వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్-2 (వివిపి-2) ను కేంద్ర పథకంగా (100% కేంద్ర నిధులు) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది, తద్వారా  వికసిత భారత్ - 2047 లక్ష్యానికి అనుగుణంగా సురక్షితమైన, భద్రమైన, పటిష్ఠమైన సరిహద్దులను సాధించే దిశగా ప్రభుత్వం తన నిబద్ధతను మరింతగా చాటుకుంది. ఇప్పటికే వీవీపీ-1 పరిధిలోకి ఉన్న ఉత్తర సరిహద్దు కాకుండా అంతర్జాతీయ భూ సరిహద్దుల (ఐఎల్ బీ)కు ఆనుకుని ఉన్న బ్లాకుల్లో ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

మొత్తం రూ.6,839 కోట్ల వ్యయంతో 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గుజరాత్, జమ్ముకశ్మీర్ (యూటీ), లడఖ్ (యూటీ), మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన వ్యూహాత్మక గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

సుసంపన్నమైన,  సురక్షితమైన సరిహద్దులను నిర్ధారించడానికి, మెరుగైన జీవన పరిస్థితులు,  తగిన ఉపాధి అవకాశాలను కల్పించడం, సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను నియంత్రించడం, అక్కడి జనాభాను దేశ ప్రధాన జన జీవన స్రవంతిలో చేర్చడం, అలాగే వారిని సరిహద్దు రక్షణ దళాల కళ్ళు, చెవులుగా మారుస్తూ అంతర్గత భద్రతను మరింత మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యాలలో ప్రధానమైనవి.

ఈ కార్యక్రమం గ్రామంలో లేదా గ్రామ సమూహాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను అందించడంతో పాటు, సహకార సంఘాలు, స్వయం సహాయ సంఘాలు వంటి సంస్థల ద్వారా విలువ ఆధారిత అభివృద్ధి వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అలాగే, సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు, స్మార్ట్ తరగతులు వంటి విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి కి, సరిహద్దు ప్రాంతాల్లోవైవిధ్యమైన, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించే  పనులు / ప్రాజెక్టులకు నిధులను అందిస్తుంది.

సహకార దృక్పథంతో రూపోందించిన గ్రామ కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా సరిహద్దు ప్రదేశాలకు ముఖ్యంగా  ఆయా రాష్ట్రాలు  గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట చర్యలను చేపడతారు. 

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్డీ) ఇప్పటికే ఆమోదించిన ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన-4 (పీఎంజీఎస్వై-4) కింద ఈ గ్రామాలకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనువైన రహదారుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గదర్శకాల్లో తగిన మార్పులు, చేర్పులను కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ పరిశీలిస్తుంది.

ఎంపిక చేసిన మండలాల్లోని అన్ని గ్రామాలను - ఏ కాలంలో నైనా ప్రయాణించగలిగే రహదారి అనుసంధానం, టెలికమ్యూనికేషన్ సౌకర్యం, టెలివిజన్ సదుపాయం, విద్యుదీకరణ - అనే నాలుగు ప్రధాన రంగాలలో పూర్తి కవరేజీ సాధించేలా చేయాలని కూడా ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పథకం నిబంధనల సమన్వయం ద్వారా వీటిని అమలు చేస్తారు. 

ఈ కార్యక్రమం గ్రామాలలో చైతన్యభరిత జీవనానికి దోహదపడుతుంది. జాతరలు, పండుగలు, అవగాహన శిబిరాలు, జాతీయ పండుగలను నిర్వహించడం, కేంద్ర,  రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు ఈ గ్రామాలకు పర్యటనలు,  ప్రజలతో కలసి రాత్రి బస చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇవన్నీ స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు, పర్యాటక అవకాశాలను పెంపొందిస్తుంది. 

ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు పీఎం గతి శక్తి వంటి సమాచార డేటాబేస్ లను వినియోగించనున్నారు.

వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్-2 (వివిపి-2), ఇప్పటికే అమలులో ఉన్న వివిపి-1 తో కలసి సరిహద్దు గ్రామాలను స్వయం సమృద్ధిగా చైతన్యవంతంగా మార్చేందుకు చేపట్టిన మార్గదర్శక కార్యక్రమం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vietnam BrahMos deal already signed, Indonesia pact in final stages: Defence Secretary RK Singh

Media Coverage

Vietnam BrahMos deal already signed, Indonesia pact in final stages: Defence Secretary RK Singh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 మే 2026
May 30, 2026

Viksit Bharat in Motion: How PM Modi is Building a Self-Reliant Global India”