ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 14న ఉత్తరాఖండ్లోను, ఉత్తరప్రదేశ్లోను పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11:15 గంటలకు ప్రధాని ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ చేరుకొంటారు. ఢిల్లీ -డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ లో ఉన్నత భాగమైన వైల్డ్లైఫ్ కారిడార్ గురించి ప్రధానమంత్రి సమీక్షిస్తారు. ఉదయం దాదాపు 11:40 గంటలకు ప్రధాని డెహ్రాడూన్ సమీపంలో జై మా దాత్ కాళీ ఆలయాన్ని దర్శించుకొని, పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత, ఇంచుమించు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధానమంత్రి డెహ్రాడూన్లో ఒక జనసభలో పాల్గొని, ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ పొడవు 213 కిలోమీటర్లు. దీనిలో ఆరు దోవలు ఉన్నాయి. దీని నిర్మాణానికి రూ.12,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేశారు. ఇది ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా సాగుతుంది. దీనితో ఢిల్లీకీ, డెహ్రాడూన్కూ మధ్య ప్రయాణానికి ప్రస్తుతం పడుతున్న ఆరు గంటలకు పైచిలుకు కాలం కాస్తా సుమారు రెండున్నర గంటలకు తగ్గుతుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా 10 ఇంటర్చేంజుల్నీ, 3 రైల్వే ఓవర్ బ్రిడ్జుల్నీ (ఆర్ఓబీస్), 4 ప్రధాన వంతెనలతో పాటు 12 పక్కదారి సదుపాయాల్నీ నిర్మించి, నిరంతరాయంగా అధిక వేగవంతమైన అనుసంధానానికి మార్గాన్ని సుగమం చేశారు. ఈ కారిడార్ ను ఉపయోగించుకొనే వారికి సురక్షిత, మరింత ఎక్కువ సమర్థమైన ప్రయాణానుభవాన్ని అందించడం కోసం ఆధునిక ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ (ఏటీఎంఎస్)ను జతపరిచారు.
ఆ ప్రాంతంలో సమృద్ధంగా ఉన్న జీవవైవిధ్యాన్ని, వన్యప్రాణుల ఉనికిని, పర్యావరణపరమైన సమతౌల్యాన్ని పరిరక్షించే దృష్టితో మనుషులు, పశువులు సాధ్యమైనంత వరకూ పరస్పరం ఎదురుపడకుండా చూడటానికి అనేక వెసులుబాట్లతో ఈ రాకపోకల మార్గం రూపురేఖలను తీర్చిదిద్దారు. వన్య ప్రాణులు స్వతంత్రంగా తిరిగేటట్లు చూడడానికి, అటవీ మృగాల పరిరక్షణకు అనేక ముందు జాగ్రత్త చర్యలను ఈ ప్రాజెక్టులో భాగంగా చేశారు. వీటిలో.. 12 కి.మీ. పొడవైన వైల్డ్లైఫ్ ఎలివేటెడ్ కారిడార్ ఒకటి. ఇది ఆసియా ఖండంలో అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్లలో ఒకటి. వన్యమృగాల సంచారానికి వీలుగా ఈ నడవాలో ఎనిమిది దారుల్నీ, ఏనుగుల కదలికలకు ఉద్దేశించిన ఒక్కొక్కటీ 200 మీటర్ల మేర ఉన్న రెండు అథోమార్గాలతో పాటు దాత్ కాళీ ఆలయానికి దగ్గర్లో 370 మీటర్ల పొడవైన సొరంగాన్నీ కూడా ఏర్పాటు చేశారు.
ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడంలో ఒక కీలక పాత్రను పోషిస్తుంది. ప్రధాన పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది. అంతేకాదు, ఆ ప్రాంతంలో వాణిజ్యానికి, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుంది. అధిక వేగవంతమైన అనుసంధానాన్ని, తదుపరి తరం మౌలిక సదుపాయాలను సమకూర్చాలని, ఈ క్రమంలో పర్యావరణ స్థిరత్వానికి కూడా ప్రాధాన్యాన్నిస్తూ పౌరుల జీవిత నాణ్యతను మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు ఈ ప్రాజెక్టు అద్దం పడుతోంది.


