· “అంతరిక్షం కేవలం ఒక గమ్యం కాదు.. ఉత్సుకత-సాహ‌సం-స‌మ‌ష్టి ప్ర‌గతిని ప్ర‌స్ఫుటం చేసే సంక‌ల్పం”
· “భారతీయ రాకెట్లు శక్తికి మంచి పనిచేయగలవు... అంటే- 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష‌ల‌ను మోస్తూ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తాయి”
· “దేశీయ అంతరిక్ష సాంకేతికపై పెరుగుతున్న ఆకాంక్ష‌ల‌కు భారత తొలి మానవ అంతరిక్షయాన కార్య‌క్ర‌మం... గగన్‌యాన్ ఒక ప్రతీక‌”
· “భారత అంతరిక్ష కార్యకలాపాల్లో అధిక‌ శాతానికి మహిళా శాస్త్రవేత్తలే సార‌థులు”
· “అంత‌రిక్షంపై భార‌త్ దృక్కోణం ‘వ‌సుధైవ కుటుంబ‌కం’ అనే ఉదాత్త ప్రాచీన విశ్వాసానుగుణం”

విశిష్ట ప్రతినిధులు, గౌరవనీయులైన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, వ్యోమగాములు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు,

నమస్కారం!

గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ కాన్ఫరెన్స్-2025లో మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. అంతరిక్షం కేవలం ఓ గమ్యస్థానం కాదు. అది ఆసక్తి, ధైర్యం, సమష్టి ప్రగతిని ప్రకటించే అంశం. భారతీయ అంతరిక్ష ప్రయాణం ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 1963లో ఓ చిన్న రాకెట్ ప్రయోగం నుంచి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా ఎదిగేంత వరకు మా ప్రయాణం అత్యద్భుతం. మా రాకెట్లు పేలోడ్లను మించిన బరువును మోస్తున్నాయి. 1.4 బిలియన్ల మంది భారతీయుల కలలను అవి మోస్తున్నాయి. భారత్ సాధించిన విజయాలు శాస్త్ర రంగంలో గొప్ప మైలురాళ్లు. వీటన్నింటినీ మించి, మానవ స్ఫూర్తి... గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుందనడానికి ఇది గొప్ప రుజువు. 2014లో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకొని భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై నీటి జాడను కనుగొనేందుకు చంద్రయాన్-1 తోడ్పడింది. చంద్రయాన్-2 అధిక స్పష్టత ఉన్న చంద్రుని ఛాయాచిత్రాలను మనకు పంపింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై మన అవగాహనను చంద్రయాన్–3 పెంచింది. మేం రికార్డు సమయంలో క్రయోజనిక్ ఇంజిన్లను తయారుచేశాం. ఒకే ప్రయోగంలో 100 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. మా వాహక నౌకల ద్వారా 34 దేశాలకు చెందిన 400 ఉపగ్రహాలను కక్ష్యంలో ప్రవేశపెట్టాం. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను పూర్తి చేశాం. ఇది పెద్ద విజయం.

 

స్నేహితులారా,

ఇతరులతో పోటీ పడటం భారత అంతరిక్ష ప్రయాణ ఉద్దేశం కాదు. అందరితో కలసి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నదే మా ఆశయం. మానవాళి సంక్షేమం కోసం అంతరిక్ష అన్వేషణ సాగించడమే మన అందరి ఉమ్మడి లక్ష్యం. దక్షిణాసియా దేశాల కోసం మేం ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాం. జీ20కి అధ్యక్షత వహించిన సమయంలో మేం ప్రకటించిన జీ20 ఉపగ్రహాన్ని అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాలకు బహుమతిగా ఇస్తాం. శాస్త్రీయ అన్వేషణకు సంబంధించిన హద్దులను అధిగమిస్తూ.. నూతన ఆత్మవిశ్వాసంతో మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం. మా మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ విస్తరిస్తున్న మా ఆకాంక్షలను తెలియజేస్తుంది. త్వరలోనే, ఇస్రో-నాసా సంయుక్త మిషన్లో భాగంగా భారతీయ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళతారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించాలన్న మా లక్ష్యం.. పరిశోధన, అంతర్జాతీయ సహకారంలో నూతన అవకాశాలను తీసుకొస్తుంది. 2040 నాటికి చంద్రునిపై భారతీయుని పాదముద్రలు ఉంటాయి. అంగారకుడు, శుక్ర గ్రహాలపై సైతం మా మా దృష్టిని సారిస్తున్నాం.

స్నేహితులారా,

భారత్‌కు అంతరిక్షం అంటే, అన్వేషణతో పాటు సాధికారతకు సంబంధించినది. ఇది పరిపాలనను శక్తిమంతం చేస్తుంది. జీవనోపాధిని పెంచుతుంది. తరాల పాటు స్ఫూర్తినిస్తుంది. మత్స్యకారులకు హెచ్చరికల నుంచి గతిశక్తి వేదిక వరకు, రైల్వే భద్రత నుంచి వాతావరణ అంచనాల వరకు, మన ఉపగ్రహాలు ప్రతి భారతీయుని సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయి. అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువ మేధకు మా అంతరిక్ష రంగం తలుపులు తెరిచాం. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగంలో 250కి పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి ఉపగ్రహ సాంకేతికతలు, ప్రొపల్షన్ వ్యవస్థలు, ఇమేజింగ్, తదితరమైన అంశాల్లో అత్యాధునిక పురోగతులకు తోడ్పడుతున్నాయి. మా అంతరిక్ష మిషన్లకు మహిళా శాస్త్రవేత్తలు స్ఫూర్తిదాయక నాయకత్వం వహిస్తున్నారని మీ అందరికీ తెలుసు.  

 

స్నేహితులారా,

‘వసుధైవ కుటుంబకం’ – ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం.. అనే పురాతన జ్ఞానం ఆధారంగా భారత అంతరిక్ష లక్ష్యం రూపుదిద్దుకుంది. మా అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా.. ప్రపంచ జ్ఞానాన్ని సుసంపన్నం చేయడానికి, ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం. ఉమ్మడి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటిని సాకారం చేసుకోవడం, కలసి నక్షత్రాలను చేరుకోవడం అనే భావనకు భారత్ కట్టుబడి ఉంటుంది. మెరుగైన రేపటి కోసం సైన్స్, ఉమ్మడి కలల మార్గనిర్దేశంలో అంతరిక్ష అన్వేషణలో ఓ కొత్త అధ్యాయాన్ని మనం అందరూ కలసి లిఖిద్దాం. మీ అందరూ భారత్‌లో ఆహ్లాదకరమైన, ఉత్పాదక సమయాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year

Media Coverage

IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఏప్రిల్ 2026
April 28, 2026

From Orchids to Expressways: PM Modi’s Blueprint for a Self-Reliant, Connected & Proud India