హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రచారాన్ని అజ్మీర్ నుంచి ప్రారంభిస్తూ.. ఇది భారతదేశ మహిళా శక్తిని సాధికారం చేయడంలోను, తల్లులు, కుమార్తెల ఆరోగ్యాన్ని కాపాడటంలోను కీలకమైన చర్య అని అభివర్ణించారు. ‘‘కుటుంబంలో తల్లి అనారోగ్యం పాలైతే ఇల్లంతా చెల్లాచెదురవుతుందని మనందరికీ తెలుసు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ప్రతి సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోగలదు. ఇదే భావనతో మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది’’ అని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు.

మహిళల ఆరోగ్యం, గౌరవం పట్ల ప్రభుత్వానికి ఉన్న సున్నితమైన దృక్పథాన్ని ప్రధానమంత్రి వివరించారు. టాయిలెట్ల నిర్మాణం, శానిటరీ ప్యాడ్ల పంపిణీ, ఉజ్వల గ్యాస్ పథకం వంటి పరిష్కారాలను అత్యంత ప్రాధాన్యతతో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భధారణ సమయంలో పౌష్టికాహారాన్ని అందించేందుకు సోదరీల ఖాతాల్లో రూ. 5,000 జమ చేసే సురక్షిత మాతృత్వ పథకాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో ఉన్న నిర్లక్ష్యపు సంస్కృతిని వీడి, సున్నితత్వంతో కూడిన బాధ్యతాయుత పాలన వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.

మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతూ.. రోడ్డు, రైలు, విమానయాన రంగాల్లో ఆధునిక అనుసంధానం రాజస్థాన్ తలరాతను మారుస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అజ్మీర్-పుష్కర్ వంటి ప్రాంతాల్లో మెరుగైన ప్రయాణ సౌకర్యాలు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని, ఇది స్థానిక వ్యాపారులు, కళాకారులు, టాక్సీ డ్రైవర్లకు మద్దతుగా నిలుస్తుందని ఆయన వివరించారు. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ చుట్టూ నిర్మితమవుతున్న మౌలిక సదుపాయాలు రాజస్థాన్‌ను ప్రపంచ పెట్టుబడులకు ‘అవకాశాల గని’గా మారుస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.

 

ప్రపంచ వేదికపై భారత్‌ ఎదుగుతున్న తీరు గురించి శ్రీ మోదీ ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సు గురించి, భారతదేశ దేశ ప్రగతిని, శౌర్యాన్ని ప్రశంసించిన  తన ఇజ్రాయెల్ పర్యటన గురించి ప్రస్తావించారు. ‘‘ప్రపంచంలోని అనేక దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఈ సదస్సుకు వచ్చారు. పెద్ద కంపెనీల అధినేతలు వచ్చారు. ప్రతి ఒక్కరూ భారత్‌ను బహిరంగంగా ప్రశంసించారు’’ అని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు.

గత 11 ఏళ్లలో భారత సాయుధ దళాల విజయాలను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. ‘‘భారత సైన్యం ప్రతి సందర్భంలోను ఉగ్రవాదులకు, దేశ శత్రువులకు గట్టి దెబ్బ కొట్టింది. ప్రతి మిషన్‌లోనూ, ప్రతి సరిహద్దులోనూ మన సైన్యం విజయం సాధించింది. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు మన సైనికులు తమ సత్తా చాటారు’’ అని కొనియాడారు.

 

రైతుల దీర్ఘకాల సమస్యలను ప్రస్తావిస్తూ.. ఈఆర్‌సీపీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ‘పార్వతి-కాళిసింధ్-చంబల్’, ‘యమునా-రాజస్థాన్’ నదుల అనుసంధాన ప్రాజెక్టుల ద్వారా ఝలావర్, బరాన్, కోట, బండి ప్రాంతాల రైతులకు నిర్ధిష్ట, గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.

 

రాజస్థాన్‌కు సూర్యరశ్మి ద్వారా శ్రేయస్సు పొందే అపారమైన సామర్థ్యం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.78,000 ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. రాజస్థాన్‌లో ఇప్పటికే 1.25 లక్షలకు పైగా కుటుంబాలు ఈ పథకంలో చేరాయని, దీనివల్ల చాలా ఇళ్లలో విద్యుత్ బిల్లులు దాదాపు సున్నాకి చేరుకుంటున్నాయని చెప్పారు. ‘వికసిత్‌ రాజస్థాన్ ద్వారా వికసిత్‌ భారత్’ అనే మంత్రాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుభిక్షమైన, సంపన్నమైన జీవితాన్ని గడపాలన్నదే తన దార్శనికత అని శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance

Media Coverage

India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 ఆగష్టు 2026
August 27, 2026

Make in India Goes Global: Engineering Boom, Rice Triumph & EU FTA Breakthrough Under PM Modi