· నేడు అమలు చేస్తున్న విధానాలు, చేపడుతున్న నిర్ణయాలు వచ్చే వెయ్యేళ్ళ భవితవ్యాన్ని నిర్దేశిస్తాయి: ప్రధాని
· యువత, రైతాంగం, మహిళల ఆకాంక్షాత్మక స్వప్నాలు అంబారాన్నంటుతున్నాయి.. ఈ అసాధారణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు అత్యంత వేగం అవసరం: ప్రధానమంత్రి
· నిజమైన ప్రగతి చిన్న మార్పులకు పరిమితం కాదు, భారీ పరివర్తన కలిగించాలి.. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీరు, బాలలకు నాణ్యమైన విద్య, వ్యాపారవేత్తలకు అందుబాటులో పెట్టుబడి, ప్రతి గ్రామానికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ లాభాల వంటివి చేకూరినప్పుడే సమగ్ర అభివృద్ధిగా పరిగణించగలం: శ్రీ మోదీ
· ప్రభుత్వ పథకాల విస్తృతి, క్షేత్రస్థాయిలో చూపే సత్ఫలితాలే నాణ్యమైన పాలనను నిర్ధారించే అంశాలు: ప్రధాని
· మందకొడి సరళి నుంచి బయటపడి గత పదేళ్ళుగా ప్రభావశీల పరివర్తనను చవి చూస్తున్న భారత్: ప్రధానమంత్రి
· పాలన, పారదర్శకత, సృజనాత్మకతల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్న దేశం: ప్రధాని
· ‘జన భాగీదారి’ వల్ల జి-20 ప్రజా ఉద్యమంగా మారింది.. భారత్ కేవలం పాల్గొనేందుకు పరిమితంకాక నేతృత్వం
వికసిత్‌ భారత్‌ ఆశయ సాకారంలో సర్దార్ పటేల్ ఆదర్శాలు దారిదీపాలంటూ, పటేల్ దార్శనికత, వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించారు.
ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ, ప్రతి క్షణం ఈ ఉమ్మడి లక్ష్య సాధనకు కృషి చేయాలని చెప్పారు.

నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ శక్తికాంత దాస్ గారు, డాక్టర్ సోమనాథన్ గారు, ఇతర సీనియర్ అధికారులు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్‌కు చెందిన సహచరులు, మహిళలు, పెద్దలు.. !


మిత్రులారా,


పౌర సేవల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ ఏడాది పౌర సేవల దినోత్సవం అనేక కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఈ ఏడాది మనం రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కూడా ఈ ఏడాదే. 1947 ఏప్రిల్ 21న మీ అందరినీ ' భారత ఉక్కు కవచం(స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా)'గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించారు. స్వతంత్ర భారత్‌లో అధికార యంత్రాంగానికి ఆయన కొత్త ప్రమాణాలను నిర్దేశించారు. దేశానికి సేవ చేయడమే తమ అత్యున్నత కర్తవ్యంగా భావించి నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావాన్ని మనస్సు నిండా నింపుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగిస్తూ దేశ లక్ష్యాల కోసం రాత్రింబవళ్లు శ్రమించే వారే సివిల్ సర్వీసెస్ ఉద్యోగి. నేడు మనం 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పుడు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పటేల్ దార్శనికతకు ఈ రోజు నివాళులర్పిస్తున్నాను. ఆయనకు నా హృదయపూర్వక నివాళిని తెలియజేస్తున్నాను.
 

మిత్రులారా,

నేటి భారత్ రాబోయే వెయ్యేళ్లకు బలమైన పునాది వేయాలని.. కొన్ని నెలల క్రితం ఎర్రకోట నుంచి పిలుపునిచ్చాను. ఒక రకంగా చూస్తే ఈ సహస్రాబ్ది 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇది కొత్త శతాబ్దంలో 25వ సంవత్సరం. ఇది కొత్త సహస్రాబ్ది 25వ సంవత్సరం కూడా. ఈ రోజు మనం అమలు చేస్తోన్న విధానాలు, తీసుకుంటోన్న నిర్ణయాలు రాబోయే వెయ్యేళ్లకు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మన గ్రంథాలు ఇలా చెబుతున్నాయి -  यथा हि एकेन चक्रेण न रथस्य गतिर्भवेत्। एवं पुरूषकारेण विना दैवं न सिध्यति॥ అంటే - రథం ఒకే చక్రంతో ఎలా కదలలేదో.. కష్టపడకుండా కేవలం విధి మీదే ఆధారపడి విజయం సాధించలేం. 'వికసిత్ భారత్' అనే మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రగతి రథంలోని ప్రతి చక్రం కలిసి కదలాలి. ప్రతిరోజూ, ప్రతి క్షణం అచంచల సంకల్పంతో పనిచేయాలి. ఈ లక్ష్యసాధనకు మన జీవితాన్ని అంకితం చేయాలి.

మిత్రులారా,

శరవేగంగా మారుతోన్న ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. మీ కుటు౦బాల్లో కూడా మీరు గమని౦చి ఉండొచ్చు. 10 లేదా 15 స౦వత్సరాల పిల్లలు ఉ౦టే.. మీరు వారితో మాట్లాడితే.. మీరు పాతబడిపోయినట్లు అనిపిస్తు౦ది. ఎందుకంటే కాలం చాలా వేగంగా మారుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రతి 2-3 సంవత్సరాలకు మారుతున్నాయి. మనం ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి లేదా నేర్చుకోవటాని కంటే ముందే ఏదో ఒక కొత్త విషయం వస్తోంది. ఈ వేగవంతమైన మార్పులతో మన చిన్న పిల్లలు ఎదుగుతున్నారు. మన అధికార యంత్రాంగం, మన పని తీరు, మన విధాన రూపకల్పన ఇకపై కాలం చెల్లిన విధానాలను అనుసరించి ఉండలేవు. అందుకే 2014 నుంచి దేశంలో వ్యవస్థల్లో పెనుమార్పులు ప్రారంభమయ్యాయి. ఈ వేగవంతమైన మార్పునకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటున్నాం. నేడు మన యువత, మన రైతులు, మన మహిళలతో ఉన్న ఆశలతో కూడిన దేశ సమాజం కంటున్న కలలు శిఖరాలను తాకుతున్నాయి. ఇది నిజంగా నిజంగా అపూర్వమైంది. ఈ అసాధారణ ఆకాంక్షలను నెరవేర్చడానికి, అసాధారణ వేగం కూడా అవసరం. రాబోయే సంవత్సరాల్లో భారత్ ఇంధన భద్రత, హరిత ఇంధనం, క్రీడలు, అంతరిక్షం, మరెన్నో రంగాల్లో అనేక ప్రధాన మైలురాళ్లను దాటుతుంది. ప్రతి రంగంలోనూ దేశ పతాకాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలి. నేను దీని గురించి మాట్లాడినప్పుడు, దేశం కూడా వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు అందరి చూపులు, నమ్మకం మీ అందరిపై ఉంటుంది. నా సహచరులారా గొప్ప బాధ్యత మీ భుజాలపై ఉంది. వీలైనంత త్వరగా భారత్‌‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి. ఈ లక్ష్యసాధనలో జాప్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.
 

మిత్రులారా,

ఈ ఏడాది పౌర సేవల దినోత్సవం ఇతివృత్తం 'భారతదేశ సమగ్రాభివృద్ధి'. ఇది కేవలం ఒక ఇతివృత్తం మాత్రమే కాదు. ఇది మా నిబద్ధత. ఈ దేశ ప్రజలకు మా వాగ్దానం. భారత సమగ్రాభివృద్ధి అంటే ఏ గ్రామం, ఏ కుటుంబం, ఏ పౌరుడు కూడా మిగిలిపోవటానికి లేదు. నిజమైన పురోగతి అంటే చిన్న మార్పులు మాత్రమే కాదు.. పూర్తి స్థాయి ప్రభావం. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీరు, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, ప్రతి పారిశ్రామికవేత్తకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండటం, ప్రతి గ్రామానికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు అందటం. ఇదే సమగ్ర అభివృద్ధి. పథకాలు ప్రారంభించినంత మాత్రాన పాలనలో నాణ్యత రాదని నేను నమ్ముతాను. పాలనలో నాణ్యత అనేది ఒక పథకం ప్రజలకు ఎంత వరకు చేరుకుంటుంది, అది ఎటువంటి నిజమైన ప్రభావాన్ని సృష్టిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. రాజ్‌కోట్, గోమతి, తిన్సుకియా, కోరాపుట్.. ఇలా ఏవైనా కావచ్చు, చాలా జిల్లాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. పాఠశాల హాజరును పెంచడం నుంచి సౌర విద్యుత్తును వాడుకోవటం వరకు అనేక జిల్లాలు తమ లక్ష్యాలను సాధించే దిశగా గణనీయమైన కృషి చేశాయి. వీటిలో పలు జిల్లాలకు నేడు అవార్డులు దక్కాయి. ఈ జిల్లాలు, పథకాల్లో భాగస్వాములైన అందరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

గడచిన 10 సంవత్సరాలలో భారత్ ‌మార్పు స్థాయిని దాటి ప్రభావవంతమైన పరివర్తన దిశగా ప్రయాణాన్ని సాగించింది. నేడు భారత్‌ పాలనా నమూనా తదుపరి తరం సంస్కరణలపై దృష్టి సారించింది. సాంకేతికత, ఆవిష్కరణలు, సృజనాత్మక విధానాల ద్వారా ప్రభుత్వానికి, పౌరులకు మధ్య అంతరాన్ని తొలగిస్తున్నాం. దీని ప్రభావం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఆశావహ జిల్లాల గురించి నేను తరచుగా మాట్లాడటం మీరు విని ఉంటారు. కానీ ఆశావహ బ్లాక్‌ల పథకం విజయం కూడా అంతే చెప్పుకోదగ్గది. రెండేళ్ల క్రితం అంటే 2023 జనవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రెండేళ్లలో ఈ బ్లాకుల్లో కనిపించిన మార్పులు అపూర్వమైనవి. ఆరోగ్యం, పోషకాహారం, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి సూచికల్లో ఈ బ్లాకులు అద్భుతమైన పురోగతి సాధించాయి. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర సగటును కూడా దాటేశాయి. రెండేళ్ల క్రితం రాజస్థాన్‌ టోంక్ జిల్లాలోని పిప్లూ బ్లాక్‌లో అంగన్ వాడీ కేంద్రాల్లో 20 శాతం మంది పిల్లలకు సంబంధించిన అంశాలను మాత్రమే నమోదు చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 99 శాతానికి పెరిగింది. బీహార్‌ భాగల్‌పూర్‌లోని జగదీష్‌పూర్ బ్లాక్‌లో మొదటి త్రైమాసికంలో గర్భిణుల నమోదు కేవలం 25% మాత్రమే. ఇప్పుడు అది 90 శాతానికి పైగా పెరిగింది. జమ్ముాకశ్మీర్ మార్వా‌ బ్లాక్‌లో సంస్థాగత ప్రసవాలు 30 శాతం నుంచి 100 శాతానికి పెరిగాయి. జార్ఖండ్ గుర్డీ బ్లాక్‌లో నల్లా నీటి సరఫరా 18 శాతం నుంచి 100 శాతానికి పెరిగాయి. ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదు. ఇవి చిట్టచివరి వారికి సేవలు అందించే విషయంలో మేం చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చటానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. సరైన ఉద్దేశం, ప్రణాళిక, అమలుతో.. అత్యంత మారుమూల ప్రాంతాలలో కూడా కోరుకున్న పరివర్తన సాధ్యమని ఇక్కడి ప్రజలు చూపిస్తున్నారు.
 

మిత్రులారా,

గడచిన 10 సంవత్సరాలలో భారత్‌ అనేక పరివర్తనాత్మక మార్పులను ప్రదర్శిస్తూ విజయాలలో కొత్త శిఖరాలకు చేరుకుంది. నేడు దేశం వృద్ధికి మాత్రమే కాకుండా.. పాలన, పారదర్శకత, సృజనాత్మకతలో కొత్త మైలురాళ్లను ఏర్పాటు చేయడంలో కూడా ప్రసిద్ది చెందింది.
 

మన జీ20 అధ్యక్షతే ఇందుకు ప్రధాన ఉదాహరణ. 60కి పైగా నగరాల్లో 200కు పైగా సమావేశాలకు ఆతిథ్యమివ్వడం- ఇంత భారీ, సమ్మిళితత్వంతో కూడిన నాయకత్వం జీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. సంపూర్ణ విధానం అంటే ఇదే. ప్రజా భాగస్వామ్యంతో కూడిన మా విధానం అనేక ఇతర దేశాల కంటే మనల్ని 10–11 సంవత్సరాలు ముందు ఉంచింది. గత 11 ఏళ్లుగా జాప్యం అనే సంస్కృతిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం కొత్త ప్రక్రియలను తీసుకొచ్చాం. పని పూర్తయ్యేందుకు పట్టే సమయాన్ని తగ్గించడానికి సాంకేతికతను ఉపయోగించాం. వ్యాపారాన్ని సులభతరం చేయటానికి మేం 40,000కి పైగా చట్టపరమైన అనుమతులను తొలగించాం. 3,400కి పైగా నిబంధనలను నేరరహితమైనవిగా చేశాం. నాకు గుర్తుంది చట్టపరంగా చేపట్టాల్సిన పనులు, అనుసరించాల్సిన నిబంధనల భారాన్ని తగ్గించడానికి.. సాధారణ వ్యాపార కార్యకలాపాల సమయంలో జరిగే కొన్ని తప్పులను నేరరహితమైనవిగా మార్చేందుకు మేం పనిచేస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఇప్పటికీ వ్యతిరేక స్వరాలు వినిపించటం నాకు ఆశ్చర్యం కలిగించింది. " ఇది ఇంతకు ముందెన్నడూ చేయలేదు, ఎందుకిలా చేస్తున్నావు? అలా ఉండనివ్వండి. అది యథాతథంగా పనిచేయనివ్వండి. ఎందుకు బాధపడాలి? వాటిని కొనసాగనివ్వండి. మీ పనిభారం ఎందుకు పెంచుకుంటున్నారు? " అని కొందరు అన్నారు. అన్ని వైపుల చర్చలు జరిగాయి. స్పందనలు కూడా వచ్చాయి. కానీ ఈ ఒత్తిడి కంటే మా లక్ష్యాలను సాధించే ఒత్తిడే ఎక్కువగా ఉంది. అందుకే మేం దేనికి లొంగలేదు. మేం లక్ష్యాలపై దృష్టి సారించాం. పాత మార్గాలను అనుసరిస్తే కొత్త ఫలితాలు రావడం కష్టం. మనం ఏదైనా భిన్నంగా చేసినప్పుడు మాత్రమే, మనకు భిన్నమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ఆలోచన కారణంగానే నేడు సులభతర వాణిజ్యానికి సంబంధించి ర్యాంకుల్లో భారత్ గణనీయంగా మెరుగుపడింది. నేడు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం ఆసక్తిగా ఉంది. ఈ అవకాశాలను మనం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లో అధికార జాప్యం ఆనవాళ్లను తొలగించాలి. అప్పుడే ఈ స్థాయిల్లో మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు.

 

మిత్రులారా,

ఒకప్పుడు అధికార యంత్రాంగం పాత్ర పారిశ్రామికీకరణను, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను పెద్దగా ప్రోత్సహించేదిగా ఉండేది కాదు. ఇప్పుడా ధోరణి మారి ఎంతో ముందడుగు వేశాం. నేడు, పౌరుల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే తపనను ప్రోత్సహిస్తూ, వారికెదురయ్యే ప్రతి అవరోధాన్ని అధిగమించడంలో మనం అండగా ఉంటున్నాం. కాబట్టి, సివిల్ సర్వీస్ అంటే సహాయకునిగా పనిచేయాలి, కేవలం నియమాలను పాటించడం మాత్రమే కాకుండా, వృద్ధి కోసం చురుగ్గా సహాయమందించాలి. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి నేను మీకో ఉదాహరణ చెబుతా.. దేశంలో మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీకు తెల్సిందే. ఈ మిషన్ విజయం మన ఎమ్ఎస్ఎమ్ఈ రంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల మధ్య, మన ఎమ్ఎస్ఎమ్ఈలు, అంకురసంస్థలు, యువ వ్యవస్థాపకులకు ఇప్పుడు చారిత్రాత్మక, అపూర్వ అవకాశం లభించింది. ఈ సందర్భంలో, ప్రపంచ సప్లయి చెయిన్ రంగంలో మనం మరింత మెరుగైన పోటీదారుగా ఉండాలి. ఎమ్ఎస్ఎమ్ఈలు నేడు చిన్న సంస్థలతో కాదు.. ప్రపంచంతో పోటీ పడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఒక చిన్న దేశం పరిశ్రమలకు సమ్మతులను సులభతరం చేసి పూర్తిగా అనువైన అవకాశాలను అందిస్తే, అది మన దేశంలోని అంకురసంస్థలతో పోటీ పడే మెరుగైన స్థితిలో ఉంటుంది. అందుకే ప్రపంచ ఉత్తమ పద్ధతుల్లో మన స్థానం ఏమిటో నిరంతరం అంచనా వేసుకోవాలి. భారత పరిశ్రమలు ప్రపంచస్థాయి అత్యుత్తమ ఉత్పత్తులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంటే, భారత అధికార యంత్రాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ సౌలభ్యాన్ని వారి కోసం అందించే లక్ష్యంతో పనిచేయాలి.

 

మిత్రులారా,

సాంకేతికతతో నడిచే నేటి ప్రపంచంలో, సివిల్ సర్వెంట్స్ ఈ సాంకేతికతను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, దానిని స్మార్ట్, సమ్మిళిత పాలన కోసం ఉపయోగించుకోగల నైపుణ్యాలు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. “సాంకేతిక యుగంలో, పాలన అంటే వ్యవస్థలను నిర్వహించడానికి సంబంధించినది కాదు, ఇది అనేక అవకాశాలను కల్పించడానికి సంబంధించినది.” మనం సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలి, తద్వారా ప్రతి పాలసీ, పథకాన్ని సాంకేతికత ద్వారా మరింత సమర్థంగా అందుబాటులోకి తీసుకురావచ్చు. విధాన రూపకల్పన, అమలు మరింత కచ్చితమైనదిగా ఉండేందుకు డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడంలో మనం నైపుణ్యం సాధించాలి. కృత్రిమ మేధ, క్వాంటం ఫిజిక్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో మీరు ఇప్పటికే చూస్తున్నారు. త్వరలో, సాంకేతిక పరిజ్ఞానం వాడకంలో సరికొత్త విప్లవం రానుంది.. ఇది నేడు మనకు తెలిసిన డిజిటల్, సమాచార యుగానికి మించినదిగా ఉంటుంది. ఈ భవిష్యత్ సాంకేతిక విప్లవం కోసం మీరు మిమ్మల్ని, మొత్తం వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి, అప్పుడే మనం పౌరులకు ఉత్తమ సేవలను అందించగలం, వారి ఆకాంక్షలనూ తీర్చగలం. మనం మన సివిల్ సర్వెంట్స్ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నప్పుడే భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సివిల్ సర్వీస్ నిర్మించగలం. అందుకే మిషన్ కర్మయోగి, సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లకు నేను చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాను.


మిత్రులారా,

వేగంగా మారుతున్న ఈ యుగంలో, మనం ప్రపంచ సవాళ్లను నిశితంగా గమనించాలి. ఆహారం, నీరు, ఇంధన భద్రతలు ముఖ్యంగా అభివృద్ధిచెందుతున్న దేశాలకు  గణనీయమైన సవాళ్లు విసురుతున్న క్రమంలో, ఈ సమస్యలు తీవ్రమైన సంక్షోభంగా మారాయి. కొనసాగుతున్న ప్రపంచ సంఘర్షణలు అనేక దేశాల్లో పరిస్థితులను మరింత దిగజార్చాయి. ఇది ప్రజలను ప్రభావితం చేస్తుంది, వారి దైనందిన జీవితాలకు అంతరాయం కలిగిస్తుంది. దేశీయ, విదేశాంగ వ్యవహారాల మధ్య పెరుగుతున్న పరస్పర సంబంధాన్ని మనం అర్థం చేసుకుని, తదనుగుణంగా మన విధానాలు, వ్యూహాలను అమలు చేయాలి. వాతావరణ మార్పు, ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి.. సైబర్ బెదిరింపులు.. ఇలా సమస్య ఏదైనా, చర్య తీసుకోవడంలో భారత్ పది అడుగులు ముందుండాలి. మనం స్థానిక స్థాయిలో వ్యూహాలను రూపొందించుకుని, అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల అభివృద్ధి నమూనాలను నిర్మించాలి.

మిత్రులారా,

ఎర్రకోట వేదికగా నేను 'పంచ ప్రాణ్' గురించి మాట్లాడాను – ఆ ఐదు ప్రమాణాలు: 'వికసిత్ భారత్' కోసం సంకల్పం.. బానిసత్వపు మనస్తత్వం నుంచి విముక్తి.. మన వారసత్వం పట్ల గర్వం.. ఐక్యత, సంఘీభావం.. నిజాయితీతో మన విధులను నిర్వర్తించడం. మీరే ఈ ఐదు ప్రమాణాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలరు. మీరు సౌలభ్యం కంటే సమగ్రతకు, జడత్వం కంటే ఆవిష్కరణకు లేదా హోదా కంటే సేవకు ప్రాధాన్యమిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మీ అందరిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కొత్తగా ఉద్యోగ బాధ్యతల ప్రయాణాన్ని ప్రారంభించిన యువ అధికారులకు నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను: సమాజ మద్దతు లేకుండా విజయం సాధించిన వారు ఎవరూ లేరు. సమాజ సహకారం లేకుండా ఎవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అందుకే ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతుగా సాధ్యమైనంత తిరిగి ఇవ్వాలని కోరుకుంటారు. మీరందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీకు తిరిగి ఇవ్వడానికి అపారమైన అవకాశం ఉంది. దేశం, సమాజం మీకు ప్రజలకు సేవ చేయగల, సమాజానికి అత్యధికంగా తిరిగి ఇవ్వగల ఈ గొప్ప బాధ్యతను అప్పగించింది.
 

మిత్రులారా,

సివిల్ సర్వీసెస్‌లో మళ్లీ సంస్కరణలు చేపట్టేందుకు ఇది సరైన సమయం. ఈ సంస్కరణలను పెంపొందిస్తూ, వాటిని వేగవంతం చేయాలి. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, అంతర్గత భద్రత, అవినీతిని నిర్మూలించాలనే మన లక్ష్యం, సామాజిక సంక్షేమ పథకాలు లేదా క్రీడలు, ఒలింపిక్ లక్ష్యాలు.. ఇలా ప్రతి రంగంలోనూ మనం నూతన సంస్కరణలను ప్రవేశపెట్టాలి. మనం ఇప్పటివరకు సాధించినది ప్రశంసనీయమే అయినా ఇప్పుడు మనం దాని కంటే చాలా రెట్లు ఎక్కువ సాధించాలి. వీటన్నిటి మధ్య, మనం ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి: "ప్రపంచం ఎంత సాంకేతికతతో నడిచినా, మానవ తీర్పు ప్రాముఖ్యతను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు." సున్నితంగా ఉండండి, పేదల సమస్యలు వినండి, వారి బాధను అర్థం చేసుకోండి, వారి సమస్యలను పరిష్కరించడాన్ని మీ ప్రధాన ప్రాధాన్యంగా చేసుకోండి. 'అతిథి దేవో భవ' అని చెప్పినట్లుగా, మనం 'నాగరిక్ దేవో భవ' (పౌరుడు దేవునితో సమానం) అనే మంత్రం స్ఫూర్తిగా ముందుకు సాగాలి. మీరు సివిల్ సర్వెంట్‌గా మాత్రమే కాకుండా, 'వికసిత్ భారత్' రూపకర్తలుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.
 

ఒకప్పుడు ఒక సివిల్ సర్వెంట్‌గా ఎంపికైన వారు, ఆ బాధ్యతల్లో ఎదిగి, అదే హోదాలో సేవ చేస్తూ ఉండేవారు. కానీ కాలం మారిపోయింది మిత్రులారా. భారత్ పట్ల నాకున్న దార్శనికత, 140 కోట్ల మంది భారతీయుల కళ్లలో నేను చూసే కలలు స్ఫూర్తిగా నేను ఒక విషయం చెబుతున్నాను: మీరు ఇకపై కేవలం సివిల్ సర్వెంట్స్ మాత్రమే కాదు.. మీరు నవ భారత రూపశిల్పులు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి, మనల్ని మనం శక్తిమంతం చేసుకోవాలి, జాతీయ లక్ష్యాల కోసం మన సమయాన్ని అంకితం చేసుకోవాలి, ప్రతి సాధారణ పౌరుడి కలలను మన సొంతం చేసుకోవాలి. మనం అలా చేసినప్పుడు, మన కళ్ళతోనే 'వికసిత్ భారత్' సాకారం అవడం చూస్తాం. నేను ఈ రోజు మాట్లాడుతున్న సమయంలో, ఇక్కడ కూర్చున్న ఒక చిన్న అమ్మాయిని గమనించాను - ఒక చిన్న బొమ్మలా ఉంది ఆ బిడ్డ. బహుశా, 2047 నాటికి, ఆమె మీ స్థానంలో కూర్చుంటుంది. మనం సొంతం చేసుకోవాల్సిన కలలు ఇవే. ఇది మన 'వికసిత్ భారత్' లక్ష్యంగా ఉండాలి. మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s contribution to BRICS: Nari Shakti moves from promise to delivery

Media Coverage

India’s contribution to BRICS: Nari Shakti moves from promise to delivery
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister speaks with the President of Iran
June 30, 2026
President Pezeshkian briefs PM on the recent developments in West Asia.
PM welcomes the understanding reached and reiterates the need for continued efforts for lasting peace and stability.

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with the President of the Islamic Republic of Iran, H.E. Dr. Masoud Pezeshkian.

President Pezeshkian briefed the Prime Minister on the recent developments in West Asia and the way forward.

Prime Minister welcomed the understanding reached, and reiterated India’s consistent position that all issues must be resolved through dialogue and diplomacy.

Prime Minister reiterated the need for continued efforts to ensure lasting peace and stability in the region, and for safeguarding freedom of navigation and commerce.