లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 31న మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. భోపాల్లో ఉదయం 11:15 గంటలకు లోకమాత దేవీ అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. భోపాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
లోకమాత దేవీ అహల్యాబాయి మహిళా శక్తికరణ్ మహాసమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. లోకమాత దేవీ అహల్యాబాయి స్మారక పోస్టల్ స్టాంపును, ప్రత్యేక నాణేన్ని కూడా ఆయన విడుదల చేస్తారు. రూ.300 నాణెంపై అహల్యాబాయి హోల్కర్ చిత్రం ఉంటుంది. గిరిజన, జానపద, సాంప్రదాయక కళల్లో విశేష కృషి చేసిన ఓ మహిళా కళాకారిణికి జాతీయ దేవీ అహల్యాబాయి పురస్కారాన్ని కూడా ప్రధానమంత్రి అందిస్తారు.
ఉజ్జయినిలో 2028లో జరగబోతున్న సింహస్థ మహాకుంభ్కు సంబంధించి క్షిప్రా నదిపై రూ .860 కోట్లకు పైగా వ్యయంతో తలపెట్టిన ఘాట్ నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. బ్యారేజీ, స్టాప్ డ్యాం, వెంటెడ్ కాజ్వే వంటి వివిధ నిర్మాణాలను కూడా చేపడతారు.
క్షేత్రస్థాయిలో విమాన సదుపాయాలకు ఊతమిచ్చేలా దతియా, సాత్నా విమానాశ్రయాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వింధ్య ప్రాంతంలో పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఆరోగ్య సంరక్షణలో ఇది కొత్త అవకాశాలను కల్పిస్తుంది.
నగరాల్లో ప్రయాణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్న సంకల్పానికి అనుగుణంగా.. ఇండోర్ మెట్రో ఎల్లో లైన్లోని సూపర్ ప్రయారిటీ కారిడార్లో ప్రయాణికుల సేవలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడంతోపాటు రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.
రూ. 480 కోట్లకు పైగా వ్యయంతో 1,271 అటల్ గ్రామ సుశాసన్ భవనాల నిర్మాణం కోసం తొలి విడతను ప్రధానమంత్రి బదిలీ చేయనున్నారు. గ్రామ పంచాయతీలకు శాశ్వత మౌలిక సదుపాయాలను అందించడంతోపాటు పరిపాలన విధులను నిర్వర్తించడంలో, సమావేశాల నిర్వహణలో, రికార్డులను మరింత సమర్థంగా నిర్వహించడంలో ఈ భవనాలు సహాయపడతాయి.


