ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం, స్వచ్ఛ రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం కాలవ్యవధి రెండేళ్లు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్యూఏ) ఆధ్వర్యంలోని జాతీయ రాజధాని ప్రాంత ప్రణాళికా బోర్డు (ఎన్సీపీఆర్బీ) ద్వారా ఈ పథకానికి నిధులు అందుతాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్టీహెచ్), పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎన్జీ) ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ఎన్సీఆర్లో భాగంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ సహకారంతో ఇది అమలవుతుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5,041 కోట్లు, ఎన్సీఆర్లో భాగంగా ఉన్న రాష్ట్రాల నుంచి అంచనా ప్రకారం రూ.1,601 కోట్ల పన్ను రాయితీలతో సహా మొత్తం రూ.9,585 కోట్ల వ్యయ అంచనాతో ఈ పథకం తయారైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రిజిస్టర్ అయిన బీఎస్-IV లేదా అంతకంటే పాతవైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ట్రక్కులూ, బస్సుల స్థానంలో బీఎస్-VI లేదా మరింత కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే వాహనాలను లేదా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) కొనుగోలు చేసేలా వాహన యజమానులను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. స్వచ్ఛమైన రవాణా సాంకేతికత పరిజ్ఞానాలకు మారే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఈ పథకం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాహన ఉద్గారాలను గణనీయంగా తగ్గించి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ముఖ్యంగా శీతాకాలంలో వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారుతోంది. ఆటోమోటివ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్ఐ) సంయుక్తంగా 2018 ఆగస్టులో ప్రచురించిన ‘‘సోర్స్ అపోర్షన్మెంట్ ఆఫ్ పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5 అండ్ పీఎం 10) ఇన్ ది ఢిల్లీ-ఎన్సీఆర్’’ నివేదిక ప్రకారం.. ఢిల్లీ-ఎన్సీఆర్లో రవాణా రంగానికి పీఎం 2.5 ఉద్గారాల్లో 14 శాతం, కార్బన్ మోనాక్సైడ్ (CO)లో 40 శాతం, నైట్రోజన్ ఆక్సైడ్ (NOx) ఉద్గారాల్లో 63 శాతం వాటా ఉంది. రవాణా రంగంలో మొత్తం వాహనాల్లో ట్రక్కులూ, బస్సులూ 3 శాతమే ఉన్నప్పటికీ.. పీఎం 2.5 ఉద్గారాల్లో 36 శాతం వాటాను కలిగి ఉన్నాయి. బీఎస్-VI ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 14 వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానమైన ఉద్గారాలను ఒక్క ప్రీ-బీఎస్ హెవీ డ్యూటీ వాహనం విడుదల చేస్తుందని అంచనా. బీఎస్-VI వాహనం కంటే అదే శ్రేణికి చెందిన బీఎస్- IV వాహనం 2.7 రెట్లు ఎక్కువగా ఉద్గారాలను విడుదల చేస్తుంది. కాబట్టి, కొత్తగా ప్రవేశపెట్టే వాహన సముదాయం వల్ల వాహన కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ (ఢిల్లీ, హర్యాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్తో కూడిన) లో ఉన్న సుమారుగా 2.07 లక్షల ( 1.91 లక్షల ట్రక్కులు, 16,329 బస్సులు) మంది యజమానులకు ఈ పథకం ప్రయోజనాన్ని అందిస్తుంది.
బీఎస్- III లేదా అంతకంటే పాత వాహనాలను నమోదిత వాహన స్క్రాపింగ్ కేంద్రాల వద్ద తుక్కుగా మార్చడం తప్పనిసరి. బీఎస్- IV వాహనాల విషయానికి వస్తే.. వాటిని తుక్కు కింద మార్చుకోవచ్చు. లేదా ఎన్సీఆర్ పరిధి వెలుపల ఉన్న ఎన్సీఏపీయేతర నగరాలు/పట్టణాల్లో విక్రయించుకోవచ్చు. ఎన్సీఆర్ పరిధిలో బీఎస్-VI లేదా అంతకంటే కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేదా విద్యుత్తు వాహనాలను మాత్రమే యజమానులు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఈ పథకం పరిధిలో ఢిల్లీలో కొనుగోలు చేసే తేలికపాటి సరకు రవాణా వాహనాలు తప్పనిసరిగా విద్యుత్తువే అయి ఉండాలి. బస్సులు మాత్రం బీఎస్-VI సీఎన్జీ లేదా విద్యుత్తుతో నడిచేవై ఉండాలి. ప్రభుత్వ వాహనాలకు ఈ పథకం నుంచి మినహాయింపు ఉంది.
ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు:
రుణాలపై అయిదేళ్ల పాటు 5 శాతం వడ్డీ రాయితీని, వాహన విభాగాన్ని బట్టి నెలకు రూ. 4,800 వరకు విలువ చేసే ఇంధన ఓచర్లను, ఈవీ కొనుగోళ్లు లేదా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ట్రేడింగ్పై భారీ మొత్తంలో ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేయడంతో పాటు, పదేళ్ల పాటు 100 శాతం వరకు మోటారు వాహన పన్ను రాయితీలను అందిస్తాయి. అదేవిధంగా పాత వాహనాలకు 50 శాతం రాయితీలను ఇస్తాయి. ఈ పథకంలో భాగమయ్యే పాత వాహనాలపై ఉన్న బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది.
ఈ పథకంలో పాల్గొనే వాహన ఓఈఎంలు ఎక్స్-షోరూం ధరలపై 8 శాతం రాయితీలను అందిస్తాయి.
సమీకృత పోర్టల్ ద్వారా ఈ పథకాన్ని డిజిటల్ రూపంలో అమలు చేస్తారు. దీనివల్ల వాస్తవ సమయంలో అర్హతల తనిఖీలు, ఆటోమేటెడ్ వడ్డీ రాయితీ క్లెయిములు, నెలవారీ ఇంధన ఓచర్ క్రెడిట్లు, కాలుష్య తగ్గింపు ఫలితాల పర్యవేక్షణ సాధ్యమవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి అయిదేళ్ల పాటు కొత్త వాహనానికి కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. తద్వారా రెండేళ్ల నమోదు గడువు ముగిసిన తర్వాత కూడా ప్రభావం కొనసాగేలా చూసుకోవచ్చు.
ఈ పథకాన్ని సాధికార సంఘం పర్యవేక్షిస్తుంది. దీనికి క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షత వహిస్తారు. నీతి ఆయోగ్ సీఈవో, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, డీఎఫ్ఎస్ కార్యదర్శులు, ఢిల్లీ-ఎన్సీఆర్లో భాగమైన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఎన్సీఆర్పీబీ సభ్యకార్యదర్శి.. మెంబర్ కన్వీనర్గా ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు/జిల్లా మెజిస్ట్రేట్లు ఈ పథకాన్ని అమలు చేసి, పర్యవేక్షిస్తారు.
The Union Cabinet has approved a scheme that will work towards reducing pollution in the Delhi-NCR region and promote cleaner mobility. The scheme will improve air quality, support sustainable transport and benefit vehicle owners. https://t.co/KFBmkJiIWY
— Narendra Modi (@narendramodi) June 3, 2026


