నార్వే రాజధాని ఓస్లోలో ఆ దేశ ప్రధానమంత్రి  శ్రీ జోనాస్ గర్ స్టోరెతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఓస్లో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని శ్రీ మోదీకి నార్వే ప్రధానమంత్రి స్టోరె స్వయంగా విచ్చేసి ఘనస్వాగతం పలికారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు అద్దం పట్టింది.

ఈ భేటీలో ఇరు దేశాల నాయకులు భారత్-నార్వే సంబంధాలలోని కీలపై అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఇందులో భాగంగా వాణిజ్యం-పెట్టుబడులు, భారత్-ఈఎఫ్‌టీఏ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తదుపరి చర్యలు, వాతావరణ మార్పులపై పోరాటం, ఇంధన పరివర్తన, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ, సముద్ర నిర్వహణ, పరిశోధన-ఉన్నత విద్యా రంగం, ఆర్కిటిక్, ధృవ ప్రాంతాల సహకారం, అంతరిక్షం, ప్రతిభావంతుల బదిలీ వంటి అంశాలపై చర్చించారు. సుస్థిరత, హరిత వృద్ధికి కట్టుబడి ఉంటూ తమ బంధాన్ని హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల అధినేతలు అంగీకరించారు.

ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల మధ్య భారీ అవకాశాలు ఉన్నాయని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు. భారత మార్కెట్లో నార్వే సంస్థలు మరింతగా పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు. 2030 నాటికి భారత్-నార్వే ప్రస్తుత వాణిజ్య విలువను రెట్టింపు చేయాలని ఇరు దేశాల నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే టీఈపీఏ ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధనకు, భారత్‌లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి గానూ వివిధ రంగాలలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని వ్యాపార ప్రతినిధులను వారు కోరారు.

వాణిజ్య వ్యవస్థ పరిరక్షణ, నౌకల నిర్మాణం, గ్రీన్ షిప్పింగ్, సొరంగ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, అంతరిక్షం, కృత్రిమ మేధ, రోబోటిక్స్, సైబర్ భద్రత, నావికుల శిక్షణ, మత్స్య సంపద, చేపల పెంపకం వంటి  రంగాలతో సహా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాల నాయకులు తమ బృందాలను ఆదేశించారు. ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల సూత్రాలను పునరుద్ఘాటించడంతో పాటు ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యాచరణలో నార్వే చేరడాన్ని స్వాగతించారు. జూన్ 2026లో ఫ్రాన్స్‌లో జరగబోయే భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సులో పాల్గొనవలసిందిగా నార్వేను ప్రధాని మోదీ ఆహ్వానించారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య నూతన ఆవిష్కరణల కేంద్రం, హరిత ఆవిష్కరణల పోటీలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.

పర్యావరణం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని ప్రస్తావిస్తూ.. కార్బన్ క్యాప్చర్, వినియోగం, నిల్వచేయడం, తీరప్రాంత పవన విద్యుత్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో మరింత కలిసి పనిచేయాలని ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు. అలాగే భారత్‌లోని స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులలో నార్వే మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.

పర్యావరణహిత పద్ధతులకు కట్టుబడి ఉంటూ..  ఆర్కిటిక్ ప్రాంతంలో ధృవ పరిశోధనలు, రవాణా రంగాలను బలోపేతం చేయడానికి ఇరు నేతలు అంగీకరించారు. పునరుత్పాదక ఇంధనం, సముద్రాలు, వాతావరణం, ఆరోగ్యం, కీలక ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఐటీ వంటి రంగాలలో ఉమ్మడి పరిశోధనలు, ఆవిష్కరణలపై చర్చించారు. ఉన్నత విద్యా రంగంలో ఉమ్మడి డిగ్రీ కార్యక్రమాలు ,అర్హతల పరస్పర గుర్తింపు, విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర మార్పిడి వంటి అవకాశాలను పరిశీలించేందుకు అంగీకరించారు.

వివిధ బహుపాక్షిక వేదికలపై పరస్పర సహకారంపై చర్చించడంతో పాటు, ఉమ్మడి ఆసక్తి గల కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించి అందులో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్‌కు నార్వే మద్దతును ఆ దేశ ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.

సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఇరు దేశాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ముప్పును అంతమొందించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

రక్షణ రంగ సహకారం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యంలో ఉన్న అవకాశాలను వారు గుర్తించారు. డిజిటల్ ప్రజా వస్తువుల విషయంలో మూడో దేశంతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించడానికి అంగీకరించారు. అలాగే డిజిటల్ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడం కోసం డిజిటలైజేషన్‌పై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఇరు దేశాల మంత్రిత్వ శాఖలను ఆదేశించారు.

తనకు లభించిన ఘన స్వాగతానికి, ఆతిథ్యానికి గానూ నార్వే ప్రధాని స్టోరెకు, ఆ దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా ప్రధాని స్టోరెను ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక పర్యటనల వేగాన్ని ఇలాగే కొనసాగించడానికి ఇరు నేతలు అంగీకరించారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
West Asia conflict: 59 India-bound vessels transited Hormuz since war

Media Coverage

West Asia conflict: 59 India-bound vessels transited Hormuz since war
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 జూలై 2026
July 22, 2026

From Scholarships to Homes to High-Speed Rail: Inclusive Growth Under PM Modi’s Leadership