గౌరవ ప్రధాన మంత్రి మిత్సోటకిస్, రెండు దేశాల ప్రతినిధులు, మీడియా మిత్రులారా…


నమస్కారం!

 

ప్రధాన మంత్రి మిత్సోటకిస్ కు , ఆయన ప్రతినిధి బృందానికి భారత్ కు స్వాగతం పలకడం  నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత ఏడాది గ్రీస్ లో నేను జరిపిన పర్యటన తరువాత ఆయన భారత పర్యటన కు రావడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటానికి సంకేతం. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత, పదహారేళ్ల తర్వాత గ్రీస్ ప్రధాని భారత్ కు రావడం చారిత్రాత్మక ఘట్టం.

మిత్రులారా,

ఈ రోజు  మేము జరిపిన చర్చలు చాలా ముఖ్యమైనవి , ఉపయోగకరమైనవి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యం దిశగా మన రెండు దేశాలు వేగంగా అడుగులు వేయడం సంతోషకరం. మన సహకారానికి కొత్త శక్తిని, దిశను ఇవ్వడానికి మేము అనేక కొత్త అవకాశాలను గుర్తించాము. వ్యవసాయ రంగంలో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారానికి అనేక అవకాశాలున్నాయి. గత ఏడాది ఈ రంగం లో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడానికి ఇరు పక్షాలు చర్యలు తీసుకోవడం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఫార్మా, మెడికల్ డివైజెస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్ మెంట్, స్పేస్ వంటి అనేక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని మేము దృఢంగా నిర్ణయించాం.

 

ఇరు దేశాల స్టార్టప్ లను అనుసంధానం చేయడంపై కూడా మేము చర్చించాము. షిప్పింగ్, కనెక్టివిటీ రెండు దేశాలకు అత్యంత ప్రాధాన్యాంశాలు. ఈ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చించాం.


మిత్రులారా,

రక్షణ, భద్రతలో పెరుగుతున్న సహకారం మన లోతైన పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రంగంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుతో రక్షణ, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర భద్రత వంటి ఉమ్మడి సవాళ్లపై పరస్పర సమన్వయాన్ని పెంపొందించుకోగలుగుతాం. భారత్ లో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ లో కో-ప్రొడక్షన్, కో-డెవలప్ మెంట్ కు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇరు దేశాల రక్షణ పరిశ్రమలను అనుసంధానం చేయడానికి అంగీకరించాం. ఉగ్రవాదంపై పోరులో భారత్, గ్రీస్ దేశాలకు ఉమ్మడి ఆందోళనలు, ప్రాధాన్యాలు ఉన్నాయి. ఈ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వివరంగా చర్చించాం.

మిత్రులారా,

రెండు పురాతన , గొప్ప నాగరికతలుగా, ఇండియా , గ్రీస్ దేశాలు లోతైన సాంస్కృతిక ,  ప్రజల మధ్య సంబంధాల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి. దాదాపు రెండున్నర వేల సంవత్సరాలుగా ఇరు దేశాల ప్రజలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలతో పాటు ఆలోచనలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

 

ఈ సంబంధాలకు ఆధునిక రూపం ఇవ్వడానికి ఈ రోజు మేము అనేక కొత్త కార్యక్రమాలను గుర్తించాము. ఇరు దేశాల మధ్య మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించడంపై చర్చించాం. ఇది ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

ఇరు దేశాల ఉన్నత విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం పై కూడా మేము దృష్టి పెట్టాం. వచ్చే ఏడాది భారత్- గ్రీస్ మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించాం. దీని ద్వారా శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, క్రీడలు, ఇతర రంగాల్లో ఇరు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని, సాధించిన విజయాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించగలం.

 

మిత్రులారా,

నేటి సమావేశంలో పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించాం. అన్ని వివాదాలు, ఉద్రిక్తతలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చాము. ఇండో-పసిఫిక్ లో గ్రీస్ క్రియాశీలక భాగస్వామ్యాన్ని, సానుకూల పాత్రను మేం స్వాగతిస్తున్నాం. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్ లో చేరాలని గ్రీస్ నిర్ణయించడం సంతోషించదగ్గ విషయం. తూర్పు మధ్యధరా ప్రాంతంలో సహకారానికి కూడా ఒప్పందం కుదిరింది. జీ-20 సదస్సు సందర్భంగా ప్రారంభించిన ఈ ఐఎంఇసి కారిడార్ దీర్ఘకాలంలో మానవాళి అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది.

ఈ చొరవలో గ్రీస్ కూడా ఒక ముఖ్యమైన భాగస్వామి కాగలదు. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలను సమకాలీకరించేందుకు వీలుగా వాటిని సంస్కరించడానికి మేం అంగీకరిస్తున్నాం. ప్రపంచ శాంతి, సుస్థిరతకు దోహదపడే ప్రయత్నాలను భారత్, గ్రీస్ కొనసాగిస్తాయి.

గౌరవనీయా

ఈరోజు సాయంత్రం రైసీనా డైలాగ్ లో మీరు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అక్కడ మీ ప్రసంగం చవినడానికి మేమంతా ఆసక్తిగా ఉన్నాము. మీ భారత పర్యటనకు ,  మన ఫలవంతమైన చర్చలకు నేను మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
As Naxalism ends in Chhattisgarh, village gets tap water for first time

Media Coverage

As Naxalism ends in Chhattisgarh, village gets tap water for first time
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 ఏప్రిల్ 2026
April 13, 2026

Nari Shakti, 7% Growth & Global Respect: PM Modi Leadership Formula India is Celebrating