• బికనేర్... పలానాలో రూ.26,000 కోట్ల ఖర్చుతో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్న ప్రధాని
• వీటిలో రైల్వేలు, రహదారులు, విద్యుత్తు, నీళ్లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు చెందిన ప్రాజెక్టులు
• దేశంలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 22న రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఆయన ఉదయం సుమారు 11 గంటలకు బీకానేర్‌కు వెళ్తారు. దేశ్‌నోక్‌లో కరణీ మాత ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు.

పదకొండున్నర గంటలకు ప్రధాని.. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరభివృద్ధి పనులు పూర్తి చేసిన దేశ్‌నోక్ స్టేషనును ప్రారంభించడంతో పాటు బికనేర్-ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. ఆ తరువాత, రూ.26,000 కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టే అనేక అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు కొన్నింటిని దేశ ప్రజలకు అంకితమివ్వనున్నారు. దేశ్‌నోక్‌లో ఒక బహిరంగసభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

దేశంలో రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరచాలన్న నిబద్ధతకు అనుగుణంగా ప్రధాని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో రూ.1,100 కోట్లకు పైచిలుకు ఖర్చుతో పునరభివృద్ధి పనులు పూర్తి అయిన 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 1,300కు పైగా స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతోఅభివృద్ధి చేస్తున్నారు. ప్రాంతీయ వాస్తుకళలకు అద్దంపడుతూనే, ప్రయాణికుల సౌకర్యాలను పెంచే దృష్టితో వీటిని తీర్చిదిద్దారు. కరణీ మాత ఆలయానికి వచ్చే తీర్థయాత్రికులు, పర్యటకులకు సేవలు అందించే దేశ్‌నోక్ రైల్వే స్టేషన్ పనుల్లో కరణీ మాత ఆలయ వాస్తుకళ, తోరణం-స్తంభం ఇతివృత్తాలను స్ఫూర్తిగా తీసుకున్నారు. తెలంగాణాలోని బేగంపేట రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనుల్లో కాకతీయ సామ్రాజ్య వాస్తుకళను స్ఫూర్తిగా  తీసుకున్నారు. బీహార్‌లో థావే స్టేషన్‌లో 52 శక్తి పీఠాలలో ఒకటైన మాత థావేవాలీకి ప్రాతినిధ్యం వహించే విభిన్న కుడ్య చిత్రాలు సహా కళాకృతులను అమర్చారు. అంతేకాక, మధుబనీ పెయింటింగులను కూడా ఇక్కడ అలంకరించారు. గుజరాత్‌లోని డాకోర్ స్టేషన్‌‌కు రణ్‌ఛోడ్‌రాయ్ జీ మహరాజ్ ప్రేరణగా నిలిచారు. దేశవ్యాప్తంగా పునరభివృద్ధిపరచిన అమృత్ స్టేషన్లలో సాంస్కృతిక వారసత్వంతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలు, దివ్యాంగ జనులు సహా ప్రయాణికులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మరీ తీర్చిదిద్దిన సౌకర్యాలకు తోడు మేలైన యాత్రానుభూతిని పంచడానికి  దీర్ఘకాలం నిలిచి ఉండే హంగూ ఆర్భాటాలను ఏర్పాటు చేశారు.

భారతీయ రైల్వేలు తన నెట్‌వర్క్‌ను 100 శాతం విద్యుదీకరించే దిశగా వేగంగా పయనిస్తోంది. దీనితో రైల్వే కార్యకలాపాలు మరింత సమర్ధంగాను, పర్యావరణానికి అనుకూలమైనవిగాను మారనున్నాయి. దీనికి అనుగుణంగానే, ప్రధాని చురూ-సాదుల్‌పుర్ రైల్వే లైను (58 కిలోమీటర్ల)తో పాటు సూరత్‌గఢ్-ఫలోదీ (336 కి.మీ.)కి శంకుస్థాపన చేస్తారు. విద్యుదీకరణ పూర్తయిన ఫులేరా-డెగానా (109 కి.మీ.), ఉదయ్‌పుర్-హిమ్మత్‌నగర్ (210 కి.మీ.), ఫలోదీ-జైసల్‌మేర్ (157 కి.మీ.)తో పాటు సమ్‌దడీ-బాడ్‌మేర్ (129 కి.మీ) రైలు మార్గాలను ప్రధాని దేశ ప్రజలకు అంకితం చేస్తారు.

రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహాన్ని అందించడానికి, ప్రధాని 3 వాహన అండర్‌పాసుల నిర్మాణం, నేషనల్ హైవేల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆయన రాజస్థాన్‌లో ఏడు రహదారి ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేస్తారు. రూ.4,850 కోట్లకు పైగా వ్యయంతో ఈ రహదారి ప్రాజెక్టులు పూర్తి అయితే సరకు రవాణాతోపాటు ప్రజల రాకపోకలు సౌకర్యవంతంగా మారతాయి. ఈ హైవేలు భారత్-పాకిస్తాన్ సరిహద్దు వరకు విస్తరించిన కారణంగా, భద్రతా దళాల రాకపోకలు పెరగడంతోపాటు భారత రక్షణ సంబంధి మౌలిక సదుపాయాలు బలోపేతమవుతాయి.

అందరికీ విద్యుత్తు, హరిత ఇంధనం, స్వచ్ఛ ఇంధనం.. వీటిని అందుబాటులోకి తీసుకుపోవాలన్న దార్శనికతను ముందుకు తీసుకు పోవడంలో భాగంగా ప్రధాని బికనేర్ నావా, దీడ్‌వానా, కుచామన్ లో  విద్యుత్తు ప్రాజెక్టులతో పాటు పార్ట్ బి పవర్‌గ్రిడ్ సిరోహీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, పార్ట్ ఇ పవర్‌గ్రిడ్ మేవాడ్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌ల విద్యుత్తు సరఫరాకు ఉద్దేశించిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన బికనేర్‌లో సౌర ప్రాజెక్టు, పవర్‌గ్రిడ్ నీమచ్, బికనేర్ కాంప్లెక్స్ నుంచి తరలింపునకు ఉద్దేశించిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ, ఫతేహ్‌గఢ్-II పవర్ స్టేషన్‌లో సరఫరా సామర్థ్యం విస్తరణ సహా విద్యుత్తు ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు. ఇవి స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించనున్నాయి. 

ప్రధానమంత్రి రాజస్థాన్‌లో మౌలిక సదుపాయాలను, సంధానాన్ని, విద్యుత్తు సరఫరాను, ఆరోగ్య సంరక్షణ సేవలను, నీటి లభ్యతను పెంచడానికి 25 ముఖ్య ప్రాజక్టులకు శంకుస్థాపన-ప్రారంభోత్సవం చేసి దేశ ప్రజలకు సమర్పించనున్నారు. వీటిలో రూ.3,240 కోట్లకన్నా ఎక్కువ ఖర్చుతో 750 కి.మీ. కి పైగా పొడవైన 12 స్టేట్ హైవేల ఉన్నతీకరణ పనులు, నిర్వహణ పనులకు శంకుస్థాపనలు, వాటిని దేశ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాలు భాగంగా ఉన్నాయి.  వీటిలో మరో 900 కి.మీ. కొత్త హైవేలు కూడా కలిసి ఉన్నాయి. ప్రధానమంత్రి బికనేర్, ఉదయ్‌పుర్‌లలో విద్యుత్తు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆయన రాజ్‌సమంద్, భీల్‌వాడా, ధౌల్‌పుర్‌లలో నర్సింగ్ కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. ఇవి రాష్ట్రంలో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను పెంచడంలో ముఖ్యపాత్రను పోషించనున్నాయి. ప్రధాని ఝంఝును జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా , ఫ్లోరోసిస్ తగ్గింపు ప్రాజెక్టు ‘అమృత్ 2.0’లో భాగంగా పాలీ జిల్లాలోని 7 పట్టణాల్లో ‘పట్టణ నీటి సరఫరా పథకాల’ పునర్‌వ్యవస్థీకరణ సహా వివిధ జల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, వాటిని దేశ ప్రజలకు అంకితం చేస్తారు.‌‌‌

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI 2.0: India bets big on making more of the smartphone at home

Media Coverage

PLI 2.0: India bets big on making more of the smartphone at home
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 మే 2026
May 29, 2026

Every Sector, Every Citizen: How PM Modi’s Vision is Transforming India Across All Fronts