బాలోతరాలో సుమారు రూ.1.06 లక్షల కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన అభివృద్ధి ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయడం, ప్రారంభించడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
వీటిలో పెట్రోరసాయనాలు నుంచి పట్టణ రవాణా, రైల్వేలు, రోడ్లు, పునరుత్పాదక ఇంధనంతో పాటు విద్యుత్తు సరఫరా సహా వివిధ రంగాలకు చెందిన ప్రాజెక్టులు
బాలోతరా.. పచ్‌పద్‌రాలో భారత మొదటి గ్రీన్‌ఫీల్డ్ ఏకీకృత రిఫైనరీ, పెట్రోరసాయనాల కాంప్లెక్సును దేశ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధానమంత్రి
ఈ అత్యాధునిక కాంప్లెక్సులో రిఫైనింగ్, పెట్రోరసాయనాల ఉత్పత్తిని ఏకీకరించారు.. రూ.79,450 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ఏర్పాటు
జైపూర్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
మార్పుచేర్పులు చేసిన ఉడాన్ పథకాన్ని జోధ్‌పూర్‌లో ప్రారంభించనున్న ప్రధానమంత్రి
జోధ్‌పూర్ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్న ప్రధాని
భారత సెమీకండక్టర్ తయారీ రంగంలో ఓ కీలక ప్రగతి ప్రస్థానానికి సూచికగా నిలిచే సీజీ సెమీ ఓఎస్ఏటీ కేంద్రాన్ని అహ్మదాబాద్‌.. సాణంద్‌లో ప్రారంభించనున్న ప్రధానమంత్రి
సీజీ సెమీ ప్లాంటులో భారత్‌కు చెందిన మొదటి ఎండ్-టూ-ఎండ్ ఓఎస్ఏటీ సౌకర్యాలలో ఒకటి కానుంది.. ఇది సెమీకండక్టర్ అసెంబ్లీ, పరీక్షా సేవలను అందిస్తుంది
పూర్తి స్థాయిలో ప్రారంభించిన తరువాత, ఈ కేంద్రానికి ఏటా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్స్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 4న రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 10:45 గంటలకు జోధ్‌పూర్ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు, సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం దాదాపు 12:15 గంటలకు, ఆయన బలోతరాకు వెళ్తారు. అక్కడ దాదాపు రూ.1.06 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి అయిన అభివృద్ధి ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయడం, ప్రారంభించడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
దీని తరువాత, ప్రధానమంత్రి గుజరాత్ వెళ్తారు. సాయంత్రం దాదాపు 4:30 గంటలకు, అహ్మదాబాద్.. సాణంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
జోధ్‌పూర్‌లో ప్రధానమంత్రి
ప్రాంతీయ అనుసంధానంపై ప్రధానంగా దృష్టిని సారిస్తూ విమానయాన రంగానికి పెద్ద దన్నుగా తీర్చిదిద్దిన ‘ఉడాన్’ (UDAN) పథకాన్ని జోధ్‌పూర్‌లో ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది భారత పౌర విమానయాన రంగంలో ఓ కీలక మలుపు అని చెప్పవచ్చు. అంతేకాదు, ఇది ‘‘ఉడే దేశ్ కీ ఆమ్ నాగరిక్’’ (దేశంలో సామాన్య పౌరులు కూడా విమాన ప్రయాణాలు చేయాలి) అనే దృష్టికోణాన్ని మరింత ముందుకు తీసుకుపోనుంది. రాబోయే 10 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని రూ.28,840 కోట్లను ఈ పథకానికి కేటాయించారు. విమానయాన ఆధారిత అభివృద్ధిలో తదుపరి దశను వేగిరపరచడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకాన్ని సమగ్ర, సుస్థిర అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించారు.
దేశమంతటా విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడానికి, ప్రస్తుతం ఉపయోగించకుండా ఉన్న ఎయిర్ స్ట్రిప్‌లను 100 ఏరోడ్రోమ్‌లుగా మార్చడంపై దృష్టి సారిస్తారు. దీనికి రూ.12,000 కోట్ల కన్నా ఎక్కువ బడ్జెటును కేటాయించారు. దీనికి అదనంగా, ప్రాంతీయ విమానాశ్రయ కార్యకలాపాలను మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాల్లోనే వాటి లాభదాయకతను నిర్ధారించడానికి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎమ్)కు రూ.2,500 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని కేటాయించారు. ఈ పథకంలో భాగంగా దూర, కఠిన ప్రాంతాలకు చేరుకోవడానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి 200 ఆధునిక హెలీప్యాడ్లను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
విమానయాన సంస్థలకు రూ.10,000 కోట్ల కన్నా ఎక్కువ విలువైన వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) సహాయాన్ని ఈ పథకంలో భాగంగా అందిస్తున్నారు. దీంతో ప్రాంతీయ కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు అవకాశం ఉంటుంది. క్రమ క్రమంగా వాణిజ్య లాభదాయకత పుంజుకొనేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికోణానికి మరింత బలాన్ని అందిస్తూ, హెచ్ఏఎల్ ధ్రువ్, డార్నియర్ ప్లాట్‌ఫారాల వంటి స్వదేశీ విమానాలూ, హెలీకాప్టర్ల సేకరణను కూడా ఈ కార్యక్రమంలో చేర్చారు. సేవలు తక్కువగా అందుబాటులో ఉన్న  ప్రాంతాలకు అనుసంధానం, నిర్వహణ కార్యకలాపాలను పెంచడం దీని ముఖ్యోద్దేశం.
ఈ కార్యక్రమంలో భాగంగా, జోధ్‌పూర్‌ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టును మొత్తం రూ.480 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. 23,000 కన్నా ఎక్కువ చ.కి.మీ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన టెర్మినల్ భవనం ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందిస్తుంది. ప్రయాణికులు నిరంతరాయంగా, హాయిగా ప్రయాణించడానికి అనువైన అనేక సౌకర్యాలను ఈ భవనంలో ఏర్పాటు చేశారు.
రాజస్థానుకు చెందిన రాచఠీవి ఉట్టిపడే వాస్తుకళ నుంచి స్పూర్తిని పొందుతూ, అదే సమయంలో సమకాలిక డిజైన్లను కూడా మేళవించి ఈ టెర్మినల్‌ కమాన్లనూ, కిటికీలనూ తీర్చిదిద్దారు. ఇంధనాన్ని ఆదా చేసే వ్యవస్థలనూ, నీటి సంరక్షణ చర్యలనూ, హరిత భవన నిర్మాణ పద్ధతులనూ అనుసరించి సుస్థిరాభివృద్ధిని వెన్నుదన్నుగా తీసుకుని, 5 నక్షత్రాల ‘గృహ’ (GRIHA) రేటింగును దక్కించుకొనే లక్ష్యంతో ఈ టెర్మినల్‌ను డిజైన్ చేశారు. జోధ్‌పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన తరువాత, ఈ ప్రాంతంలో పర్యటన, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించనుంది.
బాలోతరాలో ప్రధానమంత్రి
సుమారు రూ.1.06 లక్షల కోట్ల ఖర్చుతో బాలోతరాలో చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. నిర్మాణం పూర్తి అయిన కొన్ని ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. వీటిలో పెట్రోరసాయనాలు, పట్టణ రవాణా, రైల్వేలు, రోడ్లు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్తు సరఫరా వంటి అనేక రంగాలకు చెందిన ప్రాజెక్టులున్నాయి.
బాలోతరా.. పచ్‌పద్‌రాలో భారత తొలి గ్రీన్‌ఫీల్డ్ ఏకీకృత రిఫైనరీ, పెట్రోరసాయనిక కాంప్లెక్సును దేశ ప్రజలకు ప్రధాని అంకితం చేస్తారు. ఇది దేశంలో ఇంధనం, పెట్రోరసాయనాల రంగంలో ఒక కీలక ప్రగతి ప్రస్థానానికి సూచికగా నిలవనుంది.
ప్రభుత్వానికీ, హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ సంస్థ (హెచ్‌పీసీఎల్)కీ మధ్య సంయుక్త సంస్థ (జేవీ)గా అభివృద్ధిపరిచిన ఈ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోరసాయనిక కాంప్లెక్సు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎమ్ఎమ్‌టీపీఏ). దీనిని రూ.79,450 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేశారు.
ఈ అత్యాధునిక కాంప్లెక్సు రిఫైనింగుతో పాటు పెట్రోరసాయనాల ఉత్పాదనను ఏకీకరిస్తుంది. దీనిలో ప్రతి సంవత్సరం 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎమ్ఎమ్‌టీపీఏ) ఉత్పాదనలు లభిస్తాయి. రిపైనరీ 17.0 నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్సును కలిగివుంది. దీని పెట్రోకెమికల్ ఉత్పాదనలు 26 శాతాన్ని మించనున్నాయి. ఇవి సామర్థ్యం, స్థిరత్వం విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానూ ఉంటాయి.
ఈ ప్రాజెక్టు భారత్ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో, పెట్రోరసాయనిక రంగంలో స్వయంసమృద్ధిని పెంచడంలో, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడడంలో కీలక పాత్రను పోషిస్తుందని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో పెట్రోరసాయనిక, ప్లాస్టిక్ పార్కు అభివృద్ధికి ఒక ముఖ్యాధారంగా నిలవనుంది. దీని రాకతో సంబంధిత పరిశ్రమలూ, అనుబంధ రంగాలకు దన్ను లభిస్తుంది. ఈ రిఫైనరీ చెప్పుకోదగ్గ ఉద్యోగావకాశాలను కూడా అందిస్తుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికీ ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.
జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.13,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేయనున్నారు. రెండో దశలో భాగంగా, ప్రహ్లాద్‌పురా నుంచి తోడీ మోడ్ వరకూ 41 కి.మీ. పొడవైన ఉత్తర-దక్షిణ మెట్రో కారిడారును అభివృద్ధి చేస్తారు. ఇది 36 స్టేషన్ల గుండా సాగుతూ సీతాపురా, విశ్వకర్మ పారిశ్రామిక ప్రాంతానికి (వీకేఐ) చెందిన పారిశ్రామిక ప్రాంతాలనూ, నివాస ప్రాంతాలను కలుపుతుంది. ఈ కారిడార్ సీతాపురా పారిశ్రామిక ప్రాంతం, వీకేఐ, జైపూర్ విమానాశ్రయం, టోంక్ రోడ్డు, ఎస్ఎమ్ఎస్ ఆస్పత్రి, ఎస్ఎమ్ఎస్ స్టేడియమ్, అంబాబాడీ, విద్యాధర్‌నగర్ సహా ప్రధాన స్థానాలను ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా జోడిస్తుంది. ఈ ప్రాజెక్టు జైపూర్ లో ప్రధాన పారిశ్రామిక, నివాస ప్రాంతాలకు అనుసంధానాన్ని చెప్పుకోదగిన రీతిలో మెరుగుపరుస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు వేగవంతమైన, సురక్షిత, మరింత సౌకర్యవంత ప్రజా రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఒకటో దశలో 11 స్టేషన్లతో 11.64 కి.మీ. పొడవైన మెట్రో కారిడార్ ఇప్పటికే సేవలను అందిస్తోంది.
దాదాపు రూ.900 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసిన చురు-సాదుల్‌పూర్ (58 కి.మీ.), చురూ-రతన్‌గఢ్ (46 కి.మీ.) రైలు డబ్లింగ్ ప్రాజెక్టులను కూడా దేశ ప్రజలకు ప్రధానమంత్రి అంకితం చేస్తారు. మొత్తం 104 కి.మీ. పొడవున విస్తరించిన ఈ ప్రాజెక్టులు రాజస్థాన్ ఉత్తర-పశ్చిమ ప్రాంతాల్లో రైలు అనుసంధానాన్ని పటిష్ఠపరుస్తాయి. వీటితో రైలు మార్గాల సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా రైళ్ల రాకపోకలూ, సరకు రవాణా రైళ్ల రాకపోకలూ సాఫీగానూ, సురక్షితంగానూ, సమయబద్ధంగానూ నడిచేందుకు ఆస్కారం ఉంటుంది. రైల్ నెట్‌వర్కులో రద్దీ తగ్గుతుంది. ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో పెట్టుబడి, ఉద్యోగావకాశాల కల్పనతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా నూతనోత్తేజాన్ని అందిస్తాయి.
జోధ్‌పూర్ రింగ్ రోడ్డులో 2వ సెక్షను (కార్వార్-డాంగియావాస్)లో నెలకొన్న ఎన్‌హెచ్-125ఏను నాలుగు దోవలు కలిగిందిగా విస్తరించారు. దీనిని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. సుమారు రూ.740 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టుతో జోధ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాలకు అనుసంధానం మెరుగుపడి, ప్రయాణాలు సాఫీగానూ, సురక్షితంగానూ మారతాయి.
దీనికి అదనంగా, ఎస్‌జేవీఎన్ కు చెందిన 1,000 మెగావాట్ల బీకానేర్ సౌర ఇంధన ప్రాజెక్టును దేశ ప్రజలకు ప్రధానమంత్రి అంకితం చేస్తారు. దీనిని దాదాపు రూ.5,500 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారు.  దేశీయంగా నిర్మించిన 24.22 లక్షల సౌర మాడ్యూళ్లను ఈ ప్రాజెక్టులో ఉపయోగించారు. ఎన్‌హెచ్‌పీసీకి చెందిన 300 మెగావాట్ల కర్ణిసర్ బీకానేర్ సౌర ఇంధన ప్లాంటును కూడా దేశ ప్రజలకు ప్రధానమంత్రి అంకితం చేస్తారు. దేశీయంగా నిర్మించిన దాదాపు 7.75 లక్షల సౌర పీవీ సెల్స్‌నూ, మాడ్యూళ్లనూ ఈ ప్రాజెక్టులో ఉపయోగించారు.
రాజస్థాన్ రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ (ఆర్ఈజడ్) నుంచి విద్యుత్తు సరఫరా కోసం రూ.1,900 కోట్ల కన్నా ఎక్కు ఖర్చుతో నిర్మించిన ట్రాన్స్‌మిషన్ లైనును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. రాజస్థాన్ ఆర్ఈజడ్ కోసం 530 కి.మీ. పొడవైన విద్యుత్తు సరఫరా వ్యవస్థకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ విద్యుత్తు సరఫరా వ్యవస్థలు రాజస్థాన్లో ఉత్పత్తి చేసిన పునరుత్పాదక ఇంధనాన్ని సరఫరా చేయడంలో సౌలభ్యంతో పాటు రాష్ట్రంలో విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా కావడానికి కూడా తోడ్పడతాయి.
రాజస్థాన్ ప్రభుత్వ వివిధ విభాగాల్లో నియామకాలు పూర్తి అయిన దాదాపు 54,000 మంది యువతకు నియామక పత్రాలను ప్రధానమంత్రి అందిస్తారు. భర్తీ ప్రక్రియను ముగించుకున్న వారిలో.. విద్య, ఇంధనం, హోం, పంచాయతీ రాజ్, రవాణా, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ప్రణాళిక, వ్యవసాయం, సమాచార సాంకేతికతతో పాటు పరిపాలన సంస్కరణల విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు.
సాణంద్‌లో ప్రధానమంత్రి
గుజరాత్.. సాణంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం భారత్ సెమీకండక్టర్ తయారీ రంగంలో ఓ ముఖ్య ప్రగతి ప్రస్థానాన్ని సూచిస్తుంది. ఈ కేంద్రంలో వాణిజ్య సరళిలో ఉత్పాదన మొదలవనుండడమే దీనికి కారణం. ఇది అంతర్జాతీయ సెమీకండక్టర్ వేల్యూ చైన్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేసే దిశలో ఒక పెద్ద అడుగు కానుంది. ఈ ప్రాజెక్టు ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్)లో భాగంగా ఆమోదించిన తొలి నాలుగు ప్రాజెక్టుల్లో ఒకటి. అంతేకాక రూ.7,500 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో దీనిని అభివృద్ధి చేశారు.
పూర్తి సామర్ధ్యంతో పని చేయడం మొదలైతే ఈ కేంద్రం ఏటా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్స్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. కృత్రిమ మేధ (ఏఐ), ఉన్నత పనితీరు కలిగిన కంప్యూటింగ్‌లలో వేగంగా చోటుచేసుకుంటున్న వృ‌ద్ధి కారణంగా మెమరీ, స్టోరేజ్ పరిష్కారాల విషయంలో పెరుగుతున్న అంతర్జాతీయ గిరాకీని తీర్చడంలో ఈ కేంద్రం సాయపడుతుంది. ఆటోమోటివ్, పారిశ్రామిక, టెలికమ్యూనికేషన్స్, 5జీ, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) రంగాల వినియోగదారుల అవసరాలను ఈ ప్లాంటు తీరుస్తుంది. సీజీ సెమీ కేంద్రం వేఫర్ సార్టింగ్, అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజీ డిజైన్, వైఫల్యాల విశ్లేషణ, టెస్ట్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్, ఉత్పాదన విశిష్టత నిర్ధారణలతో పాటు ఆధునిక రవాణా వ్యవస్థ సేవలను కూడా ఇది అందిస్తుంది.
ఈ కేంద్రం పని చేయడం మొదలయితే భారత్ ఒక విశ్వసనీయ, స్వయంసమృద్ధ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా వెలుగులోకి రావడాన్ని గురించి ప్రపంచానికి చాటి చెబుతుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు దేశంలో ఒక సుదృఢ, స్వయంసమృద్ధ సాంకేతిక విస్తారిత అనుబంధ వ్యవస్థను నిర్మించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా కూడా నిలుస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a fire tragedy in Birbhum, West Bengal
August 17, 2026
Prime Minister announces ex-gratia from PMNRF for the victims of the mishap in Birbhum, West Bengal

Prime Minister Shri Narendra Modi today expressed deep anguish over the loss of lives due to a fire tragedy in Birbhum, West Bengal.

The Prime Minister extended his condolences to those who have lost their loved ones and prayed for the early recovery of the injured. He added that the local administration is actively assisting those affected in the mishap.

In a post on X, the Prime Minister's Office shared:

"Anguished to hear about the loss of lives due to a fire tragedy in Birbhum, West Bengal. I extend my condolences to those who have lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected in the mishap: PM @narendramodi"

Prime Minister Shri Narendra Modi has announced an ex-gratia from the Prime Minister's National Relief Fund (PMNRF) of Rs. 2 lakh for the next of kin of each deceased, along with Rs. 50,000 for those injured in the mishap in Birbhum, West Bengal.

In a post on X, the Prime Minister's Office shared:

"In the wake of the mishap in Birbhum, West Bengal, PM @narendramodi has announced Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 for those injured."