వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక మంత్రి గౌరవ ఖైస్ అల్ యూసఫ్ గారికి,

ఉభయ దేశాల ప్రతినిధులకు,

వాణిజ్య సంఘాల నాయకులకు,

మహిళలు, కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ,

 

నమస్కారాలు,

 

ఏడేళ్ల తర్వాత ఒమన్‌ను సందర్శించటం, ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం లభించటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.

 

ఈ వాణిజ్య సదస్సుకు స్వాగతం పలికి, నాలోని ఉత్సాహాన్ని మరింత పెంచారు. భారత్-ఒమన్ భాగస్వామ్యానికి ఇవాళ్టి ఈ సదస్సు సరికొత్త దిశానిర్దేశం చేయటమే కాక, మరింత వేగంగా ఈ సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ ప్రయత్నంలో మీరంతా కీలక పాత్ర పోషించాలి.

 

మిత్రులారా,

భారత్, ఒమన్ దేశాల వ్యాపార, ద్వైపాక్షిక వాణిజ్యానికి మీరు ప్రతినిధులు. శతాబ్దాల నాటి సుసంపన్న వారసత్వానికి వారసులు. నాగరికత ప్రారంభమైనప్పటి నుంచీ మన పూర్వీకులు నౌకా వాణిజ్యం చేశారు.

 

సముద్రపు రెండు తీరాలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయని అంటారు. కానీ మాండ్వి, మస్కట్ మధ్య అరేబియా సముద్రం బలమైన వారధిగా నిలిచింది. ఈ వారధి మన సంబంధాలను పటిష్టం చేసి, సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. ఇవాళ మనం ఎంతో నమ్మకంగా చెప్పవచ్చు. సముద్రపు అలలు, రుతువులు మారతాయి కానీ, భారత్-ఒమన్ మధ్య స్నేహం ప్రతి సీజన్ లోనూ బలపడుతూ, ప్రతీ అలతో నూతన శిఖరాలను చేరుకుంటుంది.

 

మిత్రులారా,

నమ్మకం అనే పునాదిపై ఏర్పాటైన మన బంధం, స్నేహంతో శక్తిమంతమై, కాలంతో పాటు మరింత బలపడింది.

మన దౌత్య సంబంధాలకు ఇవాళ 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది కేవలం ఏడు దశాబ్దాల వేడుక మాత్రమే కాదు.. శతాబ్దాల నాటి వారసత్వాన్ని సుసంపన్నమైన భవిష్యత్ వైపు తీసుకెళ్లాల్సిన కీలక ఘట్టం.

 

మిత్రులారా,

దశాబ్దాల పాటు గుర్తుండిపోయే ఒక చారిత్రక నిర్ణయాన్ని ఇవాళ మనం తీసుకుంటున్నాం. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం లేదా సీఈపీఏ, 21వ శతాబ్దంలో మన బంధానికి కొత్త విశ్వాసాన్ని, నూతనోత్తేజాన్ని ఇస్తుంది. ఇది మన ఉమ్మడి భవిష్యత్తుకు నమూనా వంటిది. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం వేగవంతమవటమే కాక, పెట్టుబడుల విషయంలో నమ్మకాన్ని పెంచి, ప్రతి రంగంలోనూ నూతన అవకాశాలను కల్పిస్తుంది.

 

అభివృద్ధి, ఆవిష్కరణ, ఉపాధిపరంగా యువతకు ఎన్నో కొత్త అవకాశాలను సీఈపీఏ కల్పిస్తుంది. ఈ ఒప్పందం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం కాకుండా ఫలితాలను సాధించాలంటే.. ప్రతి ఒక్కరి సహకారం అత్యంత కీలకం. విధానపరమైన చర్యలు, పారిశ్రామిక కృషి కలిసినప్పుడే ఒక భాగస్వామ్యం కొత్త చరిత్రను సృష్టించగలదు.

 

మిత్రులారా,

భారతదేశ ప్రగతి అందరినీ కలుపుకునిపోయే విధంగా ఉంటుంది. భారతదేశ అభివృద్ధిలో మిత్రదేశాలను కూడా భాగస్వాములను చేస్తుంది. ఇవాళ కూడా మనం అదే చేస్తున్నాం.

 

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇది యావత్ ప్రపంచానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఒమన్ విషయంలో ఆ ప్రయోజనం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.

మనం కేవలం నమ్మకమైన మిత్రులమే కాదు.. సముద్ర తీర సరిహద్దులను పంచుకునే పొరుగు వాళ్లం కూడా. మన ప్రజల మధ్య సత్సంబంధాలున్నాయి. మన వాణిజ్య సంఘాల మధ్య తరతరాలుగా నమ్మకముంది. ఒకరి మార్కెట్ పై మరొకరికి లోతైన అవగాహన ఉంది. కాబట్టి, భారత్ అభివృద్ధి ప్రయాణం ఒమన్ కు అపారమైన అవకాశాలను అందించగలదు.

మిత్రులారా,

నేటి ప్రపంచ వాణిజ్యంలో భారత ఆర్థిక స్థితిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లున్నప్పటికీ భారత్ 8 శాతానికి పైగా వృద్ధిని ఎలా సాధించగలిగిందని ప్రజలు తరచూ అడుగుతుంటారు. దీనికి గల ప్రధాన కారణాలను నేను మీతో పంచుకుంటాను.

గత పదకొండేళ్లలో భారత్ కేవలం తన విధానాలను మాత్రమే కాదు.. ఆర్థిక డీఎన్ఏనే పూర్తిగా మార్చుకుంది.

 

ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెబుతాను. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ).. భారతదేశాన్ని సమగ్ర, ఏకీకృత మార్కెట్ గా మార్చేసింది. దివాలా స్మృతి.. ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరిచి, పారదర్శకతను పెంచటమే కాక, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని బలపరిచింది. మేం చేపట్టిన కార్పొరేట్ పన్ను సంస్కరణ ద్వారా పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.

 

మిత్రులారా,

మేం చేపట్టిన కార్మిక సంస్కరణల గురించి మీకు తెలిసే ఉంటుంది. డజన్ల కొద్దీ ఉన్న కార్మిక చట్టాలను క్రమబద్దీకరించి, కేవలం నాలుగు భాగాలుగా రూపొందించాం. భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన కార్మిక సంస్కరణల్లో ఇవి ఉన్నాయి.

 

మిత్రులారా,

విధానపరమైన స్పష్టత ఉన్నప్పుడు, తయారీ రంగం ఆత్మవిశ్వాసాన్ని పొందుతుంది. ఒకవైపు విధానపరమైన, ప్రక్రియపరమైన సంస్కరణలను అమలు చేస్తూనే, మరోవైపు భారత్ లో తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను మేం అందిస్తున్నాం. ఇలాంటి నిరంతర ప్రయత్నాల వల్ల 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

 

మిత్రులారా,

ఈ సంస్కరణలు భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేశాయి. దీనివల్ల కాగిత రహిత ప్రభుత్వ పాలన, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, మొత్తం వ్యవస్థ సమర్థవంతంగా, పారదర్శకంగా, స్థిరంగా మారింది.

 

డిజిటల్ ఇండియా కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద 'సమ్మిళిత విప్లవం'. ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే కాక, వ్యాపార నిర్వహణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక మౌలిక సదుపాయాలు దీనికి మరింత ఊతమిచ్చాయి. మెరుగవుతున్న రవాణా వ్యవస్థ వల్ల దేశంలో లాజిస్టిక్స్ క్రమంగా వ్యయం తగ్గుతోంది.

 

మిత్రులారా,

పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం భారత్ అని ప్రపంచం గుర్తించింది. భారత్ ఒక నమ్మకమైన, రాబోయే సవాళ్లను ఎదుర్కోగల భాగస్వామి అని ఒమన్ కు బాగా తెలుసు. ఆ విషయాన్ని వారు ఎంతగానో గౌరవిస్తారు.

 

ఎన్నో ఏళ్లుగా రెండు దేశాల మధ్య పెట్టుబడులను సంయుక్త పెట్టుబడి నిధి ప్రోత్సహిస్తోంది. ఇంధనం, ఆయిల్, గ్యాస్, ఎరువులు, ఆరోగ్యం, పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి ఏ రంగంలోనైనా కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.

 

కానీ మిత్రులారా, భారత్, ఒమన్ కేవలం దీనికే పరిమితం కావాలని అనుకోవటం లేదు. సౌకర్యవంతమైన పరిధులకే మనం పరిమితం కాకూడదు. భారత్-ఒమన్ భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలి. ఇందుకోసం, ఇరుదేశాల వాణిజ్య వర్గాలు ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.

 

కొన్ని సవాళ్ల వివరణ ద్వారా మీ పనిని కాస్త సులభతరం చేస్తాను. గ్రీన్ ఎనర్జీ రంగంలో మనం ఏదైనా ప్రగతిని సాధించగలమా? రాబోయే ఐదేళ్లలో అయిదు భారీ గ్రీన్ ప్రాజెక్టులను ప్రారంభించగలమా? గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, సోలార్ పార్కులు, ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్ల రంగాల్లో మనం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుదాం.

 

మిత్రులారా,

ఇంధన భద్రత ఎంత కీలకమో, ఆహార భద్రత కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తులో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాలుగా మారనుంది. భారత్-ఒమన్ కలిసి అగ్రి ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయగలమా? ఈ కార్యక్రమం ద్వారా ఒమన్ లో ఆహార భద్రతను బలోపేతం చేయటమే కాక, భారతదేశ అగ్రి-టెక్ పరిష్కారాలు ప్రపంచ మార్కెట్లకు చేరువయ్యేందుకు సహాయపడుతుంది.

 

మిత్రులారా,

 

వ్యవసాయం రంగం కేవలం ఒక అంశం మాత్రమే. అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. ఒమన్-ఇండియా ఇన్నోవేషన్ బ్రిడ్జిని మనం నిర్మించగలమా? రాబోయే రెండేళ్లలో భారత్ లోని 200 అంకుర సంస్థలను ఒమన్ తో అనుసంధానించటమే మన లక్ష్యం.

 

ఉమ్మడి ఇంక్యుబేటర్లు, ఫిన్‌టెక్ శాండ్ బాక్సులు, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌లను మనం ఏర్పాటు చేయాలి. సీమాంతర పెట్టుబడులను ప్రోత్సహించాలి.

 

మిత్రులారా,

 

ఇవి కేవలం నా ఆలోచనలు మాత్రమే కాదు.. ఆహ్వానాలు:

 

పెట్టుబడులకు ఆహ్వానం.

 

ఆవిష్కరణలకు ఆహ్వానం.

 

కలిసి భవిష్యత్తును నిర్మించేందుకు ఆహ్వానం.

 

సరికొత్త సాంకేతికత, నూతన శక్తి, సరికొత్త కలలతో ఈ చిరకాల మైత్రిని కొనసాగిద్దాం.

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power

Media Coverage

Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Madhya Pradesh meets Prime Minister
March 18, 2026

Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister @narendramodi.

@GovernorMP”