మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.

1957లో దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుంచి మలేషియా, భారతదేశం పరస్పర గౌరవం- ఉమ్మడి విలువలపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని నిర్మించుకున్నాయి. ఈ బంధం ఆగస్టు 2024లో 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' (సీఎస్‌పీ) స్థాయికి చేరింది.

ఈ పర్యటనలో భాగంగా పుత్రజయలోని పెర్దానా పుత్రా కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అధికారిక స్వాగత వేడుక నిర్వహించారు. అనంతరం 2026 ఫిబ్రవరి 8న ఇరు దేశాల నేతలు అధికారిక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి సీఎస్‌పీని పునరుద్ఘాటించారు. రాజకీయ సంబంధాలు, రక్షణ- భద్రతా సహకారం, సముద్రయాన సహకారం, వాణిజ్యం- పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతికత, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం, యువజన మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలతో కూడిన పూర్తి ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఇరు ప్రధానమంత్రులు అత్యంత సానుకూల వాతావరణంలో విస్తృతమైన చర్చలు జరిపారు. ప్రధాని మోదీ గౌరవార్థం ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక విందును కూడా ఏర్పాటు చేశారు. ఇరు దేశాల మధ్య సంస్థాగత సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేసుకున్న పలు ద్వైపాక్షిక దస్త్రాల మార్పిడికి కూడా వారు సాక్ష్యంగా నిలిచారు. 

ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక బంధాలు, వేల సంవత్సరాల నాటి సంబంధాలు, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు, మలేషియాలో ఉన్న శక్తిమంతమైన భారతీయ సమాజం ఈ ద్వైపాక్షిక బంధానికి ఒక విశిష్టమైన, బలమైన, శాశ్వతమైన పునాదిని నిర్మించాయని… ఈ బహుముఖ సంబంధాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాయని ఇరు దేశాల నాయకులు పునరుద్ఘాటించారు.

రాజకీయ సహకారం

ఉన్నత స్థాయి పర్యటనలతో సహా క్రమం తప్పకుండా జరిగే చర్చలు, పరస్పర మార్పిడి కార్యక్రమాలు ద్వైపాక్షిక సహకారంలోని వివిధ రంగాలలో పరస్పర అవగాహన, సమన్వయాన్ని బలోపేతం చేశాయని ఇరు దేశాల నాయకులు అన్నారు. పరస్పర ఆసక్తి ఉన్న ద్వైపాక్షిక, బహుపాక్షిక అంశాలపై నిరంతరం సంబంధాలను కొనసాగించటానికి ఉన్న ప్రాముఖ్యతను వారు పునరుద్ఘాటించారు. మలేషియా-భారత సంబంధాలకు ఈ విషయంలో 'ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్' (ఎఫ్ఓసీ), 'జాయింట్ కమిషన్ మీటింగ్స్' (జేసీఎం) కీలక వేదికలుగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల తమకున్న ఉమ్మడి నిబద్ధత నుంచి ప్రేరణ పొందుతూ ఇరు దేశాల నాయకులు పార్లమెంటరీ సహకారం, మార్పిడిని పెంపొందించుకోవాలని అన్నారు. ఇటువంటి సంబంధాలు సంస్థాగత బంధాలను బలోపేతం చేయడమే కాకుండా పరస్పర అవగాహనను పెంపొందించాయని వారు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2025లో '46వ ఆసియాన్ ఇంటర్-పార్లమెంటరీ అసెంబ్లీ' (ఏఐపీఏ) జనరల్ అసెంబ్లీ కోసం భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం మలేషియాను సందర్శించడం, 2025 మే 31 నుంచి జూన్ 03 వరకు భారత 'అఖిల పక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం' మలేషియా పర్యటనతో పాటు 2026 జనవరి 13-16 తేదీలలో భారత్‌లో జరిగిన '28వ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ది కామన్వెల్త్'కు (సీఎస్‌పీఓసీ) మలేషియా ప్రతినిధుల సభ స్పీకర్ తాన్ శ్రీ దాతో డాక్టర్ జోహారీ అబ్దుల్ హాజరైనందుకు వారు సంతృప్తి వ్యక్తం చేశారు. 

వాణిజ్యంపెట్టుబడి భాగస్వామ్యం

భారతదేశాన్ని ఒక కీలకమైన ప్రపంచ ఆర్థిక భాగస్వామిగా గుర్తిస్తూ ద్వైపాక్షిక వాణిజ్యంలో కనిపిస్తున్న వృద్ధిని మలేషియా అభినందించింది. ఈ భాగస్వామ్యం పరస్పర విలువలతో కూడుకున్నదని.. వ్యూహాత్మక సమన్వయానికి నిదర్శనమని ఇరు దేశాల నాయకులు ఉద్ఘాటించారు. సమతుల్య సహకార స్ఫూర్తితో వాణిజ్య సదుపాయాలను మెరుగుపరచడానికి.. సెమీకండక్టర్లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక సహకారంతో సహా విస్తృత రంగాల్లో రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను అన్వేషించడానికి, వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.

మలేషియా-భారత్ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (ఎంఐసీఈసీఏ), ఆసియాన్-భారత్ వస్తువుల వాణిజ్య ఒప్పందాలకు (ఏఐటీఐజీఏ) ఉన్న ప్రాముఖ్యతను నాయకులు ప్రధానంగా చెప్పారు. ప్రస్తుత ప్రపంచ వాణిజ్య పద్ధతులకు అనుగుణంగా పరస్పర ప్రయోజనాన్ని అందిస్తూ వాణిజ్యానికి అనుకూలంగా ఉండేలా 'ఏఐటీఐజీఏ'పై జరుగుతున్న సమీక్షను ఇరు నేతలు స్వాగతించారు. ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో 'ఎంఐసీఈసీఏ' సామర్థ్యాన్ని అభినందించిన ఇరువురు.. దీనిని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. 

పెరుగుతున్న ద్వైపాక్షిక పెట్టుబడులను స్వాగతించిన ఇద్దరు ప్రధానమంత్రులు.. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనంతో సహా ఇంధన రంగం, అధునాతన తయారీ, సెమీకండక్టర్లు, ఆరోగ్య రక్షణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సాంకేతికత, అంకురాలు, కృత్రిమ మేధ (ఏఐ), ఆతిథ్య రంగం, హరిత సాంకేతికతలు, ఇతర అధిక విలువ కలిగిన రంగాలతో సహా ప్రాముఖ్యం కలిగిన రంగాల్లో మరింత సహకారం, పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మలేషియా కంపెనీలకు భారతదేశం ఒక ప్రధాన పెట్టుబడి గమ్యస్థానమని ప్రధాని మోదీ అన్నారు. మలేషియాలో భారతీయ తయారీ, సాంకేతిక సంస్థలు గణనీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటాన్ని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వాగతించారు. ఈ సంస్థలు మలేషియాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కల్పనకు ఎంతో దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

2026 ఫిబ్రవరి 7న కౌలాలంపూర్‌లో జరిగిన 10వ 'భారత్-మలేషియా సీఈఓ ఫోరమ్' సమావేశాన్ని రెండు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. ఈ ఫోరమ్ విడుదల చేసిన పత్రాన్ని గుర్తిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ ఫోరమ్ అదనపు బలాన్ని ఇస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించే విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ నెగారా మలేషియా మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు ప్రధానమంత్రులు అభినందించారు. వాణిజ్య లావాదేవీల రసీదులు, చెల్లింపులను స్థానిక కరెన్సీలలో అనగా భారత రూపాయి, మలేషియా రింగిట్‌లలో జరిపేలా పరిశ్రమలను మరింత ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు.

ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో 'అనుసంధానత' అనేది ఒక కీలకమైన అంశమని.. చోదక శక్తి అని ఇద్దరు నాయకులు గుర్తించారు. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న విమాన, సముద్రయాన అనుసంధానత పట్ల అభినందనలు తెలియజేశారు. దీనిని మరింత బలోపేతం చేయడానికి అంగీకరిస్తున్నట్లు తెలిపారు. 

ఆహార భద్రతవ్యవసాయ ఉత్పత్తుల సహకారం

ఆహార భద్రత, పోషకాహార రంగంలో ముఖ్యంగా నిత్యావసర వస్తువుల వాణిజ్యంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. ఈ ప్రక్రియలో ప్రతి దేశం అంతర్గత విధానాలను గౌరవించాలని నిర్ణయించారు. తమ దేశాల ప్రజల ఆహార భద్రత, పోషకాహార అవసరాలను కాపాడేందుకు స్థిరమైన, పటిష్ఠమైన, సుస్థిరమైన సరఫరా వ్యవస్థల ప్రాముఖ్యతను వారు ప్రముఖంగా చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తి, వాణిజ్యంలో వచ్చే అడ్డంకులను ముందుగానే ఊహించి వాటిని నివారించడానికి క్రమబద్ధమైన చర్చలు, సమాచార మార్పిడి, ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.

మలేషియా ఎల్లప్పుడూ సుస్థిరమైన పామాయిల్ సరఫరాలో నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం పునరుద్ఘాటించారు. ఈ విషయంలో పామాయిల్ సాగులో మరింత లోతైన సహకారాన్ని అందించుకోవాలని ఇరు నేతలు నిర్ణయించారు. పామాయిల్ వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధిలో ముఖ్యంగా శుద్ధి- అనంతర ప్రక్రియలు(డౌన్‌స్ట్రీమ్), అధిక విలువ కలిగిన పామాయిల్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. మార్కెట్ అందుబాటులో ఉంచే విషయంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి ఒక వ్యవస్థాగతమైన చర్చా విధానాన్ని అనుసరించాలని కూడా వారు నిర్ణయించారు.

డిజిటల్ఆర్థిక సహకారం

మలేషియా-ఇండియా డిజిటల్ కౌన్సిల్ (ఎంఐడీసీ) అధికారికంగా ఏర్పడటం పట్ల ఇరు దేశాల నాయకులు అభినందనలు తెలియజేశారు. ఆర్థిక సాంకేతికత, ఈ-గవర్నెన్స్, సైబర్ భద్రత, కృత్రిమ మేధ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), ఇతర అత్యాధునిక సాంకేతిక రంగాలలో ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలను అన్వేషించేందుకు.. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, డిజిటల్ సహకారాన్న ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కౌన్సిల్ ఒక కీలక వేదికగా మారుతుందని వారు గుర్తించారు. ఇరు దేశాల డిజిటల్ పరివర్తన లక్ష్యాలను సాధించడం, ద్వైపాక్షిక డిజిటల్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఎంఐడీసీ ఒక వ్యూహాత్మక యంత్రాంగంగా పనిచేస్తుందని ఇరువురు పేర్కొన్నారు.  

ద్వైపాక్షిక చెల్లింపుల అనుసంధానాన్ని ఏర్పాటు చేయడానికి 'ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ లిమిటెడ్' (ఎన్ఐపీఎల్), మలేషియాకు చెందిన 'పే-నెట్' మధ్య కుదిరిన భాగస్వామ్యాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఈ అనుసంధానం వల్ల వ్యాపార నిర్వహణ సులభతరం కావడమే కాకుండా పర్యాటకులు, విద్యార్థులు, చిన్న వ్యాపారవేత్తలకు తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన చెల్లింపు పరిష్కారాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఇది భారత్, మలేషియా మధ్య ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచనుంది.

ఇంధనసెమీకండక్టర్ రంగంలో సహకారం

భారతదేశపు పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్ రంగాలలో మలేషియాకు చెందిన పెట్రోనాస్, గెంటారి సంస్థలు సాధించిన పురోగతిని ఇరు దేశాల నాయకులు గుర్తించారు.ఈ విషయంలో భారీ స్థాయి సౌరశక్తి ప్రాజెక్టులలో మరింతగా సహకరించుకోవడానికి ఉన్న అపారమైన అవకాశాలను ఇరువురు నాయకులు పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడానికి, ఇరు దేశాల ఉద్గార రహిత (నెట్ జీరో) లక్ష్యాలను చేరుకోవడానికి మలేషియాకు ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని వారు నిర్ణయించారు. అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటుచేయటంలో భారత్‌ చేసిన కృషిని మలేషియా అభినందించింది.

ప్రపంచ సాంకేతిక రంగంలో సెమీకండక్టర్ పరిశ్రమకు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించిన ఇరువురు నాయకులు.. ఈ రంగంలో ద్వైపాక్షిక సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడం వల్ల కలిగే పరస్పర ప్రయోజనాలను ప్రధానంగా పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని పెంచటం, సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మావన వనరులు అభివృద్ధిపై దృష్టి సారిస్తూ పోటీతత్వం, దృఢత్వం కలిగిన వ్యవస్థను నిర్మించేందుకు సెమీకండక్టర్ వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేసే విషయంలో సహకారాన్ని మరింత పెంచటానికి ఉన్న ప్రాముఖ్యతను వారు తెలిపారు. ఐఐటీ-మద్రాస్ గ్లోబల్, మలేషియాకు చెందిన అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ అకాడమీ మధ్య.. అలాగే ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ), మలేషియా సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎంఎస్ఐఏ) మధ్య కొనసాగుతున్న సహకార కార్యక్రమాలను ఇరువురు ప్రధానమంత్రులు ప్రశంసించారు. 

రక్షణభద్రతా సహకారం

భారత్, మలేషియా మధ్య ఉన్న పటిష్ఠమైన రక్షణ సంబంధాల పట్ల ఇరు దేశాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిరంతర చర్చలు, పర్యటనలు, సైనిక చర్చలు, విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, రక్షణ రంగ పరిశ్రమల సహకారం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేశాయని వారు పేర్కొన్నారు. 'స్ట్రాటజిక్ అఫైర్స్ వర్కింగ్ గ్రూప్' (ఎస్ఏడబ్ల్యూజీ) , 'ఎస్‌యూ-30 ఫోరమ్' ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలతో(టర్మ్ ఆఫ్ రిఫరెన్స్) పాటు 'మలేషియా-ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ' (మిడ్‌కామ్), దాని ఉపకమిటీలు సాధించిన పురోగతిని వారు స్వాగతించారు.

‘ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ ఫ్రేమ్‌వర్క్’లో భారతదేశం నిరంతరం చూపుతున్న చొరవను నాయకులు అభినందించారు. 2024-2027 కాలానికి 'ఉగ్రవాద వ్యతిరేక వర్కింగ్ గ్రూప్'కు మలేషియాతో కలిసి భారత్ సహ-అధ్యక్షత వహించడాన్ని వారు స్వాగతించారు. భారత్, మలేషియాలు సంయుక్తంగా సహ-అధ్యక్షత వహిస్తున్న 'కౌంటర్ టెర్రరిజం టేబుల్-టాప్ ఎక్సర్‌సైజ్'లో (ఈడబ్ల్యూజీ సీటీ టీటీఎక్స్)  పాల్గొనాల్సిందిగా ఏడీఎంఎం-ప్లస్ సభ్య దేశాలన్నింటినీ నాయకులు ఆహ్వానించారు. ఈ నిపుణుల బృంద విన్యాసాలు 2026లో మలేషియా వేదికగా జరగనున్నాయి. 

ఏరో ఇండియా-2025, లంకావి ఇంటర్నేషనల్ మారిటైమ్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ (లిమా- 2025) వంటి రక్షణ ప్రదర్శనలలో ఇరు దేశాల రక్షణ బృందాలు, కంపెనీలు పాల్గొనడాన్ని నాయకులు గుర్తించారు.

2025 డిసెంబర్ 5-18లలో భారతదేశంలోని రాజస్థాన్‌లో భారత సైన్యం, రాయల్ మలేషియన్ ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన 5వ విడత ఉమ్మడి సైనిక విన్యాసం 'హరిమౌ శక్తి' విజయవంతమవటం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

సముద్రాల విషయంలో భారత్, మలేషియాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రధానమంత్రులు తెలిపారు. ఇందులో భాగంగా సౌహార్దపూర్వక సందర్శనలు, కార్యాచరణ మోహరింపులు  క్రమం తప్పకుండా జరుగుతున్నట్లు గుర్తించారు. అక్టోబర్ 2025లో మలేషియాలోని కెమామన్‌ను ఐఎన్ఎస్ సహ్యాద్రి, జూలై 2025లో క్లాంగ్‌ ఒడరేవును హైడ్రోగ్రాఫిక్ నౌక ఐఎన్ఎస్ సంధ్యాయక్ సందర్శించడాన్ని వారు అభినందించారు. 'సముద్ర లక్ష్మణ', మిలన్, ఆసియాన్-ఇండియా సముద్ర విన్యాసాలు (ఏఐఎంఈ) వంటి ద్వైపాక్షిక, బహుపాక్షిక నౌకాదళ విన్యాసాలతో పాటు తరచుగా జరుగుతున్న ఇరు దేశాల నావికా దళాల కార్యక్రమాలను వారు స్వాగతించారు.

మొదటి 'మలేషియా-భారత భద్రతా చర్చల’ కింద ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సహకారం నెలకొనడం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా అంశాల విషయంలో పరస్పర సహకారం గురించి చర్చించడానికి ఒక వేదికగా దీనిని ఏర్పాటు చేశారు.

సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రూపాలు, విధానాల్లోని ఉగ్రవాదాన్ని ఇరువురు ప్రధానమంత్రులు నిస్సందేహంగా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం పట్ల 'జీరో టాలరెన్స్' ఉండాలని.. ఉగ్రవాదాన్ని సమగ్రంగా, నిరంతరంగా ఎదుర్కోవడానికి సంఘటిత అంతర్జాతీయ ప్రయత్నాలు జరగాలని వారు పిలుపునిచ్చారు. సమాచారం - విజ్ఞానాన్ని పంచుకోవడం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, సామర్థ్య పెంపుదల ద్వారా తీవ్రవాదం- హింసాత్మక ఉగ్రవాదాన్ని అరికట్టడానికి, తీవ్రవాదులకు అందుతున్న నిధులను అడ్డుకోవడానికి, ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్త- వర్ధమాన సాంకేతికతలను ఉపయోగించకుండా నిరోధించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉగ్రవాదం, సీమాంతర వ్యవస్థీకృత నేరాల మధ్య ఉన్న సంబంధాలను గుర్తించిన ఇరువురు నేతలు.. సమాచారం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా ఈ నేరాలను అరికట్టడంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) వంటి అంతర్జాతీయ వేదికలతో సహా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్ధతను ఇరు నేతలు పునరుద్ఘాటించారు.

విద్యనైపుణ్యాభివృద్ధి

ఇరు దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న విషయాన్ని.. 'మలేషియా టెక్నికల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్' (ఎంటీసీపీ), 'ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్' (ఐటీఈసీ) కింద కొనసాగుతున్న కార్యక్రమాలను ఇరువురు నాయకులు గుర్తించారు. విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడిని పెంపొందించుకోవటంతో పాటు విద్యా సంస్థల మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలను ప్రోత్సహిస్తున్నట్లు వారు తెలిపారు. భారత్ చేపట్టిన 'స్టడీ ఇన్ ఇండియా' కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మలేషియా విద్యార్థులను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

ఇరు దేశాల మారుతున్న అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడానికి ' ‘వృత్తి విద్యా శిక్షణ' (టీవీఈటీ) రంగంలో సహకారాన్ని పెంపొందించటానికి ఉన్న ప్రాముఖ్యతను ఇద్దరు నేతలు ప్రధానంగా పేర్కొన్నారు. వృత్తి విద్యా శిక్షణను బలోపేతం చేయడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, నైపుణ్యాభివృద్ధి ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి.. ఉమ్మడి కార్యక్రమాలు, విజ్ఞానాన్ని పంచుకోవడం, మార్పిడి కార్యక్రమాలను చేపట్టాలని వారు పిలుపునిచ్చారు.

సంస్కృతిపర్యాటకంప్రజల మధ్య సంబంధాలు

ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను దృష్టిలో ఉంచుకొని కార్మికులు, నిపుణుల రాకపోకలను మరింత సులభతరం చేయటానికి ఇరువురు ప్రధానమంత్రులు అంగీకరించారు.

పర్యాటకం అనేది ద్వైపాక్షిక సహకారంలోఒక కీలకమైన అంశమని, భారత్-మలేషియా బంధాలను బలోపేతం చేసే ముఖ్యమైన శక్తి అని నాయకులు పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో 'విజిట్ మలేషియా 2026' కార్యక్రమాన్ని భారత్ స్వాగతించగా.. 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' పర్యాటక కార్యక్రమాన్ని మలేషియా అభినందించింది. ఆర్థిక వృద్ధి, పరస్పర అవగాహనకు తోడ్పడే సుస్థిర, సమగ్ర పర్యాటక ప్రాముఖ్యతను ఇరుపక్షాలు పేర్కొన్నాయి. పర్యాటక సహకారాన్ని మరింత లోతుగా పెంపొందించడానికి, ఇరు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలను పెంచడానికి ఉమ్మడి నిబద్ధతతో ఉన్నట్లు నాయకులు తెలిపారు. 

ప్రజల మధ్య సంబంధాలు ధృడంగా ఉండటాన్ని గుర్తించిన ఇరువురు నేతలు.. పర్యాటకుల సంఖ్య, వ్యాపార ప్రయాణాలను పెంచిన ప్రస్తుత 'వీసా సరళీకరణ' చర్యలను స్వాగతించారు.

పరస్పర విశ్వాసం- ప్రయోజనం, ఉమ్మడి విజయ స్ఫూర్తితో భారత్-మలేషియా మధ్య విమాన అనుసంధానాన్ని బలోపేతం చేయాలనే నిబద్ధతను ఇరు నేతలు పునరుద్ఘాటించారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రజల మార్పిడి విషయంలో అనుసంధానతకు ఉన్న ప్రాముఖ్యత, పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను గుర్తించిన రెండు ప్రభుత్వాలు.. పౌర విమానయాన రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు అంగీకరించాయి.

ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న విమాన ట్రాఫిక్ హక్కులను మరింత పెంచాలని మలేషియా ప్రతిపాదించగా.. దీనిని భారత్ సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంది.

కౌలాలంపూర్‌లోని ప్రఖ్యాత మలేయా విశ్వవిద్యాలయం(యూఎం)లో 'తిరువళ్లువర్ పీఠం' కార్యరూపం దాల్చడం పట్ల ఇరు నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే అదే విశ్వవిద్యాలయంలో 'తిరువళ్లువర్ కేంద్రం' ఏర్పాటును వారు స్వాగతించారు. మలేషియా ప్రజల కోసం 'తిరువళ్లువర్ ఉపకారవేతనాల' ప్రకటించటాన్ని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వాగతించారు.

ఆరోగ్య రంగ సహకారం

ఆరోగ్య సంరక్షణ, సంప్రదాయ వైద్య రంగాలలో భాగస్వామ్యాన్ని ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలోని కీలకమైన వైద్య అవసరాలను తీర్చడానికి తగిన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలను అన్వేషించాలని ఇరు నేతలు నిర్ణయించారు.  

'ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' (ఐటీఈసీ) కార్యక్రమం కింద భారతీయ సంప్రదాయ వైద్య నిపుణులను (టీఐఎం) భవిష్యత్తులో మలేషియాకు పంపే విషయంలో అవసరమైన ఏర్పాట్లు చేయడానికి మలేషియా కట్టుబడి ఉంది. దీనిపై భారతదేశంతో క్రీయాశీల సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇది మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంపిక చేసిన ఆసుపత్రులలో భారతీయ సంప్రదాయ వైద్య సేవలను తిరిగి ప్రారంభించడానికి దోహదపడుతుంది. తద్వారా అల్లోపతి వైద్యంతో పాటు సమగ్ర, సంపూర్ణ చికిత్సా విధానం అందుబాటులోకి వస్తుంది.

అందుబాటు ధరలో ఆరోగ్య సంరక్షణ, ఔషధాల రంగంలో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని నాయకులు గుర్తించారు. ఔషధ నియంత్రణ, ఫార్మాకోపియా గుర్తింపు, నర్సింగ్ సేవల గుర్తింపు వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య జరుగుతున్న చర్చలను వారు స్వాగతించారు.

హోమియోపతి రంగంలో పరిశోధన సహకారం, శిక్షణ, విద్యాపరమైన మార్పిడిని ప్రోత్సహించే లక్ష్యంతో అక్టోబర్ 2025లో భారత్‌కు చెందిన 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి' (సీసీఆర్‌హెచ్), మలేషియాలోని 'యూనివర్సిటీ ఆఫ్ సైబర్‌జయా' (యూఓసీ) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ఇరువురు నాయకులు స్వాగతించారు.

సుస్థిర అభివృద్ధిలో సహకారం

జీవవైవిధ్య సంరక్షణ పట్ల ఉమ్మడి నిబద్ధతను ఇరువురు నాయకులు ప్రధానంగా చెప్పారు. ముఖ్యంగా 'అంతర్జాతీయ పెద్దపులుల కూటమి' (ఐబీసీఏ)లో వ్యవస్థాపక సభ్య దేశంగా మలేషియా పోషిస్తున్న పాత్రను వారు ప్రశంసించారు. పరిశోధన- అభివృద్ధి, సామర్థ్య పెంపుదల, సాంకేతిక బదిలీ, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారత్, మలేషియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 'పెద్ద పులుల' జాతులను సంరక్షించేందుకు ఇరు నేతలు నిబద్ధతను పునరుద్ధరించారు.

ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తుల పట్ల రెండు దేశాలకు ఉన్న ముప్పును గుర్తించిన ఇరువురు నేతలు.. విపత్తు సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ఇందులో భాగంగా నైపుణ్యాలను పంచుకోవడం, విపత్తు నిర్వహణ, గాలింపు సహాయక పద్ధతులలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఉమ్మడి విన్యాసాలను నిర్వహించడం వంటివి ఉంటాయి. ఇరు దేశాల జాతీయ విపత్తు నిర్వహణ సంస్థల మధ్య కుదిరిన 'విపత్తు నిర్వహణ సహకార అవగాహన ఒప్పందం' (ఎంఓయూ) కింద ఈ పనులు  కొనసాగుతాయి. అంతర్జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, దృఢత్వాన్ని ప్రోత్సహించడంలో 'వైపరీత్యాలను తట్టుకొనే మౌలికసదుపాయాల కూటమి’ (సీడీఆర్ఐ) వంటి ప్రాంతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల ప్రాముఖ్యతను ఇరు దేశాల నాయకులు గుర్తించారు.

ప్రాంతీయబహుపాక్షిక సహకారం

ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త కీలక అంశాలపై ఇరువురు నాయకులు అభిప్రాయలను పంచుకున్నారు. ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని వారు ప్రముఖంగా చెప్పారు. 

2026లో భారత్‌ 'బ్రిక్స్' అధ్యక్ష పదవిని చేపట్టడాన్ని మలేషియా స్వాగతించగా.. బ్రిక్స్ భాగస్వామ్య దేశంగా ఉన్న  మలేషియాకు మద్దతు ఇవ్వడానికి నిబద్ధతతో ఉన్నట్లు భారత్ తెలిపింది. అలాగే బ్రిక్స్‌లో పూర్తి స్థాయి సభ్యత్వం పొందాలన్న మలేషియా ఆకాంక్షను భారత్ గుర్తించింది. మరింత సమతుల్యమైన, ప్రాతినిధ్యంతో కూడిన అంతర్జాతీయ క్రమాన్ని నిర్మించడంలో ఈ సహకారం ఒక వ్యూహాత్మక ఘట్టమని ఇరువురు నేతలు గుర్తించారు. ఇలాంటి భాగస్వామ్యాలు ప్రపంచవ్యాప్తంగా సమానమైన నియంత్రణను అందించడానికి, సుస్థిర అభివృద్ధికి దేశాలు తమ వంతు నిర్మాణాత్మక సహకారాన్ని అందించడానికి కీలకమైన వేదికలుగా నిలుస్తాయని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్యసమితితో సహా బహుపాక్షిక వేదికలలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని.. అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని ఇరువురు ప్రధానమంత్రులు అంగీకరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో (యూఎన్ఎస్‌సీ) సహా అంతర్జాతీయ సంస్థలను మరింత ప్రాతనిధ్యం, సమకాలీన వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చడానికి కలిసి పనిచేసేందుకు వారు ఒప్పుకున్నారు. బహుపాక్షిక వేదికలపై ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన పరస్పర సహకార స్ఫూర్తిని చాటుతూ వివిధ అంతర్జాతీయ అభ్యర్థిత్వాలకు సంబంధించి ఒకరికొకరు మద్దతునిచ్చుకోవడంపై ఇరువురు నాయకులు చర్చించారు. సంస్కరించిన యూఎన్‌ఎస్‌సీలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న మలేషియా మద్దతును భారత్ గట్టిగా అభినందించింది.

అవినీతి నిరోధించటం- నిర్మూలించటంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ), విపత్తు నిర్వహణపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ), మలేషియాలో బీమా రక్షణ ఉన్న భారతీయ పౌరుల కోసం సామాజిక భద్రతా కార్యక్రమాలు- కార్యకలాపాలను ప్రోత్సహించే సహకార ఒప్పందం (ఎంఓసీ), దృశ్య శ్రవణ సహ- నిర్మాణం‌పై కుదిరిన ఒప్పందాలను ఇరువురు నాయకులు స్వాగతించారు. సెమీకండక్టర్లు, ఆరోగ్య సంరక్షణ, జాతీయ భద్రత, వృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీ) రంగాలలో సహకారం కోసం భారత్ - మలేషియా మధ్య జరిగిన అధికారిక పత్రాల మార్పిడి ప్రక్రియను కూడా నాయకులు స్వయంగా వీక్షించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సహకార ఒప్పంద పునరుద్ధరణకు సంబంధించిన అధికారిక లేఖల మార్పిడిని (ఈఓఎల్), అంతర్జాతీయ పెద్దపులుల కూటమి (ఐబీసీఏ) ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని మలేషియా ఆమోదించడాన్ని ఇరువురు నాయకులు గుర్తించారు.

1982 నాటి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందంలో (యూఎన్‌సీఎల్ఓఎస్) పొందుపరిచిన అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. ఎటువంటి అడ్డంకులు లేకుండా నౌకల రాకపోకలు, విమాన ప్రయాణాలు, చట్టబద్ధమైన వాణిజ్యం సాగాలనే నిబద్ధతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. వివాదాలను యూఎన్‌సీఎల్ఓఎస్- 1982తో సహా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చట్టాలు, సూత్రాలకు అనుగుణంగా శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవాలని అన్ని పక్షాలకు వారు విజ్ఞప్తి చేశారు. 

ఆసియాన్ దేశాల ఐక్యత, ఆసియాన్ ప్రధాన పాత్ర పోషించే విషయంలో భారతదేశం అందిస్తున్న పూర్తిస్థాయి నిరంతర మద్దతును ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వాగతించారు. 2025లో ఆసియాన్ అధ్యక్ష పదవిని మలేషియా విజయవంతంగా నిర్వహించిన తీరును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అలాగే భారత్-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉమ్మడిగా బలోపేతం చేయడంలో మలేషియాతో పాటు ఇతర ఆసియాన్ సభ్య దేశాలు అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

స్వేచ్ఛాయుత, బహిరంగ, నిబంధనలకు కట్టుబడి ఉండే శాంతియుత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించేందుకు ఇరువురు నాయకులు నిబద్ధతతో ఉన్నట్లు తెలిపారు. ఏఓఐపీ(ఆసియాన్ అవుట్‌లుక్ ఆన్ ది ఇండో-పసిఫిక్ ) సహకార రంగాల్లో కార్యక్రమాలను అమలు చేయటంతో పాటు ఏఓఐపీ, భారత్‌కు చెందిన 'ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్' (ఐపీఓఐ) మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం  'ఆసియాన్-ఇండియా జాయింట్ స్టేట్‌మెంట్ ఆన్ కోఆపరేషన్ ఆన్ ది ఆసియాన్ అవుట్‌లుక్ ఆన్ ది ఇండో-పసిఫిక్ (ఏఓఐపీ)'ను అమలు చేయడంలో పెరుగుతున్న కృషిని ఇరుపక్షాలు స్వాగతించాయి.

ఈ పర్యటనలో తనకు, తన ప్రతినిధి బృందానికి లభించిన సాదర స్వాగతం, అపూర్వమైన ఆతిథ్యానికి ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, మలేషియా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే భారతదేశంలో పర్యటించవలసిందిగా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంను ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views

Media Coverage

Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings to all civil servants on Civil Services Day
April 21, 2026

The Prime Minister, Shri Narendra Modi extended greetings to all civil servants on Civil Services Day, today. Shri Modi remarked that this is an occasion to further strengthen the resolve to work towards good governance and nation building. "From the grassroots to policy-making, the efforts of civil servants touch countless lives and contribute to India’s progress. May our civil servants continue to serve with excellence, compassion and innovation, upholding the highest standards of duty", Shri Modi said.

Shri Modi posted on X:

"Greetings to all civil servants on Civil Services Day. This is an occasion to further strengthen the resolve to work towards good governance and nation building. From the grassroots to policy-making, the efforts of civil servants touch countless lives and contribute to India’s progress. May our civil servants continue to serve with excellence, compassion and innovation, upholding the highest standards of duty."