దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ (COVID-19 vaccination) మరో కీలక మైలురాయికి చేరనుంది. టీకా కార్యక్రమంలో వినియోగించిన డోసుల సంఖ్య అక్టోబరు 21..గురువారం నాటికి అంటే ఇవ్వాల్టికి 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది.

అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో, విమానాల్లో, షిప్స్‌ల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ విజయాన్ని లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రకటించాలని సర్కారు డిసైడ్‌ అయ్యింది. అలాగే ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక వ్యాక్సినేషన్‌ (vaccination) 100 కోట్ల డోసులకు చేరిన సందర్భంగా.. సింగర్‌‌ కైలాశ్‌ ఖేర్‌ ఆలపించిన పాటను, ఒక ఆడియో..విజువల్‌ ఫిల్మ్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) రిలీజ్‌ చేయనున్నారు. బుధవారం సాయంత్రం నాటికి మన దేశంలో 99.54 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్‌ జరిగింది.

అయితే మన పొరుగుదేశం చైనా 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ రికార్డును ( 100 crore COVID-19 vaccination) జూన్‌లో నమోదుచేసింది. ఇప్పుడు దాని తర్వాతి స్థానంలో మన భారత్‌ నిలవనుంది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన కొవిడ్‌ మార్గదర్శకాలను భారత్‌ తాజాగా సవరించింది. భారత్‌తో పరస్పర టీకా ఆమోద ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశాలకు ఈ విషయంలో పలు సడలింపులు కల్పించింది. ఈ జాబితాలోని 11 దేశాలు ఉన్నాయి. 

బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నేపాల్‌, బెలారస్‌, లెబనాన్‌, ఆర్మేనియా, ఉక్రెయిన్‌, బెల్జియం, హంగరీ, సెర్బియా నుంచి వచ్చే వారు రెండు డోసుల టీకా (Two-dose vaccine) తీసుకొని ఉంటే వెంటనే విమానాశ్రయం నుంచి పంపించేస్తారు. ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్ (RT-PCR Test) నెగెటివ్‌ నివేదికను చూపించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు భారత్‌లో (India) అక్టోబరు 25 నుంచి అమల్లోకి రానున్నాయి.

 
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor

Media Coverage

‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ఐక్యతా మహాకుంభమేళా – నవ శకానికి నాంది
February 27, 2025

పవిత్ర నగరమైన ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఒక గొప్ప ఐక్యతా మహాయజ్ఞం పూర్తయింది. ఒక జాతిలో చైతన్యం పురివిప్పినప్పుడు- శతాబ్దాల నాటి అణచివేత ధోరణికి సంబంధించిన సంకెళ్ల నుంచి విముక్తి కలిగినపుడు- ఉప్పొంగిన ఉత్సాహంతో అది స్వేచ్ఛా వాయువుల్ని ఆస్వాదిస్తుంది. గత నెల 13 నుంచి ప్రయాగరాజ్‌లో దిగ్విజయంగా సాగిన ఐక్యతా మహాకుంభ మేళా (ఏక్తా కా మహాకుంభ్) సరిగ్గా ఈ ఫలితానికి సాక్షిగా నిలిచింది.

గతేడాది జనవరి 22న, అయోధ్యలోని రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా, నేను దైవభక్తి గురించీ, దేశభక్తి గురించీ మాట్లాడుతూ దేవుడి పట్లా, దేశం పట్లా- భక్తి ఉండాలని చెప్పాను. ప్రయాగరాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు దేవుళ్లు, దేవతలతో పాటు, సాధువులు, మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు ఇలా అంతా ఒక్కచోటనే కలిశారు. జాతి చైతన్యం మేల్కొన్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూశాం. ఇది ఐక్యతా మహా కుంభమేళా. ఈ పవిత్ర సందర్భం కోసం 140 కోట్ల మంది భారతీయుల నమ్మకాలన్నీ ఒకే చోట, ఒకే సమయంలో ఏకమయ్యాయి.

ఈ పవిత్ర ప్రయాగరాజ్ ప్రాంతంలోనే శృంగవర్‌పూర్ అనే పవిత్ర ప్రాంతం ఉంది. ఇది ఐక్యత, సామరస్యం, ప్రేమకు గుర్తుగా ఈ పుణ్యభూమిలోనే ప్రభు శ్రీరాముడు, నిషధరాజు కలుసుకున్నారు. వారి కలయిక భక్తికీ, సద్భావనకూ ప్రతీక. నేటికీ, ప్రయాగరాజ్ అదే స్ఫూర్తిని మనలో నింపుతోంది.

45 రోజులుగా... దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రజలు ఈ సంగమ ప్రాంతానికి తరలిరావడాన్ని నేను చూశాను. సంగమం వద్ద భావోద్వేగాలు ఒక అలలా పెరుగుతూనే వచ్చాయి. ఈ త్రివేణీ సంగమంలో మునిగి పుణ్యస్నానాన్ని ఆచరించాలన్న ఏకైక లక్ష్యం ప్రతి భక్తుడిలోనూ ప్రతిఫలించింది. గంగా, యమునా, సరస్వతుల పవిత్ర సంగమం ప్రతి యాత్రికునిలో ఉత్సాహాన్నీ, శక్తినీ, ధైర్యాన్నీ నింపింది.

ఆధునిక మేనేజ్‌మెంటు నిపుణులు, ప్రణాళిక, విధాన నిపుణులకు ఈ మహా కుంభమేళా ఒక అధ్యయన అంశం. ప్రపంచంలో మరెక్కడా కూడా దీనికి సాటిరాగలదిగానీ, ఈ స్థాయిలో కనిపించే ఉదాహరణగానీ లేదు.

ఈ నదుల సంగమ తీరానికి కోట్లాది మంది ఎలా వచ్చారని ప్రపంచం ఆశ్చర్యంతో చూసింది. ఎప్పుడు వెళ్లాలన్న విషయంలో ప్రజలకు ఎలాంటి అధికారిక ఆహ్వానాలుగానీ, ముందస్తు సమాచారంగానీ ఏదీ లేదు... అయినా కోట్లాది మంది స్వచ్ఛందంగా మహా కుంభమేళాకు ప్రయాణం కట్టారు. సంగమానికి చేరుకుని, పుణ్య జలాల్లో మునక వేయడం ద్వారా అలౌకిక ఆనందాన్ని ఆస్వాదించారు.

పుణ్య జలాల్లో మునక తర్వాత… మాటలకు అందని ఆనందం, తృప్తితో నిండిపోయిన భక్తుల ఆ ముఖాల్ని మరిచిపోవడం అసాధ్యం. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన మన సోదరసోదరీమణులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈ పవిత్ర సంగమానికి చేరుకోగలిగారు.

ముఖ్యంగా భారత యువత భాగస్వామ్యం నాకు మరింత ఉత్సాహాన్ని అందించింది. మహా కుంభమేళాలో పాల్గొనడం ద్వారా మన అద్భుత సంస్కృతీ, వారసత్వాలకు మార్గదర్శకులుగా ఉంటామంటూ యువత మనకు గొప్ప సందేశాన్ని పంపింది. వాటి పరిరక్షణ దిశగా వారికున్న బాధ్యతలను గుర్తించి, వాటిని ముందుకు తీసుకుకెళ్లేందుకు సంకల్పించారు.

ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు కొత్త రికార్డులను సృష్టించారు. ఇక్కడికి వచ్చిన వారికి మించి, వివిధ కారణాలతో ఇక్కడికి రాలేకపోయినవారు సైతం ఈ పుణ్యకార్యంతో మానసికంగా అనుసంధానమయ్యారు. ఇక్కడి నుంచి వెళుతూ వెళుతూ భక్తులు తీసుకెళ్లిన త్రివేణీ సంగమ జలాలను లక్షలాది మందికి అలౌకిక ఆనందాన్ని అందించాయి. మహా కుంభమేళా యాత్ర చేసి వెనక్కి వచ్చిన వారికి ఊరంతా ఆహ్వానం పలికింది. సమాజం వారిని గౌరవించింది.

గత కొన్ని వారాలుగా జరిగిన ఈ మహా కార్యక్రమం అపూర్వం. రాబోయే శతాబ్దాలకు పునాది వేసింది.

ఎవరి ఊహలకూ అందని స్థాయిలో భక్తులు ప్రయాగరాజ్ కు తరలివచ్చారు. గతంలో జరిగిన కుంభమేళాల ఆధారంగా మాత్రమే అధికార యంత్రాంగం అంచనా వేసింది.

ఈ ఐక్యతా మహాకుంభమేళాలో సుమారుగా అమెరికా జనాభాకు రెండింతల మంది పాలుపంచుకున్నారు.

కోట్లాది భారతీయుల ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక పండితులు విశ్లేషిస్తే... భారత్ తన వారసత్వం పట్ల గర్విస్తోందనీ, కొత్తగా లభించిన చేతనతో వారంతా ముందుకు సాగుతున్నారనీ కచ్చితంగా తెలుసుకుంటారు. ఒక నవ శకం ఆవిష్కారం అయిందనీ, ఇది రేపటి భారతదేశపు నిర్మాణానికి దారులు వేస్తుందని నేను నమ్ముతున్నాను.

మహా కుంభమేళా భారత జాతీయతను వేల సంవత్సరాలుగా బలోపేతం చేసింది. పూర్ణ కుంభమేళా జరిగిన ప్రతిసారీ సాధువులు, పండితులు, మేధావులు ఒక చోటకు వచ్చి, ఆయా కాలాల్లోని సమాజ స్థితిగతుల గురించి చర్చించేవారు. వారి ఆలోచనలు దేశానికి, సమాజానికి దిశానిర్దేశం చేసేవి. ప్రతి ఆరేళ్లకోసారి జరిగే అర్ధకుంభ మేళాలో అప్పటి వరకూ చేసిన ఆలోచనలను సమీక్షించేవారు. 144 సంవత్సరాల పాటు జరిగిన 12 పూర్ణకుంభ మేళా కార్యక్రమాల తర్వాత- వాడుకలో లేని, కాలం చెల్లిన సంప్రదాయాలను రద్దు చేసేవారు. సరికొత్త ఆలోచనలను స్వీకరించేవారు. కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుట్టి, మారిన కాలంతోపాటు ప్రయాణం చేసేవారు.

144 ఏళ్ల తర్వాత... ఈ మహా కుంభమేళాలో, మన సాధువులు మరోసారి భారత అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త సందేశాన్ని అందించారు. అది ఏమంటే- అభివృద్ధి చెందిన భారతదేశం - వికసిత్ భారతం.

ఈ ఐక్యతా మహా కుంభమేళాకు ప్రతి యాత్రికుడు- ధనికులు కావచ్చు, పేదలు కావచ్చు.. యువకుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు.. గ్రామాలు కావచ్చు, నగరాలు కావచ్చు… తూర్పు పశ్చిమాలు, ఉత్తర దక్షిణాలు… కులం, మతం, భావజాలం అన్న భేదాలేమీ లేకుండా కలిసిపోయారు. ఇందులో సాకారమైన ఏక్ భారత్- శ్రేష్ఠతా భారత్ కోట్లాది మందిలో ధైర్యాన్ని ప్రోది చేసింది. ఇపుడు, ఇదే స్ఫూర్తితో అభివృద్ధి చెందిన భారతావని నిర్మాణం కోసం మనం చేరువ అవుదాం.

బాల్యంలో శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు బ్రహ్మాండమంతటినీ తన నోటిలో చూపిన సంగతి నాకు జ్ఞాపకానికి వచ్చేలా చేసింది. ఈ మహా కుంభమేళా- సమష్టిగా భారత దేశ ప్రజల అపారమైన శక్తిని ఇటు దేశానికీ, అటు ప్రపంచానికీ చూపించింది. మనం ఇప్పుడు ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం మనల్ని మనం అంకితం చేసుకోవాలి.

గతంలో భక్తి ఉద్యమానికి చెందిన ప్రబోధకులు మన సమష్టి సంకల్ప బలాన్ని గుర్తించి, ప్రోత్సహించారు. స్వామి వివేకానంద నుంచి శ్రీ అరబిందో వరకు, గొప్ప ఆలోచనాపరులంతా మన సమిష్టి సంకల్ప శక్తిని మనకు తెలియజెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ సైతం దీని ప్రభావాన్ని గుర్తించారు. అయితే దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రానంతరం ఈ సమిష్టి బలాన్ని సరిగ్గా గుర్తించి, అందరి సంక్షేమం కోసం ఉపయోగించినట్లయితే, కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశానికి గొప్ప శక్తిని అందించి ఉండేది. దురదృష్టవశాత్తూ ఇంతకు పూర్వం ఎవరూ చేసి ఉండలేదు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఇపుడు ఈ సమష్టి సంకల్ప బలం నా కళ్ల ముందు కనిపించడం పట్ల నా మనసు ఉల్లాసం చెందుతోంది.

వేదాల నుంచి వివేకానందుని బోధనల వరకు, ప్రాచీన గ్రంథాల నుంచి ఆధునిక ఉపగ్రహాల వరకు, భారతదేశానికి సంప్రదాయలు ఈ దేశాన్ని తీర్చిదిద్దాయి. మన పూర్వీకులు, మహారుషులు అందించిన జ్ఞాపకాల నుంచి మనం కొత్త స్ఫూర్తిని అందుకోవాలని ఒక పౌరుడిగా నా విజ్ఞప్తి. నూతన సంకల్పంతో ముందుకు సాగడానికి మనకు ఈ ఐక్యతా మహా కుంభమేళా సహాయపడొచ్చు. ఐక్యతను మన మార్గదర్శక సూత్రంగా చేసుకుందాం. దేశ సేవే- మాధవ సేవగా భావిస్తూ కలిసికట్టుగా పనిచేద్దాం.

వారణాసిలో ఎన్నికల ప్రచారంలో, "గంగామాత నన్ను పిలిచింది" అని నేను చెప్పాను. ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు. మన పవిత్ర నదుల పరిశుభ్రత పట్ల బాధ్యత కోసం ఇచ్చిన పిలుపు కూడా. ప్రయాగరాజ్‌లోని గంగా, యమునా, సరస్వతుల సంగమాన్ని దర్శించినప్పుడు నా సంకల్పం మరింత బలపడింది. మన నదుల పరిశుభ్రత మన జీవితాలతో లోతుగా ముడిపడి ఉంది. చిన్నవైనా, పెద్దవైనా మన నదులన్నింటినీ జీవదాతలుగా భావించి వాటిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ మహా కుంభమేళా మన నదుల పరిశుభ్రత కోసం మనం మన కృషిని కొనసాగించేందుకు స్ఫూర్తినిచ్చింది.

ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు. మా భక్తిలో ఏవైనా లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించమని గంగా, యమునా, సరస్వతి మాతలను నేను ప్రార్థిస్తున్నాను. జనతా జనార్ధనుడని చూస్తున్నాను. ప్రజలను నేను దైవ స్వరూపంగా భావిస్తాను. వారికి సేవ చేసే మా ప్రయత్నాల్లో ఏదైనా లోపం జరిగి ఉంటే, నేను అందుకు ప్రజలను సైతం క్షమాపణ కోరుతున్నాను.

మహాకుంభ్‌లో కోట్లాది మంది భక్తి భావంతో పాలుపంచుకున్నారు. వారికి సేవ చేసే బాధ్యతను సైతం అదే భక్తి భావంతో నిర్వహించాం. యోగి జీ నాయకత్వంలో, పరిపాలన యంత్రాంగం, ప్రజలు కలిసి ఈ ఐక్యతా మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి కలిసికట్టుగా పనిచేశారని ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యునిగా నేను గర్వంగా చెప్పగలను. రాష్ట్రం, కేంద్రం, పాలకులు లేదా నిర్వాహకులు అనే తేడాలేవీ లేకుండా ప్రతి ఒక్కరూ తమనుతాము సేవకులుగా భావించి అంకితభావంతో పనిచేశారు. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పడవలు నడిపేవారు, డ్రైవర్లు, ఆహారం అందించే వ్యక్తులు ఇలా అందరూ అవిశ్రాంతంగా పని చేశారు. ప్రత్యేకించి, అనేక అసౌకర్యాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రయాగరాజ్ ప్రజలు యాత్రికులను హృదయపూర్వకంగా స్వాగతించిన విధానం చాలా స్ఫూర్తిదాయకం. వారికి, ఉత్తరప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మన దేశ ఉజ్వల భవిష్యత్తుపై నాకు ఎప్పుడూ అచంచలమైన నమ్మకం ఉంది. ఈ మహా కుంభమేళాను వీక్షించడంతో నా దృఢ విశ్వాసం మరింత బలోపేతమైంది.

140 కోట్ల మంది భారతీయులు ఈ ఐక్యతా మహా కుంభమేళాను ప్రపంచస్థాయి కార్యక్రమంగా మార్చిన తీరు నిజంగా అద్భుతం. మన ప్రజల అంకితభావం, భక్తి, ప్రయత్నాలు నాకు ఎంతో సంతోషం కలిగించాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన శ్రీ సోమనాథుడిని త్వరలోనే దర్శించుకుంటాను. ఈ జాతీయ సమష్టి కృషి ఫలాలను ఆయనకు సమర్పిస్తాను. అలాగే ప్రతి భారతీయుడి క్షేమం కోసం ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తాను.

మహా కుంభమేళా భౌతికంగా మహాశివరాత్రి పర్వదినాన విజయవంతంగా ముగిసి ఉండవచ్చు. కానీ గంగానది శాశ్వత ప్రవాహంలా, మహాకుంభమేళా మేల్కొల్పిన ఆధ్యాత్మిక బలం, జాతీయ స్పృహ అలాగే ఐక్యత మనకు అనేక తరాల వరకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.