· “మన నారీశక్తికి సాధికారత కల్పించే చారిత్రక అవకాశం ఇదే”
· “వికసిత భారత్ సాకారం సహా నిర్ణయాత్మకతలో నారీశక్తికి భాగస్వామ్యం అవశ్యం”
· “క్షేత్రస్థాయిలో మరింత ఎక్కువగా మహిళలు సారథ్య పాత్ర పోషిస్తున్నారు”
· “నారీశక్తికి మనం ఏదో ఇస్తున్నామనే భావన సరికాదు... ఇది వారి హక్కు”
· “మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం సంఖ్యలకు పరిమితం కాదు... అది ప్రజాస్వామ్య

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్‌సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఉదయాన్నే కీలక బిల్లుపై చర్చ ప్రారంభాన్ని ఉటంకిస్తూ- అనేకమంది తన సహచరులు వాస్తవాల మేరకు తర్కబద్ధంగా కీలక సమస్యలను సమర్థంగా ప్రస్తావించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఒక దేశ ప్రస్థానంలో అనేక కీలక ఘట్టాలు తటస్థిస్తాయని చెబుతూ- తదనుగుణంగా సామాజిక ధోరణి, నాయకత్వ సామర్థ్యం అవకాశాలను అందిపుచ్చుకుని, బలమైన జాతీయ వారసత్వాన్ని ప్రోదిచేస్తాయని ప్రధానమంత్రి గుర్తుచేశారుఏ. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రస్తుత తరుణం కూడా అటువంటి చారిత్రక ఘట్టమేనని స్పష్టం చేశారు. నేటి ఈ ఆలోచన 25 నుంచి 30 ఏళ్ల కిందటే సాకారం కావాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భారత్‌ గుర్తింపును ప్రముఖంగా ప్రస్తావిస్తూ- వేల ఏళ్లనాటి వారసత్వానికి ఓ సరికొత్త, సంస్కరణాత్మక శోభను జోడించే దిశగా సభ్యులందరికీ ఈ సభ ఒక శుభప్రదమైన అవకాశం ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

విధాన రూపకల్పనలో దేశ జనాభాలోని సగభాగాన్ని చురుకైన భాగస్వాములను చేయడం ఒక అద్భుత, విశేష అధికారమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ కీలక అవకాశాన్ని జారవిడచుకోరాదని గౌరవనీయ పార్లమెంటు సభ్యులను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత  పరిణామాత్మక కృషిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ- దేశ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంలో భాగంగా పరిపాలన వ్యవస్థలో ప్రగాఢ అవగాహన నింపేందుకు భారతీయులంతా సమష్టిగా సన్నద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. “మనమిప్పుడు ఓ కీలక మలుపులో మేధా మథనం చేస్తున్నాం... దీన్నుంచి ఆవిర్భవించే అమృతమే దేశం దశ, దిశలను నిర్ధారిస్తుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ప్రస్తుత 21వ శతాబ్దంలో భారత్‌ సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ- యావద్దేశం నేడు విస్తృత ప్రపంచ ఆమోదం పొందుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఇది వికసిత భారత్‌ సంకల్పంతో ముడిపడినది కావడం మనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌పై తన దృక్కోణం అత్యున్నత మౌలిక సదుపాయాలకు అతీతమన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రాన్ని విధాన రూపకల్పనలో అర్థవంతంగా ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు మన జనాభాలో 50 శాతమైన మహిళలను విధాన రూపకల్పనలో భాగస్వాములను చేయడం తక్షణావసరమని చెప్పారు. దీనికి సంబంధించి లోగడ జాప్యం చోటు చేసుకున్నప్పటికీ, తన విస్తృత వ్యక్తిగత సంప్రదింపుల సందర్భంగా ఈ బిల్లుపై ఏ ఒక్క పార్టీ నుంచీ సూత్రప్రాయంగానైనా వ్యతిరేకత రాలేదని పేర్కొన్నారు. వ్యక్తిగత రాజకీయ వ్యవస్థలకన్నా సామూహిక నిర్ణయాలే అంతిమంగా మన ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయన్నది చరిత్ర తేల్చిన సత్యమని చెప్పారు. ఈ ఘనత తనకు లేదా అధికార పక్షానికి కాకుండా మొత్తం సభకు దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. “అందువల్ల, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే- దీనికి మద్దతు పలకడంలోనే ప్రతిఒక్కరి వాస్తవిక ప్రయోజనం ఇమిడి ఉంది” అని శ్రీ మోదీ ప్రకటించారు.

ప్రభుత్వాధినేతగా అధికార బాధ్యతలు చేపట్టడానికి ముందు సంస్థాగత కార్యకర్తగా తన గతాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. పంచాయతీ స్థాయిలో రిజర్వేషన్లు సరళంగా మంజూరు కావడాన్ని ప్రశ్నిస్తూ- పార్లమెంటు ప్రాంగణంలో సాగిన చర్చలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తమ పదవులు లేదా అధికారాన్ని కోల్పోతామనే భయం లేకపోవడం వల్లే పంచాయతీలలో కోటా మంజూరుకు నాయకులు సుముఖత ప్రకటించారని స్పష్టం చేశారు. అయితే, స్వప్రయోజనాలకు ముప్పు వాటిల్లే కోటాల అమలుపై ఉన్నతాధికారులలో పాతుకుపోయిన వైముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- “పార్లమెంటుపై ఎలాంటి ప్రభావం చూపకుండా స్థానిక రిజర్వేషన్లు విజయవంతంగా 50 శాతానికి చేరుకోవడంలో ఈ రక్షణాత్మక ధోరణి దోహదం చేసింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

చారిత్రక మార్పులను తక్కువగా అంచనా వేయరాదని హెచ్చరిస్తూ- 25 లేదా 30 ఏళ్ల కిందటిలా కాకుండా మహిళల హక్కులపై వ్యతిరేకత రాజకీయ ఉపరితలం దిగువన నేడు లోతుగా ప్రతిధ్వనిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడొక ప్రగాఢ రాజకీయ చైతన్యం పెల్లుబుకుతోందని, పంచాయతీ ఎన్నికలలో నెగ్గిన లక్షలాది మంది మహిళలు నిశ్శబ్ద పరిశీలకుల స్థాయి నుంచి అత్యంత వాగ్ధాటిగల క్షేత్రస్థాయి అభిప్రాయ రూపకర్తలుగా పరిణామం చెందారని ఆయన చెప్పారు. నేటి ఈ అనుభవజ్ఞులైన మహిళలు ప్రజా సమస్యలను తుదకంటా పరిష్కరించారని ప్రకటించారు. ఇకపై శాసనసభలు, పార్లమెంటు స్థాయిలో ప్రాథమిక నిర్ణయాత్మకత దిశగా తమ భాగస్వామ్యం కోసం తీవ్ర ఆందోళనతో డిమాండ్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆశావహులైన రాజకీయ నాయకులందదరూ ఈ మార్పును గుర్తించాలని సూచించారు. ఈ లక్షలాది మంది మహిళా నేతలు  అన్ని నియోజకవర్గాలలో భవిష్యత్ ఎన్నికల ఫలితాలను ఇకపై శక్తిమంతంగా ప్రభావితం చేయగలరని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశ మహిళల అవగాహనపై పూర్తి విశ్వాసం అవశ్యమని ప్రధానమంత్రి సభను కోరారు. ఈ చట్టంతో మహిళలకు 33 శాతం సభా ప్రాతినిధ్యం సాధించాక పితృస్వామ్య పర్యవేక్షణ అవసరం లేకుండానే వివిధ వర్గాలు, సమూహాలకు తదుపరి ఉప-కేటాయింపులను నిర్ణయించగల సామర్థ్యం కలిగి ఉంటారని పేర్కొన్నారు. తాను అత్యంత వెనుకబడిన వర్గానికి చెందినవాడినని చెబుతూ- సమాజంలోని ప్రతి వర్గంతో భుజం కలిపి సాగడమే తన ప్రధాన రాజ్యాంగ కర్తవ్యమని ఆయన చెప్పారు. తనకు రాజ్యాంగమే సర్వోన్నతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఒక అణగారిన వ్యక్తి ఇంతటి బృహత్తర జాతీయ కర్తవ్యం నిర్వర్తించడానికి వీలు కల్పించిన శక్తి అదేనని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “వారి సామర్థ్యాలపై మనకెందుకు సందేహం? మహిళలే  ముందడుగు వేసి, నిర్ణయించనివ్వండి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

జీవితంలోని అన్ని రంగాల్లో అద్భుత విజయాలతో దేశ ప్రతిష్ఠను పెంచడంలో, దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడంలో మహిళా శక్తి ఏమాత్రం వెనుకబడలేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తల్లులు, సోదరీమణులు, కుమార్తెల అపార, విశిష్ట కృషితో యావద్దేశం గర్వంగా తలెత్తుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఇంతటి అత్యంత సమర్థ వర్గాన్ని అడ్డుకోవడం కోసం పెను రాజకీయ శక్తిని వెచ్చించడంలో హేతుబద్ధతను ప్రశ్నించారు. శాసనసభలలో మహిళల చేరికతో యావద్దేశ సామర్థ్యం అనేక రెట్లు ఇనుమడిస్తుందని ఆయన సూచించారు. ఈ చారిత్రక చర్యను ఏదో ఒక ఎన్నికల లెక్కల ప్రాతిపదికన కాకుండా జాతీయ ప్రయోజనాల ఆధారంగా అంచనా వేయాలని ప్రధానమంత్రి చట్టసభ సభ్యులకు విస్పష్ట విజ్ఞప్తి చేశారు. “దీన్ని రాజకీయ త్రాసులో తూచరాదని మీకు నా విజ్ఞప్తి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

నేటి తక్షణ కర్తవ్యాన్ని ప్రస్తావిస్తూ- వికసిత భారత్‌ సాకారంలో మహిళల భాగస్వామ్యాన్ని విశాల దృక్పథంతో సురక్షితం చేసే ప్రస్తుత అవకాశం ఏకీకృత ఆలోచనను అభిలషిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. తుది శాసన నిర్ణయాన్ని యావద్దేశం విశ్లేషిస్తున్న నేపథ్యంలో మహిళా ఓటర్లు దాని వెనుకగల ఉద్దేశాలను మరింత నిశితంగా పరిశీలిస్తారని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయ దురుద్దేశం పరిణామాలపై చట్టసభను హెచ్చరిస్తూ, వారి ఉద్దేశపూర్వక  తప్పిదం ఎలాంటిదైనా తీవ్ర వ్యతిరేకత తప్పదని పేర్కొన్నారు. “ఈ దేశంలోని నారీశక్తి మన ఉద్దేశాలలోని ఎలాంటి లోపాన్నీ, ఎన్నటికీ క్షమించదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

2023లో నూతన పార్లమెంటు భవనంలో ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా, ఆనందంగా ఆమోదించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇది దేశవ్యాప్తంగా సానుకూల, నిష్పాక్షిక వాతావరణాన్ని నెలకొల్పిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జనగణన డేటా, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై వస్తున్న ఆందోళనలపైనా ఆయన స్పందించారు. చరిత్ర మరవలేని కొన్ని ఘటనలు, కోవిడ్ విపత్తు సృష్టించిన భారీ అంతరాయాల వల్లే వీటి అమలులో జాప్యం జరిగిందని శ్రీ మోదీ వివరించారు. ఈ చట్టాన్ని సత్వరమే అమలు చేయాల్సిన ఆవశ్యకతను 2023లో జరిగిన విస్తృత చర్చలు స్పష్టం చేశాయని, కానీ 2024లోపే వాటిని అమలు చేయడం సాధ్యపడలేదని తెలిపారు. 2029లోనూ అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే, అది ప్రజల విశ్వాసాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశముందన్నారు. ఈ ప్రక్రియలో అంతులేని జాప్యం జరిగితే.. మహిళా సాధికారత పట్ల రాజకీయ వ్యవస్థ చిత్తశుద్ధితో ఉందన్న విషయమై వారికి విశ్వాసం కల్పించడం అసాధ్యమవుతుందన్నారు. రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలతో సమగ్రమైన అధికారిక, అనధికారిక సంప్రదింపులను ఇప్పటికే నిర్వహించామన్న ఆయన.. ఒక ఆచరణాత్మకమైన మార్గాన్ని రూపొందించడానికి ఈ చర్చలు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ‘‘ఇక ఏమాత్రం ఆలస్యం చేయకపోవడమే ప్రస్తుత కాలం చేస్తున్న ఖచ్చితమైన డిమాండ్' అని మోదీ ఉద్ఘాటించారు. ‘‘ఈ విషయంలో ఇక ఎంతమాత్రమూ జాప్యం తగదు. ఈ చట్టం అత్యావశ్యకమైన తరుణమిది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగం నిర్దేశించిన విధులకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. దేశాన్ని ముక్కలుగా చూసే హక్కు గానీ, భౌగోళిక విభజనను ప్రోత్సహించే నిర్ణయాలు తీసుకునే అధికారం గానీ ఈ సభలో కూర్చున్న ఏ సభ్యుడికీ లేదని తేల్చిచెప్పారు. కాశ్మీర్ అయినా, కన్యాకుమారి అయినా.. ఒకే దేశంగా ఐక్యంగా వ్యవహరించాలనే పార్లమెంటు సభ్యుల పవిత్ర ప్రమాణ స్వీకారాలు నిర్దేశిస్తున్నాయన్నారు. పూర్తిగా అబద్ధాలతో సృష్టించిన రాజకీయ దుమారాన్ని తీవ్రంగా ఖండిచారు. కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ఏ రాష్ట్రంపైనా లేదా ఏ ప్రాంతంపైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్ష ఉండబోదని పవిత్ర సభా వేదిక సాక్షిగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్ణయించిన జనాభా నిష్పత్తులను కచ్చితంగా పాటిస్తామని, ఎవరికీ నష్టం కలిగించకుండా న్యాయబద్ధంగా సీట్ల పెంపు జరుగుతుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. రాజకీయ ఉద్దేశాలతో కూడిన పద చమత్కారానికి, మాటల గారడీకి ఇందులో తావులేదన్నారు. తమిళంలోని ప్రాంతీయ పదాలు సహా, భరోసానిచ్చే బలమైన మాటల్లోనూ హామీ ఇచ్చేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తూ.. ప్రధానమంత్రి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ‘‘ఈ నిర్ణయ ప్రక్రియ ఎవరికీ అన్యాయం చేయదు’’ అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.

చట్టసభ సభ్యులనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ... దేశ మహిళలకు తామేదో ఉదారంగా ఇస్తున్నామన్న అహంకారపూరిత భ్రమలో ఎవరూ ఉండొద్దనీ, అది ఈ దేశ మహిళల హక్కు అనీ స్పష్టం చేశారు. ఈ హక్కును కాలరాయడంలో మొత్తం రాజకీయ వ్యవస్థా దశాబ్దాలుగా దోషిగా ఉందనీ, ఇప్పుడు ఈ బిల్లును తీసుకురావడం దానికి ప్రాయశ్చిత్తం లాంటిదనీ వ్యాఖ్యానించారు. గతంలో పైకి మద్దతిస్తున్నట్లు నటిస్తూనే.. సాంకేతిక సాకులను చూపుతూ ఓ పద్ధతి ప్రకారం ఈ బిల్లును అడ్డుకున్న రాజకీయ నాయకుల కపటత్వాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ రిజర్వేషన్‌ను బహిరంగంగా వ్యతిరేకించే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. ఈ దిశగా పురోగతిని సంక్లిష్టమైన ప్రక్రియల సాకులు చెప్పి అడ్డుకుంటూ, దేశ మహిళలను ఇకపై మోసం చేయలేమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలను సభ్యులు విడనాడాలని కోరారు. రకరకాల సాంకేతిక చిక్కులనే సాకులతో మూడు దశాబ్దాల పాటు దీనికి అవాంతరాలు ఎదురయ్యాయనీ, గత వైఫల్యాలను సమీక్షించుకునేందుకు ఆ సమయం చాలా ఎక్కువనీ ఆయన పేర్కొన్నారు. ‘‘మూడు దశాబ్దాలుగా మీరు దీన్ని అడ్డుకున్నారు. ఇక ఇప్పుడు దీన్ని సాకారం చేయాల్సిందే’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

వ్యక్తిగత కీర్తి లేదా పార్టీ ప్రయోజనాల పట్ల తనకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఏకీకృత విధానాన్ని అనుసరించడం.. మొత్తం చర్చల సరళినే మారుస్తుందనీ, తద్వారా పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రయోజనాలకు తావుండబోదనీ పేర్కొన్నారు. ఈ బిల్లు వెనుక తాత్విక నేపథ్యాన్ని వివరిస్తూ... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యమన్నది కేవలం గణాంకాల సర్దుబాటు మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యానికి తల్లి వంటి మన దేశ సాంస్కృతిక నిబద్ధతకు నిదర్శనమనీ వ్యాఖ్యానించారు.

ఈ నిబద్ధత వల్లే 20కి పైగా రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు విజయవంతంగా అమల్లోకి వచ్చాయనీ, అవి అద్భుతమైన సానుకూల ఫలితాలను ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా తన సుదీర్ఘ అనుభవాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయి మహిళా నాయకత్వం ఎంత సమర్థమైన, సున్నితమైన విధానాన్ని అనుసరిస్తుందో ప్రత్యక్ష అనుభవం ద్వారా తాను తెలుసుకున్నానన్నారు. సహానుభూతితో కూడిన పాలన ద్వారా.. అభివృద్ధి దిశగా పురోగమనంలో మహిళా నేతలు ఎప్పటికప్పుడు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల భాగస్వామ్యం.. దేశ విధాన రూపకల్పనలో సరికొత్త శక్తిని నింపుతుందని శ్రీ మోదీ ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అనుభవాలను వాస్తవాలతో కూడిన తర్కంతో మేళవిస్తే.. చట్టసభల సామర్థ్యం అనూహ్యంగా పెరుగుతుందన్నారు. ‘‘వారి గళాలు సభకు శక్తినివ్వడమే కాకుండా, సభ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఎంతో అనుభవమూ, సమర్థతా ఉన్న మహిళా శక్తికి భారత్‌లో కొదువ లేదనీ, దేశ సేవకు వారు సిద్ధంగా ఉన్నారని ప్రధానమంత్రి అన్నారు. ఈ మహిళా శక్తిపై దృఢమైన విశ్వాసం.. దేశ పరిపాలనలో అసాధారణమైన, అత్యంత ప్రయోజనకరమైన ఫలితాలనిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే సభలో సేవలందిస్తున్న మహిళా సభ్యులను ప్రశంసిస్తూ... వారికి అవకాశం లభించినప్పుడల్లా ఎంతో స్పష్టమైన, బలమైన దృక్పథాలను సభ ఎదుట నిలుపుతున్నారని గుర్తుచేశారు. ‘‘తమ సమర్థమైన సేవలతో వారు ఇప్పటికే సభను అద్భుతంగా సుసంపన్నం చేశారు’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

తన వాదనకు బలాన్నిచ్చే కచ్చితమైన గణాంకాలను ఆయన ఉటంకించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650కి పైగా జిల్లా పంచాయతీలకు దాదాపు 275 మంది మహిళలు నాయకత్వం వహిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వీరు నిర్వహిస్తున్న బాధ్యతలు, బడ్జెట్లు చాలావరకూ కేంద్ర కేబినెట్ మంత్రి పరిధి కన్నా కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. అంతేకాకుండా దాదాపు 6,700 బ్లాక్ పంచాయతీల్లో 2,700 కు పైగా పంచాయతీలు మహిళల ప్రత్యక్ష, సమర్థ నాయకత్వంలో విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. పట్టణ ప్రాంతాల్లో వారి ప్రభావాన్ని ప్రస్తావిస్తూ... 900కు పైగా నగరాల్లో మహిళలు మేయర్లుగా, స్టాండింగ్ కమిటీల అధిపతులుగా స్థానిక సంస్థలను సమర్థంగా నడిపిస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశం ఇంత వేగంగా పురోగమించడంలో కీలక పాత్ర పోషించిన ఈ క్షేత్ర స్థాయి మహిళా నాయకులకు కృతజ్ఞతగానూ, దేశం వారి రుణాన్ని తీర్చుకునేందుకూ.. ఈ రిజర్వేషన్ బిల్లు ఆమోదం ఒక గొప్ప అవకాశమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘ఈ అపారమైన పరిపాలన అనుభవం సభలో ప్రవేశిస్తే మన శక్తి మరెన్నో రెట్లు పెరుగుతుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

దేశ అభివృద్ధిలో మహిళా శక్తి క్రియాశీల భాగస్వామ్యాన్ని సాహసోసేతంగా చాటడం లక్ష్యంగా.. గత పరిమితుల నుంచి విముక్తి పొందాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ శాసనాన్ని పూర్తి ఏకగ్రీవంగా ముందుకు తీసుకెళ్లాలని సభకు విన్నవించారు. సమష్టి ఏకాభిప్రాయమన్నది.. ఎవరికీ నష్టం కలగకుండా అందరి హక్కులను గౌరవించేలా అధికార పక్షంపై ఒక సానుకూల ఒత్తిడిని కలిగిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘సమష్టి శక్తి ద్వారా మనం ఎన్నో అసాధారణ ఫలితాలను సాధించగలం’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ... దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు సభలో కూర్చునేందుకు తిరుగులేని హక్కు ఉందని స్పష్టం చేశారు. సీట్ల సంఖ్యపై జరుగుతున్న చర్చలను ప్రస్తావించారు. మొత్తం సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా.. ప్రస్తుత సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లేదా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా 33 శాతం కోటాను అవాంతరాల్లేకుండా అమలు చేయవచ్చని ఆయన చెప్పారు. ఈ అదనపు సభ్యుల బలానికి అనుగుణంగానే నూతన పార్లమెంటు భవనాన్ని ముందస్తు ప్రణాళికతో నిర్మించినట్లు శ్రీ మోదీ తెలిపారు.  

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh

Media Coverage

Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
UK Foreign Secretary meets Prime Minister
June 04, 2026

UK Foreign Secretary Yvette Cooper today met Prime Minister Shri Narendra Modi.

The Prime Minister expressed his pleasure upon the meeting and appreciated the deepening of the India-UK partnership in recent times which has unlocked unprecedented growth opportunities for both countries.

The Prime Minister affirmed that the India-UK Vision 2035 will continue to guide the partnership and strengthen joint efforts for the global good.

The Prime Minister posted on X:

"Pleased to meet UK Foreign Secretary Yvette Cooper. Appreciated the deepening of the India-UK partnership in recent times that has unlocked unprecedented growth opportunities for both our countries.

India-UK Vision 2035 will continue to guide our partnership and strengthen our joint efforts for global good.@YvetteCooperMP"