ప్రజాస్వామ్యాన్ని గౌరవించే స్నేహపూర్వక దేశానికి ఎన్నికైన ప్రతినిధుల ముందుకు రావటం నాకు ఎంతో గౌరవంగా ఉంది: ప్రధానమంత్రి
భారతదేశానికి ప్రజాస్వామ్యం అనేది ఒక జీవన విధానం: ప్రధానమంత్రి
శతాబ్దాల నాటి సంబంధాలలో లోతుగా పాతుకుపోయిన స్నేహ బంధాన్ని ఇరు దేశాలు కలిగి ఉన్నాయి: ప్రధానమంత్రి
ఆధునిక భారత్‌ను నిర్మించేదిశగా మహిళలకు శక్తి సామర్థ్యాలను అందిస్తున్నాం: ప్రధానమంత్రి
మేం అభివృద్ధిని ఇతరుల పట్ల బాధ్యతగా భావిస్తున్నాం. ఎల్లప్పుడూ గ్లోబల్ సౌత్‌ మా ప్రాధ్యనత: ప్రధానమంత్రి
గ్లోబల్ సౌత్ వృద్ధి చెందుతోంది... నూతన, సమన్యయంతో కూడిన ప్రపంచ క్రమాన్ని ఇది చూడాలనుకుంటోంది: ప్రధానమంత్రి
గ్లోబల్ సౌత్‌కు కోసం భారతదేశ దార్శనికత… మహాసాగర్: ప్రధానమంత్రి

గౌరవ ప్రధానమంత్రి శ్రీమతి కమ్లా ప్రెసాద్ బిసెసా, 

గౌరవ సెనేట్ అధ్యక్షుడు శ్రీ వేద్ మార్క్,

గౌరవ స్పీకర్ శ్రీ జగదేవ్ సింగ్,

గౌరవ మంత్రులూ, 

గౌరవ పార్లమెంట్ సభ్యులు,

నమస్కారం!

శుభోదయం!

గర్వించదగిన ప్రజాస్వామ్యానికీ, స్నేహపూర్వక దేశానికి ప్రతినిధులుగా ఎన్నికైన మీ ముందు నిలబడటం నాకు ఎంతో గౌరవంగా ఉంది.

నేను 140 కోట్ల మంది భారత ప్రజల శుభాకాంక్షలను తీసుకొచ్చాను. ఇక్కడికి రాకముందు నేను సందర్శించిన ఘనా ప్రజల నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ ప్రతిష్ఠాత్మక రెడ్ హౌస్‌లో ప్రసంగిస్తున్నందుకు తొలి భారత ప్రధానమంత్రిగా నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను.

స్వేచ్చ, గౌరవం కోసం ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రజలు చేసిన పోరాటాలకూ, త్యాగాలకూ ఈ చారిత్రాత్మక భవనం సాక్షిగా నిలిచింది. గత ఆరు దశాబ్దాలుగా, మీరు న్యాయమైన, సమ్మిళితమైన, సంపన్నమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుంటూ దీనిని పటిష్టంగా నిలబెట్టారు.

మిత్రులారా, 

ఈ గొప్ప దేశ ప్రజలు ఇద్దరు విశిష్ట మహిళా నాయకురాళ్లను అధ్యక్షురాలుగా, ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. వారు తమను తాము ప్రవాస భారతీయుల కుమార్తెలమంటూ సగర్వంగా చెప్పుకుంటారు. వారు తమ భారతీయ వారసత్వాన్ని గురించి గర్వపడతారు. భారతదేశంలో, వారి నాయకత్వాన్నీ, ధైర్యాన్నీ, సంకల్ప బలాన్నీ మేము ఆరాధనా భావంతో చూస్తాం. వారు మన దేశాల మధ్య భాగస్వామ్య మూలాలు... భాగస్వామ్య కలల ఆధారంగా అల్లుకున్న బంధానికి సజీవ చిహ్నాలు.

 

గౌరవ సభ్యులారా, 

వలస పాలన నీడల నుంచి  మన రెండు దేశాలు బయటపడి, ధైర్యాన్ని సిరాగా, ప్రజాస్వామ్యాన్ని కలంగా చేసుకుని వాటి సొంత గాథలను లిఖించుకున్నాయి.

నేడు, మన రెండు దేశాలు గర్వించదగిన ప్రజాస్వామ్యాలుగా, ఆధునిక ప్రపంచంలో శక్తికి ఆధారాలుగా నిలిచాయి. కొన్ని నెలల క్రితం, మీరు ఎన్నికలలో పాల్గొని ప్రజాస్వామ్య పండుగను జరుపుకున్నారు. శాంతి, సుస్థిరత, సౌభాగ్యం కోసం ఈ దేశ ప్రజలు చూపిన వివేకం, దూరదృష్టిని నేను అభినందిస్తున్నాను. ఈ ఉన్నతమైన సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు కూడా నా అభినందనలు.

మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రి కమ్లా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప దేశాన్ని నిరంతర వృద్ధి, సౌభాగ్యం దిశగా నడిపిస్తున్న ఆమెకు నిరంతర విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

మిత్రులారా, 

‘‘భారత ప్రజల నుంచి ట్రినిడాడ్, టొబాగో ప్రజలకు....’’ అంటూ సువర్ణాక్షరాలతో మీరు స్పీకర్ కుర్చీపై రాసిన అక్షరాలను చూస్తుంటే ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాను.

ఆ కుర్చీ కేవలం చెక్క వస్తువు మాత్రమే కాదు... మన రెండు దేశాల మధ్య స్నేహానికీ, నమ్మకానికీ బలమైన చిహ్నం. ఒక ప్రజాస్వామ్యం మరో ప్రజాస్వామ్యం పట్ల చూపే బంధాన్ని ఈ మాటలు వ్యక్తపరుస్తాయి. 

భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం ఒక రాజకీయ నమూనా మాత్రమే కాదు. మాకు అదొక జీవన విధానం. మనకు వేల సంవత్సరాల వారసత్వం ఉంది. మీ పార్లమెంటులో కూడా కొందరు సభ్యులు ఉన్నారు. వాళ్ల పూర్వీకులు బీహార్ రాష్ట్రం నుంచి వచ్చారు. బీహార్ లో ఒకనాడు జనపదాలు ఉండేవి. పూర్వకాలపు ప్రజాస్వామ్య వ్యవస్థలకు పునాది.

మిత్రులారా, 

మన రెండు దేశాల మధ్య అనుబంధంలో సహజమైన ఆప్యాయత ఉంది. వెస్టిండీస్ క్రికెట్ జట్టును భారతీయలు అమితంగా అభిమానిస్తారు. వారు భారత్‌తో కాకుండా వేరేవరితో అయినా ఆడేటప్పుడు మేం వారిని హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తాం. 

 

మన రెండు దేశాల బంధం శతాబ్దాల నుంచీ పునాది వేసుకున్న సంబంధాలపై నిలబడింది. 180 సంవత్సరాల కిందట భారతీయులు తొలిసారిగా సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణం తర్వాత ఈ భూభాగానికి చేరుకున్నారు. భారతీయ హృదయ స్పందనలు సముద్రాలు దాటి కరీబియన్ లయతో అద్భుతంగా కలిసిపోయాయి.

ఇక్కడ, భోజ్‌పురి క్రియోల్‌తో కలిసిపోయింది.

దాల్ పూరీ డబుల్స్‌ను కలిసింది.

తబలా స్టీల్ పాన్‌ను కలిసింది!

నేడు, భారతీయ సంతతి ప్రజలు ఎరుపు, నలుపు, తెలుపు జెండాను గర్వంతో ఎగురవేస్తున్నారు!

రాజకీయాల నుంచి  కవిత్వం వరకు, క్రికెట్ నుంచి వాణిజ్యం వరకు, కాలిప్సో నుంచి  చట్నీ వరకు, మీరు ప్రతి రంగంలోనూ తమ వంతు కృషి చేస్తున్నారు. అందరూ గౌరవించే శక్తిమంతమైన వైవిధ్యంలో మీరు అంతర్భాగం. "కలిసి మనం ఆశిద్దాం, కలిసి మనం సాధిద్దాం" అనే  నినాదాన్ని సార్థకం చేస్తూ మీరందరూ కలిసి ఒక దేశాన్ని నిర్మించారు.

మిత్రులారా, 

ఈ రోజు ఉదయం, గౌరవ అధ్యక్షురాలు ఈ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని నాకు ప్రదానం చేశారు. 1.4 బిలియన్ల భారతీయుల తరపున నేను దీనిని వినయపూర్వకంగా స్వీకరించాను.

ఇప్పుడు, అపారమైన కృతజ్ఞతతో, నేను దీనిని మన రెండు దేశాల మధ్య నిరంతర స్నేహానికి,  పూర్వీకుల బంధాలకు అంకితం చేస్తున్నాను.

మిత్రులారా, 

ఈ సభలో ఇంతమంది మహిళా సభ్యులను చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళల పట్ల గౌరవం భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయింది. మన ముఖ్యమైన పవిత్ర గ్రంథాలలో ఒకటైన స్కంద పురాణం ఇలా చెబుతోంది:

దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయన్ |

యత్ ఫలం లభతే మర్త్యః తత్ లభ్యం కన్యా ఏకయా ||

ఈ శ్లోకం భావం- పది మంది కుమారులను పెంచడం ద్వారా ఒక మనిషి పొందే ఫలం, ఒక్క కుమార్తె ద్వారానే పొందవచ్చు. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికి మేము మహిళలను శక్తిమంతులను చేస్తున్నాం.

అంతరిక్షం నుంచి  క్రీడల వరకు, స్టార్టప్‌ల నుంచి  సైన్స్ వరకు, విద్య నుంచి వాణిజ్యం వరకు, విమానయానం నుంచి  సాయుధ దళాల వరకు, వివిధ రంగాలలో మహిళలు భారతదేశాన్ని నూతన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నారు. మీలాగే, మాకు కూడా ఒక మహిళ ఉన్నారు. ఆమె నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చి మా రాష్ట్రపతి పదవిని అధిష్టించారు.

రెండు సంవత్సరాల కిందట భారత పార్లమెంటు ఒక చరిత్రాత్మక అడుగు వేసింది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మేం నిర్ణయించాం. ఇది రాబోయే తరాలలో, ఎక్కువ మంది మహిళలు దేశ భవిష్యత్తును, దిశను నిర్ణయించేలా చేస్తుంది.

భారతదేశంలో మహిళా నాయకులు స్థానిక స్థాయిలో కూడా ఎంతో బలంగా ఎదుగుతున్నారు. సుమారు 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు స్థానిక పరిపాలనా వ్యవస్థల్లో నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మేం మహిళా నాయకత్వంలో అభివృద్ధి యుగంలో ఉన్నాం. ఇది మా జి-20 అధ్యక్ష కాలంలో మేం ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన అంశాలలో కూడా ఒకటి. 

 

భారతదేశంలో మహిళా నాయకత్వంలో అభివృద్ధి కోసం ఒక కొత్త నమూనాను  మేం అభివృద్ధి చేస్తున్నాం. మా జి-20 అధ్యక్ష సమయంలో కూడా ఈ నమూనా విజయాన్ని మేం ప్రపంచానికి చూపించాం.  

గౌరవ సభ్యులారా, 

నేడు, భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. ప్రతి రంగం, ప్రతి ప్రాంతం, ప్రతి సమాజం ఈ వృద్ధి గాథలో భాగంగా ఉన్నాయి.

భారతదేశ అభివృద్ధి సమ్మిళితమైనది. ప్రజలే కేంద్రంగా ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవల నివేదించిన దాని ప్రకారం, భారతదేశ సామాజిక భద్రత, సంక్షేమ వ్యవస్థ 950 మిలియన్ల (95 కోట్లు) మంది ప్రజలకు భద్రతను అందిస్తోంది. ఈ లబ్దిదారుల సంఖ్య దాదాపు 1 బిలియన్. ఇది ప్రపంచంలోని చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ!

అలాంటి సమగ్ర అభివృద్ధిపై ఉన్న మా దృష్టికోణం మా సరిహద్దుల వద్దనే ఆగిపోదు. మా అభివృద్ధిని మేం ఇతరుల పట్ల బాధ్యతగా కూడా భావిస్తాం. మా ప్రాధాన్యత ఎల్లప్పుడూ గ్లోబల్ సౌత్ కోసమే ఉంటుంది.

అదే స్ఫూర్తితో, మేము ట్రినిడాడ్ అండ్ టొబాగోతో మా సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాం. మా వ్యాపారం నిరంతరం వృద్ధి చెందుతోంది. ఈ దేశంలో మరింత పెట్టుబడి పెట్టడానికి మా వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తున్నాం. మన  అభివృద్ధి భాగస్వామ్యం విస్తరిస్తోంది. శిక్షణ, సామర్థ్య నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. ఆరోగ్యం మా భాగస్వామ్యంలో ముఖ్యమైన భాగంగా ఉంది. ఇక ముందూ అలాగే ఉంటుంది.

అనేక మంది భారతీయ వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఇక్కడ విశిష్ట సేవల్ని అందిస్తున్నారు. భారత వైద్య ప్రమాణాలను గుర్తించాలని మీరు నిర్ణయించడం మాకు సంతోషంగా ఉంది. నాణ్యమైన మందులను ఇది అందరికీ తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతుంది.

మీరు యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను స్వీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం.  ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పరంగా విప్లవాన్ని సృష్టించింది.

ఈ వేదిక ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులు చేసే దేశంగా అవతరించింది. నేడు, భారతదేశంలో మామిడి పండ్ల విక్రేతలకు కూడా క్యూఆర్ కోడ్‌లు ఉన్నాయి. మీరు వారికి నగదు చెల్లించడానికి ప్రయత్నిస్తే, వారి వద్ద చిల్లర లేదని యూపీఐని ఉపయోగించమని వారే మిమ్మల్ని అడుగుతారు!

ఇతర డిజిటల్ ఆవిష్కరణలపై కూడా సహకారం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. గ్లోబల్ సౌత్‌లో వృద్ధి, అభివృద్ధిని పెంపొందించడానికి భారతదేశం కృత్రిమ మేధ సాధనాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ట్రినిడాడ్ అండ్ టొబాగో మాకు ఒక ప్రాధాన్య దేశంగా ఉంటుంది.

వ్యవసాయం, ఉద్యానవనం, ఆహార శుద్ధిలో కూడా మా నైపుణ్యాన్ని పంచుకుంటాం. భారతదేశం నుంచి  వచ్చే యంత్రాలు మీ వ్యవసాయ పరిశ్రమకు మద్దతు ఇస్తాయి. అభివృద్ధి అనేది గౌరవంతో కూడుకున్నది కాబట్టి, ఇక్కడ వికలాంగ పౌరుల కోసం మేం ఒక కృత్రిమ అవయవ అమరిక శిబిరాన్ని నిర్వహిస్తాం.

మీతో సహకారానికి మాకు ఎటువంటి పరిమితులూ లేవు. మీ అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా మేం ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం.

 

మిత్రులారా, 

మన దేశాల మధ్య ఉన్న సమన్వయం అపారమైన అవకాశాలను కలిగి ఉంది. కరీబియన్ ప్రాంతంలో ప్రధాన భాగస్వామిగా, లాటిన్ అమెరికాకు ఒక వారధిగా ట్రినిడాడ్ అండ్ టోబాగోకు గొప్ప సామర్థ్యం ఉంది. మన బంధం మరింత విస్తారమైన పరిధితో బలమైన అనుసంధానాన్ని ఏర్పరిచేందుకు సహాయపడుతుందనే నమ్మకం నాకు ఉంది.

రెండో ఇండియా-కారికోమ్ సదస్సు స్ఫూర్తితో, వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడం, మౌలిక సదుపాయాలు, రాకపోకల సౌకర్యాల అభివృద్ధి, కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడం, అన్నింటికంటే మించి, పెద్ద ఎత్తున సామర్థ్య పెంపు, శిక్షణ,  నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇచ్చే కార్యక్రమాలపై సహకరించడానికి మేము ఆసక్తిగా ఉన్నాం.

మిత్రులారా, 

మన భాగస్వామ్యాన్ని నేను మరింత విస్తృతమైన గ్లోబల్ పరిధిలో కూడా చూస్తున్నా. ప్రపంచంలో మార్పుల వేగం, వ్యాప్తి ఎప్పుడూ లేని విధంగా ఉంది. రాజకీయాల స్వభావం, అధికార కేంద్రీకరణలో సమూల మార్పులు జరుగుతున్నాయి. స్వేచ్ఛా వాణిజ్యం ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచంలో విభజనలు, వివాదాలు, అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి.

ప్రపంచం వాతావరణ మార్పులు, ఆహారం, ఆరోగ్యం, ఇంధన భద్రత వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం ఒక పెను ముప్పుగా పరిణమించింది. గతంలోని వలస పాలనలు ముగిసినప్పటికీ, వాటి నీడలు కొత్త రూపాల్లో వెంటాడుతున్నాయి.

అంతరిక్షం, సైబర్ భద్రతలో కొత్త సవాళ్లు ఉన్నాయి. కృత్రిమ మేధ కొత్త అవకాశాలను తీసుకువస్తూనే, కొత్త అనర్థాలను కూడా సృష్టిస్తోంది. పాత సంస్థలు శాంతి, అభివృద్ధి సాధించడంలో కష్టపడుతున్నాయి.

అదే సమయంలో, గ్లోబల్ సౌత్ ఎదుగుతోంది. వారు కొత్త, మరింత న్యాయమైన ప్రపంచ క్రమాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితికి 75 సంవత్సరాలు నిండినప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు గొప్ప ఆశ ఉండేది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణలు నెరవేరుతాయనే ఆశ అది. ఇప్పటికైనా వారి గళాలు వినిపిస్తాయనే ఆశ. కానీ ఆ ఆశ నిరాశగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాల గళం అంచులలోనే మిగిలిపోయింది. ఈ అంతరాన్ని తగ్గించడానికి భారతదేశం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.

భారతదేశానికి మహా సాగర్ (అన్ని ప్రాంతాలలో భద్రత, అభివృద్ధి కోసం పరస్పర సమగ్ర పురోగతి) అనే దృక్పథం గ్లోబల్ సౌత్‌ కోసం మార్గదర్శకంగా ఉంది. మాకు అవకాశం వచ్చిన ప్రతిసారీ, గ్లోబల్ సౌత్‌ గళాన్ని వినిపించాం. 

 

మా జీ-20 అధ్యక్ష సమయంలో, గ్లోబల్ సౌత్ ఆందోళనలను ప్రపంచ స్థాయి నిర్ణయాక ప్రక్రియకు కేంద్రంగా తీసుకొచ్చాం. మహమ్మారి సమయంలో, మా 140 కోట్లమంది ప్రజలను చూసుకుంటూనే, l 150కి పైగా దేశాలకు వ్యాక్సిన్లు, మందులను అందించాం. విపత్తుల సమయంలో, సహాయం, ఉపశమనం, సంఘీభావంతో మేము తక్షణమే స్పందించాం. మా అభివృద్ధి భాగస్వామ్యాలు అవసరాల ఆధారితమైనవి. గౌరవప్రదమైనవి. ఇంకా ఎటువంటి షరతులు లేనివి.

గౌరవ సభ్యులారా, 

గ్లోబల్ సౌత్‌కు సరైన వేదికపై సరైన స్థానం కల్పించడానికి ఇది మనం కలిసి పనిచేయాల్సిన సమయం. వాతావరణ న్యాయం జరిగేలా చూడాలి. తద్వారా వాతావరణ సంక్షోభానికి తక్కువగా దోహదపడిన వారిపై భారం పడదు. ఈ ప్రయత్నంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోను మేం ఒక ముఖ్యమైన భాగస్వామిగా భావిస్తున్నాం.

మిత్రులారా, 

మన రెండు దేశాలు పరిమాణం, భౌగోళిక స్థానం పరంగా భిన్నంగా ఉండవచ్చు. కానీ మన విలువలలో బలమైన ఐక్యత ఉంది. మనవి గర్వించదగిన ప్రజాస్వామ్య దేశాలు. చర్చలు, సార్వభౌమత్వం, బహుపాక్షిక వ్యవస్థ, మానవ గౌరవం అనే సూత్రాలపై మనకు విశ్వాసం ఉంది. ఈ సంఘర్షణల కాలంలో, మనం ఈ విలువలకు కట్టుబడి ఉండాలి. 

ఉగ్రవాదం అనేది మానవత్వానికి శత్రువు. ఉగ్రవాదం తెచ్చిపెట్టిన గాయాలను, అమాయక ప్రాణాలు బలి కావడాన్ని ఈ రెడ్ హౌస్ కూడా ప్రత్యక్షంగా చూసింది. ఉగ్రవాదానికి ఎక్కడా స్థలం, ఆశ్రయం లభించకుండా మనం ఐక్యంగా నిలబడాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా  పోరాటంలో మాకు తోడుగా నిలిచిన ఈ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మిత్రులారా, 

మన పూర్వీకులు కష్టపడ్డారు... త్యాగాలు చేశారు. భవిష్యత్ తరాలకు మెరుగైన జీవితాల కోసం కలలు కన్నారు. భారతదేశం, ట్రినిడాడ్ అండ్  టొబాగో రెండూ- ప్రజలకు వాగ్దానం చేసిన భవిష్యత్తు వైపు చాలా దూరం ప్రయాణించాయి. అయితే మనంతట మనంగా, ఇంకా కలిసి చాలా చేయాల్సింది చాలా ఉంది.

 

పార్లమెంటు సభ్యులుగా మీరందరూ ఆ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలి. అయోధ్య నుంచి అరిమా వరకు, గంగా తీరాల నుంచి గల్ఫ్ ఆఫ్ పారియా వరకు, మన బంధాలు మరింత లోతుగా, మన కలలు మరింత ఉన్నతంగా ఎదగాలి.

ఈ ఆలోచనలతో నా ప్రసంగాన్ని ముగిస్తాను.

మీరు చూపిన గౌరవాదరాలకు మీకు మరోసారి ధన్యవాదాలు. 

ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
₹10,000-crore scheme puts container manufacturing at the centre of India’s maritime push

Media Coverage

₹10,000-crore scheme puts container manufacturing at the centre of India’s maritime push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting determination, perseverance, and continuous effort in overcoming life's challenges
August 13, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the power of determination, perseverance, and courage in overcoming life's challenges and turning adverse circumstances into favorable ones.

The Prime Minister wrote on X;

"दैवं पुरुषकारेण यः समर्थः प्रबाधितुम्।

न दैवेन विपन्नार्थः पुरुषः सोऽवसीदति॥"

A person who possesses the determination, perseverance and courage to turn adverse circumstances into favorable ones is never defeated by the challenges of life. Instead, through continuous effort and unwavering resolve, he moves forward and ultimately achieves success.