* ఈరోజు పీఏం-కిసాన్ పథకం 19వ విడత నిధులను విడుదల చేసే అవకాశం కలిగింది... మన సన్నకారు రైతులకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉండటం సంతృప్తిని కలిగిస్తోం ది : ప్రధానమంత్రి
* మఖానా వికాస్ బోర్డు ఏర్పాటు వల్ల ఆ పంట సాగు చేసే బీహార్ రైతులకు గొప్ప లబ్ధి చేకూరుతుంది.. మఖానా పంట సాగు, శుద్ధి, విలువ పెంపు, మార్కెటింగుల్లో బోర్డు సహాయకారిగా ఉంటుందన్న ప్రధానమంత్రి
* ఎన్డీఏ ప్రభత్వం లేనిదే బీహార్ సహా దేశంలోని రైతులెవరికీ పీఏం కిసాన్ సమ్మాన్ నిధి ఫలాలు దక్కేవి కావు .. గత 6 ఏళ్ళలో పథకానికి చెందిన ప్రతి పైసా నేరుగా అన్నదాతల ఖాతాల్లోకి చేరిందన్న ప్రధానమంత్రి
* సూపర్ ఫుడ్ మఖానా కానివ్వండి, భాగల్పూర్ పట్టు కానివ్వండి, బీహార్ కే ప్రత్యేకమైన ఉత్పత్తులను ప్రపంచ విపణులకు చేర్చడమే లక్ష్యమన్న ప్రధానమంత్రి
* పీఏం ధన-ధాన్య యోజన, వ్యవసాయంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో పంట దిగుబడిని పెంచడమే కాక రైతులను సాధికారులను చేస్తుందన్న ప్రధానమంత్రి
* ఈరోజు ఎఫ్పీఓ 10,000వ కేంద్రం ప్రారంభానికి బీహార్ సాక్షిగా నిలిచింది... దేశవ్యాప్తంగా గల రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులకు అభినందనలు... అన్న ప్రధానమంత్రి

వ్యవసాయదారుల సంక్షేమమే పరమావధిగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పీఏం కిసాన్ పథకం 19వ విడత నిధులను బీహార్ భాగల్పూర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించారు. అంతర్జాలం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రధాని స్వాగతం పలికారు. మహాకుంభ్ పావన సందర్భంలో మందరాంచల్ ప్రాంతంలోకి  అడుగు పెట్టడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.  ఆధ్యాత్మికత, వారసత్వ సంపదలకు ఆలవాలమైన ఈ ప్రాంతం వికసిత్ భారత్ లక్ష్యానికి కూడా అనువైనదని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు తిల్కా మాంఝీ స్మృతికే గాక భాగల్పూర్ పట్టు నగరంగా కూడా ప్రసిద్ధి చెందిందన్నారు. బాబా అజ్గైబినాథ్ నడయాడిన పవిత్ర క్షేత్రంలో, రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు. ఇటువంటి శుభదినాల్లో పీఏం కిసాన్ 19వ విడత నిధులను విడుదల చేసే అదృష్టం తనకు దక్కిందని, సుమారు రూ. 22,000 కోట్ల సొమ్ము ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ అయ్యిందన్నారు.

పీఏం కిసాన్ పథకం లబ్ధి పొందుతున్న 75 లక్షల బీహార్ రైతు కుటుంబాలకి ఈరోజు పథకం 19వ విడత నిధులను విడుదల చేశామన్నారు. బీహార్ అన్నదాతల ఖాతాల్లోకి ఈరోజు రూ. 1600 కోట్ల మేర సొమ్ము జమ అయ్యిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని బీహార్ రైతు కుటుంబాలు సహా దేశంలోని అన్ని వ్యవసాయ కుటుంబాలకు  అభినందనలు తెలియజేశారు.

తన ఎర్రకోట ప్రసంగంలోని భాగాలను గుర్తుచేస్తూ,  “పేదలు, రైతులు, యువత, మహిళలు వికసిత్ భారత్‌ కు గల నాలుగు ప్రధాన స్తంభాలు” అన్నారు.  కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా రైతుల సంక్షేమమే తమ ప్రాధాన్యమన్నారు. "గత దశాబ్దంలో రైతుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి మేము పూర్తి శక్తియుక్తులను వెచ్చించాం" అని శ్రీ మోదీ అన్నారు. రైతులకు మంచి విత్తనాలు, సరిపడే మొత్తంలో అందుబాటు ధరల్లో ఎరువులు, నీటిపారుదల సౌకర్యాలు, వారి పశువులకు వ్యాధుల నుంచి రక్షణ,  విపత్తుల సమయంలో నష్టాల నుంచి భద్రత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. గతంలో రైతులు ఈ సమస్యలన్నిటితో సత్యమతమయ్యేవారని, తమ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చివేసిందని, ఇటీవలి సంవత్సరాలలో వందలాది ఆధునిక విత్తన రకాలను రైతులకు అందించామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గతంలో యూరియా కోసం రైతులు ఆగచాట్లు పడేవారని, అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కోవలసి వచ్చేదని, అదే ఈరోజున రైతులకు సరిపడా ఎరువులు అందుతున్నాయని తెలిపారు. మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని గుర్తు చేసిన శ్రీ మోదీ, తమ ప్రభుత్వం అధికారంలోకి రాకుంటే ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే ఉండేవారని వ్యాఖ్యానించారు. మూతపడ్డ బరౌని ఎరువుల కర్మాగారం ఇప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించేది కాదని అభిప్రాయపడ్డారు. భారతీయ రైతులు ఎరువుల బస్తా ఒక్కింటికి రూ.300 కంటే తక్కువ ధరను చెల్లిస్తూ ఉంటే, అనేక దేశాల్లో అదే బస్తాకి రూ.3,000 చెల్లిస్తున్నారని చెప్పారు. రూ. 3,000 విలువ చేసే యూరియా సంచులు రైతులకు అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రధానమంత్రి వెల్లడించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తుందని హామీ ఇచ్చారు.  రైతులు యూరియా, డీఏపీ నిమిత్తం  ఖర్చు పెట్టవలసిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో రైతులు ఖర్చు చేయవలసిన రూ.12 లక్షల కోట్లు సొమ్మును వారి తరుఫున కేంద్ర ప్రభుత్వమే భరించిందని శ్రీ మోదీ అన్నారు. దీని వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కోట్లాది రూపాయల మేర డబ్బు ఆదా అయిందని ఆయన తెలిపారు.

పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గడిచిన ఆరేళ్లలో రూ.3.7 లక్షల కోట్లు రైతుల ఖాతాలకు నేరుగా జమ చేసినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందలేకపోయిన చిన్న, సన్నకారు రైతులు ఇప్పుడు పూర్తిస్థాయి ప్రయోజనాలను పొందుతున్నారని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని మధ్యవర్తులు దోచుకోకుండా నివారించడంలో కేంద్ర ప్రభుత్వం అలాగే నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విజయం సాధించాయన్నారు. మేం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న మొత్తం గత ప్రభుత్వాల వ్యవసాయ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని ప్రధానమంత్రి తెలిపారు. రైతుల సంక్షేమం పట్ల నిబద్ధత గల ప్రభుత్వాలతోనే ఇది సాధ్యమవుతుందన్న శ్రీ మోదీ, అవినీతిలో కూరుకుపోయిన వారు ఇలాంటి పనులు చేయలేరని విమర్శించారు.
 

గత ప్రభుత్వాలు రైతుల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదన్న ప్రధానమంత్రి, కరువులు, వరదల వంటి విపత్తుల సమయాల్లో రైతులు ఎన్నో కష్టాలుపడి కడుపునింపుకునే పరిస్థితులు గతంలో ఉండేవన్నారు. 2014లో తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎమ్ ఫసల్ బీమా యోజన ద్వారా రైతులు విపత్తుల సమయంలో నష్టపోయిన పంటల కోసం రూ.1.75 లక్షల కోట్ల పరిహారం పొందారని ప్రధానమంత్రి తెలిపారు.

భూమిలేని, చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం తమ ప్రభుత్వం పశుపోషణను ప్రోత్సహించిందని ప్రధానమంత్రి తెలిపారు. "లఖ్‌పతి దీదీలు" సైతం పశుపోషణ ద్వారా వారి ఆదాయాన్ని పెంచుకున్నారనీ, ఇప్పటివరకు బీహార్‌లోని వేలాదిమంది జీవికా దీదీలతో పాటుగా దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు (లఖ్‌పతి దీదీలు) గా మారారని ప్రధాని వివరించారు. “గత దశాబ్ద కాలంలో దేశంలో పాల ఉత్పత్తి 14 కోట్ల టన్నుల నుంచి 24 కోట్ల టన్నులకు పెరిగి, నేడు ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానానికి చేరింది” అని తెలిపిన ప్రధానమంత్రి, ఈ విషయంలో బీహార్ పాత్రను ప్రశంసించారు. బీహార్ పాల సహకార సంఘాలు రోజుకు 30లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తూ, ఏడాదికి సుమారు 3వేల కోట్ల రూపాయలను స్థానిక పాడి రైతులు, మాతృమూర్తులు, సోదరీమణుల ఖాతాల్లో జమ చేస్తున్నాయని ఆయన తెలిపారు.

పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ నైపుణ్యంతో దానిని అబివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీ రాజీవ్ రంజన్ కృషిని ప్రశంసిస్తూ, వారి కృషి కారణంగా బీహార్‌లో వేగంగా పురోగమిస్తున్న రెండు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రస్తావించారు. మోతీహారీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నాణ్యమైన దేశీయ పశు జాతులను అభివృద్ధి చేస్తుండగా, బరౌనీలోని పాల ప్లాంట్ 3లక్షల మంది పాడి రైతులకు ప్రయోజనకరంగా ఉంటూ, యువతకు ఉపాధి అవకాశాలను అందించడం పట్ల ప్రధాననమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
 

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మత్స్యకారులు, పడవల యజమానులకు తమ ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను ఇచ్చి అండగా నిలిచిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. తమ ప్రభుత్వ కృషి కారణంగా, చేపల ఉత్పత్తిలో గతంలో దేశంలోని పది రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న బీహార్, నేడు గణనీయ పురోగతితో మొదటి ఐదు రాష్ట్రాల సరసన నిలిచిందని ఆయన పేర్కొన్నారు. మత్స్యరంగ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో చిన్న రైతులు, మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం కలిగిందన్న ప్రదానమంత్రి, భాగల్పూర్ గంగా డాల్ఫిన్స్ కోసం ప్రసిద్ధిగాంచడం నమామి గంగే ప్రచారం సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు.

“మా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యలతో భారత వ్యవసాయ సంబంధ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి” అని ప్రదానమంత్రి తెలిపారు. ఫలితంగా రైతులు వారి ఉత్పత్తులకు అధిక ధరలు పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎగుమతి చేయని ఎన్నో ఉత్పత్తులు నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్నాయన్న శ్రీ నరేంద్ర  మోదీ, ఇప్పుడు బీహార్ మఖానా ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించే సమయం వచ్చిందన్నారు. భారత నగరాల్లో అత్యుత్తమ అల్పాహారంగా మఖానా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన మఖానా బోర్డు ఏర్పాటు రైతులకు మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ పెంపు, మార్కెటింగ్ వంటి అంశాల్లో సహాయకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.

బీహార్ రైతులు, యువత కోసం బడ్జెట్‌లో ప్రస్తావించినట్లుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్  ఎంట్రప్రెన్యూర్‌షిప్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి, తూర్పు భారతంలో ఆహార శుద్ధి రంగానికి బీహార్ ప్రధాన కేంద్రంగా మారనుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భాగల్పూర్‌లో ఏర్పాటు చేయబోయే కేంద్రం జర్దాలు రకం మామిడి పంటపై దృష్టిసారించనుండగా, ముంగేర్, బక్సర్‌లలో ఏర్పాటు చేయనున్న కేంద్రాలు టమాట, ఉల్లి, అలాగే బంగాళాదుంప రైతులకు సహాయం చేస్తాయని శ్రీ మోదీ వివరించారు. రైతులకు ప్రయోజనం కలిగించే ఏ అవకాశాన్నీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఆయన స్పష్టం చేశారు.

“భారత్ వస్త్రాల ప్రధాన ఎగుమతిదారుగా మారుతోంది” అని తెలిపిన ప్రధానమంత్రి, వస్త్రరంగ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భాగల్పూర్ పట్టు, టస్సర్ పట్టుకు దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్న శ్రీ మోదీ, అందుకే భాగల్పూర్ చెట్లకు బంగారం పండుతుందనే పేరు వచ్చిందని తెలిపారు. ఫ్యాబ్రిక్, నూలు డైయింగ్ యూనిట్స్, ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు సహా పట్టు పరిశ్రమ కోసం మౌలికవసతులను మెరుగుపరిచేందుకు కేంద్రం ఎంతగానో కృషి చేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. దీని ద్వారా భాగల్పూర్ నేతన్నలకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు, వారి ఉత్పత్తులు ప్రపంచంలోని ప్రతి మూలకూ చేరేందుకు వీలు కలిగిందన్నారు.
 

సరిపడా వంతెనలు లేకపోవడం రాష్ట్రంలో అనేక సమస్యలకు కారణంగా పేర్కొన్న శ్రీ మోదీ, నదులపై సాధ్యమైనన్ని వంతెనలు నిర్మించడం ద్వారా బీహార్‌లో రవాణా ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గంగానదిపై రూ.1100 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల రహదారి వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు.  

బీహార్‌లో వరద నష్టాలను తగ్గించడం కోసం వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చిన పశ్చిమ కోసి కాలువ ఈఆర్ఎమ్ ప్రాజెక్టు ద్వారా మిథిలాంచల్ ప్రాంతంలోని 50వేల ఎకరాలకు సాగునీరంది, లక్షలాది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుందని తెలిపారు.  

 “రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మా ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది” అని తెలిపిన ప్రధానమంత్రి, దిగుబడులు పెంచడం, పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, మరిన్ని ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు, భారత ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కి చేర్చడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ప్రపంచంలోని ప్రతీ వంటగదిలో భారత్‌లో పండిన ఒక్క ఉత్పత్తి అయినా ఉండాలనే దార్శనికతకు అనుగుణంగా పీఎమ్ ధన్ ధాన్య యోజనను ప్రకటించామన్నారు. ఈ పథకం కింద అత్యంత తక్కువ పంట ఉత్పత్తులు ఉన్న 100జిల్లాలను గుర్తించి, అక్కడ వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పప్పుల సాగులో స్వయంసమృద్ధి సాధన కోసం విశేష కృషి జరుగుతుందనీ, దీనికోసం పప్పులు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, కనీస మద్దతు ధరను సైతం పెంచినట్లు ప్రదానమంత్రి వివరించారు.

దేశంలో పదివేల ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమైన ఈరోజు చాలా ప్రత్యేకమైనదిగా శ్రీ మోదీ అభివర్ణించారు. మొక్కజొన్న, వరి, అరటి పంటలపై ప్రధానంగా దృష్టిసారించే ఈ పదివేలో ఎఫ్‌పీఓ బీహార్‌లోని ఖగారియా జిల్లాలో నేడు ఏర్పాటు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌పీఓలు కేవలం సంస్థలు మాత్రమే కాదనీ, రైతుల ఆదాయాన్ని పెంచే అపూర్వ శక్తి కేంద్రాలని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఎఫ్‌పీఓల ద్వారా చిన్న రైతులకు నేరుగా గణనీయ ప్రయోజనాలు, అపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 30లక్షల మంది ఈ ఎఫ్‌పీఓలతో అనుబంధం కలిగి ఉండగా వారిలో 40శాతం మంది మహిళలే కావడం విశేషమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ రంగంలో ప్రస్తుతం వేల కోట్ల వ్యాపారం జరుగుతుందన్న శ్రీ మోదీ, ఈ సందర్భంగా ఎఫ్‌పీఓల సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.
 

బీహార్ పారిశ్రామిక అభివృద్ధిని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం భాగల్పూర్‌లో పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, దీనికోసం సరిపడా బొగ్గు సరఫరా జరుగుతుందని శ్రీ మోదీ తెలిపారు. దీనికోసం కేంద్రం బొగ్గు అనుసంధానాన్ని ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ బీహార్ అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

“వికసిత్ భారత్ ప్రయాణం పూర్వోదయతో ప్రారంభమవుతుంది” అని వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి, బీహార్‌ను తూర్పు భారతానికి మూలస్తంభంగా, భారత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. గత ప్రభుత్వాలు అవినీతి పాలనతో బీహార్‌ను నాశనం చేసి, అపఖ్యాతి పాలు చేశాయని విమర్శించిన ఆయన, అభివృద్ధి చెందిన భారత్‌లో బీహార్ తిరిగి నాటి సుసంపన్న పాటలీపుత్ర ప్రతిష్టను సొంతం చేసుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికోసం ఆధునికత, రహదారుల అనుసంధానం, ప్రజాసంక్షేమ పథకాలకు మద్దతునివ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రూ. 5వేల కోట్లతో ముంగేర్ - భాగల్పూర్ – మీర్జా చౌకీ వరకు నూతన జాతీయ రహదారిని నిర్మించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే భాగల్పూర్ నుంచి హంసడీహా వరకు నాలుగు వరసల రహదారి విస్తరణ పనులు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. విక్రమశిల నుంచి కటారియా వరకు కొత్త రైలు మార్గం, రైల్వే వంతెన ఏర్పాటుకు భారత ప్రభుత్వం అనుమతించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత గల భాగల్పూర్ నాటి విక్రమశిల విశ్వవిద్యాలయ కాలంలో ప్రపంచ విజ్ఞానకేంద్రంగా ఉండేదని ప్రధానమంత్రి తెలిపారు. నలంద విశ్వవిద్యాలయ ప్రాచీన వైభవాన్ని ఆధునిక భారత్‌తో అనుసంధానించే కృషి జరుగుతోందన్న ఆయన, విక్రమశిలలోనూ కేంద్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే  పనులు ప్రారంభించామన్నారు. ఈ విషయంలో సహకారం అందించిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీహార్ ప్రభుత్వ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.

“భారత అద్భుత వారసత్వ పరిరక్షణ అలాగే సుసంపన్న భవిత నిర్మాణం కోసం మా ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను భారత విశ్వాసం, ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా నిలిచే అతిపెద్ద పండుగగా ఆయన అభివర్ణించారు. యూరప్ జనాభా కంటే ఎక్కువ మంది మహాకుంభ్‌లో పుణ్యస్నానాలు చేశారనీ, బీహార్‌ పల్లెల నుంచీ ప్రజలు మహాకుంభ్‌కు వెళ్తున్నారని పేర్కొన్న ప్రధానమంత్రి, ఈ మహా ఉత్సవం గురించి తప్పుగా మాట్లాడుతున్న పలు పార్టీల తీరును విమర్శించారు. నాడు రామ మందిరం గురించి తప్పుగా మాట్లాడిన వారే నేడు మహాకుంభ్ గురించి కూడా విమర్శలు చేస్తున్నారన్న శ్రీ మోదీ, అలాంటి వారిని బీహార్ ప్రజలు క్షమించరని తెలిపారు. సుసంపన్న బీహార్ సాధన కోసం ప్రభుత్వం అవిశ్రాంత కృషిని కొనసాగిస్తుందన్న శ్రీ మోదీ, దేశ రైతులకు, బీహార్ ప్రజలకు అభినందనలు తెలిపారు.
 

బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, కేంద్ర మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీ జితన్ రామ్ మాంజీ, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ లాలన్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ రామ్ నాథ్ ఠాకూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

నేపథ్యం

రైతు సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా భాగల్పూర్‌లో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పీఎమ్ విడుదల చేసిన నిధులతో దేశవ్యాప్తంగా 9.7 కోట్లకు పైగా రైతులు రూ. 21,500 కోట్లకు పైగా ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు.

రైతులు తమ ఉత్పత్తుల ద్వారా మెరుగైన ఆదాయం పొందేలా చేయడంపై ప్రధానమంత్రి ప్రధానంగా దృష్టిసారించారు. దీనికోసం పదివేల రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) ఏర్పాటు చేసి, వాటిని ప్రోత్సాహించడం కోసం కేంద్రప్రభుత్వ రంగ పథకాన్ని 2020, ఫిబ్రవరి 29న ప్రధానమంత్రి ప్రారంభించారు. రైతులు వారి వ్యవసాయ ఉత్పత్తులను సమిష్టిగా ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి ఇవి సహాయం చేస్తాయి. ఐదు సంవత్సరాల్లోనే, ఈ కార్యక్రమం ద్వారా దేశంలో పదివేలో ఎఫ్‌పీఓ ఏర్పాటుతో ప్రధానమంత్రి ఆశయం నెరవేరింది.
 

రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద మోతీహరీలో నిర్మించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇండిజీనస్ బ్రీడ్స్‌ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. అత్యాధునిక ఐవీఎఫ్ పద్ధతులను ప్రవేశపెట్టడం, మరింత దిగుబడి కోసం దేశీయ జాతులకు చెందిన మేలైన పశువులను ఉత్పత్తి చేయడం అలాగే ఆధునిక పునరుత్పత్తి విధానాలను గురించి రైతులకు, సంబంధిత నిపుణులకు శిక్షణ ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యాలు. 3 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు వ్యవస్థీకృత మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో బరౌనిలో ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, రూ. 526 కోట్లకు పైగా నిధులతో నిర్మించిన వారిసాలిగంజ్-నవాడా-తిలయ్య రైలు సెక్షన్ డబ్లింగ్‌ను అలాగే ఇస్మాయిల్‌పూర్ - రఫీగంజ్ రహదారి పైవంతెనను కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Number of Indian women with digital access doubled since 2021: Survey

Media Coverage

Number of Indian women with digital access doubled since 2021: Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets people of Goa on Goa Statehood Day
May 30, 2026

The Prime Minister, Shri Narendra Modi, today extended his greetings to the people of Goa on the occasion of Goa Statehood Day.

The Prime Minister said that Goa is widely known for its vibrant culture, rich heritage, natural beauty and warm-hearted people.

The Prime Minister noted that the occasion is an opportunity to remember with gratitude all those who worked tirelessly for the progress and identity of Goa.

The Prime Minister expressed hope that Goa will continue to prosper and play an important role in building a Viksit Bharat.

Shri Modi also prayed for the good health and prosperity of every Goan.

The Prime Minister wrote on X;

“Greetings to the people of Goa on the special occasion of Goa Statehood Day. Goa’s vibrant culture, rich heritage, natural beauty and warm-hearted people are widely known. This day is also an opportunity to remember with gratitude all those who worked tirelessly for its progress and identity. May Goa continue to prosper and play an important role in building a Viksit Bharat. Praying for the good health and prosperity of every Goan.”