• ట్రినిడాడ్ టొబాగోలో భారతీయ సంతతి జీవనయాత్ర సాహస భరితం: ప్రధానమంత్రి
• 500 సంవత్సరాల తరువాత రామ్ లలా అయోధ్యకు తిరిగి రావడాన్ని మీరంతా చాలా సంతోషించి ఉంటారని నమ్ముతున్నా: ప్రధానమంత్రి
• భారతీయ ప్రవాసులు మాకు గర్వకారణం: ప్రధానమంత్రి
• ప్రపంచం అంతటా గర్మతీయ సమాజాన్ని సన్మానించడంతో పాటు వారితో బంధం ఏర్పరుచుకోవడానికి
అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తామని ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా నేను ప్రకటించా: ప్రధానమంత్రి

ట్రినిడాడ్ టొబాగోలో ఈ రోజు భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీమతి కమ్లా ప్రెసాద్ బిసెసా, మంత్రిమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో పాటు అనేక మంది ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో, ప్రధానమంత్రికి ప్రవాసులు అపూర్వ స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికే సందర్భంగా భారత్, ట్రినిడాడ్.. ఇరు దేశాల సంప్రదాయాలనూ అనుసరించారు.

 

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా స్వాగతిస్తూ, ట్రినిడాడ్ టొబాగోలో అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో’’తో ఆయనను సత్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవాన్ని తనకు ఇస్తున్నందుకు ఆమెతో పాటు ట్రినిడాడ్ టొబాగో ప్రజానీకానికి తన హృదయపూర్వక కృతజ్ఞత‌లను ప్రధానమంత్రి తెలియజేశారు.

ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా కనబరిచిన ఆత్మీయతకూ, రెండు దేశాల మధ్య చైతన్యభరిత, విశిష్ట సంబంధాలను బలపరచడంలో ఆమె అందించిన తోడ్పాటుకు ప్రధానమంత్రి తన ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. ట్రినిడాడ్ టొబాగో గడ్డ మీద భారతీయ ప్రవాసులు మొదటిసారి అడుగు పెట్టి ఇప్పటికి 180 సంవత్సరాలైన ఘట్టాన్ని పండుగ చేసుకొంటున్న తరుణంలో, ఈ దేశంలో చరిత్రాత్మక పర్యటనకు తాను తరలి రావడం దీనికి మరింత ప్రత్యేకతను అందించిందని ప్రధానమంత్రి అభివర్ణించారు.

 

భారతీయ ప్రవాసులు తమ ధీరత్వంతో, సాంస్కృతిక సంపన్నత్వంతో పాటు ట్రినిడాడ్ టొబాగో ప్రగతికి ఎనలేని తోడ్పాటును అందిస్తున్నారంటూ ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు. ట్రినిడాడ్ టొబాగోలో వారు భారతీయ సాంస్కృతిక మూలాలనూ, సంప్రదాయాలనూ పదిలంగా కాపాడుకోవడంతో పాటు వాటిని పెంచి పోషించుకొంటున్నారని కూడా ఆయన కితాబిచ్చారు. ఈ సంబంధాలను మరింత బలపరుచుకోవడం కోసం, ట్రినిడాడ్ టొబాగోలో భారతీయ మూలాలున్న వ్యక్తులలో 6వ తరానికి చెందిన వారికి ఓసీఐ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనను విన్న ఆహూతులు చప్పట్లు కొడుతూ తమ ప్రతిస్పందనను వ్యక్తం చేశారు. గిర్మితీయ వారసత్వాన్ని సంరక్షించడానికీ, పురోభివృద్ధి చెందడానికీ భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు మద్దతును అందించనుందని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీ, తయారీ, పచ్చదనంతో కళకళలాడే మార్గాలు, అంతరిక్షం, నవకల్పన, అంకుర సంస్థల రంగాల్లో భారత్ పురోగతినీ, మార్పునూ శరవేగంగా తీసుకు వస్తోందని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రగతి ఫలాలను అన్ని వర్గాల వారికీ అందించడంలో భారత్ గత పది సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ముందడుగు వేసిందని ఆయన చెబుతూ, 25 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం బారి నుంచి విముక్తులను చేసినట్లు తెలిపారు.

 

భారత్ వృద్ధి గాథకు చెందిన వివిధ అంశాలను ప్రధానమంత్రి వివరిస్తూ, దేశం త్వరలోనే ప్రపంచంలో అగ్రగామి మూడు ఆర్థిక వ్యవస్థల్లో స్థానాన్ని సంపాదించుకొంటుందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్, క్వాంటమ్ కంప్యూటింగ్.. వీటికి సంబంధించిన జాతీయ మిషన్లు దేశాభివృద్ధికి సరికొత్త ఇంజిన్లుగా మారుతున్నాయని స్పష్టం చేశారు.

 

యూపీఐని ఉపయోగిస్తూ డిజిటల్ మాధ్యమంలో చెల్లింపులు చోటుచేసుకొనే ప్రక్రియ భారతదేశంలో విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ సాంకేతికతను అనుసరించడంలో ట్రినిడాడ్ టొబాగోలో కూడా ఉత్సాహం చూపిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్ తరతరాలుగా ‘వసుధైక కుటుంబం’ దర్శనాన్ని అనుసరిస్తూ వస్తోందనీ, ఈ మాటలకు ‘‘ప్రపంచం అంతా ఒకే పరివారం’’ అని అర్థమనీ, కోవిడ్ మహమ్మారి కాలంలో ఈ భావనను ఇండియా ప్రస్ఫుటంగా చాటిచెప్పిందన్నారు.  ప్రగతి, దేశ నిర్మాణం దిశగా ట్రినిడాడ్ టొబాగో సాగిస్తున్న ప్రయాణంలో భారత్ నిరంతరంగా మద్దతను అందిస్తూ ఉంటుందని ఆయన అన్నారు.

ఈ భారీ కార్యక్రమంలో 4000 కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సాంస్కృతిక సహకార సంస్థతోపాటు ఇతర సంస్థల కళాకారులు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.‌

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India Exports 3.15 lakh Tonnes Sugar in Oct-Feb of 2025-26 Marketing Year: AISTA

Media Coverage

India Exports 3.15 lakh Tonnes Sugar in Oct-Feb of 2025-26 Marketing Year: AISTA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 మార్చి 2026
March 17, 2026

Resilient Bharat Rising: From Safe LPG Deliveries to UPI Dominance and Women's Empowerment Achievements Under PM Modi's Leadership