'జల్-శక్తి అభియాన్' ప్రజల భాగస్వామ్యంతో భారీ విజయాన్ని సాధిస్తోంది: ప్రధాని మోదీ
మన్ కీ బాత్ సంధర్భంగా, ఖేలో ఇండియా దేశవ్యాప్తంగా యువ క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తోందన్నారు: ప్రధాని మోదీ
దాదాపు 34,000 బ్రూ-రీంగ్ శరణార్థులను త్రిపురలో స్థిరపడతారు: ప్రధానమంత్రి మోదీ
ఏ సమస్యనూ హింస పరిష్కరించలేదు: ప్రధాని మోదీ
గగన్యాన్ మిషన్ 'న్యూ ఇండియాకు ఒక మైలురాయిగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
పద్మ అవార్డులు' పీపుల్స్ అవార్డ్స్ 'అయ్యాయి: ప్రధాని మోదీ

నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! ఇవాళ జనవరి 26వ తేదీ.  మన గంతంత్ర దినోత్సవం సందర్భం గా అనేకానేక శుభాకాంక్షలు. 2020లో ఇది మన మొదటి ‘మన్ కీ బాత్’. ఈ నూతన సంవత్సరం లోనే గాక ఈ దశాబ్దం లోనే మొదటి ‘మన కీ బాత్’ కార్యక్రమం ఇది.  మిత్రులారా, ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల కారణం గా మీతో జరిపే ‘మన్ కీ బాత్ ’ కార్యక్రమం సమయం లో మార్పులు చేస్తే మంచిదనిపించింది. అందుకని ఇవాళ మరొక సమయాన్ని నిర్ణయించి, మీతో ‘మన్ కీ బాత్’ మాట్లాడుతున్నాను. మిత్రులారా, రోజులు మారతాయి. వారాలు మారతాయి. నెలలు గడిచిపోతాయి. సంవత్సరాలే మారిపోయాయి. కానీ, మన భారతదేశ ప్రజల ఉత్సాహం మారదు. మనం ఏ మాత్రం తక్కువ కాదు, మనం కూడా ఏదో ఒకటి సాధిస్తాం – ’can do’ అన్న భావం అది. ఈ ’can do’ అనే భావన ఒక సంకల్పంగా మారుతోంది. దేశం కోసం, సమాజం కోసం ఏదైనా చెయ్యాలనే భావన ప్రతి రోజూ అంతకు ముందు కన్నా, మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. మిత్రులారా, కొత్త కొత్త విషయాలపై చర్చించేందుకు, దేశ ప్రజలు సాధించే కొత్త కొత్త విజయాల ను తెలుసుకుని దేశమంతటా సంబరాలు జరుపుకోవడానికీ ఈ ‘మన్ కీ బాత్ ’ వేదిక పై మనందరము మరొక్కసారి సమావేశమయ్యాము. పంచుకోవడానికీ, నేర్చుకోవడానికీ, కలిసి ఎదగడానికీ – ‘మన్ కీ బాత్’ కార్యక్రమం – ఒక చక్కని, సహజమైన వేదిక గా మారింది. ప్రతి నెలా వేల సంఖ్య లో ప్రజలు తమ సూచనల ను, తమ ప్రయత్నాలను, తమ అనుభవాలను పంచుకుంటారు. వాటిలో నుంచి సమాజానికి ప్రేరణ ను ఇచ్చే విషయాల ను, కొందరు ప్రజల అసాధారణ ప్రయత్నాల నూ ఇక్కడ చర్చించుకునే అవకాశం ‘మన్ కీ బాత్’ ద్వారా మనకు లభిస్తోంది.

                                                                                                                  

ఎవరో అలా చేసి చూపించారుట – మనం కూడా చెయ్యగలమా? అలాంటి ఒక ప్రయోగాన్ని దేశవ్యాప్తం గా మరొకసారి చేసి ఒక గొప్ప మార్పుని మనమూ తీసుకు రాగలమా? ఆ మార్పుని, సమాజం లో ఒక సాధారణ అలవాటుగా మార్చి, ఆ మార్పుని  శాశ్వతం చేయగలమా? ఇలాంటి కొన్ని ప్రశ్నల ను వెతుకుతూ వెతుకుతూ, ప్రతి నెలా ‘మన్ కీ బాత్’ లో కొన్ని విన్నపాలు, కొన్ని ఆహ్వానాలూ, ఏదో సాధించాలనే సంకల్పాల పరంపర మొదలైంది. గడిచిన కొన్ని సంవత్సరాలు గా మనం ఎన్నో చిన్న చిన్న సంకల్పాల ను చేసుకుని ఉంటాము. ‘‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు’’ , ‘‘ఖాదీనీ, దేశీ వస్తువులనూ కొనాలి’’, ‘‘పరిశుభ్రత పాటించాలి’’ , ‘‘ఆడబిడ్డలను గౌరవించాలి, వారి విజయాలకు గర్వపడాలి’’ , ‘‘less cash economy లాంటి కొత్త అంశాలు, వాటిని బలపరచడం’’ – మొదలైన అనేకమైన సంకల్పాలన్నీ మన ఈ తేలికపాటి ‘మన్ కీ బాత్’ కబుర్ల ద్వారానే జన్మించాయి.

 

నాకొక ముచ్చటైన ఉత్తరం వచ్చింది.  బీహార్ నుంచి శ్రీ శైలేశ్ గారి నుంచి. అయితే వారు ఇప్పుడు బీహార్ లో నివసించట్లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీ లోని ఒక ఎన్.జి.ఒ లో పని చేస్తున్నారు.  శ్రీ శైలేశ్ గారు ఏం రాశారంటే, ‘‘మోదీ గారూ, మీరు ప్రతి ‘మన్ కీ బాత్’ లోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రస్తావిస్తారు. వాటిల్లో ఎన్నో పనుల ను నేను చేశాను.  ఈ చలికాలం లో నేను ప్రజల వద్ద నుండి పాత బట్టలు సేకరించి, వాటి అవసరం ఉన్నవారికి పంచాను. ‘మన్ కీ బాత్’ నుండి ప్రేరణ పొంది ఎన్నో పనుల ను నేను చేయడం మొదలు పెట్టాను. కానీ నెమ్మది గా నేను కొన్ని విషయాల ను మర్చిపోయాను. కొన్ని నాకు సాధ్యపడలేదు. కొత్త సంవత్సరం లో నేనొక ప్రణాళిక ను తయారు చేసాను. నూతన సంవత్సరం లో ప్రజలు new year resolutions చేసుకున్నట్లు, నేను చేయాలనుకున్న పనులన్నింటి జాబితా ను నేను తయారు చేశాను. మోదీ గారూ, ఈ కొత్త సంవత్సరం లో ఇది నా social resolution! ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ పెద్ద పెద్ద మార్పుల ను తీసుకు రాగలవని నాకు అనిపిస్తోంది. నా ఈ ప్రణాళిక మీద మీరు ఆటోగ్రాఫ్ చేసి, నాకు తిరిగి పంపగలరా?’’

                                                                                                                  

 

శైలేశ్ గారూ, మీకు అనేకానేక అభినందనలు, శుభాకాంక్షలు. ‘‘మన్ కీ బాత్ ప్రణాళిక’’ అనే మీ నూతన సంవత్సర resolution ఎంతో సృజనాత్మకం గా ఉంది. దీనిపై నేను తప్పకుండా అభినందనలు అని రాసి మీకు తిరిగి పంపిస్తాను.  మిత్రులారా, ఈ ‘‘మన్ కీ బాత్ ప్రణాళిక’’ ను చదువుతుంటే, ఇన్ని రకాల విషయాలు ఉన్నాయా? ఇన్ని రకాల హేష్ ట్యాగ్ లా? అని ఆశ్చర్యం కలిగింది. మనందరమూ కలిసి ఎన్నో పనులు కూడా చేశాము.  ఒకసారి మనము ‘‘సందేశ్ టూ సోల్జర్స్’’ పేరుతో ఒక ప్రచారాన్ని నడిపాము. తద్వారా మన భారత సైనికుల మనసుల కు మరింత చేరువ గా వెళ్ళి వారితో బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ‘మన్ కీ బాత్ ’ కార్యక్రమం ద్వారా ఒక ప్రచారాన్ని నడిపాము.

 

‘ఖాదీ ఫర్ నేశన్ – ఖాదీ ఫర్ ఫ్యాశన్’  నినాదం తో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాల కు ఒక కొత్త స్థాయి ఏర్పడింది. ‘buy local’ అనే మంత్రాన్ని సొంతం చేసుకున్నాం. ‘हम फिट तो इंडिया फिट’ అంటూ శారీరిక ధృఢత్వం పట్ల అప్రమత్తత పెంచాము. ‘మై క్లీన్ ఇండియా’   లేదా ‘స్టాచ్యూ క్లీనింగ్’ మొదలైన ప్రయత్నాలతో పరిశుభ్రతను ఒక సామూహికోద్యమంగా తయారుచేశాము.  హేష్ ట్యాగ్ No to drugs(#NoToDrugs,), హేష్ ట్యాగ్  భారతలక్ష్మి (#BharatKiLakshami), హేష్ ట్యాగ్  Self for Society (#Self4Society), హేష్ ట్యాగ్  StressFreeExam (#StressFreeExams), హేష్ ట్యాగ్  సురక్షా బంధన్ (#SurakshaBandhan), హేష్ ట్యాగ్  డిజిటల్ ఎకానమీ (#DigitalEconomy), హేష్ ట్యాగ్  రోడ్ సేఫ్టీ (#RoadSafety), చెప్పుకుంటూ పోతే ఇలాంటివి కోకొల్లలు!

 

శైలేశ్ గారూ, మీరు తయారు చేసిన ఈ ‘మన్ కీ బాత్ ప్రణాళిక’ ను చూస్తే అర్థమైంది, ఇది చాలా పెద్ద జాబితా అని.  రండి, మనందరమూ ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం.  ఈ ‘మన్ కీ బాత్ ప్రణాళిక’ నుండి మనకు నచ్చిన ఏదో ఒక అంశాన్ని ఎన్నుకుని దానిపై పని చేద్దాం. హేష్ ట్యాగ్ ను ఉపయోగించి అందరితోనూ మన వంతు తోడ్పాటును పంచుకుందాం. స్నేహితులను, కుటుంబ సభ్యులను, అందరికీ ప్రేరణ ను అందిద్దాం.  ప్రతి భారతీయుడూ ఒక్కో అడుగూ వేస్తూంటే మన భారతదేశం 130 కోట్ల అడుగులు ముందుకు వెళ్తుంది. అందుకే ‘‘చరైవేతి, చరైవేతి, చరైవేతి…’’ అంటే ‘‘పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ముందుకు’’ అనే మంత్రం తో మన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉందాం.

 

నా ప్రియమైన దేశప్రజలారా, మనం ‘మన్ కీ బాత్ ప్రణాళిక’ ను గురించి మాట్లాడుకున్నాం. పరిశుభ్రత తర్వాత ప్రజల సహకార భావన, అంటే participative spirit, నేడు మరొక రంగం లో వేగవంతమవుతోంది.  అదే ‘నీటి సంరక్షణ’.  ‘నీటి సంరక్షణ’ కోసం ఎన్నో విస్తృతమైన, సరికొత్త ప్రయత్నాలు దేశవ్యాప్తం గా, దేశం నలుమూలల్లోనూ జరుగుతున్నాయి.  క్రితం వర్షా కాలం లో మనం మొదలుపెట్టిన ‘‘జల్ శక్తి అభియాన్’’ – ప్రజల సహకారం తో అత్యంత వేగం గా విజయపథం వైపుకి అడుగులు వేస్తోంది. పెద్ద సంఖ్య లో జలాశయాల, చెరువుల నిర్మాణం జరిగింది. సమాజం లోని అన్ని వర్గాల ప్రజలూ ఈ ప్రచారం లో తమ వంతు సహకారాన్ని అందించారు. రాజస్థాన్ లోని ఝాలోర్ జిల్లా లో రెండు చారిత్రాత్మిక దిగుడు బావులు చెత్త తోనూ, మురికి నీటి తోనూ నిండిపోయాయి. భద్రాయు, థాన్వాలా పంచాయితీల నుండి వందలాది ప్రజలు ‘‘జల్ శక్తి అభియాన్" ద్వారా ఈ దిగుడు బావుల ను పునర్జీవితం చేసే ప్రయత్నాలు చేపట్టారు. వర్షాల కు ముందుగానే వారందరూ ఈ దిగుడు బావుల్లో పేరుకు పోయిన చెత్తనీ, బురదనీ, మురికి నీటినీ తొలగించే పని ప్రారంభించారు. ఈ ప్రచారం కోసం కొందరు శ్రమదానం చేస్తే, కొందరు ధన సహాయం చేశారు. అందరి శ్రమ వల్లా ఇవాళ ఆ దిగుడు బావులు వాళ్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ తాలూకూ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఇక్కడ, 43 హెక్టార్ల ప్రాంతం లో వ్యాపించి ఉన్న సరాహీ సరస్సు తన అవసాన దశ లో ఉంది.  కానీ, అక్కడి గ్రామీణ ప్రజలు తమ సంకల్పశక్తి తో ఈ సరస్సు కు కొత్త ఊపిరి ని అందించారు.  ఇంత పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చే దారి లో వాళ్ళు ఏ ఆటంకాన్నీ రానివ్వలేదు.  ఒకదాని తర్వాత మరొక గ్రామాన్ని కలుపుకుంటూ అంతా ఒకటిగా నిలిచారు.  వారంతా కలిసి సరస్సు కి నలువైపులా ఒక మీటరు ఎత్తు గట్టుని కట్టారు. ఇప్పుడా సరస్సు నీటి తో నిండి ఉంది. చుట్టుపక్కల వాతావరణం పక్షుల కలరవాలతో ప్రతిధ్వనిస్తోంది.

 

                                                                                                                  

ఉత్తరాఖండ్ లోని అల్మోరా –హల్ద్వానీ హైవే ను ఆనుకుని ఉన్న సునియాకోట్ గ్రామం నుండి కూడా ప్రజా భాగస్వామ్యం తాలూకూ ఒక ఉదాహరణ వెలుగు లోకి వచ్చింది.  గ్రామం లో నీటి ఎద్దడి నుంచి బయటపడడానికి, తామే స్వయం గా నీటిని గ్రామం వరకూ తెచ్చుకోవాలనే సంకల్పాన్ని చేపట్టారు. ప్రజలు చందాలు వేసుకుని, డబ్బు పోగుచేసి, శ్రమదానం చేసి, దాదాపు ఒక కిలో మీటర్ దూరం నుంచి తమ గ్రామం వరకూ గొట్టాలు వేసుకున్నారు. పంపింగ్ స్టేషన్ ఏర్పరుచుకున్నారు. ఇంకేముంది, చూస్తూండగానే రెండు దశాబ్దాల నుంచీ ఇబ్బంది పెడుతున్న సమస్య శాశ్వతం గా సమసిపోయింది. వర్షపు నీటి సంరక్షణ కోసం బోరుబావిని వాడే సృజనాత్మక ఆలోచన ఒకటి తమిళ నాడు నుంచి వెలుగు లోకి వచ్చింది.  నీటి సంరక్షణ కు సంబంధించిన ఇటువంటి కథనాలు దేశవ్యాప్తం గా ఎన్నో వినవచ్చాయి.  ‘న్యూ ఇండియా’ సంకల్పాని కి ఇవి బలాన్ని ఇస్తాయి. మన జలశక్తి ఛాంపియన్స్ గురించిన కథలు వినడానికి యావత్ దేశం ఉత్సుకత చూపెడుతోంది. నీటి సేకరణ కు, ఇంకా నీటి సంరక్షణ కు సంబంధించి మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రయత్నాల ను, వాటి తాలూకూ కథనాల నూ ఫోటోల నూ, వీడియోల నూ హేష్ ట్యాగ్ (#)jalshakti4India లో షేర్ చేయండి.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, ముఖ్యం గా నా యువ మిత్రులారా,  ‘‘ఖేలో ఇండియా’’ కు అందించిన అద్భుతమైన ఆతిథ్యాని కి గానూ అసమ్ ప్రభుత్వాని కీ, అసమ్ ప్రజల కూ, ఇవాళ ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా నేను అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను. మిత్రులారా, గువాహాటీ లో జరిగిన మూడవ ‘‘ఖేలో ఇండియా క్రీడలు’’ జనవరి 22వ తేదీన పూర్తయ్యాయి. ఆ పోటీల లో రకరకాల రాష్ట్రాల కు చెందిన దాదాపు ఆరు వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.  ఈ ఆటల పోటీల లో ఎనభై పాత రికార్డుల ను బద్దలుకొట్టారని వింటే మీరు ఆశ్చర్యపోతారు. అందులోనూ 56 రికార్డుల ను మన ఆడబిడ్డలు తిరగరాశారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇది కేవలం ఆడబిడ్డల వల్లే సాధ్యపడింది. విజేతల తో పాటూ, ఈ ఆటలపోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరి కీ నేను అభినందనలు తెలుపుతున్నాను.                                                                                            

                                                                                               

 ఇంకా, ‘‘ఖేలో ఇండియా గేమ్స్’’ ను విజయవంతం గా నిర్వహించినందుకు దీనికి సంబంధించిన అందరు వ్యక్తుల కూ, శిక్షకుల కూ, సాంకేతిక అధికారుల కూ నా కృతజ్ఞతను తెలుపుతున్నాను. మనందరం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఏడాది ఏడాది కీ కృతజ్ఞతా  ఈ ‘‘ఖేలో ఇండియా క్రీడలు’’ లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. దీనిని బట్టి పాఠశాల స్థాయి లో పిల్లల కు క్రీడల పట్ల ఆసక్తి ఎంతగా పెరుగుతోందో గమనించవచ్చు. 2018లో ‘ఖేలో ఇండియా క్రీడలు’ మొదలైనప్పుడు ఇందులో ముఫ్ఫై ఐదు వందల క్రీడాకారులు పాల్గొన్నారు. కానీ మూడేళ్లల్లో క్రీడాకారుల సంఖ్య ఆరు వేల కంటే ఎక్కువకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు సంఖ్య! అంతేకాదు కేవలం మూడేళ్ళ లో ‘ఖేలో ఇండియా క్రీడలు’ మాధ్యమం ద్వారా ముఫ్ఫై రెండు వందల ప్రతిభావంతులైన పిల్లలు తయారయ్యారు. ఇందులో చాలామంది పిల్లలు లేమి లోనూ, పేదరికం లోనూ పెరిగి పెద్దయినవారూ ఉన్నారు. ‘ఖేలో ఇండియా క్రీడల’ లో పాల్గొన్న పిల్లల, వారి తల్లిదండ్రుల ధైర్యం, ధృఢ సంకల్పం తాలూకూ కథనాలు ప్రతి భారతీయుడి కీ ప్రేరణ ను అందిస్తాయి. గువాహాటీ కు చెందిన పూర్ణిమా మండల్ నే తీసుకోండి, ఆమె గువాహాటీ నగరపాలిక సంస్థలో ఒక పారిశుధ్య కార్మికురాలు (స్వీపర్). కానీ వారి అమ్మాయి మాళవిక ఫుట్ బాల్ పై పట్టుదల పెడితే, అబ్బాయి సుజీత్ ఖో ఖో పై దృష్టి పెట్టాడు. వారి ఇంకో అబ్బాయి ప్రదీప్ అసమ్ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

 

గర్వంతో నిండిన ఇటువంటి మరొక కథనం తమిళ నాడు లోని యోగానందన్ గారిది. తమిళ నాడు లో బీడీలు తయారు చేసే పని ఆయనది. కానీ ఆయన కుమార్తె పూర్ణశ్రీ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని సంపాదించుకుని అందరి మనసులను దోచుకుంది. నేను డేవిడ్ బెక్‌హామ్ పేరు తలవగానే మీరంతా ప్రఖ్యాత అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటగాడు అంటారు. కానీ, ఇప్పుడు మన దగ్గర కూడా ఒక డేవిడ్ బెక్‌హామ్ ఉన్నాడు. ఇప్పుడు అతడు కూడా గువాహాటీ లోని యూత్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. అది కూడా  200 మీటర్ల సైక్లింగ్ పోటీ తాలూకూ Sprint Event లో.

                                                                                                         

కార్-నికోబార్ ద్వీపానికి చెందిన డేవిడ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అతడిని పెంచిన బాబాయి అతడిని ఫుట్ బాల్ ఆటగాడిగా చూడాలనుకుని, అతడికి పేరును కూడా ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడి పేరునే పెట్టాడు. కానీ డేవిడ్ మనసు సైకింగ్ పై ఉండేది. నాకు సంతోషాన్ని కలిగించిన మరొక విషయం ఏమిటంటే, ఖేలో ఇండియా పథకం లో భాగం గా ఈయన ఎన్నికయి, ఇవాళ సైక్లింగ్ లో ఒక కొత్త కీర్తికిదీటాన్ని అధిరోహించాడు. భివానీ కి చెందిన ప్రశాంత్ సింహ్ కన్హయ్యా Pole vault ఈవెంట్ లో తన సొంత రికార్డ్ ను తానే బద్దలుకొట్టాడు. 19 ఏళ్ల ప్రశాంత్ ఒక రైతు కుటుంబానికి చెందిన వాడు. ప్రశాంత్ తన Pole vault ప్రాక్టీసుని మట్టిలోనే చేసేవాడని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది తెలిసిన తర్వాత ఆయన కోచ్ కు, ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో అకాడమీ నడిపించడానికి క్రీడా విభాగం సహాయం చేసింది. ఇవాళ ప్రశాంత్ అక్కడ శిక్షణ పొందుతున్నాడు.

 

ముంబయి కు చెందిన కరీనా శన్ తా (Kareena Shankta ) కథ, ఎట్టి పరిస్థితి లోనూ ఓటమి ని ఒప్పుకోని ఆమె పట్టుదల ప్రతి ఒక్కరికీ ప్రేరణ ను అందిస్తుంది. కరీనా 100 మీటర్ల Breaststroke పోటీలో, అండర్ 17 విభాగం లో స్వర్ణ పతకాన్ని సాధించి, ఒక సరికొత్త జాతీయ రికార్డు ని నెలకొల్పింది. పదవ తరగతి చదువుతున్న కరీనా కి ఒకసారి మోకాలికి దెబ్బ తగిలిన కారణం గా ట్రైనింగ్ ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కరీనా, ఆమె తల్లి ధైర్యాన్ని కోల్పోలేదు. దానికి పరిణామం ఇవాళ మీ ముందర ఉంది. క్రీడాకారులందరి ఉజ్వల భవిష్యత్తు ని నేను కోరుకుంటున్నాను. దానితో పాటుగా దేశ ప్రజలందరి తరఫునా వీరందరి తల్లిదండ్రుల కి నేను నమస్కరిస్తున్నాను. వారంతా తమ పేదరికాన్ని పిల్లల భవిష్యత్తు కి అవరోధంగా కానివ్వలేదు. జాతీయ ఆటల పోటీల మాధ్యమం ద్వారా క్రీడాకారుల కు తమ ప్రతిభను కనబరిచే అవకాశమే కాకుండా ఇతర రాష్ట్రాల సంస్కృతి ని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అందుకని "ఖేలో ఇండియా యూత్ గేమ్స్" నమూనా లోనే ప్రతి ఏడాదీ "ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్" ను నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాము.

                                                                                                         

మిత్రులారా, రాబోయే నెల ఫిబ్రవరీ 22 నుండీ మార్చి 1 వరకూ ఒడిశా కు చెందిన కటక్, ఇంకా భువనేశ్వర్ లోనూ  ‘‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్’’ ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో పాల్గొనడానికి మూడు వేల కు పైగా క్రీడాకారులు ఎంపికయ్యారు.

 

నా ప్రియమైన దేశప్రజలారా, పరీక్షల సమయం వచ్చేసింది. కాబట్టి విద్యార్థులందరూ తమ తమ చదువుల సన్నహాలు పూర్తి చేసుకునే స్థితి లో ఉండి ఉంటారు. దేశం లోని కోట్ల మంది విద్యార్థి మిత్రుల తో ‘‘పరీక్షా పే చర్చ’’ జరిపిన తరువాత దేశ యువత ఆత్మవిశ్వాసం తో ఉందని, ఏ సవాలునైనా ఎదుర్కొనే స్థాయి లో ఉన్నారని నేను నమ్మకం గా చెప్పగలుగుతున్నాను.

 

మిత్రులారా, ఒక పక్క పరీక్షలు ఉన్నాయి. మరో పక్క చలికాలం. ఈ రెండింటి మధ్యా మిమ్మల్ని మీరు ఆరోగ్యం గా ఉంచుకోవాల్సిందని నేను కోరుతున్నాను. కాస్తంత కసరత్తు చెయ్యండి. కాస్తంత ఆడుకోండి, గెంతులు వెయ్యండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆటపాటల్లో నిమగ్నమవ్వడం కూడా ముఖ్యం. ‘‘ఫిట్ ఇండియా’’లో భాగం గా ఎన్నో కొత్త కార్యక్రమాలు జరగడం నేను ఈ మధ్య గమనిస్తున్నాను. జనవరి 18న దేశవ్యాప్తం గా యువత cyclothon ని ప్రారంభించారు. అందులో పాల్గొన్న లక్షల కొద్దీ దేశ ప్రజలు ఫిట్ నెస్ ని గురించి సందేశాలు ఇచ్చారు. మన ‘న్యూ ఇండియా’ పూర్తి స్థాయి లో ఫిట్ గా ఉండడానికి,  అన్నివైపుల నుండీ జరుగుతున్న ప్రయత్నాలు ఉత్సాహాన్నీ, ఉత్సుకతనీ నింపేవిగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబర్ లో మొదలైన ‘‘ఫిట్ ఇండియా స్కూల్’’ ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది. ఇప్పటిదాకా 65,000 కంటే ఎక్కువ పాఠశాలలు ఆన్ లైన్  రిజిస్ట్రేషన్ తీసుకుని ‘‘ఫిట్ ఇండియా స్కూల్’’ సర్టిఫికెట్ ని పొందాయని తెలిసింది.  ఫిజికల్ ఏక్టివిటీ నీ, ఆటలనూ స్కూలు పాఠాలతో కలిపి ‘‘ఫిట్ స్కూల్’’ గా తప్పక మారాలని దేశం లోని మిగిలిన పాఠశాలల వారిని కూడా నేను కోరుతున్నాను. ఇంతేగాక, దేశ ప్రజలందరినీ నేను కోరేది ఏమిటంటే, మీరందరూ కూడా మీ దినచర్యలో ఫిజికల్ ఏక్టివిటీ కి ఎక్కువ అవకాశం ఇవ్వండి.  మనం ఫిట్ గా ఉంటే ఇండియా ఫిట్ గా ఉంటుందని రోజూ మీకు మీరే గుర్తు చేసుకోండి.

                                                                                                         

నా ప్రియమైన దేశప్రజలారా, రెండు వారాల క్రితం భారతదేశ విభిన్న ప్రాంతాల లో రకరకాల పండుగలు జరిగాయి. లోరీ తాలూకూ ఉత్సాహమూ, వెచ్చదనంతో పంజాబ్  నిండిపోయింది. తమిళ నాడు లోని సోదర సోదరీమణులు పొంగల్ పండుగ ను, తిరువళ్ళువర్ జయంతి నీ జరుపుకున్నారు. అసమ్ లో బిహు తాలూకూ మనోహరమైన వర్ణం చూశాము. గుజరాత్ లో ప్రతి చోటా ఉత్తరాయణ పుణ్యకాలపు ఉత్సవం తో పాటూ ఆకాశం గాలిపటాల తో నిండిపోయింది. ఇటువంటి సమయంలో ఢిల్లీ ఒక చారిత్రాత్మక ఘటన కు సాక్షి గా నిలిచింది. ఢిల్లీ లో ఒక ముఖ్యమైన ఒప్పందం పై సంతకాలు జరిగాయి. దానితో పాటుగా దాదాపు 25 ఏళ్ల ఒక బాధాకరమైన అధ్యాయం – Bru Reang refugee crisis – అంతమయింది. ఎప్పటికీ ముగిసిపోయింది. మీ పండుగ సంబరాల మధ్యన ఈ ఒప్పందం గురించి మీరు వివరంగా తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. అందుకని ‘మన్ కీ బాత్’ లో దీని గురించి తప్పకుండా చర్చించాలని నేను అనుకున్నాను. ఈ సమస్య 90లలో ఏర్పడింది. 1997లో జాతీయ ఉద్రిక్తత కారణంగా Bru Reang తెగ కు చెందిన ప్రజల కు మిజోరమ్ నుండి వేరుపడి త్రిపుర లో శరణు తీసుకోవాల్సివచ్చింది.  ఈ శరణార్థుల ను ఉత్తర త్రిపుర (North Tripura)లోని కంచన్ పూర్ లో ఉన్న అస్థాయీ కెంప్స్ లో ఉంచారు. Bru Reang సముదాయపు ప్రజలు ఇలా శరణార్థులు గా జీవిస్తూ తమ జీవితం లోని ముఖ్యమైన భాగాన్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అలా కేంపుల్లో జీవించడం అంటే తమ ప్రాథమిక సౌకర్యాల ను కోల్పోవడమే!  23 ఏళ్ల పాటు ఇల్లు లేదు, భూమి లేదు, కుటుంబం లేదు, అనారోగ్యానికి పరిష్కారం లేదు, పిల్లల కు చదువు లేదు, వారికి ఏ రకమైన సౌకర్యమూ లేదు. ఒక్కసారి ఆలోచించండి 23 ఏళ్ల పాటు కేంపుల్లో కఠిన పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడం వాళ్లకు ఎంత కష్టంగా ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. జీవితం లో ప్రతి క్షణం, ప్రతి రోజూ ఒక అనిశ్చిత భవిష్యత్తు తో ముందుకు నడవడం ఎంత కష్టమయమో కదా!  ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళిపోయాయి. కానీ, వీళ్ళ దుఃఖానికి పరిష్కారాన్ని మాత్రం అందించలేకపోయాయి. కానీ ఇన్ని కష్టతర పరిస్థితుల్లో కూడా భారతీయ రాజ్యాంగం, సంస్కృతి పట్ల వారి విశ్వాసం ధృఢంగా ఉంది. ఇదే విశ్వాసం వల్ల వారి జీవితాల్లో ఇవాళ ఒక కొత్త వెలుగు కనబడింది.   

                                                                            

ఒప్పందం ప్రకారం ఇప్పుడు వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మార్గం ఏర్పడింది. ఆఖరికి ఈ 2020 కొత్త శతాబ్దపు ప్రారంభం, Bru Reang సముదాయపు ప్రజలకు ఒక కొత్త ఆశనూ, ఆశా కిరణాలనూ తీసుకు వచ్చింది. దాదాపు 34000 Bru Reang శరణార్థుల కు త్రిపుర లో నివాసాలు ఏర్పడతాయి.  ఇంతేగాక, వారి పునర్నివాసానికీ, సంపూర్ణ అభివృధ్ధి కీ కేంద్ర ప్రభుత్వం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయిల సహాయాన్ని కూడా ఇవ్వబోతోంది.

 

ప్రతి ఒక్క నిరాశ్రిత కుటుంబానికీ స్థలాలు మంజూరు చెయ్యబడతాయి. ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం కూడా అందించబడుతుంది. దానితో పాటుగా వారికి అన్నసామాగ్రి కూడా ఇవ్వబడుతుంది. వారు ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల జన సంక్షేమ పథకాల లో భాగస్థులవుతారు. వాటిని ఉపయోగించుకో గలుగుతారు.  ఈ ఒప్పందం ఎన్నో రకాలుగా ఎంతో ప్రత్యేకమైనది. Co-operative Federalism భావనని ఈ ఒప్పందం చూపెడుతుంది. ఈ ఒప్పందం కోసం మిజోరం, త్రిపుర, ఉభయ రాజ్యాల ముఖ్యమంత్రులూ హాజరయ్యారు. ఈ ఒప్పందం ఉభయ రాష్ట్రాల ప్రజల ఒప్పుదల, ఇంకా అభినందనల వల్లనే సాధ్యపడింది. అందువల్ల నేను ఈ రెండు రాష్ట్రాల ప్రజలకూ, అక్కడి ముఖ్యమంత్రులకూ ప్రత్యేకం గా కృతజ్ఞతల ను తెలుపుతున్నాను. ఈ ఒప్పందం భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమైన కరుణా భావాన్ని, సహృదయతనీ ప్రకటితం చేస్తుంది. అందరినీ ‘మనవారు’ అనుకోవడం, ఐకమత్యం తో జీవించడం, ఈ పుణ్యభూమి సంస్కారంలోనే ఇమిడి ఉంది. మరొక్కసారి ఈ ఉభయ రాజ్యాల ప్రజలకూ, Bru Reang సముదాయాని కీ నేను ప్రత్యేకం గా అభినందనలు తెలుపుతున్నాను.

 

నా ప్రియమైన దేశప్రజలారా, ‘ఖేలో ఇండియా గేమ్స్’ లాంటి సఫలవంతమైన ఆటలపోటీలను నిర్వాహించిన అసమ్ లో మరొక పెద్ద పని జరిగింది. మీరు కూడా వార్తల్లో చూసే ఉంటారు. కొద్ది రోజుల క్రితం అసమ్ లో ఎనిమిది వేరు వేరు మిలిటెంట్ గ్రూప్ లకు సంబంధించిన 644 సభ్యులు తమ ఆయుధాల తో పాటూ లొంగిపోయారు.  ఇంతకు ముందు హింసామార్గం వైపుకి వెళ్ళిపోయినవారు తమ విశ్వాసాన్ని శాంతిమార్గం వైపుకి మళ్ళించి, దేశ అభివృధ్ధి కి భాగస్వాములు అవ్వాలనే నిర్ణయాన్ని తీసుకుని, జనజీవన స్రవంతి లోకి వెనక్కు వచ్చారు. గత ఏడాది త్రిపుర లో కూడా ఎనభై కంటే ఎక్కువ మంది హింసామార్గాన్ని విడనాడి, జనజీవన స్రవంతి లోకి తిరిగి వచ్చారు. హింస తోనే సమస్యల కు పరిష్కారాన్ని వెతకవచ్చు అనుకుని ఆయుధాల ను పట్టుకున్నవారంతా; శాంతి, ఐకమత్యాల వల్లనే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. అదే ఏకైక మార్గం అని బలంగా నమ్మారు. దేశ ప్రజలారా, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం చాలామటుకు తగ్గింది. దీనికి అతి పెద్ద కారణం ఏమిటంటే, ఈ ప్రాంతం తో ముడిపడి ఉన్న ప్రతి సమస్యనూ శాంతి తోనూ, నిజాయితీ తోనూ, చర్చించి పరిష్కరించడం జరిగితుంది. ఇప్పుడు కూడా దేశం లో ఏ మూలనైనా హింస, అయుధాల ద్వారా సమస్యల కు సమాధానాలు వెతుకుతున్న వారితో ఇవాళ్టి పవిత్రమైన గణతంత్ర దినోత్సవం సందర్భం గా నేను అభ్యర్థించేది ఏమిటంటే, వారంతా జనజీవన స్రవంతి లోకి వెనక్కు రావాలని.
సమస్యల ను శాంతి పూర్వకం గా పరిష్కరించడం లో తమ పైన, ఈ దేశ సామర్థ్యం పైనా నమ్మకం ఉంచాలని కోరుతున్నాను.  జ్ఞాన విజ్ఞానాలు, ప్రజాస్వామ్య యుగమైన ఇరవై ఒకటవ శతాబ్దం లో మనం ఉన్నాము. హింస వల్ల జీవితాలు బాగుపడిన ప్రాంతం ఏదైనా ఉందని మీకు తెలుసా అసలు? శాంతి, సద్భావాలు జీవితానికి ఆటంకాలు గా ఉన్న ప్రాంతం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఏ సమస్యకూ హింస సమాధానం కాదు. ప్రపంచం లోని ఏ సమస్యకూ మరొక వేరే సమస్య ను పుట్టించడం వల్ల పరిష్కారం లభించదు. సమస్య కు వీలయినన్ని సమాధానాలు వెతకడం వల్ల సమస్యల కు పరిష్కారాలు దొరుకుతాయి. రండి, మనందరమూ కలిసి, అన్ని ప్రశ్నల కూ శాంతిమార్గమే సమాధానం అయ్యేలాంటి నవ భారత నిర్మాణానికి నడుం కడదాం.

                                                                  

ఐకమత్యం ద్వారా ప్రతి సమస్యకూ సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రతి విభజననూ, విభజన ప్రయత్నాల నూ మనలోని సోదరభావం నిర్వీర్యం చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, పవిత్ర గణతంత్ర దినోత్సవ సందర్భం గా గగన యాన్ మిశన్ గురించి చెప్పడం నాకు చాలా ఆనందం గా ఉంది. దేశం ఆ వైపుగా ముందుకు అడుగేస్తోంది. 2022 నాటికి మన దేశాని కి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భం గా మనం గగన్ యాన్ మిషన్ ద్వారా ఒక భారతీయుడిని అంతరిక్షం లోకి తీసుకువెళ్ళే మన సంకల్పాన్ని సాధించాల్సి ఉంది. 21వ శతాబ్దపు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ‘‘గగన్ యాన్’’ భారతదేశాని కి ఒక చారిత్రాత్మక విజయం గా నిలుస్తుంది.  ఈ ప్రయోగం భారతదేశానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది.

 

మిత్రులారా, మీకు తెలిసే ఉంటుంది, ఈ మిశన్ లో వ్యోమగామి అంటే అంతరిక్ష యాత్రికులు గా నలుగురు అభ్యర్థుల ను ఎన్నుకోవడం జరుగుతుంది.  ఈ నలుగురు యువ భారతీయ వాయుసేన తాలూకూ పైలెట్లు. ఈ ప్రతిభావంతులైన యువకులు, భారతదేశ నైపుణ్యం, ప్రతిభ, సామర్థ్యం, సాహసం, ఇంకా భారతదేశ స్వప్నాలకూ ప్రతీకలు. మన నలుగురు మిత్రులూ, రాబోయే రోజుల్లో తమ శిక్షణ కోసం రశ్యా వెళ్లబోతున్నారు. భారత్-రశ్యా దేశాల మధ్య మైత్రీభావానికి, సహకారాని కీ ఈ శిక్షణ మరొక సువర్ణావకాశం గా నిలుస్తుందని నాకు నమ్మకం. వీరికి ఒక ఏడాది పైగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత భారతదేశ ఆశలనూ, ఆకాంక్షల నూ అంతరిక్షం దాకా తీసుకువెళ్ళాల్సిన బృహత్తర బాధ్యత వీరిలో ఒకరిపై ఉంటుంది.  నేటి గణతంత్ర దినోత్సవ శుభ సందర్భం లో ఈ నలుగురు యువకుల కూ, ఈ మిశన్ తో ముడిపడిన భారత, రశ్యా దేశపు శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను నేను అభినందిస్తున్నాను.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, గత మార్చ్ లో ఒక వీడియో, మీడియా లోనూ, సోషల్ మీడియా లోనూ చర్చనీయాంశం అయ్యింది. చర్చ దేనిపైనంటే, 107 సంవత్సరాల ఒక వయోవృధ్ధురాలు, రాష్ట్రపతి భవన వేడుకల లో ప్రోటోకాల్ ని దాటుకుని వచ్చి ఎలా రాష్ట్రపతి ని ఆశీర్వదించగలదు? కర్నాటక లో వృక్ష మాత పేరు తో ప్రసిధ్ధి చెందిన ఆమె పేరు సాలూమరదా తిమ్మక్క.  అవి పద్మ పురస్కారాల వేడుకలు.

                                     

చాల సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన తిమ్మక్క చేసిన అసాధారణ సేవ ను దేశం గుర్తించి, అర్థం చేసుకుని ఆమె కు తగిన గౌరవాన్ని ఇచ్చింది. ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

 

మిత్రులారా, నేడు భారతదేశం ఇటువంటి మహనీయుల ను చూసి గర్వపడుతుంది. భుమితో సంబంధం ఉన్న ఇటువంటి గొప్ప వారిని సన్మానించి దేశం గర్వపడుతుంది. ప్రతి ఏడాది లాగనే, నిన్నటి సాయంత్రం పద్మ పురస్కారాల ప్రకటన జరిగింది.  మీరందరూ కూడా ఈ పురస్కార గ్రహీతలు అందరి గురించి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. వీరందరూ చేసిన సేవా కార్యక్రమాల గురించి మీ కుటుంబం తో చర్చించాలని కోరుతున్నాను. 2020లో పద్మ పురస్కారాల కోసం 46 వేల అభ్యర్థనలు నమోదు అయ్యాయి. 2014తో పోలిస్తే ఈ సంఖ్య 20 రెట్లు కన్నా ఎక్కువే.  ఈ సంఖ్య పద్మ పురస్కారాలు ఇప్పుడు people's award గా మారాయన్న ప్రజల నమ్మకాన్ని చూపెడుతుంది. పద్మ పురస్కారాల ప్రక్రియ అంతా ఇప్పుడు ఆన్ లైన్ లోనే జరుగుతోంది. ఇంతకు ముందు కొద్దిమంది ప్రజల చేతుల్లో ఉండే ఈ నిర్ణయాలు ఇప్పుడు పూర్తిగా ప్రజల చేతుల్లో ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, పద్మ పురస్కారాల ను గురించి ఇప్పుడు ప్రజల్లో ఒక కొత్త నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి. ఈ పురస్కారాల ను అందుకునే వ్యక్తులు అందరూ ఎలాంటివారంటే, పరిశ్రమ తోనూ, కష్టం తో పైకి వచ్చినవారు. పరిమిత అవకాశాల తో, చుట్టుపక్కల ఉన్న చీకటి ని చీల్చుకుని ముందుకు నడిచినవారు. ఒక రకం గా చెప్పాలంటే వారి బలమైన ఇఛ్చాశక్తి, సేవా భావన, నిస్వార్థ భావం, మనందరికీ ప్రేరణాదాయకం. పద్మ పురస్కార గ్రహీతలందరి కీ నేను మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. మీరంతా కూడా వీరి గురించి చదివి, వారి గురించి వీలయినంత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవాల్సింది గా కోరుతున్నాను. వారి జీవితాల గురించిన అసాధారణ కథనాలు సమాజానికి సరైన మార్గం లో ప్రేరణను ఇవ్వగలవు.
నా ప్రియమైన దేశప్రజలారా, మరోసారి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భం గా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ దశాబ్దం అంతా మీ జీవితాల లో, భారతదేశ చరిత్ర లో కొత్త సంకల్పాలు ఏర్పడాలనీ, అవి నెరవేరాలనీ కోరుతున్నాను.

                                                                                               

ప్రపంచం భారతదేశం నుంచి ఏదైతే ఆశిస్తోందో, అవన్నీ సంపూర్ణం చేసుకునే సామర్థ్యం భారతదేశం సంపాదించుకోవాలి. ఇదే నమ్మకం తో రండి, కొత్త దశాబ్దపు ప్రారంభాన్ని ఆహ్వానిద్దాం. కొత్త సంకల్పాల తో, భరతమాత కోసం ఐకమత్యం తో కలసి ఉందాం. అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt

Media Coverage

Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister visits L&T complex at Hazira, Gujarat
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today visited the Larsen & Toubro (L&T) complex at Hazira, Gujarat, where he witnessed pioneering innovations being developed by the company across various sectors.

The Prime Minister highly commended the significant role played by L&T in furthering self-reliance in India's defence sector. Sharing glimpses from the visit, Shri Modi appreciated the engineering achievements and advancements being spearheaded at the facility.

In a series of posts on X, the Prime Minister shared:

"This afternoon, went to the L&T complex at Hazira. Witnessed some of their pioneering innovations across different sectors. The role played by L&T in furthering self-reliance in the defence sector is commendable.
@larsentoubro"

"Here are some more glimpses from the visit to the L&T complex in Hazira, Gujarat."