ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ దేశంలో పత్తి సాగు-ఉత్పాదకతకు సంబంధించి వృద్ధి-నాణ్యతల క్షీణత, అవరోధాలు తదితర సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ప్రణాళికకు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు (2026-27 నుంచి 2030-31) ఐదేళ్లపాటు రూ.5659.22 కోట్లతో “పత్తి ఉత్పాదకత మిషన్” అమలుకు సమ్మతి తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 5 ‘ఎఫ్‌’ (ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్) దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం అమలవుతుంది. పత్తి సాగులో చీడపీడలను, తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే రకాల (హెచ్‌వైవీ) విత్తనాల రూపకల్పనపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల (SAU) ద్వారా ప్రస్తుత, సరికొత్త పంట ఉత్పత్తి సాంకేతికతలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. ఈ విధానాల అనుసరణ, విస్తరణ సహా జౌళి పరిశ్రమకు స్వల్ప మాలిన్య పత్తి సరఫరాకు భరోసా, అధిక నాణ్యతగల పత్తి ఎగుమతికి ప్రోత్సాహం తదితర లక్ష్యాలతో ఉత్పాదకత పెంపు దీని ధ్యేయం. ఈ మేరకు కింద పేర్కొన్న ప్రధానాంశాలపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది:

·        అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల, చీడపీడలను నిరోధించే విత్తనాలు సహా ఇతర ఉత్పత్తి/రక్షణ సాంకేతికతల రూపకల్పన.

·        అధిక సాంద్రతతో నాట్లు, సామీప్యం పెంపు, సమీకృత పత్తి యాజమాన్యం వంటి మెరుగైన ఉత్పత్తి సాంకేతికతల విస్తరణ, పొడుగు పింజ పత్తి సాగుకు ప్రోత్సాహం.

·        సామర్థ్య వికాసం ద్వారా పత్తి నాణ్యత పెంపు, ఉత్తమ ప్రాసెసింగ్ విధానాల అనుసరణ సహా జిన్నింగ్, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల ఆధునీకరణకు చేయూత.

·        విశ్వసనీయ నాణ్యత అంచనా-ప్రపంచ ప్రమాణ సహిత విలువలకు భరోసా దిశగా ఆధునిక, ప్రామాణిక, గుర్తింపు పొందిన సౌకర్యాలతో దేశవ్యాప్తంగా పత్తి పరీక్ష మౌలిక సదుపాయాల బలోపేతం.

·        భారతీయ పత్తిని ఒక అత్యుత్తమ, సుస్థిర, అంతర్జాతీయంగా విశ్వసనీయ ఉత్పత్తిగా నిలిపే దిశగా ‘కస్తూరి కాటన్ భారత్’ కింద పటిష్ట బ్రాండింగ్-ట్రేసబిలిటీ కార్యక్రమాల అమలు.

·        మండీ (మార్కెట్ యార్డు)ల డిజిటల్ సంధానం ద్వారా రైతులకు సాధికారత, తద్వారా పారదర్శక ధరల నిర్ధారణ, ప్రత్యక్ష మార్కెట్ సౌలభ్యం, ఈ-వేదికల ద్వారా మెరుగైన రాబడిని సమకూర్చడం.

·        వనరుల సామర్థ్యం పెంచి, పర్యావరణ ప్రభావాల తగ్గింపుతోపాటు పరిశ్రమ అదనపు విలువ జోడింపు మార్గాల సృష్టికి వీలుగా పత్తి వ్యర్థాల రీసైక్లింగ్, వర్తుల ఆర్థిక విధానాలకు ప్రోత్సాహం.

·        అవిసె, రామీ, సిసల్, మిల్క్‌వీడ్, వెదురు, అరటి వంటి సహజ నార ఉత్పత్తుల జోడింపు ద్వారా భారత నార ఆధారిత వైవిధ్యం సహా పర్యావరణపరంగా సుస్థిర వస్త్రోత్పత్తి-ఆవిష్కరణల రూపకల్పన. పత్తికి అనుబంధంగా వ్యూహాత్మక అనుసంధానం, ప్రోత్సాహంతోపాటు భారత వస్త్ర రంగాన్ని మారుతున్న ప్రపంచ డిమాండ్ ధోరణికి అనుగుణంగా తీర్చిదిద్దడం.

కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ, జౌళి మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా అమలు చేస్తాయి. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్‌) పరిధిలోని 10 సంస్థలు, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోగల ఒక సంస్థ, పత్తి ప్రధాన పంటగాగల రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలలోని ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కిందనున్న 10 పత్తి కేంద్రాలు ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. రాష్ట్రాల్లోని వ్యవసాయ మంత్రిత్వశాఖ, ‘ఐకార్‌’ల ద్వారా 14 రాష్ట్రాల్లోని 140 జిల్లాలపై తొలుత దృష్టి సారిస్తారు. సాంకేతికతల ఉన్నతీకరణ, 2000 జిన్నింగ్-ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల ఏర్పాటు దీని ప్రధాన ధ్యేయం. అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను, తెగుళ్లను తట్టుకోగల వంగడాల రూపకల్పన,  ఆధునిక వ్యవసాయ సాంకేతికతల అనుసరణ, రైతులకు శిక్షణ, నాణ్యత మెరుగుదల, ట్రేసబిలిటీ, పత్తి విలువ వ్యవస్థ అంతటా సుస్థిర ఫైబర్లు, ఆవిష్కరణలకు ప్రోత్సాహంతో మౌలిక సదుపాయాలను బలోపేతం వంటివి దీని లక్ష్యాలు.

దేశంలో 2031 నాటికి పత్తి ఉత్పాదకతను హెక్టారుకు 440 కిలోల నుండి 755 కిలోలకు పెంచడం ద్వారా 498 లక్షల బేళ్ల (ఒక్కోటి 170 కిలోలు) ఉత్పత్తి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. తద్వారా సుమారు 32 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగడంతో వారు స్వావలంబన సాధిస్తారు. ట్రేసబిలిటీ-సర్టిఫికేషన్ దిశగా ‘కస్తూరి కాటన్ భారత్‌’కు ప్రోత్సాహం, వ్యర్థాలను 2 శాతంకన్నా దిగువకు నియంత్రించడం ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. అలాగే అవిసె, రామీ, సిసల్, మిల్క్‌వీడ్, వెదురు, అరటి వంటి సహజ నార ఉత్పత్తులకు ప్రోత్సహించడం ద్వారా పత్తి రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధం చేసే దిశగా ఇదొక కీలక మలుపు అవుతుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s pharmaceutical sector records transformative growth over 12 years, strengthening affordable healthcare and self-reliance

Media Coverage

India’s pharmaceutical sector records transformative growth over 12 years, strengthening affordable healthcare and self-reliance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 జూన్ 2026
June 19, 2026

Appreciation for India’s Domestic Growth and Rising Global Influence under PM Modi’s Leadership