“భారత సాయుధ దళాల శౌర్యపరాక్రమాలకు విజయోత్సవమే నిదర్శనం”
“ఈ విజయోత్సవ స్ఫూర్తితోనే సభలో భారత్‌ దృక్కోణాన్ని ఆవిష్కరిస్తున్నాను”
“స్వావలంబ భారత్‌ శక్తిని ఆపరేషన్ సిందూర్ ప్రస్ఫుటం చేసింది!”
“ఈ ఆపరేషన్‌లో మన సైనిక.. నావిక.. వైమానిక దళాల సమన్వయం పాకిస్థాన్‌ మూలాలను కుదిపేసింది”
“ఉగ్రవాదంపై తనదైన శైలిలో ప్రతిస్పందిస్తానని.. అణ్వస్త్ర దాడులను సహించబోనని.. ఉగ్రవాద ప్రోత్సాహకులు-సూత్రధారులను ఒకే విధంగా చూస్తామని భారత్‌ స్పష్టం చేసింది”
“ఆపరేషన్ సిందూర్ వేళ భారత్‌ విస్తృత స్థాయిలో అంతర్జాతీయ మద్దతును కూడగట్టింది”
“ఈ ఆపరేషన్ కొనసాగుతుంది... పాకిస్థాన్‌ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా భారత్‌ స్పందన కఠినాతికఠినంగా ఉంటుంది”
“సరిహద్దుల వద్దగల బలమైన సైన్యమే శక్తియుత.. సురక్షిత ప్రజాస్వామ్యానికి భరోసా ఇస్తుంది”
“దశాబ్దం నుంచీ భారత సాయుధ దళాల బలం ఇనుమడిస్తోందని చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ విస్పష్ట నిదర్శనం”
“భారత్‌ బౌద్ధ భూమి- యుద్ధ భూమి కాదు... బలమే శాశ్వత శాంతికి మూలమన్న వాస్తవిక దృష్టితో సామరస్యం.. సౌభాగ్యం కోసం మేం కృషి చేస్తాం”
“రక్తం... నీరు కలిసి ప్రవహించజాలవని ఈ ఆపరేషన్‌తో భారత్‌ స్పష్టం చేసింది”

పహల్గామ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 22నాటి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో ఈ రోజు ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దీన్ని శక్తియుత, నిర్ణయాత్మక, విజయవంతమైన సైనికచర్యగా ఆయన అభివర్ణించారు. పార్లమెంటు సమావేశాలకు ముందు దీనిపై మీడియా సోదరులతో తన సంభాషణను ప్రధాని ముందుగా సభకు గుర్తుచేశారు. ప్రస్తుత సమావేశాలను భారత  విజయోత్సవంగా, దేశ కీర్తిప్రతిష్ఠలకు నివాళిగా పరిగణించాలని గౌరవనీయ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు.

ఉగ్రవాద ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేయడాన్ని ఈ ‘విజయోత్సవం’ సూచిస్తుందని శ్రీ మోదీ చెప్పారు. అలాగే నుదుటి సిందూరం సాక్షిగా చేసిన ప్రతిన నెరవేర్చడానికి ప్రతీకగానేగాక దేశం అంకితభావానికి, త్యాగానికి నివాళిగా నిలుస్తుందన్నారు. “ఈ విజయోత్సవం మన సాయుధ దళాల శౌర్యపరాక్రమాలకు నీరాజనం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయోత్సవం 140 కోట్ల మంది భారతీయుల ఐక్యత, సంకల్ప శక్తి, సమష్టి విజయానికి చిహ్నమని పేర్కొన్నారు.

ఈ విజయమిచ్చిన స్ఫూర్తితోనే సభ సమక్షాన భారత్‌ దృక్పథాన్ని దృఢంగా చాటుతున్నానని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ దృక్కోణాన్ని దర్శించలేని వారికి స్పష్టంగా అవగతం అయ్యేలా తాను అద్దం పడుతున్నానని చెప్పారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల భావోద్వేగాలతో గళం కలపడానికే సభకు వచ్చానని ఆయన అన్నారు. ఈ సమష్టి భావన సభలో ప్రతిధ్వనించిందని, ఆ స్ఫూర్తికి తన స్వరం జోడించడానికే ఇప్పుడు ముందుకొచ్చానని శ్రీ మోదీ చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో తిరుగులేని మద్దతుతో ఆశీర్వదించిన దేశ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తాను సదా వారికి రుణపడి ఉంటానన్నారు. పౌరుల సమష్టి సంకల్పాన్ని ప్రశంసిస్తూ, ఈ విజయంలో వారు పోషించిన పాత్రకు ధన్యవాదాలు తెలిపారు.

పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22నాటి అమానుష ఉగ్రదాడిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఖండించారు. ఉగ్రవాదులు మతం గురించి వాకబు చేసి మరీ, అమాయకులను కాల్చి చంపారని గుర్తుచేశారు. దీన్ని క్రూరత్వానికి పరాకాష్ఠగా అభివర్ణిస్తూ, ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మత విద్వేషం రెచ్చగొట్టి, హింసాగ్ని రగల్చాలన్నదే వారి దురుద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, దేశ ప్రజానీకం ఏకతాటిపై నిలిచి, పునరుత్ధాన శక్తితో ముష్కర కుట్రను భగ్నం చేశారంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఆ ఉదంతం తర్వాత ప్రపంచానికి భారత్‌ వైఖరిని స్పష్టం చేయడం కోసం ఆంగ్లంలో కూడా తాను బహిరంగ ప్రకటన చేశానని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్నది భారత్‌ దృఢ సంకల్పమని తాను స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇంతటి క్రౌర్యానికి పాల్పడిన సూత్రధారులను వారు కలలోనైనా ఊహించని రీతిలో శిక్షిస్తామని కూడా ప్రకటించానని చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న తాను ఏప్రిల్ 22న తక్షణ సమాచారంతో వెంటనే తిరిగి వచ్చి, ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడాన్ని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక ప్రతిస్పందన దిశగా ఆ సమావేశంలో విస్పష్ట సూచనలిచ్చానని, తమ జాతీయ నిబద్ధతకు ఇదే నిదర్శనమని పునరుద్ఘాటించారు.

మన సాయుధ దళాల శక్తిసామర్థ్యాలు, సాహసంపై పూర్తి విశ్వాసం ప్రకటిస్తూ- ఆపరేషన్‌ సమయం, ప్రదేశం, ప్రతిస్పందన విధాన నిర్ణయాధికారం వంటి అంశాలపై సైన్యానికి సంపూర్ణ కార్యాచరణ స్వేచ్ఛ ఇచ్చినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని, వాటిలో కొన్ని ప్రసార-ప్రచురణ మాధ్యమాల్లో కనిపించి ఉండవచ్చునని ప్రధానమంత్రి చెప్పారు. ఉగ్రవాదులకు విధించిన శిక్ష అత్యంత ప్రభావశీలం కావడంతో సూత్రధారులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని ఆయన సగర్వంగా వ్యాఖ్యానించారు.

భారత్‌ ప్రతిస్పందనను, తద్వారా సాయుధ దళాల విజయాన్ని సభ ద్వారా దేశం ముందుంచాలని భావించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పహల్గామ్ దాడి అనంతరం భారత్‌ తీవ్రస్థాయిలో సైనిక చర్యకు దిగుతుందని పాకిస్థాన్‌ అపోహ పడినట్లు చెప్పారు. అందుకే అణ్వస్త్ర ప్రయోగం చేస్తామంటూ బెదిరింపులకు దిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, తద్భిన్నంగా చేపట్టిన ఆపరేషన్‌లో తొలి కోణాన్ని స్పృశిస్తూ- ప్రణాళిక మేరకు 2025 మే 6, 7 తేదీల మధ్య అర్ధరాత్రి దాటాక దాడి చేయడంతో పాక్‌ దిగ్భ్రాంతికి లోనైందని చెప్పారు. ఆ విధంగా ఏప్రిల్ 22నాటి ఉగ్రదాడికి మన సాయుధ దళాలు దీటుగా బదులివ్వడమేగాక నిర్దేశిత లక్ష్యాలను కేవలం 22 నిమిషాల్లో సాధించాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

అలాగే రెండో కోణాన్ని వివరిస్తూ- పాకిస్థాన్‌ గతంలోనూ భారత్‌తో పలుమార్లు కయ్యానికి పాల్పడిన నేపథ్యంలో శత్రువుకు అంతుబట్టని వ్యూహాన్ని అమలు చేశామని శ్రీ మోదీ తెలిపారు. ఈ మేరకు మునుపెన్నడూ స్పృశించని లక్ష్యాలను మన దళాలు సునాయాసంగా ఛేదించాయని తెలిపారు. ఈ మేరకు పాకిస్థాన్‌ వ్యాప్తంగాగల ఉగ్రవాద స్థావరాలను  నిర్ణయాత్మక లక్ష్యం చేసుకుని దెబ్బతీశాయన్నారు. వీటిలో భారత్‌ చేరుకోగలదని ఎవరూ ఊహించని ప్రాంతాలు కూడా ఉన్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా బహావల్పూర్, మురిద్కే ఉగ్రవాద స్థావరాలను ప్రత్యేకించి ప్రస్తావించారు. ఈ రెండు కీలక ప్రదేశాలను నేలమట్టం చేయడం ద్వారా ఉగ్రవాద మూకలను భారత సాయుధ దళాలు విజయవంతంగా హతమార్చాయని ప్రకటించారు.

అణ్వస్త్ర ప్రయోగం చేస్తామంటూ పాకిస్థాన్‌ బెదిరింపులకు పాల్పడినా, అవన్నీ ఉత్తుత్తివేనని తేలిపోవడం మూడో కోణమని శ్రీ మోదీ చెప్పారు. ఇలాంటి అణు బెదిరింపులకు భారత్‌ బెదిరేది లేదని,  ప్రత్యర్థి ఎదుట ఎన్నడూ మోకరిల్లబోదని ఈ ఆపరేషన్‌ నిరూపించినట్లు పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ కింద భారత్‌ వ్యూహాత్మక ప్రతిస్పందనలోని నాలుగో కోణాన్ని ప్రస్తావిస్తూ, పాక్‌ భూభాగంలోకి లోతుగా దూసుకుపోయి, కచ్చితమైన దాడుల ద్వారా తన అధునాతన సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించిందని తెలిపారు. దీంతో పాకిస్థాన్‌ వైమానిక స్థావరాలు భారీగా నష్టపోయాయని, ఇప్పటికీ కోలుకునే స్థితిలో లేవన్నారు. మనమిప్పుడు సాంకేతిక పరిజ్ఞానాధారిత యుద్ధశకంలో ఉన్నామని, ఈ రంగంలో భారత్‌ తన నైపుణ్యాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా రుజువు చేసుకున్నదని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో నిత్య  సంసిద్ధత దిశగా భారత్‌ కృషి చేయకపోయి ఉంటే- నేటి సాంకేతిక శరంలె దేశం అపార కష్టనష్టాలకు లోనయ్యేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ఐదో కోణాన్ని ప్రస్తావిస్తూ- స్వయం సమృద్ధ భారత్‌ శక్తిసామర్థ్యాలను ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచం తొలిసారి గ్రహించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాక్‌ ఆయుధ వ్యవస్థల దుర్బలత్వాన్ని బహిర్గతం చేసిన ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్లు, క్షిపణుల ప్రభావాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

భారత రక్షణరంగ స్వరూపంలో ఓ కీలక అంశాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) ప్రకటనను ప్రస్తావిస్తూ- ఆపరేషన్ సిందూర్‌లో సైనిక, నావిక, వైమానిక దళాలు సమష్టిగా వ్యవహరించాయని, త్రివిధ బలగాల సమన్వయ శక్తి పాక్‌ మూలాలను కుదిపేసిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

దేశంలో ఇంతకుముందు జరిగిన ఉగ్రవాద దాడుల సూత్రధారులకు శిక్ష పడుతుందన్న భయ, సంకోచాలు ఏ కోశానా ఉండేవి కావని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీంతో మళ్లీమళ్లీ దాడులకు ప్రణాళికలు రచిస్తూనే వచ్చారని శ్రీ మోదీ చెప్పారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయని వారికి స్పష్టంగా అర్థమైందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ దాడికి పాల్పడినా వారికి కంటిమీద కునుకు ఉండటం లేదని చెప్పారు. భారత్‌ ప్రతిదాడికి దిగుతుందని, ఉగ్రమూకలను అమిత కచ్చితత్వంతో దునుమాడగలదని తెలిసివచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌ దీన్నొక “నవ్య సంప్రదాయం”గా మార్చిందని ప్రధానమంత్రి ప్రకటించారు.

అంతర్జాతీయ సమాజం ఇప్పుడు భారత్‌ వ్యూహాత్మక కార్యకలాపాల విస్తృత పరిధి, పరిమాణాలను గుర్తించిందని తెలిపారు. ‘సిందూర్ నుంచి సింధు’ వరకూ పాక్‌ అంతటా దాడులతో ఆపరేషన్ సిందూర్ ఒక కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత్‌పై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా, ఉగ్రదాడి చేయించినా, సూత్రధారులతోపాటు తాను కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పాకిస్థాన్‌కు తెలిసివచ్చిందన్నారు.

ఆపరేషన్ సిందూర్ ద్వారా రూపుదిద్దుకున్న మూడు విస్పష్ట సూత్రాలను ప్రధానమంత్రి వివరించారు. ఇందులో మొదటిది... స్వీయ నిర్దేశానుగుణంగా, తనదైన శైలిలో, తనకు అనువైన సమయంలో దీటుగా ప్రతిస్పందిస్తుంది. రెండోది... అణ్వస్త్ర దాడులకు పాల్పడతామనే ఉత్తుత్తి బెదిరింపులను ఇకపై సహించదు. మూడోది... ఉగ్రవాద ప్రోత్సాహకులు, దాడుల సూత్రధారులను ఒకేవిధంగా పరిగణిస్తుంది.

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్‌కు ప్రపంచవ్యాప్త మద్దతు లభించడంపై శ్రీ మోదీ సభకు స్పష్టత ఇచ్చారు. జాతీయ భద్రత పరిరక్షణ దిశగా భారత్‌ సముచిత చర్యలు చేపట్టడాన్ని ఏ దేశమూ వ్యతిరేకించలేదని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాలలో కేవలం మూడు మాత్రమే పాకిస్థాన్‌కు మద్దతు పలికాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అంటే- ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ విస్తృత మద్దతునిచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.  ఇక “క్వాడ్, బ్రిక్స్” వంటి వ్యూహాత్మక కూటములు సహా ఫ్రాన్స్, రష్యా, జర్మనీ వంటి అగ్ర  దేశాలు కూడా మద్దతు ప్రకటించాయని తెలిపారు. మొత్తంమీద అంతర్జాతీయ సమాజం భారత్‌కు అన్నివిధాలా అండగా నిలిచిందని ప్రధానమంత్రి వెల్లడించారు.

భారత్ కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించినప్పటికీ, దేశ సైనికుల ధైర్యసాహసాలకు ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ మోదీ, ఏప్రిల్ 22 న ఉగ్రవాద దాడి జరిగిన కొద్ది రోజులకే కొందరు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఎగతాళి చేయడం ప్రారంభించారని, విఫలమైనట్టు ఆరోపించారని పేర్కొన్నారు. ఈ వెటకారం, పహల్గామ్ హత్యాకాండ అనంతరం కూడా వారు రాజకీయ అవకాశవాదానికి పాల్పడడం దేశవ్యాప్త విషాదాన్ని వారు తేలికగా తీసుకున్నట్టు కనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. వారి ప్రకటనలు చిల్లరగా ఉండడమే కాకుండా భారత భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు దేశ శక్తి మీద, మన సాయుధ దళాల సామర్థ్యాలపైన నమ్మకం లేకుండా, ఆపరేషన్ సిందూర్ పై ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారని శ్రీ మోదీ అన్నారు. పత్రికలలో పతాక శీర్షికల కోసం వెంపర్లాడడం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడవచ్చునేమో కానీ అది ప్రజల నమ్మకాన్ని లేదా గౌరవాన్ని పొందదని ఆయన స్పష్టం చేశారు.


2025 మే 10 న భారతదేశం ఆపరేషన్ సిందూర్ కింద కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రకటన వివిధ ఊహాగానాలకు దారితీసిందని, ఇది సరిహద్దు వెంబడి పుట్టుకొచ్చిన ప్రచారంగా ఆయన అభివర్ణించారు.

భారత సైనిక బలగాలు చూపిన వాస్తవాలను విశ్వసించకుండా, పాకిస్థాన్ వ్యాప్తి చేస్తున్న తప్పుడు కథనాలను పదేపదే ప్రచారం చేస్తున్నవారిని ఆయన తీవ్రంగా విమర్శించారు. భారత్ ఎప్పుడూ దృఢమైన, స్పష్టమైన వైఖరినే కొనసాగిస్తూ వచ్చిందని ఆయన పునరుద్ఘాటించారు.

గతంలో భారతదేశం నిర్వహించిన లక్ష్య నిర్దేశిత సైనిక చర్యలను ప్రస్తావిస్తూ, వాటిలో చూపిన వ్యూహాత్మక స్పష్టత, అమలు తీరును ప్రధాని ప్రముఖంగా పేర్కొన్నారు. సర్జికల్ దాడుల సమయంలో భారతదేశం శత్రు దేశ భూభాగంలోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సూర్యోదయానికి ముందే  విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. బాలాకోట్ వైమానిక దాడుల్లో ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ కింద, భారతదేశం మళ్ళీ స్పష్టమైన లక్ష్యంతో పనిచేసిందని, పహల్గామ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ప్రధాన కేంద్రాన్ని, వారి ప్రణాళిక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, నిధుల మూలాలు, ట్రాకింగ్,  సాంకేతిక మద్దతు, ఆయుధ సరఫరా సహా మొత్తం మౌలిక సదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగిందని వివరించారు. “భారతదేశం చాలా కచ్చితంగా  ఉగ్రవాదుల నాడి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని వారి కార్యకలాపాల మూలాన్ని నిర్వీర్యం చేసింది" అని ప్రధానమంత్రి అన్నారు.

"భారత దళాలు మరోసారి తమ లక్ష్యాలను 100% సాధించాయి, దేశ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించాయి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ మైలురాళ్లను ఉద్దేశపూర్వకంగా విస్మరించేవారిని విమర్శిస్తూ, వారిని దేశం బాగా గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు. మే 6 రాత్రి,  మే 7 ఉదయం ఈ ఆపరేషన్ జరిగింది. మే 7 న సూర్యోదయం తరువాత భారత సైన్యం పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి మిషన్ పూర్తయినట్టు ప్రకటించిందని తెలిపారు. ఉగ్రవాద వ్యవస్థలను, వాటి సూత్రధారులను, వాటికి ఆయుధాలు, ఇతర అవసరాల చేరవేత మార్గాలను ధ్వంసం చేయాలనే భారతదేశ లక్ష్యాలు మొదటి రోజు నుంచే స్పష్టంగా ఉన్నాయని, ప్రణాళికాబద్ధంగా ఈ మిషన్ పూర్తయిందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ను ఉటంకిస్తూ, భారత సాయుధ దళాలు తమ విజయాన్ని నిమిషాల్లోనే పాకిస్థాన్ సైన్యానికి తెలియజేశాయని, తద్వారా భారత ఉద్దేశాలు,  ఫలితాలు స్పష్టంగా అర్ధమయ్యేలా చేశాయని ప్రధానమంత్రి ధృఢంగా పేర్కొన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం వారి అవివేకాన్ని చూపుతోందని ఆయన పేర్కొన్నారు. వారు తెలివిగా వ్యవహరిస్తే, ఇంత ధైర్యంగా ఈ తప్పుడు నిర్ణయం తీసుకునేవారు కాదని చెప్పారు. భారత్ పూర్తిగా సిద్ధంగా ఉండి, సరైన సమయం కోసం ఎదురు చూసిందని,  భారత్ పోరాటం ఒక దేశంతో కాదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే విధానమని ప్రధానమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదులకు మద్దతుగా యుద్ధరంగంలోకి ప్రవేశించాలని పాకిస్థాన్ నిర్ణయించడంతో భారత్ దీటుగా బదులిచ్చిందని చెప్పారు. మే 9 అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు భారత క్షిపణులు పాక్ ఊహకు అందనంత తీవ్రతతో వారి లక్ష్యాలపై దాడి చేశాయని ప్రధాని తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ కింద భారత్ తీసుకున్న నిర్ణయాత్మక చర్య పాకిస్థాన్ ను మోకరిల్లేలా చేసిందని ప్రధాని సభకు తెలిపారు. భారత్ చర్యకు ఆ దేశ ప్రజలు విస్తుపోయిన తీరు,  వారి స్పందనలు టెలివిజన్లలో విస్తృతంగా కనిపించాయని ఆయన గుర్తు చేశారు. భారత్ స్పందనకు పాక్ ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయిందంటే, దాని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజీఎంఓ) నేరుగా భారతదేశానికి ఫోన్ చేసి, దాడిని ఆపమని వేడుకున్నారని, ఇక దాడులను తాము తట్టుకోలేమని ఆయన అంగీకరించారని శ్రీ మోదీ తెలిపారు.

మే 7వ తేదీ ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో భారత్ తన లక్ష్యాలను సాధించిందని, పాక్ మరింత రెచ్చగొడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని స్పష్టం చేసిందని ఆయన పునరుద్ఘాటించారు. “భారత్ విధానం సరైన ఉద్దేశంతో, సక్రమమైన ఆలోచనతో, సాయుధ దళాల సమన్వయంతో రూపుదిద్దుకుంది. ఇది ఉగ్రవాదాన్ని, దాని నిర్వాహకులను, వారి స్థావరాలను నిర్మూలించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. భారత్ చర్య ఉద్దేశం ఉద్రిక్తతలను పెంచడం ఎంతమాత్రం కాదు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

భారత్ చర్యపై ఏ ప్రపంచ నాయకుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రధాని పేర్కొన్నారు. మే 9వ తేదీ రాత్రి భారత రక్షణ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశంలో ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు పలుమార్లు తనతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆయన వెల్లడించారు. సమావేశం అనంతరం తిరిగి కాల్‌ చేసినప్పుడు, పాక్ పెద్ద స్థాయిలో ఎదురుదాడి ప్రారంభించవచ్చన్న సమాచారం అందినట్టు ప్రధానమంత్రి తెలిపారు. దీనిపై తాను స్పందిస్తూ.. 'పాక్ ఉద్దేశం అదే అయితే, వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, భారత్ మరింత బలంగా ప్రతీకారం తీర్చుకుంటుందని, తూటాలకు ఫిరంగులతో సమాధానం చెబుతామని” స్పష్టం చేసినట్టు తెలిపారు. మే 9వ తేదీ రాత్రి, మే 10వ తేదీ ఉదయం  భారతదేశం శక్తిమంతంగా తిరిగి దాడి చేసి, పాక్ సైనిక మౌలిక సదుపాయాలను భారీ బలప్రయోగంతో ధ్వంసం చేసిందని ప్రధాని తెలిపారు. ఇక భారత్ నుంచి ప్రతి ప్రతిస్పందన మునుపటి కంటే బలంగా ఉంటుందని పాకిస్థానీలకు ఈపాటికి పూర్తిగా అర్థమై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. “పాకిస్థాన్ మళ్లీ ఏదైనా దుస్సాహసం చేస్తే అది తగిన,  భయంకరమైన ప్రతీకారాన్ని ఎదుర్కొంటుంది. ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ చురుకుగా, దృఢంగా కొనసాగుతోంది" అని శ్రీ మోదీ ప్రకటించారు.

"నేటి భారతదేశం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది స్వావలంబన స్ఫూర్తితో వేగంగా పురోగమిస్తోంది" అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు, ఆత్మనిర్భరత దిశగా భారతదేశం ప్రయాణాన్ని ప్రజలు చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో, విపక్షాలు తమ రాజకీయ విమర్శల కోసం పాకిస్థాన్ పై ఎక్కువగా ఆధారపడుతున్న దురదృష్టకరమైన ధోరణిని కూడా దేశం చూస్తోంది” అని ప్రధాని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 16 గంటల చర్చలో కూడా, విపక్షాలు పాక్ నుంచి సమస్యలను దిగుమతి చేసుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందని, ఇది చాలా విచారకరమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు.

యుద్ధాల స్వరూపం మారిపోతున్న నేపథ్యంలో – అవాస్తవ సమాచారం, కల్పిత కథనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. భారత సైనిక దళాల మనోబలాన్ని దెబ్బతీయడానికి, ప్రజల్లో అవిశ్వాసం కలిగించడానికి కృత్రిమ మేధ ఆధారిత తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని హెచ్చరించారు. ప్రతిపక్షాలు, దాని మిత్రపక్షాలు పాక్ ప్రచారానికి ప్రతినిధులుగా మారి భారత జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశ సైనిక విజయాలను ప్రశ్నించడానికి,  తక్కువ చేయడానికి పదేపదే జరుగుతున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, విజయవంతమైన సర్జికల్ దాడుల తరువాత, ప్రతిపక్ష నాయకులు సాయుధ దళాల నుంచి ఆధారాలు డిమాండ్ చేసిన విషయాన్ని శ్రీ మోదీ గుర్తు చేశారు. అయితే ప్రజల మనోభావాలు సైన్యానికి అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్ష నేతలు గళం మార్చి మూడు నుంచి పదిహేను వరకు భిన్నమైన సంఖ్యలను ఉటంకిస్తూ తాము కూడా సర్జికల్ దాడులు నిర్వహించినట్టు చెప్పుకున్నారని ప్రధాని పేర్కొన్నారు.

బాలాకోట్ విమాన దాడుల అనంతరం, విపక్షాలు ఆ ఆపరేషన్‌ను నేరుగా వ్యతిరేకించలేకపోయినా, ఫోటో ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించాయని ప్రధాన మంత్రి తెలిపారు. దాడి ఎక్కడ జరిగింది? ఏం ధ్వంసమయ్యింది? ఎంతమంది మృతిచెందారు? వంటి ప్రశ్నలను వారు పదే పదే అడిగారని, ఇవన్నీ పాక్ మాటల చాతుర్యాన్ని ప్రతిబింబించాయని ఆయన వ్యాఖ్యానించారు.

భారత వైమానిక దళం పైలట్ అభినందన్ ను పాకిస్థాన్ బంధించినప్పుడు ఆ దేశంలో సంబరాలు జరగడం సహజమే అనీ, అయితే భారత్‌లో కొందరు నిస్సిగ్గుగా అనుమానాలు వ్యక్తపరిచి – ప్రధాన మంత్రి సంకటంలో ఉన్నారని, అభినందన్ తిరిగి రాకపోవచ్చని చర్చ జరిపారని ఆయన అన్నారు. అభినందన్ భారత్ కు తిరిగి రావడం సాహసోపేత సంకల్పంతోనే సాధ్యమైందని, ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విమర్శకులంతా ఒక్కసారిగా మౌనం వహించారని ప్రధాని వ్యాఖ్యానించారు.

పహల్గామ్ దాడి తర్వాత ఒక బీఎస్ఎఫ్ జవానును పాకిస్థాన్ బందీగా తీసుకున్నప్పుడు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తమకు పెద్ద అవకాశం లభించినట్టు కొన్ని వర్గాలు భావించాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. సైనికుని భవితవ్యం, అతడి కుటుంబ పరిస్థితి, అతడు తిరిగి వచ్చే అవకాశం గురించి ఊహాజనిత ప్రశ్నలను లేవనెత్తుతూ సామాజిక మాధ్యమాల్లో అనేక కథనాలను వ్యాప్తి చేశారని విమర్శించారు. అయితే ఈ ప్రచారానికి భారత్ స్పష్టతతో హుందాగా స్పందించిందని, తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రతి సైనికుడిని రక్షించే తన నిబద్ధతను పునరుద్ఘాటించిందని ఆయన స్పష్టం చేశారు.

పహల్గామ్ ఘటన తర్వాత పట్టుబడిన బీఎస్ఎఫ్ జవాను కూడా గౌరవంగా, హుందాగా తిరిగివచ్చారని ప్రధానమంత్రి తెలిపారు. ఇందుకు ఉగ్రవాదులు,  వారిని నడిపించే శక్తులతో పాటు వారిని చూసి భారత్ లోని కొందరు వ్యక్తులు కూడా బాధపడినట్టు కనిపిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సర్జికల్ దాడుల సమయంలో కూడా రాజకీయ లాభాల కోసం కొన్ని ఆటలు ఆడే ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి ప్రజల్లో ఎటువంటి ఆదరణ పొందలేక విఫలమయ్యాయని అన్నారు. వైమానిక దాడుల సమయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి  కానీ అవి కూడా విఫలమయ్యాయని అన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు విమర్శకులు తమ వైఖరిని మార్చుకున్నారని, మొదట ఆపరేషన్ ను అంగీకరించడానికి నిరాకరించారని, ఆ తర్వాత ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారని   వ్యతిరేకించే వారు ఎప్పుడూ అభ్యంతరం చెప్పడానికి ఒక సాకు వెతుక్కుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

సాయుధ దళాల పట్ల ప్రతిపక్షాలు చాలాకాలంగా ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తున్నాయని, ఇటీవల కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కూడా ప్రతిపక్షాలు విజయాన్ని జరుపుకోలేదని, దాని ప్రాముఖ్యతను గుర్తించలేదని ప్రధాని గుర్తు చేశారు. డోక్లాం ప్రతిష్ఠంభన సమయంలో భారత బలగాలు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటే ప్రతిపక్ష నేతలు రహస్యంగా అనుమానాస్పద వర్గాల నుంచి వివరణలు కోరారనడానికీ చరిత్రే సాక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ కు ప్రతిపక్షాలు క్లీన్ చిట్ ఇచ్చినట్లు కనిపించడంపై ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రవాదులు పాక్ జాతీయులని రుజువు చేయాలంటూ ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్ ను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంలో పాకిస్థాన్ కూడా ఇదే డిమాండ్‌ చేయడం గమనార్హమని వ్యాఖ్యానించారు. ఇలాంటి అలవాట్లు, అలాంటి ధైర్యంతో బాహ్య శక్తుల కథనాలను ప్రతిధ్వనించే ప్రవర్తన విపక్షాల్లో ఇప్పటికీ కొనసాగుతోందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈరోజు ప్రజల ముందు స్పష్టమైన సాక్ష్యాలు, వాస్తవాలు ఉన్నాయి.  అయినప్పటికీ, కొందరు వ్యక్తులు ఇంకా అనుమానాలు వ్యక్తపరచడం ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత స్పష్టమైన ఆధారాలు లభించకపోతే ఈ వ్యక్తులు ఇంకా ఎలా స్పందించేవారోనని,  అప్పుడు వారి ప్రతిస్పందనలు మరింత తప్పుదోవ పట్టించేవిగా లేదా బాధ్యతారాహిత్యంగా ఉండేవని ఆయన అన్నారు. 
 
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ఒక కోణంపైనే చర్చలు ఎక్కువగా దృష్టి సారించినప్పటికీ దేశ గౌరవం, బల ప్రదర్శనల ప్రాధాన్యతను తెలిపే క్షణాలు కూడా ఉన్నాయని ప్రధాని అన్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థలను ప్రశంసించిన ఆయన.. ఈ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తృత గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ఇవి పాకిస్థాన్ క్షిపణులను, డ్రోన్‌లను గడ్డిపరకలుగా కూల్చేశాయని అన్నారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మే 9న పాకిస్థాన్ సుమారు వెయ్యి క్షిపణులు, సాయుధ డ్రోన్‌లతో కూడిన పెద్ద దాడికి తెగబడిందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్షిపణులు భారత భూభాగంపై పడి ఉంటే భారీ విధ్వంసాన్ని కలిగించేవని గుర్తు చేశారు. గాలిలోనే వీటన్నింటిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ పేల్చేసిందని తెలిపారు. ఈ విజయం దేశంలోని ప్రతి ఒక్కరిని గర్వంతో నింపుతుందని అన్నారు.


ఆదంపూర్‌ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు తప్పుడు కథనాలను సృష్టించిన పాకిస్థాన్.. వాటిని ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందన్నారు. ఆ మరుసటి రోజే తాను స్వయంగా ఆదంపూర్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలోనే అబద్ధాలను తేటతెల్లం చేశానని తెలిపారు. తప్పుడు నివేదికల వ్యాప్తిలో ఇకమీదట విజయం సాధించలేరనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.

ప్రస్తుత ప్రతిపక్షం దేశాన్ని చాలా కాలం పాటు పరిపాలించిందన్న ఆయన.. ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో వారికి పూర్తిగా తెలుసునని అన్నారు. అనుభవం ఉన్నప్పటికీ అధికారిక ప్రకటనలను అంగీకరించేందుకు వారు ఎల్లప్పుడూ నిరాకరించటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన అయినా, విదేశాంగ మంత్రి పలుమార్లు స్పందించినా..  హోం, రక్షణ మంత్రులు ఇచ్చిన వివరణలు అయినా నమ్మేందుకు ప్రతిపక్షం నిరాకరిస్తోందని మోదీ విమర్శించారు. దశాబ్దాలుగా పాలించిన పార్టీకి దేశంలోని అధికారిక వ్యవస్థల విషయంలో ఇంత అపనమ్మకాన్ని ఎలా చూపించగలదని ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు అనుగుణంగా మారుతోన్న వైఖరిని చూస్తుంటే ప్రతిపక్షం ఇప్పుడు ఆ దేశ రిమోట్ కంట్రోల్‌లో పనిచేస్తోందని ఎద్దేవా చేశారు.

తాము చెప్పదలచుకున్న వాటిని లిఖిత పూర్వకంగా యువనేతలకు ఇచ్చి, వారితో మాట్లాడించారని ప్రతిపక్షనేతను విమర్శించారు. అలాంటి నాయకులకు మాట్లాడే ధైర్యం లేదని అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న క్రూరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను "దృష్టిని మారల్చే ఒక చర్య”గా అభివర్ణించిన అలాంటి నాయకత్వాన్ని ఖండించారు. ఇది.. ఒక భయానక ఘటన‌కు సంబంధించిన చేదు జ్ఞాపకాల గాయాన్ని పెద్దది చేయటమే అవుతుందని, దీనినొక సిగ్గుచేటు చర్యగా అని అభివర్ణించారు.

పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులను మొన్న భద్రతా దళాలు మట్టుబెట్టాయని తెలిపిన మోదీ.. ఆపరేషన్ చేపట్టిన రోజు గురించి నవ్వు, ఎగతాళితో కూడిన ప్రశ్నలను లేవనెత్తటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని కోసం శ్రావణ మాసంలో పవిత్ర సోమవారం కావాలా! అని వ్యంగ్యంగా బదులిచ్చారు. ఈ వైఖరిని తీవ్ర నిరాశకు ప్రతిబింబంగా వర్ణించిన ఆయన.. ప్రతిపక్షాల దిగజారుడు పరిస్థితిని ఇది తెలియజేస్తోందని అన్నారు.

ఆయుధాలతో దేశం రక్షణలో ఉన్నప్పుడు జ్ఞాన అన్వేషణ, తాత్విక భావనలు వృద్ధి చెందుతాయన్న పురాతన గ్రంథాల్లోని భావనను ప్రధాని ప్రస్తావించారు. “సరిహద్దులో బలమైన సైన్యం ఉంటే ప్రజాస్వామ్యం శక్తిమంతంగా, సురక్షితంగా ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.

“గత దశాబ్దంలో సైన్యం సాధించిన సాధికారతకు ఆపరేషన్ సిందూర్ ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది” అని ఉద్ఘాటించారు. ఈ సామర్థ్యం ఆకస్మికంగా వచ్చింది కాదని, ఇది నిరంతరం దృష్టి సారించి చేసిన కృషి ఫలితమని అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పటి పరిస్థితికి.. ఇది పూర్తి వ్యతిరేకంగా ఉందని.. వారి హయాంలో రక్షణ రంగంలో స్వావలంబన అనే విషయాన్ని పరిగణించలేదని విమర్శించారు. నేటికీ గాంధీ ఆలోచనలతో ముడిపడి ఉన్న "స్వావలంబన" అనే భావనను కూడా వారు అపహాస్యం చేస్తున్నారని అన్నారు.

ప్రతిపక్ష పార్టీల పాలనలో ప్రతి రక్షణ ఒప్పందం వ్యక్తిగత లాభం కోసం ఉన్న ఒక అవకాశంగా మారిందని పేర్కొన్న ఆయన.. చిన్న పరికరాల కోసం కూడా విదేశాలపై ఆధాపడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రాత్రి సమయంలో చూసేందుకు ఉపయోగించే కెమెరాలు లేకపోవడం వంటి లోపాలను ఈ సందర్భంగా ఎత్తిచూపారు. జీపులు మొదలుకొని బోఫోర్స్, హెలికాప్టర్ల వరకు రక్షణకు సంబంధించిన ప్రతి కొనుగోలు చుట్టు కుంభకోణాలు ఉండేవని విమర్శించారు. ఆధునిక ఆయుధాల కోసం భారత రక్షణ దళాలు దశాబ్దాలుగా వేచి ఉండాల్సి వచ్చిందని ప్రధానంగా పేర్కొన్నారు. చరిత్ర చూసుకుంటే రక్షణ తయారీలో భారత్‌ అగ్రగామిగా ఉందన్న విషయాన్ని సభకు తెలియజేశారు. కత్తులతో యుద్దాలు చేసే కాలంలో కూడా భారత ఆయుధాలను ఉన్నతమైనవిగా పరిగణించేవారని తెలిపారు. బలంగా ఉన్న భారత రక్షణ రంగ తయారీ వ్యవస్థను స్వాతంత్ర్యం అనంతరం ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచి, ఒక క్రమపద్ధతిలో నాశనం చేశారన్నారు.

పరిశోధన, తయారీకి ఉన్న మార్గాలు సంవత్సరాలుగా మూసేసి ఉన్నాయని, అదే విధానాలు కొనసాగి ఉంటే ప్రస్తుత 21వ శతాబ్దంలో ఆపరేషన్‌ సిందూర్‌ను భారత్ కనీసం ఊహించలేకపోయేదని అన్నారు. ఆ పరిస్థితులే ఉంటే ఆయుధాలు, యుద్ధ పరికరాలు, మందుగుండు సామగ్రిని సకాలంలో పొందటంలో భారత్ ఇబ్బంది పడేదని.. సైనిక చర్య జరుగుతున్నప్పుడు కూడా అంతరాయాలు ఏర్పడుతాయన్న భయం వెంటాడేదని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా భారత్‌లో తయారీ కార్యక్రమం కింద తయారైన ఆయుధాలు ఆపరేషన్ సిందూర్ విజయం సాధించటంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయని ప్రధానంగా చెప్పారు.

బలమైన, స్వావలంబన, ఆధునిక దేశాన్ని నిర్మించాలనే నిర్ణయం దశాబ్దం కిందట భారతీయులు తీసుకున్నారని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా రక్షణకు సంబంధించి వరుస సంస్కరణలకు అదే ప్రేరణగా నిలిచిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం ఒక ప్రధాన సంస్కరణ అని అన్నారు. ఎంతో కాలంగా దీనిపై చర్చ కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్నప్పటికీ.. భారత్‌లో ఈ నియామకం చేపట్టలేదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను త్రివిధ దళాలు హృదయపూర్వకంగా అంగీకరించడాన్ని ఆయన ప్రశంసించారు.

తివిధ దళాలు కలిసి పనిచేయటం, వాటి ఏకీకరణలో గొప్ప సామర్థ్యం ఉందని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. అన్ని స్థాయిలలో నౌకాదళం, వైమానిక దళం, సైన్యం ఏకీకరణ కావటం అనేది దేశ రక్షణ సామర్థ్యాన్ని రెట్టింపు చేసిందని అన్నారు. ఈ మార్పు ఫలితాన్ని ఆపరేషన్ సిందూర్ విజయం తెలియజేస్తోందని పేర్కొన్నారు.

ప్రారంభంలో సమ్మెలు, ఆందోళనలు వంటి ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ రక్షణ రంగ తయారీకి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి తెలిపారు. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, సంస్కరణలను అంగీకరించటం, అధిక ఉత్పాదకతను సాధించటం పట్ల ఆయా సంస్థల సిబ్బంది, కార్మికులను ప్రశంసించారు. రక్షణ రంగ ద్వారాలను ప్రైవేట్ కంపెనీల కోసం భారత్ ‍‌‌తెరిచిందని.. నేడు ప్రైవేట్ రంగం గణనీయమైన పురోగతిని సాధిస్తోందని ప్రధానంగా పేర్కొన్నారు. రక్షణ రంగంలో వందలాది అంకురాలు ఆవిష్కరణలకు గణనీయంగా దోహదపడుతున్నాయని అన్నారు. వీటిలో చాలా వరకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 27-30 సంవత్సరాల వయస్సు గల యువతీయువకుల నేతృత్వంలో అంకురాలేనని తెలిపారు.

డ్రోన్‌లకు సంబంధించిన కార్యకలాపాలు కూడా ప్రధానంగా 30-35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులే నిర్వహిస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్‌లో వారి సహయ సహకారాలు కీలక పాత్ర పోషించాయని ప్రధాని పేర్కొన్నారు. వారందరిని ప్రశంసిస్తున్నట్లు తెలిపిన ఆయన.. దేశం పురోగమిస్తూనే ఉంటుందని వారందరికీ హామీ ఇస్తున్నట్లు తెలియజేశారు.

రక్షణ రంగంలో 'భారత్‌లో తయారీ’ అనేది కేవలం నినాదం కాదని చెబుతూ.. స్పష్టమైన ముందూచూపుతో బడ్జెట్ పెంపు, విధాన మార్పులు, కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు అన్నారు. ఇవి స్వదేశీ రక్షణ తయారీ రంగం వేగంవంతమైన వృద్ధి సాధించేలా చేశాయని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశ రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు, రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 250 శాతం పెరిగినట్లు తెలియజేశారు. గత 11 సంవత్సరాలలో రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగి.. ఇప్పుడు దాదాపు 100 దేశాలకు చేరుతున్నాయని చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ భారతదేశానికి ప్రపంచ రక్షణ మార్కెట్‌లో బలమైన స్థానాన్ని ఇచ్చిందని పేర్కొన్న మోదీ..  కొన్ని కీలక ఘట్టాలు చరిత్రపై శాశ్వత ప్రభావాన్ని చూపెడతాయని అన్నారు. భారతీయ ఆయుధాలకు పెరుగుతోన్న డిమాండ్..దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తుందని, ఎంఎస్‌ఎంఈలను శక్తిమంతం చేస్తుందని, యువతకు ఉపాధి అందిస్తుందని పేర్కొన్నారు. భారత యువతీయువకులు ఆవిష్కరణల ద్వారా భారతదేశ సమర్థతను చూపిస్తున్నారని తెలిపారు.

రక్షణ రంగ స్వావలంబన అనేది జాతీయ ప్రయోజనాల కోసమే కాకుండా నేటి పోటీ యుగంలో ప్రపంచ శాంతికి కూడా అవసరమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. “భారతదేశం బుద్ధ భూమి... యుద్ధ భూమి కాదు. దేశం శ్రేయస్సు, శాంతిని కోరుకుంటున్నప్పటికీ.. రెండింటికీ బలం, సంకల్పం అవసరం” అని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని గొప్ప యోధుల భూమిగా వర్ణించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాజా రంజిత్ సింగ్, రాజేంద్ర చోళ, మహారాణా ప్రతాప్, లచిత్ బోర్ఫుకన్, మహారాజా సుహెల్దేవ్ లాంటి ప్రముఖులను ప్రస్తావించారు. అభివృద్ది, శాంతికి వ్యూహాత్మక బలం చాలా ముఖ్యమని ప్రధానంగా పేర్కొన్నారు.

ప్రతిపక్షాలకు జాతీయ భద్రత పట్ల స్పష్టమైన దృక్పథం ఎప్పుడూ లేదని, ఈ విషయంలో వారు రాజీ పడుతూనే ఉన్నారని మోదీ ప్రధానంగా అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారు.. పాకిస్థాన్‌ను వారికి ఎవరు అప్పగించారో ముందు సమాధానం చెప్పాలన్నారు.

స్వాతంత్ర్యానంతర తీసుకున్న నిర్ణయాలు దేశంపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. కీలకమైన సమయాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు.. అక్సాయ్ చిన్‌లోని 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కోల్పోవటానికి దారి తీసిందని అన్నారు. దీనిని బంజరు భూమిగా తప్పుడు ముద్ర వేశారని అన్నారు. 1962, 1963 మధ్య అధికారంలో ఉన్న పార్టీ నాయకులు జమ్మూ, కాశ్మీర్‌లోని పూంచ్, యురి, నీలం లోయ, కిషన్‌గంగాతో సహా కీలక ప్రాంతాలను అప్పగించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.

 
ఇదంతా శాంతి పేరుతో జరిగిందని ప్రధానమంత్రి అన్నారు. 1966లో రణ్ ఆఫ్ కచ్ఛ్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి ఒప్పుకొన్నందుకు కూడా ప్రతిపక్షాన్ని ఆయన విమర్శిస్తూ, దీంతో వివాదాస్పద ఛద్ బెట్ ప్రాంతం సహా దాదాపు 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్థాన్‌కు అప్పగించవలసి వచ్చిందన్నారు. భారతీయ దళాలు 1965 యుద్ధంలో హాజీపీర్ కొండదారిని తిరిగి తమ అధీనంలోకి తీసుకొన్నప్పటికీ, అప్పటి పాలక పక్షం దానిని వెనక్కిచ్చి, దేశం సాధించిన వ్యూహాత్మక విజయాన్ని బలహీనపరచిందని ఆయన గుర్తు చేశారు.
మన దేశం 1971 యుద్ధ కాలంలో, పాకిస్థాన్‌లోని వేలాది చ.కి.మీ. భూభాగాన్ని భారత్ వశం చేసుకొని, 93,000 మందిని యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అనుకూల స్థితులు ఉన్నప్పటికీ కూడా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను తిరిగి అధీనంలోకి తీసుకొనే అవకాశాన్ని చేజార్చుకొన్నామని ఆయన అన్నారు. సరిహద్దుకు దగ్గరగా ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్‌ను కూడా సాధించలేదన్నారు. 1974లో కచ్చతీవు దీవిని శ్రీలంకకు బహుమతిగా ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ బదలాయింపు వల్ల తమిళనాడుకు చెందిన మత్స్యకారులు ప్రస్తుతం కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు.
దేశ భద్రతపై రాజీకి తావిస్తూ, సియాచిన్ నుంచి భారతీయ బలగాలను ఉపసంహరించాలనే అభిమతాన్ని ప్రతిపక్షం దశాబ్దాల నుంచీ వ్యక్తం చేస్తూ వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు.
ముంబయిలో భయానక 26/11 దాడులు చోటుచేసుకొంటే, అప్పటి ప్రభుత్వం ఈ విషాద ఘటన తరువాత కొన్ని వారాలకే మళ్లీ చర్చలను మొదలుపెట్టడానికి మొగ్గు చూపిందని, దీని వెనుక విదేశీ ఒత్తిడి ఉందన్న ప్రచారం జరిగిందని ప్రధానమంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు. 26/11 నాటి భారీ దాడి నేపథ్యంలోనూ, అప్పటి ప్రభుత్వం ఒక్క పాకిస్థానీ దౌత్యవేత్తను బహిష్కరించడమో, లేదా కనీసం ఒక్క వీసానైనా రద్దు చేయడమో.. వీటిలో ఏదీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రోద్బలంతో ఉగ్ర దాడులు ఎంతమాత్రం తగ్గకుండా కొనసాగాయని, అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ హయాంలో పాకిస్థాన్ ‘‘అత్యంత సానుకూల దేశం’’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్.. ఎంఎఫ్ఎన్) హోదాను నిలబెట్టుకొందని, దీనిని ఎన్నడూ ఉపసంహరించలేదని ప్రధానమంత్రి తెలిపారు.
ముంబయి దాడులకు న్యాయం జరగాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తుంటే, ఆనాటి అధికార పక్షం పాకిస్థాన్‌తో వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించిందని శ్రీ మోదీ అన్నారు. విధ్వంసానికి పాల్పడండి అంటూ ఉగ్రవాదులను పాక్ పంపిస్తుంటే, అప్పటి ప్రభుత్వం భారత్‌లో ప్రశాంతంగా కవి సమ్మేళనాలు నిర్వహించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
ఉగ్రవాదం తాలూకు ‘వన్-సైడ్ ట్రాఫిక్‌’ను తన ప్రభుత్వం ఆపేసిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పాకిస్థానుకు ఉన్న ఎంఎఫ్ఎన్ హోదాను రద్దు చేయడం, వీసాలను నిలిపివేయడంతో పాటు అటారీ-వాగా సరిహద్దును మూసివేయడం ద్వారా ప్రతికూల ఫలితాలను ఇచ్చే చర్యలకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. భారతదేశ ప్రయోజనాలను పదేపదే తాకట్టు పెడుతున్నందుకు కూడా ప్రతిపక్షాన్ని ఆయన విమర్శించారు. ఈ సందర్భంలో ఇండస్ నీటి ఒప్పందమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. భారతదేశంలో పుట్టి, భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో భాగమైన నదులకు సంబంధించిన ఒప్పందాన్ని అప్పటి ప్రధానమంత్రి అమలు చేశారన్నారు.
సింధు, ఝీలం.. ఇవి ఒకప్పుడు భారత్ గుర్తింపునకు ప్రతీకలు.  భారత్ సొంత నదులు, నీళ్లు అయినప్పటికీ, ఈ  నదులను మధ్యవర్తిత్వం కోసం ప్రపంచ బ్యాంకుకు అప్పగించారని శ్రీ మోదీ అన్నారు. ఈ చర్య భారత ఆత్మగౌరవానికి, సాంస్కృతిక మర్యాదకు చేసిన నమ్మకద్రోహం అంటూ ఆయన తప్పుపట్టారు.

చరిత్రలో తీసుకున్న దౌత్య నిర్ణయాలు భారత నీటి హక్కులూ, అభివృద్ధి విషయంలో- ముఖ్యంగా ఇండస్ జలాల ఒప్పంద నిర్ణయాలను ప్రధానమంత్రి ఖండించారు. భారత్‌లో పుట్టిన నదుల్లో నుంచి 80 శాతం నీటిని పాకిస్థానుకు కేటాయించడానికి అప్పటి ప్రధానమంత్రి అంగీకరించారనీ, సువిశాల భారత దేశానికి 20 శాతం మాత్రమే మిగిల్చారని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ నిర్ణయంలో ఏపాటి విచక్షణ ఉందంటూ ప్రశ్నిస్తూ... తెలివిడి, దౌత్య వివేచన, దేశ హితం లోపించాయన్నారు.
భారత్‌లో పుట్టి పారే నదులు మన పౌరులకే.. మరీ ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రైతులకే చెందుతాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. నదీ జలాల పంపకంపై అప్పటి పాలక పక్షం కుదుర్చుకున్న ఒప్పందం దేశంలో చాలా విశాల ప్రాంతాన్ని నీటి ఎద్దడికి గురి చేయడంతోపాటు అంతర్రాష్ట్ర జల వివాదాలూ తలెత్తాయి. దీని నుంచి పాకిస్థాన్ లాభపడింది.
నదులతో భారత్‌కు సాంస్కృతికంగానూ, నాగరికత పరంగానూ ఉన్న అనుబంధాన్ని పట్టించుకోలేదని, దీంతో ఎక్కువగా నష్టపోయింది భారతీయ రైతులేనని, వారికి న్యాయంగా దక్కాల్సింది వారికి దక్కలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ఈ పరిస్థితే తలెత్తకపోయి ఉంటే, పశ్చిమప్రాంతాల నదుల్లో అనేక ప్రధాన నీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు అవకాశం లభించేదని ఆయన వివరించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లతో  పాటు ఢిల్లీ రైతులు సరిపడ నీళ్లను అందుకొని ఉండేవాళ్లనీ, తాగునీటి ఎద్దడి ఎదురయ్యేది కాదని ఆయన అన్నారు. దీనికి తోడు, భారత్  పరిశ్రమలను ఏర్పాటు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేసి ఉండేదన్నారు.
అప్పటి ప్రభుత్వం పాకిస్థానుకు కాల్వల నిర్మాణానికి కోట్లాది రూపాయలను కూడా సమకూర్చిందని, ఇది భారత్ హితం కోణంలో చూస్తే ఎంతమాత్రం తగదని ప్రధానమంత్రి అన్నారు. తమ ప్రభుత్వం దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇండస్ నీటి ఒడంబడిక అమలును ఆపేసిందని శ్రీ మోదీ చెప్పారు. ‘‘రక్తమూ, నీళ్లూ కలసి ప్రవహించవు అని భారత్ చెప్పింది’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
2014కు పూర్వం..దేశం అభద్రతలో ఉందని శ్రీ  మోదీ అన్నారు. ‘‘ఎవరూ పట్టించుకోకుండా వదలివేసిన వస్తువులా.. అవి బాంబులు కావచ్చు, వాటి జోలికి ఎవరూ పోవద్దు’’ అంటూ .. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండులు, విమానాశ్రయాలు, ఆలయాలు ఇతర బహిరంగ స్థలాల దగ్గర తరచుగా ప్రకటనలు వినిపించారని ఆయన గుర్తుచేశారు. ఆ కాలంలో దేశమంతటా భయంతో నిండిన వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ఆనాటి పాలక పక్షం నేతృత్వంలోని ప్రభుత్వ బలహీనత వల్ల ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోయరన్నారు. పౌరులను కాపాడటంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆయన స్పష్టం  చేశారు.  ఉగ్రవాదాన్ని అరికట్టి ఉండవచ్చు.. గత 11 సంవత్సరాల్లో నమోదైన ప్రగతే దీనికి ఒక ఉదాహరణ అని ఆయన చెబుతూ, 2004 నుంచి 2014 మధ్య కాలంలో దేశాన్ని పీడించిన ఉగ్రవాద ఘటనలు భారీగా తగ్గిపోయాయని వివరించారు.
ఉగ్రవాదాన్ని అదుపుచేయడం సాధ్యమే అనుకొన్నప్పుడు అందుకు తగిన చర్యలను మునుపటి పాలన యంత్రాంగాలు ఎందుకు తీసుకోలేదని ప్రధానమంత్రి ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వాలు కొన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచే రాజకీయాలు నడుపుతూ, ఓట్ బ్యాంకును కాపాడుకొనే వైఖరిని అవలంబిస్తూ ఉగ్రవాదం శాఖోపశాఖలుగా విస్తరించడానికి అవకాశాన్ని అందించాయని ఆయన ఆరోపించారు.
2001లో దేశ పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు.. ఓ సీనియర్ ప్రతిపక్ష నేత అప్జల్ గురును వెనకేసుకొస్తూ, అతడి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడారని శ్రీ మోదీ గుర్తుచేశారు. 26/11 ముంబయి దాడుల వేళ... ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పట్టుకొన్నప్పుడు, అతడి పాకిస్థానీ జాతీయత గురించి ప్రపంచం మొత్తానికీ తెలిసినా ఆ దాడి ఘటనను ‘‘కాషాయ బీభత్సం’’గా చిత్రించే యత్నాలు ఎలా జరిగిందీ ఆయన వివరించారు.
ఆ కాలపు అధికార పక్షానికి చెందిన నాయకుడు ఒకరు లష్కరే తయ్యబా కంటే పెనుముప్పుగా మారింది హిందూ గ్రూపులే అని అమెరికాకు చెందిన ఒక ప్రముఖ దౌత్యవేత్తతో అన్నారని ప్రధానమంత్రి ఉదాహరించారు. వారు విదేశాల్లో చేసే ప్రచారానికి ఇదొక ఉదాహరణ అని ఆయన అన్నారు.
భారత రాజ్యాంగాన్ని జమ్మూకాశ్మీర్‌లో పూర్తి స్థాయిలో అమలుపరచకుండా అడ్డుపడినందుకు ప్రతిపక్షాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ భద్రత విషయంలో ఎప్పటికప్పుడు రాజీ పడుతూ, కొన్ని వర్గాలను సంతోషపెట్టే రాజకీయాలను నడుపుతున్నందు వల్ల.. బాబా  సాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆ ప్రాంతంలో అమలు కాలేదని ప్రధానమంత్రి తెలిపారు.
ఒక్కతాటి మీద నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, దేశ హితం కోరేటప్పుడు ఐక్యత అనే పరమార్థాన్ని విడచిపెట్టరాదని ఆయన అన్నారు.  పహల్గామ్ విషాద ఘటనను గురించి ప్రస్తావిస్తూ, అది  దేశ ప్రజలను ఎంతగా కలచి వేసిందీ ప్రధానంగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించిందనీ, ఈ ఆపరేషన్‌‌లో ధైర్య సాహసాలు, స్వయంసమృద్ధి, జాతీయ దృఢసంకల్పం కలబోసుకున్నాయని ప్రధానమంత్రి అభివర్ణించారు.
భారతీయ ప్రతినిధి వర్గాలు వివిధ దేశాలకు వెళ్లి చిత్తశుద్ధితోను, స్పష్టంగాను వాదనను వినిపించాయని ఆయన ప్రశంసించారు. వారి వాదనలో ‘సిందూర్ స్ఫూర్తి ’ మారుమోగిందని, ఈ స్ఫూర్తే దేశం లోపలా దేశం బయటా కూడా భారత్ అనుసరిస్తున్న వైఖరికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన సూటి సందేశాన్ని వ్యతిరేకించే రీతిలో కొందరు ప్రతిపక్ష నేతలు ప్రతిస్పందించారని ఆరోపణలు రావడం పట్ల ప్రధానమంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశానికి అనుకూలంగా సభలో మాట్లాడిన వారిని మౌనంగా ఉంచే ప్రయత్నాలు సాగాయంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మనస్తత్వాన్ని గురించి ఆయన చెప్తూ ధైర్యంగా, ప్రయోజనకరంగా మాట్లాడడం మేలు అని బోధించిన ఒక కవితా పంక్తిని  సభ్యులతో పంచుకున్నారు.
పాకిస్థాన్ పట్ల దయ చూపడానికి దారితీసిన రాజకీయ ఒత్తిడులను విడనాడాల్సిందిగా ప్రతిపక్షానికి శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు. దేశం విజయాన్ని సాధించిన సందర్భాలను రాజకీయంగా ఎగతాళి చేసే సందర్భాలుగా మార్చవద్దని ఆయన హెచ్చరించారు.
ఉగ్రవాదాన్ని వేళ్ళతో సహా భారత్ పెకలించివేస్తుందని ప్రధానమంత్రి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని, ఇది పాకిస్థానుకు స్పష్టమైన హెచ్చరికగా ఉంటుందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపనంత కాలం భారత్ తన ప్రతిస్పందన పూర్వక చర్యలను చేపడుతూనే ఉంటుందని అని ఆయన స్పష్టం చేశారు.
భారత భవిష్యత్తు సురక్షితంగా, సమృద్ధంగా ఉంటుందన్న దృఢసంకల్పాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రజల మనోభావాలకు తగినవిధంగా అర్థవంతమైన చర్చను చేపట్టినందుకు సభకు ఆయన మనస్ఫూర్తిగా కృత‌జ్ఞత‌లు తెలిపారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's passenger vehicle sales expected to grow 4-6% in FY27: Report

Media Coverage

India's passenger vehicle sales expected to grow 4-6% in FY27: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends birthday greetings to President of India, Smt. Droupadi Murmu
June 20, 2026

The Prime Minister, Shri Narendra Modi has extended warm birthday greetings to the President of India, Smt. Droupadi Murmu.

The Prime Minister said that her journey, marked by courage, simplicity, humility and unwavering commitment to public service, continues to inspire people across the country.

Shri Modi noted that through her many years in public life, the President has served the nation in an outstanding manner and has been especially passionate about the wellbeing of the underprivileged and marginalised.

The Prime Minister stated that her steadfast dedication to India’s development is very motivating.

Shri Modi prayed for her long and healthy life in the service of the nation and said that he looks forward to meeting her later in the day at a programme in Odisha.

The Prime Minister wrote on X;

“Warm birthday greetings to the President of India, Smt. Droupadi Murmu Ji. Her journey, marked by courage, simplicity, humility and unwavering commitment to public service, continues to inspire people across the country.

Through her many years in public life, she has served the nation in an outstanding manner, especially passionate about the wellbeing of the underprivileged and marginalised. Her steadfast dedication to India’s development is very motivating.

May she be blessed with a long and healthy life in the service of the nation. I look forward to meeting her later today at the programme in Odisha.

@rashtrapatibhvn”