అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు“ఎం.కె.1ఎ" సైన్యానికి అప్పగింత
ఈ ప్రాజెక్టులు సృజనాత్మకతకు, స్వదేశీ అభివృద్ధికి ప్రతీకలు. తమిళనాడు అభివృద్ధిని వేగిరపరుస్తాయి: ప్రధాని
పుల్వామా దాడిలో అమరులకు మోదీ నివాళులు
రక్షణరంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనపై దృష్టి
తీరప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్ ప్రత్యేక ప్రాధాన్యం: ప్రధాని
శ్రీలంకలోని తమిళుల సంక్షేమం, వారి మనోభావాలపై ప్రభుత్వం ఎప్పడూ శ్రద్ధచూపుతోంది: ప్రధాని
తమిళనాడు సంస్కృతిని పరిరక్షించడం మాకు గౌరవం. తమిళనాడు సంస్కృతికి ప్రపంచ వ్యాప్త జనాదరణ ఉంది: ప్రధాని

తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు సృజనాత్మకతకు, స్వదేశీ అభివృద్ధికి ప్రతీకలన్నారు. తమిళనాడు అభివృద్ధిని ఈ ప్రాజెక్టులు మరింత వేగవంతం చేస్తాయన్నారు. ఈ రోజు పునాది రాయి వేసిన636కిలోమీటర్ల మేర పొడవైన గ్రాండ్ అనికట్ కాలువల ఆధునికీకరణవ్యవస్థతోతంజావూరు, పుదుక్కొట్టై ప్రాంతాలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుందని, దీని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో 2.27 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసినందుకు, నీటి వనరులను చక్కగా వినియోగించుకున్నందుకు తమిళనాడు రైతులను ప్రధాని ప్రశంసించారు. "గ్రాండ్ అనికట్ మన అద్భుతమైన గత చరిత్రకు సజీవ సాక్ష్యం" అన్నారు. "ఆత్మనిర్భర్ భారత్" లక్ష్యాలకు కూడా ఇది ప్రేరణ"గా ఉంటుందని అన్నారు. తమిళ కవి అవ్వయ్యార్ మాటలను ప్రధానమంత్రి ఉటంకిస్తూ, నీటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని, నీరు జాతీయ సమస్య మాత్రమే కాదు, ప్రపంచ ప్రాధాన్యం కలిగిన అంశంగా పరిగణించాలని అన్నారు. ప్రతి నీటి చుక్కకూ మరింత పంట అనే మంత్రాన్ని మనం గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

 

 

చెన్నై మెట్రో రైలు మార్గంలో ఈ రోజు ప్రారంభమైన 9కిలోమీటర్ల తొలి దశను గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహమ్మారి కోవిడ్ వైరస్ వ్యాప్తి సమస్య ఎదురైనప్పటికీ, ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోనే పూర్తిచేయగలిగారన్నారు. ఈ మార్గంకోసం రైలు బోగీలను, వ్యాగన్లను స్థానికంగానే తయారు చేయడం, నిర్మాణ కార్యకలాపాలన్నీ భారతీయ కంట్రాక్టర్లే నిర్వహించడంఆత్మనిర్భర్ భారత్ నినాదానికి అనుగుణంగా ఉందన్నారు. 119 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు రెండవ దశకోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 63వేల కోట్లకుపైగా కేటాయించినట్టు చెప్పారు. ఒకేసారిగా ఈ స్థాయిలో కేటాయింపు జరిగిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటన్నారు. ఈ స్థాయిలో ఏ నగరంలోనూ ప్రాజెక్టును చేపట్టలేదన్నారు. పట్టణ రవాణా ఏర్పాట్లపై దృష్టిని కేంద్రీకరించడంతో చెన్నై నగరంలో పౌరుల సులభతర జీవనం మరింత మెరుగుపడుతుందన్నారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో ప్రజలకు సౌకర్యం మెరుగుపడుతుందని, ఇది వాణిజ్యానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన చెన్నై బీచ్-ఎన్నోర్ అత్తిపట్టు మార్గం, వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతమన్నారు. చెన్నై ఓడరేవు, కామరాజార్ పోర్టు మధ్య సరకు రవాణాను వేగవంతం చేయవలసిన అవసరం ఉందని, చెన్నై బీచ్, అత్తిపట్టు మధ్య ఏర్పరిచే 4వ మార్గంతో ఈ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. విల్లుపురం, తంజావూర్ తిరువళ్లూరు ప్రాజెక్టు విద్యుదీకరణ ప్రాజెక్టు డెల్టా ప్రాంతపు జిల్లాలకు ఒక వరం కాగలదని అన్నారు.

 

 

పుల్వామా దాడిలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. “ఈ దాడిలో ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ మనం నివాళులర్పిస్తున్నాం. మన భద్రతా బలగాలు మనకు ఎంతో గర్వకారణం. వారి ధైర్య సాహసాలు తరతరాలకూ స్ఫూర్తిదాయంగా ఉంటాయి.” అన్నారు.

రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారతదేశం భారీ స్థాయిలో కృషి చేసిందని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని అతి ప్రాచీన భాష అయిన తమిళంలో కవితలు రాసిన మహాకవి సుబ్రమణియ భారతి భారతదేశం కృషికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయుధాలు తయారు చేద్దాం, కాగితం తయారు చేద్దాం, ఫ్యాక్టరీలు నిర్మిద్దాం. పాఠశాలలు నిర్మిద్ధాం. కదలి, ఎగిరే వాహనాలు తయారు చేద్దాం. ప్రపంచాన్ని కుదిపివేసే నౌకలు తయారు చేద్దాం. అన్న ఆయన మాటలు రక్షణ రంగానికి స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని రెండు రక్షణ కారిడార్లలో ఒకటి తమిళనాడుకు చెందినదేనన్నారు. తమిళనాడు రక్షణ కారిడార్ కోసం రూ. 8,100కోట్లకుపైగా పెట్టుబడులకు హామీ ఇప్పటికే లభించిందని అన్నారు.

దేశంలో మోటారు వాహనాల తయారీలో అగ్రస్థానం సాధించిన కేంద్రంగా తమిళనాడు ఇప్పటికే పేరు సంపాదించిందని ప్రధానమంత్రి అన్నారు. ఇపుడు యుద్ధట్యాంకుల తయారీ కేంద్రంగా తమిళనాడును చూడాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.

అర్జున్ మార్క్ 1ఎ (ఎం.కె.-1ఎ) పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును గురించి ప్రధాని మాట్లాడుతూ, “ఈ ట్యాంకు తయారీలో, రూపకల్పనలో స్వదేశీ పరిజ్ఞానం వినియోగించడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను” అన్నారు. స్వదేశీ తయారీ మందుగుండు సామగ్రినే ఈ యుద్ధట్యాంకు వినియోగిస్తుందన్నారు. తమిళనాడులో తయారైన యుద్ధ ట్యాంకున మన ఉత్తర సరిహద్దులకు రక్షణగా వినియోగిస్తామని, భారతదేశపు “ఏక్తా దర్శన్” అనే స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోందని ప్రధాని అన్నారు. రక్షణరంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్.గా తీర్చిదిద్దేందుకు దృష్టిని కేంద్రీకరించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, ఇకపై పూర్తి వేగంతో ఈ కార్యక్రమం సాగిస్తామని ప్రధానమంత్రి చెప్పారు.

భారతీయ సంప్రదాయానికి, సాహసానికి మన సాయుధ బలగాలు ప్రతీకలని, మాతృభూమిని రక్షించే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని సాయుధ బలగాలు ఎన్నోసార్లు రుజువుచేశాయని, భారతదేశం శాంతినే విశ్వసిస్తుందని కూడా సాయుధ బలగాలు నిరూపించాయని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశం తన సౌర్వభౌమత్వాన్ని అన్ని విధాలా పరిరక్షించుకోగలదని మోదీ అన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాల ఏర్పాటు కోసం మద్రాసు ఐ.ఐ.టి.లో డిస్కవరీ క్యాంపస్ పేరిట 2లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పరిశోధకులకు ఇకపై ఇది కేంద్రం కాగలదని ఆశిస్తున్నట్టు చెప్పారు.

సంస్కరణలపై ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈ ఏడాది బడ్జెట్ కూడా ప్రతిబింబించిందని మోదీ అన్నారు. భారతదేశంలోని తీర ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్ ప్రత్యేక ప్రాముఖ్యం ఇస్తోందని అన్నారు. మత్స్యకారులకు అదనపు రుణంకోసం యంత్రాగం, చెన్నైతో సహా ఐదు కేంద్రాల్లో ఆధునిక సదుపాయాలతో చేపల రేవుల ఏర్పాటు, సముద్రపు శైవలాల (సీవీడ్) పెంపకాన్ని, సాగును ప్రోత్సహించడం, తదితర చర్యలు తీరప్రాంతాల్లో ప్రజల జీవితాలను మెరుగుపరచగలవని అన్నారు. ఇందుకు సంబంధించి ఒక సీవీడ్ పార్క్. తమిళనాడులో ఏర్పాటు కాబోతున్నదని చెప్పారు.

తమకు సంప్రదాయపరమైన పేరుతోనే గుర్తింపు ఇవ్వాలని సుదీర్ఘకాలంగా దేవేంద్రకుల వేళార్ తెగవారు చేస్తున్న డిమాండ్.ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, ఇదివరకు రాజ్యాగంలోని షెడ్యూలులో పొందుపరిచిన ఆరేడు పేర్లతో కాకుండా, వారి వారసత్వపు పేరుతోనే ఇకపై వారికి గుర్తింపు లభిస్తుందని ప్రధాని చెప్పారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ముసాయిదాను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ సవరణను సభముందుకు తీసుకువస్తామని అన్నారు. ఈ అంశంపై వివరంగా అధ్యయనం జరిపిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేరు మార్పుకంటే నిర్ణయం తీసుకోవడమే ముఖ్యమని, ఇది న్యాయం, గౌరవం, అవకాశానికి సంబంధించిన అంశమని ప్రధాని అన్నారు. “తమిళనాడు సంస్కృతిని పరిరక్షించడం, ఆ సంస్కృతి వైభవాన్ని ఆస్వాదించడం మనకు గర్వకారణం. తమిళనాడు సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉంది.” అని మోదీ అన్నారు.

శ్రీలంకలోని తమిళ సోదర, సోదరీమణుల సంక్షేమంపట్ల, వారి ఆశలు మనోభావాలపట్ల ప్రభుత్వం ఎప్పుడూ శ్రద్ధ కనబరుస్తూనే ఉందని అన్నారు. శ్రీలంకలోని జాఫ్నాను సందర్శించిన ఏకైక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే. తమిళులకు సంబంధించి ప్రభుత్వం అందించిన వనరులు గతంతో పోల్చితే చాలా ఎక్కువ. శ్రీలంకలోని తమిళులకోసంప్రభుత్వం చేపట్టిన పథకాలు: ఈశాన్య శ్రీలంకలో నిరాశ్రయులైన తమిళులకోసం 50వేల ఇళ్లు, తోటల పెంపకం ప్రాంతాల్లో 4వేల ఇళ్లు నిర్మించారు. ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఆర్థిక సాయంతో అందించిన ఉచిత అంబులెన్స్ సేవలను తమిళులు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. డికోయా ప్రాంతంలో ఒక ఆసుపత్రిని కూడా నిర్మించారు. తమిళులమధ్య అనుసంధానం మెరుగుపరచడానికి జాఫ్నా, మన్నార్ ప్రాంతాలకు రైలుమార్గం తిరిగి నిర్మిస్తున్నారు. చెన్నైనుంచి జాఫ్నాకు విమాన సర్వీసులను ఏర్పాటు చేశారు. భారతదేశం నిర్మించిన జాప్నా సాంస్కృతిక కేంద్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. “తమిళుల హక్కుల సమస్యపై శ్రీలంక నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. వారు సమానత్వం, సమ న్యాయం, గౌరవంతో బతకాలన్న అంశానికి మేం ఎప్పుడూ కట్టుబడి ఉంటున్నాం.” అని ప్రధానమంత్రి చెప్పారు.

 

మత్స్యకారుల సమంజసమైన ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం ఎప్పటికైనా కట్టుబడి ఉంటుందని, శ్రీలంకలో పట్టుబడిన జాలర్లను సత్వరం విడిపించేందుకు చర్యలు తీసుకుంటూనే ఉందని ప్రధాని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 16వందలమంది జాలర్లు విడుదలయ్యారని, ప్రస్తుతం శ్రీలంక కస్టడీలో భారతీయ మత్స్యకారులెవరూ బందీలుగా లేరని, అలాగే 313మత్స్యకారుల బోట్లను కూడా విడుదలయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు.

చెన్నై మెట్రో రైలు మొదటి దశ విస్తరణ ప్రాజెక్టును, చెన్నై బీచ్-అత్తిపట్టు మధ్య 4వ రైల్వే లైనును, విల్లుపురం-కడలూరు-మైలాడుదురై-తంజావూరు సింగిల్ లైన్ సెక్షన్,..మైలాడుదురై-తిరువారూర్ మార్గం విద్యుదీకరణను, ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. గ్రాండ్ ఆనికట్ కాలువ వ్యవస్థ విస్తరణ, పునరుద్ధరణ, ఆధునికీకరణ ప్రాజెక్టుకు, మద్రాసు ఐ.ఐ.టి.లో డిస్కవరీ క్యాంపస్ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

తమిళనాడు గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, తమిళనాడు శాసనసభ సభాపతి, తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report

Media Coverage

Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 మార్చి 2026
March 26, 2026

India’s Economy, Innovative Spirit and Global Standing Continue to Thrive with the Modi Government