అందరి సూచనలూ వినండి…. మీకు నచ్చినప్పుడే మీ శైలిని మార్చుకోండి: పీఎం
ఆసక్తీ, అవగాహనా పెరిగేలా విద్యార్థులకు ముందుగానే తెలియజేయాలని ఉపాధ్యాయులకు పీఎం సూచన
లక్ష్యం చేరుకునేదిగా ఉండాలి. కానీ సులభంగా అందకూడదు... గురి పెట్టండి, ప్రయత్నించండి: పీఎం
మెదడుకు సానపెట్టండి.. అనుసంధానం కండి.. ఆ తర్వాతే చదవండి, విజయం సాధించేందుకు ఇది సాయపడుతుంది: పీఎం
విద్య, నైపుణ్యాలు, విశ్రాంతి, అభిరుచిని సమతౌల్యం చేయడమే వృద్ధికి మూలం: పీఎం
విద్య, నైపుణ్యాలు, విశ్రాంతి, అభిరుచిని సమతౌల్యం చేయడమే వృద్ధికి మూలం: పీఎం
పుస్తకాలు విజ్ఞానాన్నిస్తాయి, కానీ సాధనే మిమ్మల్ని నిపుణులుగా మారుస్తుంది: పీఎం
గతం గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయొద్దు, భవిష్యత్తుపైనే దృష్టి సారించండి: పీఎం
పరీక్షల కోసమే చదువు కాదు.. జీవితం కోసం కూడా, ఎవరిని వారు సమీక్షించుకోవడమే పరీక్షల ఉద్దేశం: పీఎం
అందరిలో ఒకరిగా ఉండాలని కాదు.. ఏదైనా సాధించాలని ఆకాంక్షించండి.. : పీఎం
దేవుడిచ్చిన గొప్ప బహుమతి వర్తమానం- ఇప్పుడే, ఇక్కడే జీవించండి: పీఎం
ఈ క్షణాన్ని మీరు ఎంత ఆస్వాదిస్తే.. అంత ఎక్కువ కాలం దానిని గుర్తు పెట్టుకుంటారు: పీఎం
సామూహిక పఠనం.. అందరి వృద్ధికి దోహదం చేస్తుంది : పీఎం
పునఃశ్చరణ చేయండి.. తెలివితేటలు పెంచుకోండి: పీఎం
పాఠశాలలోనే ప్రాథమికాంశాలపై పట్టు సాధించండి.. పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది: పీఎం
పిల్లల సామర్థ్యం, ఆసక్తులకు అనుగుణంగా వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు పీఎం సూచన
మీ అభిరుచులను ఉత్పాదకాలుగా మార్చుకోండి…
ఇతరులతో వాటిని పంచుకోండి, కొత్త ఆలోచనలకు, విజయానికి ఫీడ్‌బ్యాక్ తోడ్పడుతుంది: పీఎం
మిమ్మల్ని మీరు అన్వేషించండి..మీ జీవితం అందించే ప్రతి అనుభవాన్ని ఆస్వాదించండి: పీఎం
పరీక్షలు పండగలాంటివి, వాటిని వేడుకలా జరుపుకోండి: పీఎం
అంతర్లీనంగా ఉన్న సత్యం నుంచే అసలైన ఆత్మవిశ్వాసం పుడుతుంది, మీ పట్ల మీరు నిజాయతీగా ఉండండి: పీఎం
మీ జీవితాన్ని జీవన విధానమే తీర్చిదిద్దుతుంది కానీ అనుకూలమైన వాతావరణం కాదు: పీఎం
ఆకాంక్ష లేకపోవడం నేరం - ఎల్లప్పుడూ కలలు కనండి: పీఎం
మీకు మీరే చుక్కాని, మీ సామర్థ్యాలను గుర్తించండి: పీఎం
పెద్ద కలలు కనండి, భయాన్ని వీడండి - జీవిత చరిత్రలు చదవండి: పీఎం
పరిశుభ్రతను పాటించడమే మన ప్రథమ ప్రాధాన్యం, కర్తవ్యం: పీఎం

పరీక్షా పే చర్చ (పీపీసీ) 9వ సంచికలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.

మీ శైలిమీ వేగం

గుజరాత్‌కు చెందిన విద్యార్థి ప్రధానమంత్రిని ఓ ప్రశ్న అడిగాడు. తమ గురించి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటే.. ఉపాధ్యాయులు తోడ్పాటునిస్తారని ఆ విద్యార్థి అన్నాడు. అయితే చదువుకొనే విషయంలో తమ ఉపాధ్యాయులు ఒక పద్ధతిని.. తల్లిదండ్రులు మరో విధానాన్ని సూచిస్తుంటే, తాము మాత్రం మరోదాన్ని అనుసరిస్తున్నామని, వీటిలో ఏది సరైనదో తెలియక తికమకపడుతున్నామని చెప్పాడు. దీనికి ప్రధానమంత్రి స్పందిస్తూ.. ఇది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుందని, ప్రధానమంత్రిగా తనకు కూడా ప్రజలు వివిధ రకాల సూచనలిస్తుంటారని చెప్పారు. ఒక ఇంట్లో ఉన్న తోబుట్టువులకు వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉంటాయన్నారు. కొందరు కూరగాయలతో, ఇంకొందరు పప్పుతో, మరికొందరు అన్నీ కలగలిపి తింటారు. ప్రతి ఒక్కరికీ వారికంటూ ప్రత్యేకమైన శైలి ఉంటుందని వివరించారు. అయితే, ఎవరి శైలిని వారు అనుసరిస్తేనే ఆనందమన్నారు. కొందరు రాత్రి పూట చదవడానికి ప్రాధాన్యమిస్తే.. మరికొందరు ఉదయాన్నే చదువుకుంటారని, అది వారి ఇష్టానుగుణంగా ఉంటుందని శ్రీ మోదీ తెలిపారు. ఈ విషయంలో అబద్ధాలు చెప్పకూడదని హెచ్చరిస్తూ.. కొందరు తమ తల్లులకు ఉదయాన్నే చదువుకుంటామని చెప్పి, తెల్లారిన తర్వాత దాని గురించి పట్టించుకోరన్నారు. విద్యార్థులు తమ సొంత శైలిని విశ్వసించాలని, సూచనలను జాగ్రత్తగా వినాలన్నారు. ఇతరులు చెప్పారని కాకుండా, వ్యక్తిగత అనుభవం ద్వారా శైలిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. పరీక్షా పే చర్చ మొదలుపెట్టినప్పుడు ఒక పద్ధతి ఉండేదని, కాలక్రమేణా దానికి మార్పులు చేసినట్లు వివరించారు. మూల ఉద్దేశానికి కట్టుబడి ఉంటూనే.. ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల్లో సెషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి స్నేహపూర్వకతత్వాన్ని గుర్తించిన విద్యార్థులు ఆయనతో చాలా సులభంగా మాట కలిపారు. వివిధ పద్ధతుల గురించి తెలుసుకొని, వాటి నుంచి మంచిని స్వీకరించాలన్నారు. కానీ, తమ సొంత పద్ధతిపై దృష్టి సారించి క్రమంగా దాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పారు.

 

తరచూ పాఠశాల లేదా ఉపాధ్యాయుల వేగాన్ని తాము అందుకోలేకపోతున్నామని, వెనకబడిన పాఠాలను నేర్చుకోవాలని ప్రయత్నిస్తే.. తర్వాతి అధ్యాయాల్లో వెనకబడిపోతున్నామని ఓ విద్యార్థి చెప్పాడు. ఉపాధ్యాయులు బోధనలో విద్యార్థుల కంటే ఒక్కడుగు మాత్రమే ముందుండాలని, మరీ ఎక్కువ దూరంలో ఉండకూడదని శ్రీ మోదీ అన్నారు. లక్ష్యం చేరుకోగలిగేగా ఉండాలి కానీ.. సాధించేందుకు సులభంగా ఉండకూడదని వివరించారు. ‘‘లక్ష్యానికి చేరువగా ఉండాలి. కానీ అది సులభంగా దక్కేలా ఉండకూడదు’’ అని ఎగ్జామ్ వారియర్ మంత్ర 26ను విద్యార్థి గుర్తు చేసుకోగా.. అతడి జ్ఞాపకశక్తిని ప్రధాని ప్రశంసించారు. విద్యార్థులకంటేఉపాధ్యాయులు 50 అడుగుల ముందుంటే విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతారు. పొలాన్ని రైతు దున్నినట్టే.. విద్యార్థుల మెదడును ఉపాధ్యాయులు సిద్ధం చేయాలన్నారు. ప్రతి వారంలోనూ బోధించే అధ్యాయాల గురించి ఉపాధ్యాయులు ముందుగానే చెప్పాలని ఆయన సూచించారు. దానివల్ల పాఠ్యాంశం ప్రారంభానికి ముందే.. విద్యార్థులు చదవడం, రాయడం, ఆన్‌లైన్లో శోధించడం మొదలుపెడతారన్నారు. బోధన వాస్తవికంగా ఉన్నప్పుడు విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని, అర్థం చేసుకొనే శక్తి పెరుగుతుందని, ఏకాగ్రత మెరుగవుతుందని వివరించారు. ఒక అధ్యాయం ఆసక్తికరంగా ఉంటే.. విద్యార్థులు దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారని, పునఃశ్చరణ బలోపేతమవుతుందన్నాను. ఇది చాలా సులభమైన పద్ధతి అని.. ఇలా చేసిన తర్వాత కూడా ఉపాధ్యాయుల వేగం ఇంకా సమస్యగానే ఉంటుందా అని ప్రశ్నించారు. దానికి విద్యార్థి అవును అని సమాధానమివ్వగా శ్రీ మోదీ ఉండదు అని చెప్పాలని సరిచేశారు. ఎందుకంటే ఉపాధ్యాయుని కంటే ఓ అడుగు ముందే ఉన్నప్పుడు, విద్యార్థుల్లో వెనకబడి ఉన్నామనే భావన ఉండదన్నారు. ‘‘ముందు మెదడుకి పదును పెట్టండి, దానితో అనుసంధానమవ్వండి. ఆ తర్వాతే పాఠాలను చదవండి. అప్పుడే.. విద్యార్థులు విజయం సాధిస్తారు’’ అని తెలిపారు. ప్రధానమంత్రితో ముఖాముఖిగా మాట్లాడే, ప్రశ్నలు అడిగే, చర్చించే అవకాశం అందరికీ రాదని విద్యార్థులు అన్నారు. ఉపాధ్యాయుల కంటే రెండు అడుగులు ముందుండాలని సలహా ఇచ్చారని, ఇప్పుడు తాము చదువులో వెనకబడిపోమని వారు వెల్లడించారు.

సంగీత సమయం

‘హమారా భారత్ భూమి’ పేరుతో హిందీ, నేపాలీ, బెంగాలీ భాషల్లో దేశభక్తి గీతాన్ని తాను స్వరపరిచినట్లు సిక్కింకు చెందిన విద్యార్థిని తెలియజేసింది. ఆశ్చర్యపోయిన ప్రధానమంత్రి.. కవితలు రాయడం ఇష్టమా అని అడిగారు. వాటిని చదివి వినిపించమని ప్రోత్సహించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అన్న జాతీయ ఐక్యతా స్ఫూర్తి గురించి ఆమె పలికిన విధానాన్ని మెచ్చుకున్నారు. ఆ తర్వాత మాన్సీ అనే విద్యార్థినిని పాట పాడమని శ్రీ మోదీ అడిగారు. విద్యార్థులకు అంకితమిస్తూ.. తన తల్లి రాసిన పాటను మాన్సీ పాడి వినిపించింది. ఆమెను ప్రశంసిస్తూ.. తన తరఫున ఆమె తల్లికి అభినందనలు తెలియజేయమని ప్రధాని చెప్పారు. యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీ, ఇన్స్టా పేజీని తాను నడుపుతున్నట్లు ఓ విద్యార్థి చెప్పాడు. తన ఫేస్‌బుక్ ఖాతాను 1.5 లక్షల మంది అనుసరిస్తున్నారని వెల్లడించాడు. ఆశ్చర్యపోయిన ప్రధాని అతడిని అభినందిస్తూ.. ఇలాంటి ప్రతిభావంతులైన వారిని కలుసుకోవడం తనకు గర్వకారణమన్నారు.

 

అస్సాం గమోఛాతో ప్రధాని విద్యార్థులకు స్వాగతం పలికారు. అది తనకు అత్యంత ఇష్టమైనదని చెప్పారు. అస్సాం, ఈశాన్య ప్రాంతంలో మహిళా సాధికారతకు గమోఛా చిహ్నమని, అక్కడి మహిళలు దీనిని రూపొందిస్తారని వివరించారు. ఇది వారి సామర్థ్యాన్ని, సహకారాన్ని సూచిస్తుందన్నారు. విద్యార్థులకు గౌరవపూర్వకంగా గమోఛాను అందించాలనేది తన కోరిక అని చెప్పారు.

లక్ష్యాన్ని చేధించేలా సన్నద్ధత

విద్యార్థుల్లో ఉన్న అయోమయాన్ని, భయాన్ని తెలియజేస్తూ.. నైపుణ్యాలు ముఖ్యమా? మార్కులు ప్రధానమా? అని సబావత్ వెంకటేశ్ అనే విద్యార్థి ప్రధానిని అడిగాడు. తినడమైనా-నిద్రపోవడమైనా, చదవడమైనా-ఆడుకోవడమైనా, నైపుణ్యాలైనా-మార్కులైనా జీవితంలో సమతౌల్యం అవసరమని ప్రధానమంత్రి సమాధానమిచ్చారు. ఒకవైపే మొగ్గు చూపడం అసమతౌల్యానికి దారి తీస్తుందని, సరైన సమతౌల్యం స్థిరత్వాన్ని అందిస్తుందన్నారు. నైపుణ్యాలు రెండు రకాలు - జీవన నైపుణ్యాలు, వృత్తిగత నైపుణ్యాలు- ఈ రెండూ ముఖ్యమైనవేనని చెప్పారు. విజ్ఞానం, పరిశీలన, అధ్యయనం లేకుండా ఏ నైపుణ్యం మెరుగుపడదని, విజ్ఞానంతోనే నైపుణ్యం మొదలవుతుందని వివరించారు.

 

దీనిని ఉదాహరణలతో శ్రీ మోదీ వివరించారు: జీవన నైపుణ్యాలు లేకపోతే.. వంట చేయడం, రైల్వే స్టేషన్లో టిక్కెట్టు కొనుక్కోవడం లాంటి దైనందిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అనుసరణీయతతో సహా జీవన నైపుణ్యాలను పూర్తిగా అలవరుచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వృత్తిగత నైపుణ్యాల గురించి వివరిస్తూ.. తమ నైపుణ్యాలను వైద్యులు నిరంతరం మెరుగుపరుచుకోవాలని, పుస్తక జ్ఞానం మాత్రమే హృద్రోగ నిపుణున్ని తయారుచేయలేదని తెలిపారు. రోగులతో కలసి పనిచేసినప్పుడే అసలు నైపుణ్యాలు అలవడతాయన్నారు. అదే విధంగా న్యాయస్థానంలో వాదించే నైపుణ్యాలు పెంపొందించుకోవాలంటే రాజ్యాంగ నిబంధనల గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. సీనియర్లతో కలసి న్యాయవాదులు ప్రాక్టీసు చేయాలి. కొత్త సాంకేతికతలను స్వీకరించాలంటే.. 40 ఏళ్ల వయసులో కూడా నిరంతర అభ్యాసం అవసరమని ఆయన స్పష్టం చేశారు. వైద్యం, ఇతర రంగాల్లో వస్తున్న పురోగతులను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. విద్య, నైపుణ్యాలు కవలల్లాంటివని, వాటిని విడివిడిగా చూడలేమని, అవి జీవితంలో తప్పనిసరి అని తెలిపారు.

మార్కుల పరిధిని అధిగమించిన మాధ్యమంగా విద్య

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పట్ల తనకున్న అభిమానాన్ని మణిపూర్లోని ఇంఫాల్లో ఉన్న సైనిక్ పాఠశాల విద్యార్ధి వ్యక్తం చేశాడు. తనది, ప్రధానిది పుట్టిన రోజు ఒకటేనని చెప్పారు. గడచిపోయిన సంవత్సరాలను తాను లెక్కపెట్టనని, మిగిలి ఉన్న సమయంపైనే తాను దృష్టి పెడతానని చెప్పారు. గతం గురించి ఆలోచిస్తూ.. సమయాన్ని వృథా చేసుకోవద్దని, భవిష్యత్తు గురించి ఆలోచించమని విద్యార్థులను శ్రీ మోదీ కోరారు.

గతేడాది ప్రశ్నల ఆధారంగా పరీక్షలకు సన్నద్ధమయ్యే వ్యూహాల గురించి అడిగినప్పుడు.. చాలా సందర్భాల్లో ప్రశ్నాపత్రం కష్టంగా ఉందని విద్యార్థులు భావిస్తారని ప్రధాని అన్నారు. దీనికి కారణం ఆ ప్రశ్నలు సిలబస్‌లో లేకపోవడం కాదని.. కొన్ని పునరావృత నమూనాలకే పరిమితం కావడమని చెప్పారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలోనూ ఇదే పరిస్థితి ఉండేదని, కొన్ని సందర్భాల్లో మార్కులకే ప్రాధాన్యమిచ్చేలా ఉపాధ్యాయులు వ్యవహరించేవారన్నారు. మొత్తం సిలబస్‌ను పూర్తి చేసి, దానిని వాస్తవ జీవితానికి తగినట్టుగా అనువదించడం ద్వారా సమగ్ర విజ్ఞానం అందించేందుకు మంచి గురువులు ప్రాధాన్యమిస్తారన్నారు. క్రికెట్లో బౌలర్‌ను ఉదాహరణగా చూపిస్తూ.. భుజం కండరాలను బలోపేతం చేసుకోవడానికే పరిమితం కాకుండా.. యోగా చేసి మొత్తం శరీరాన్ని, మనసును బలోపేతం చేసుకోవాలని, ఆహార నియమాలు పాటించాలని, తగినంత నిద్రపోవాలని వివరించారు. అదే మాదిరిగా.. పరీక్షల కోసమే చదువు కాదని, జీవితం కోసమని తమని తాము సమీక్షించుకోవడమే పరీక్షల వెనక ఉన్న అర్థమని ఆయన చెప్పారు. అంతిమ లక్ష్యం మార్కులు కాదు.. జీవిత పరిపూర్ణాభివృద్ధి కావాలి. పది ప్రశ్నలకు లేదా పద్ధతులపైనే దృష్టి సారిస్తే.. సన్నద్ధత కూడా పరిమితంగానే ఉంటుందని, సంపూర్ణ అభ్యాసంపై దృష్టి సారించాలని సలహా ఇచ్చారు.

 

ముఖ్యంగా పరీక్షల సమయానికి ముందు ఎదురయ్యే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న ప్రశ్నకు ప్రధానమంత్రి సమాధానమిచ్చారు. ఇది అందరికీ ఉన్న సమస్యేనని ఆయన అన్నారు. విద్యను నిర్భందమైనదిగా లేదా భారంగా పరిగణించకూడదని, దానికి పూర్తిగా నిమగ్నమవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసంపూర్ణ విద్య విజయానికి మార్గం కాదన్నారు. మార్కులకే ప్రాధాన్యం ఇవ్వడం గురించి మాట్లాడుతూ.. గతేడాది బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థి పేరు మీకు గుర్తుందా అని ప్రశ్నించారు. దానికి ఓ విద్యార్థి లేదు అని సమాధానమివ్వగా.. మార్కులకు ఎంత తక్కువ ప్రాధాన్యముందో వివరిస్తూ.. అలాంటి విజయాలను కూడా స్వల్పకాలం మాత్రమే మెచ్చుకుంటారని, తర్వాత మరచిపోతారన్నారు. తమ మనసును మార్కులతో ముడిపెట్టుకోవద్దని, తమ జీవితం ఏ వైపు వెళుతుందో దృష్టి సారించాలన్నారు. అలాగే తరగతి గదిలో లేదా పరీక్షాకేంద్రాల్లో మాత్రమే కాకుండా.. జీవితంలో కూడా తమను తాము పరీక్షించుకోవాలని సూచించారు.

ఒత్తిడిని తగ్గించిఎక్కువ నేర్చుకోవటం

చదువుకునేటప్పుడు మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ, నేర్చుకున్న పాఠాలు కూడా త్వరగా మర్చిపోతున్నాం. ఆ సమయంలో ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఎలా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణ సందర్భంగా ఒక విద్యార్థి అడిగారు. చక్కని ఉదాహరణతో ప్రధానమంత్రి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. "ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత ఎవరైన మిమ్మల్ని ఈ కార్యక్రమం గురించి అడిగితే గుర్తుంటుందా, మర్చిపోతారా?” అనిప్రధానమంత్రి అడగ్గా.. ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భం కాబట్టి ఎప్పటికీ గుర్తుంటుందని ఆ విద్యార్థి చెప్పారు. అప్పుడు శ్రీ నరేంద్ర మోదీ ఇలా వివరించారు. మీరు ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉండటమే అందుకు కారణం. మీరు వర్తమానంలో జీవిస్తూ, ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని శ్రద్ధగా గమనిస్తున్నారు. ఎప్పుడైతే మనం ఒక పనిలో పూర్తిగా లీనమవుతామో, ఆ జ్ఞాపకాలు మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

మనం ఒక పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు, ఆ అనుభవాలను స్నేహితులతో పంచుకున్నప్పుడు జ్ఞాపకాలు కలకాలం పదిలంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన వారితో స్నేహం చేసి, వారికి పాఠాలు నేర్పండని విద్యార్థులకు సూచించారు. మీకన్నా తెలివైనవారితో చర్చించి, మీ అవగాహనను మెరుగుపరచుకోండి. ఈ రెండు రకాల ప్రయోజనాల ద్వారా కొత్త ఆలోచనలు రావటమే కాక, మనసు ఉత్సాహంగా ఉండి, ఏకాగ్రత పెరుగుతుందని ఆయన తెలిపారు.

 

పంజాబ్‌కు చెందిన మరో విద్యార్థి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి గౌరవప్రదంగా అభివాదం చేస్తూ, 12వ తరగతి విద్యార్థులకున్న సవాళ్ల గురించి మాట్లాడారు. ఒకే సమయంలో బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవటం, పరీక్షా విధానాలు వేరుగా ఉండటం, ఒకే సమయంలో పరీక్షల షెడ్యూల్ ఉండటం వారికి కష్టంగా ఉంటుందన్నారు. ఆ విద్యార్థి ఆందోళనను అర్థం చేసుకున్న ప్రధానమంత్రి.. దీన్ని ఒకే సమయంలో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడటమని అభివర్ణించారు. విద్యార్థులు 12వ తరగతి సిలబస్‌కే ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. సిలబస్‌ను పూర్తిగా అవగతం చేసుకుంటే ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకుండానే పోటీ పరీక్షలు సులభతరమవుతాయన్నారు. పిల్లలు వారి సామర్థ్యం, నైపుణ్యం, ఆసక్తి మేరకు ఎదిగేలా సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు.

మార్కులుఆటలుఆనందాన్ని సమతుల్యం చేయటం

చదువుపై శ్రద్ధ పెట్టాలని సమాజం నుంచి ఒత్తిడి ఉందని, గేమింగ్ రంగంలో భవిష్యత్తుపై ఓ విద్యార్థి ప్రశ్నించారు. దానికి ప్రధానమంత్రి సమాధానమిస్తూ.. మొదట్లో తల్లిదండ్రులు నిరుత్సాహపడినా, ఒకసారి విజయం సాధించిన తర్వాత వాళ్లే గర్వంగా ఆ విజయాన్ని వేడుకగా జరుపుకుంటారని వివరించారు. గేమింగ్ పట్ల ఆసక్తిని ఉత్పాదకత దిశగా మళ్లించాలని ఆ విద్యార్థిని ప్రోత్సహిస్తూ.. పంచతంత్రం, పురాణ గాథల వంటి భారతదేశపు గొప్ప కథల ఆధారంగా కొత్త ఆటలను సృష్టించాలని, వాటికి గుర్తింపు లభించేలా సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకోవాలని ఆయన సూచించారు. గేమింగ్.. కేవలం కాలక్షేపం కాదని, దానికి వేగం, అప్రమత్తత వంటి నైపుణ్యాలు అవసరమని, ఇది స్వీయ అభివృద్ధికి సహకరిస్తుందని వివరించారు. నాణ్యమైన గేమింగ్‌లో ప్రావీణ్యం సంపాదించటంపై దృష్టి సారించాలని సూచించారు. గేమింగ్ పేరుతో జరుగుతున్న జూదం పట్ల హెచ్చరిస్తూ, అనైతిక పద్ధతులను అరికట్టటానికి రూపొందించిన చట్టాలను గుర్తు చేస్తూ, గేమింగ్‌ను నిర్మాణాత్మక నైపుణ్యంగా స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రధానమంత్రి నివాసాన్ని సందర్శించటం పట్ల విద్యార్థులు ఉత్సాహాం కనబరిచారు. ఆయన స్వేహపూర్వక పలకరింపు, విద్యార్థుల ప్రశ్నలపై ఆయన చూపిన ఆసక్తి, వాటికి ఆయన అందించిన ఆలోచింపజేసే సమాధానాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

భయాన్ని బలంగా మార్చుకోవటం ఒత్తిడిసమయంఆత్మవిశ్వాసాన్ని సమన్వయం చేసుకోవటం

ఎగ్జామ్ వారియర్ పుస్తకం చదవటం వల్ల పరీక్షలపై తమ దృక్పథం ఎలా మారిందో విద్యార్థులు పంచుకున్నారు. గతంలో పరీక్షలంటే ఒత్తిడి, భయం కలిగేవని, ఈ పుస్తకం చదివిన తర్వాత పరీక్షలు ఒక మిత్రుడిలా మారిపోయాయని ఓ విద్యార్థి పేర్కొన్నారు. గతంలో ఇతరులతో పోల్చుకుని ఆందోళన చెందేవాళ్లమని, తమ శైలి ప్రత్యేకమైనదని, ప్రభావవంతమైందని ఇప్పుడు గ్రహించినట్లు మరో విద్యార్థి తెలిపారు. సమయపాలన ఎప్పుడూ సవాలుగానే ఉండేదని, ఎగ్జామ్ వారియర్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాక, ఇకపై ఉదయాన్నే నిద్రలేచి పనులను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని నిశ్చయించుకున్నామని ఒక విద్యార్థి చెప్పారు.

సమయపాలనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సులభమైన పద్ధతిని సూచించారు. చేయాల్సిన పనులను రాత్రి పడుకునే ముందు డైరీలో రాసుకుని, మరుసటి రోజు వాటిని సరిచూసుకోవటం, కొన్ని పనులు ఎందుకు పూర్తి కాలేదో విశ్లేషించుకోవాలని చెప్పారు. ఉత్పాదకతతో సమయాన్ని వినియోగించుకోవటం నేర్చుకుంటే ఒత్తిడి, అలసట తొలగిపోతాయని స్పష్టం చేశారు. తనకు ఎన్ని బాధ్యతలున్నప్పటికీ, సరైన సమయపాలన పాటించే అలవాటు వల్లే ఒత్తిడి ఉండదని తెలిపారు.

గణితం వంటి సబ్జెక్టుల పట్ల తమకున్న భయం ఆసక్తిగా ఎలా మారిందో విద్యార్థులు వివరించారు. ఒకప్పుడు గణితం భూతంలా ఉండేది కానీ, ఇప్పుడది ఇష్టమైన సబ్జెక్టు అని ఒక విద్యార్థి తెలిపారు. వేద గణితం గురించి మరింత తెలుసుకోవాలని విద్యార్థులను ప్రధానమంత్రి ప్రోత్సహించారు. ఇది చాలా వినోదాత్మకంగా, మాయాజాలంలా ఉంటుందని అభివర్ణిస్తూ, ఇలాంటి విధానాలను స్నేహితులతో పంచుకోవటం వల్ల వారిలోనూ ఆసక్తిని కలిగించవచ్చని సూచించారు.

 

ఒకప్పుడు పరీక్షల తేదీలు భయాన్ని కలిగించేవని కానీ, పరీక్షలను పండగలా జరుపుకోవాలి అనే మంత్రం తనలో ఉత్సాహాన్ని నింపిందని మరో విద్యార్థి పంచుకున్నారు. పరీక్షా పే చర్చలో నేర్చుకున్న పాఠాలను కుటుంబసభ్యులతో కూడా పంచుకోవాలని, అవి వారికి కూడా సమాన ప్రయోజనాలను కలిగిస్తాయని ప్రధానమంత్రి సలహా ఇచ్చారు.

తక్కువ మార్కులు వస్తాయేమో అన్న భయాన్ని అధిగమించిన తీరును విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. మార్కులే సర్వస్వం కాదని గ్రహించారు. వైఫల్యాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎదిగిన తీరుని వారు ఉదహరణగా చెప్పుకున్నారు. ఒత్తిడి తగ్గితే మెదడు ఉల్లాసంగా మారి పాటలు పాడటం, చిత్రలేఖనం, కవితలు రాయటం వంటి నూతన నైపుణ్యాలను నేర్చుకోవటానికి వీలవుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సృజనాత్మక పనులను ప్రారంభించిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు.

విద్యార్థులు ప్రసంగాల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టుకోవటానికి పుస్తకాల ద్వారా లభించిన ఆత్మవిశ్వాసం సహాయపడింది. ఒక సాధారణ వ్యక్తి కళ్లతో చూసిన సంఘటనను ఎంత స్పష్టంగా వివరించగలడో.. అలాగే సత్యం, అనుభవం నుంచి ఆత్మవిశ్వాసం లభిస్తుందని ప్రధానమంత్రి వివరించారు. విద్యార్థులు చేసిన కృషి, సాధించిన విజయ సత్యాల నుంచి ఆత్మవిశ్వాసం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

గతంలో సుదీర్ఘమైన లిటరేచర్ పేపర్లు చూసి ఆందోళన కలిగేదని, ఇప్పుడు వేగంగా రాయటం, చేతి రాతను మెరుగుపరుచుకోవటం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఒక విద్యార్థి పంచుకున్నారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి.. ప్రశ్నాపత్రానికి జవాబులను రాయటం ప్రారంభించే ముందు 30 సెకన్లపాటు ప్రశాంతంగా ఉండాలని, దీర్ఘంగా శ్వాస తీసుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని, జ్ఞానం లేకపోవటం వల్ల కాదు.. తొందరపాటు వల్లే పరీక్షల్లో తప్పులు జరుగుతాయని ఆయన తెలిపారు. సరైన పద్ధతులు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షల భయాన్ని జయించి, విజయం సాధించగలరని అన్నారు.

గందరగోళ పరిస్థితుల మధ్య స్థిరంగా నిలబడటం

ఇంట్లో గందరగోళ పరిస్థితులు, తల్లిదండ్రుల మద్దతు లేని సమయాల్లో ఎలా చదువుకోవాలని ఓ విద్యార్థి అడిగారు. సరుకులతో నిండిన ఎడ్లబండిపై కూర్చొని, ఓ చిన్నారి ఎంతో ఏకాగ్రతతో చదువుకుంటున్న వీడియోను ఈ సందర్బంగా ప్రధానమంత్రి గుర్తు చేశారు. విజయం సాధించేందుకు సౌకర్యం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే చాలామంది, సౌకర్యాలు లేని చిన్న గ్రామాల నుంచి వస్తారని తెలిపారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, క్రికెట్ లో విజయం సాధించిన అంధులైన అమ్మాయిల స్ఫూర్తిదాయక కథను ఈ సందర్భంగా పంచుకున్నారు. మనం అనుభవించే సౌకర్యాల వల్ల కాదు.. జీవన విధానాన్ని బట్టి జీవితం రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు.

 

అతిథుల వల్ల పరీక్షల సన్నద్ధతకు అంతరాయం కలుగుతుందని తమిళనాడుకు చెందిన విద్యార్థి అన్నారు. ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి బదులిచ్చారు. అతిథుల బాల్య జ్ఞాపకాల గురించి అడిగి, చర్చాంశాన్ని మార్చాలని, ఇది విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించటమే కాక, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని సలహా ఇచ్చారు.

ఉన్నత లక్ష్యాలుగొప్ప కార్యాచరణ

పిల్లలు పెద్ద కలలను కంటే, వాటిని నెరవేర్చుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలని లద్దాఖ్ కు చెందిన విద్యార్థి అడిగారు. కలలు కనకపోవటం నేరం.. కలలకు కార్యాచరణ తోడవ్వాలని ప్రధానమంత్రి బదులిచ్చారు. వ్యోమగామి కావాలన్న ఆశయం నెరవేర్చుకోవాలంటే నిరంతరం చదవటం, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను అధ్యయనం చేయటం, ఆ రంగంపై ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవటం ముఖ్యమని వివరించారు. కలలను బహిర్గతం చేయటం వల్ల ఇతరులు హేళన చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. తమ కలలను ఒకచోట రాసుకుని, జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

 

పెద్ద కలలను సాధించేందుకు అలవరచుకోవాల్సిన రోజువారీ అలవాట్లపై అడిగిన మరో ప్రశ్నకు స్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా సమాధానం చెప్పారు. మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని సూచించారు. వారి జీవితంలోని కష్టాలను, మొదట్లో వారు తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవటం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కలుగుతుందని, ఒక్కో అడుగూ ఎలా ముందుకు వేయాలో నేర్చుకోవచ్చని చెప్పారు.

ఒక విద్యార్థి హృదయం ఉప్పొంగే కవితను ప్రధానమంత్రికి అంకితమిచ్చారు. ఆ కవితలో ప్రధానమంత్రిని భారతదేశానికి గర్వకారణమని, మానవతా సేవకుడని, దేశ కలలను ముందుకు తీసుకెళ్తున్న గొప్ప నాయకుడని అభివర్ణించారు. ఆ కవితను హృదయపూర్వకంగా ప్రశంసించిన ప్రధానమంత్రి, ఆ విద్యార్థిని అభినందించారు.

ప్రధానమంత్రి ఉపాధ్యాయుడిగా మారినప్పుడు

స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి, 2047లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ దార్శనికత ప్రయోజనాలు పొందేందుకు ఇప్పటి యువత.. 35 నుంచి 45 ఏళ్ల వయసులో జీవితంలో అత్యంత కీలకమైన దశలో ఉంటారని చెప్పారు. 1915లో ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మహాత్మాగాంధీ 1947 వరకు స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారని, భగత్ సింగ్ వంటి నాయకుల త్యాగాలు స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి స్ఫూర్తినిచ్చాయని ఆయన తెలిపారు. అంతటి అద్భుతమైన స్వేచ్ఛను మనం సాధించగలిగినప్పుడు, కలిసికట్టుగా కృషి చేస్తే అభివృద్ధి చెందిన భారతదేశం తప్పక సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధి చెందిన భారతదేశం కోసం వ్యక్తిగత అంకిత భావాన్ని లిఖితపూర్వకంగా వ్యక్తపరచాలని విద్యార్థులను ప్రధానమంత్రి కోరారు. ఇందులో భాగంగా వారి చేయాల్సిన ఐదు ప్రధానాంశాలను గుర్తించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, ఆత్మవిశ్వాసం, స్వదేశీ వస్తువుల వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. స్వదేశీ స్ఫూర్తిని అవలంబించటం ద్వారా మనసుని సిద్ధం చేసుకుంటూ వలసవాద మనస్తత్వాన్ని వీడాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై వ్యామోహం పాఠశాలల్లో ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. రోజూ ఉపయోగించే వస్తువులను జాబితాగా రూపొందించి, వాటిలో విదేశీ వస్తువులను గుర్తించి, ఆ వస్తువుల స్థానంలో భారత ఉత్పత్తులను చేర్చటం ద్వారా ఏడాది కాలంలోనే వారి ఇళ్లు స్వదేశీ వస్తువులతో నిండిపోతుందని విద్యార్థులకు ప్రధానమంత్రి సూచించారు. భారతీయులుగా మన ఉత్పత్తులపై మనమే గర్వపడకపోతే, ప్రపంచం గౌరవించదని ఆయన తెలిపారు. ఆలస్యానికి "ఇండియన్ టైమ్" అని సాకులు చెప్పే ధోరణిని ఆయన విమర్శించారు. ఇటువంటి వైఖరి దేశ గౌరవాన్ని తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. పరిశుభ్రతతో ప్రారంభమయ్యే కర్తవ్య పాలనను అలవరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలు శుభ్రంగా ఉండటానికి కారణం కేవలం పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కాదు.. అక్కడి పౌరులు బయట చెత్త వేయకపోవటం అసలు కారణమని స్పష్టం చేశారు. భారతీయులు పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ఎవరైనా చెత్త వేసినా, దాన్ని మనం తీసేయటం ద్వారా చెత్త పడేసిన వారు సిగ్గుపడేలా చేయాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా పౌరుల ప్రాథమిక బాధ్యతని, పౌరులంతా ఇటువంటి బాధ్యతలను నెరవేరిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధి చెందితే నేటి యువత, పెద్దయ్యాక పూర్తిస్థాయిలో గొప్ప ప్రయోజనాలను అనుభవిస్తారని తెలిపారు. తమకు ప్రయోజనం కలిగే పనులు చేయాలా అని ప్రధానమంత్రి ప్రశ్నించగా, విద్యార్థులు అవునని బదులిచ్చారు. ఆ తర్వాత ప్రస్తుత తరానికి, ముఖ్యంగా సాంకేతిక రంగంలోని అపారమైన అవకాశాల గురించి మాట్లాడారు. అప్పట్లో అలాంటి అవకాశాలు లేవని, నేటి యువత కృతిమ మేథను తెలివిగా వినియోగించుకోవాలని సూచించారు. జీవిత చరిత్రలను క్షుప్తంగా తెలుసుకోవటానికి ఏఐని వాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఒక వ్యక్తి వయసు, అభిరుచులకు అనుగుణంగా ఏ జీవిత చరిత్రలు చదవాలో సిఫార్సు చేయమని ఏఐని అడిగి, ఆ పుస్తకాలను స్వయంగా చదవటం వల్ల నిజమైన వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని చెప్పారు. వినోదం మాత్రమే కాక, సామర్థ్యం, జ్ఞానాన్ని పెంపొందించటానికి ఏఐ సాధనంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ వినియోగంపై ఆయన మార్గదర్శకత్వం పట్ల విద్యార్థులు ప్రశంసలు కురిపించారు. ఇది వారి సాంకేతిక ప్రయత్నాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

 

కర్ణాటక శాస్త్రీయ సంగీత శైలిలో ఓ విద్యార్థి ఇచ్చిన వేణుగాన ప్రదర్శనను ప్రధానమంత్రి ఆసక్తిగా ఆలకించి, ప్రశంసించారు. వసంతపంచమి సందర్భంగా ఉత్తరాఖండ్ సంప్రదాయ విశిష్టత తెలిసేలా స్వయంగా రూపొందించిన పుష్పగుచ్ఛం అందించిన విద్యార్థిని అభినందించారు. త్రిపుర సంప్రదాయాలను తెలియజేసేలా విద్యార్థులు బహుమతిగా ఇచ్చిన సేంద్రీయ తేయాకు, అస్సామీ గమోచాను ప్రశంసించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను అభినందిస్తూ, కవిత్వం రాయటం కొనసాగించాలని ప్రోత్సహించారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, శుభాకాంక్షలు తెలిపారు.

పరీక్షా పే చర్చ కార్యక్రమం రాబోయే ఎపిసోడ్ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో "పరీక్షా పే చర్చ" నిర్వహించాలని చాలామంది విద్యార్థులు సూచించారని, ఆ విషయం ఈ ఎపిసోడ్‌లో ప్రతిబింబించిదనన్నారు. కుటుంబంలో తోబుట్టువుల నుంచి మంచి లక్షణాలను అలవరచుకోవాలని సూచించారు. గొప్పగా ఎదగాలని ఆశించటంలో తప్పులేదు కానీ, ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదన్నారు. వ్యక్తిగతంగా, సామాజికంగా విద్య ప్రాముఖ్యతను గురించి చెబుతూ, జీవితంలో క్రీడలు కూడా ముఖ్య భాగంగా ఉండాలని చెప్పారు. విద్యార్థుల ఆలోచనలను, అనుభవాలను స్వేచ్ఛగా పంచుకోవాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం తదుపరి ఎపిసోడ్ 9 ఫిబ్రవరి 2026న ఉదయం 10 గంటలకు ప్రసారం అవుతుంది.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's passenger vehicle sales expected to grow 4-6% in FY27: Report

Media Coverage

India's passenger vehicle sales expected to grow 4-6% in FY27: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the transformative impact of Yoga
June 22, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that the remarkable success of the International Day of Yoga is proof that Yoga is not only helping millions of people across the world achieve physical well-being, but is also inspiring them to lead positive lives with confidence.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“चित्तप्रशमनोपायो योग इत्यभिधीयते। प्राणस्पन्दनिरोधो वा द्वेधा योगस्य धारणा॥”

The Subhashitam conveys that yoga is the means of completely calming and quieting the mind. To attain this goal, two principal methods of yoga are prescribed: calming the mind and regulating the flow of the breath.

The Prime Minister wrote on X;

“अंतर्राष्ट्रीय योग दिवस की बड़ी सफलता इस बात का प्रमाण है कि योग न केवल दुनियाभर में करोड़ों लोगों को शारीरिक रूप से स्वस्थ बना रहा है, बल्कि उन्हें आत्मविश्वास के साथ सकारात्मक जीवन जीने के लिए प्रेरित भी कर रहा है।

चित्तप्रशमनोपायो योग इत्यभिधीयते। प्राणस्पन्दनिरोधो वा द्वेधा योगस्य धारणा॥”