“భారత యువత నిరంతరం దేశ ప్రగతివైపు నడిచేలా ‘ఎన్‌సిసి’ స్ఫూర్తినిచ్చింది”
“ప్రపంచ శ్రేయస్సు దిశగా భారత యువత ఓ కీలక శక్తి”
“భారత యువత ఎదుర్కొంటున్న అనేక అవరోధాల తొలగింపు దిశగా గత పదేళ్లలో మా కృషి ఫలించడంతో వారి సామర్థ్యం ఇనుమడించింది”
“ప్రస్తుత అమృత కాలంలో మన ఏకైక లక్ష్యం ‘వికసిత భారత్’... మన ప్రతి నిర్ణయానికీ ఇదే ప్రమాణం... మన ప్రతి కార్యాచరణకూ అదే గమ్యం కావాలి”

 కేంద్ర మంత్రిమండలిలోని నా సహచరులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ సంజయ్ సేథ్, ‘సిడిఎస్‌’ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ కార్యదర్శి గారు, ‘ఎన్‌సిసి’ డీజీగారు, ఇతర అతిథులు నా ప్రియ ‘ఎన్‌సిసి’ యువ మిత్రులారా!

   మున్ముందుగా... ‘ఎన్‌సిసి దినోత్సవం’ నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. మీతోపాటు 18 మిత్ర దేశాల నుంచి దాదాపు 150 మంది కేడెట్లు కూడా ఇవాళ వేడుకకు హాజరయ్యారు. వీరందరికీ కూడా సాదర స్వాగతం... అలాగే దేశంతో ముడిపడిన ‘మేరా యువ భారత్’, ‘మై భారత్‌’ సహచరులకూ నా అభినందనలు.

మిత్రులారా!

   గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎంపిక కావడమే మీరు సాధించిన విజయం. ఒక గణతంత్రంగా భారత్‌ 75 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రస్తుత వేడుకలు మనకెంతో  ప్రత్యేకం. నేటి ఈ జ్ఞాపకాలన్నీ జీవితాంతం మదిలో నిలిచిపోతాయి.. నాటి 75వ గణతంత్ర దినోత్సవ కవాతులో మనమూ పాలుపంచుకున్నామని భవిష్యత్తులో మీరు కచ్చితంగా తలచుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘అత్యుత్తమ కేడెట్‌’ పురస్కార విజేతలైన మిత్రులకు హృదయపూర్వక అభినందనలు. ‘ఎన్‌సిసి’ సంబంధిత వివిధ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం నాకు ఇటీవల లభించింది. ఇలాంటి కార్యక్రమాలు భారత వారసత్వాన్ని యువత ఆకాంక్షలతో అనుసంధానిస్తాయి. ఆయా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కేడెట్లందరికీ నా శుభాకాంక్షలు.

 

మిత్రులారా!

   మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో ‘ఎన్‌సిసి’ ఆవిర్భవించింది. ఒక విధంగా చూస్తే- దేశ రాజ్యాంగానికన్నా ముందే మీ సంస్థ తన ప్రయాణం ప్రారంభించిందని చెప్పవచ్చు. గడచిన 75 ఏళ్ల గణతంత్రంలో మన రాజ్యాంగం సదా ప్రజాస్వామ్య స్ఫూర్తినిస్తూ, పౌర విధుల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసింది. అదేవిధంగా భారత యువతకు క్రమశిక్షణ ప్రాముఖ్యాన్ని నేర్పిన ‘ఎన్‌సిసి’- దేశ ప్రగతి దిశగా వారికి ప్రేరణచ్చింది. ‘ఎన్‌సిసి’ పరిధి, బాధ్యతల విస్తరణకు కొన్నేళ్లుగా ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టడం నాకెంతో సంతృప్తినిచ్చింది. దీనివల్ల ‘ఎన్‌సిసి’ సరిహద్దు ప్రాంతాలు సహా తీరప్రాంత జిల్లాలకు విస్తరించింది.

   నేడు 170కిపైగా సరిహద్దు తాలూకాలు, దాదాపు 100 తీరప్రాంత తాలూకాల్లో ‘ఎన్‌సిసి’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ జిల్లాల్లో యువ కేడెట్లకు ప్రత్యేక శిక్షణనిచ్చే బాధ్యతను స్వీకరించిన త్రివిధ దళాలకు నా అభినందనలు. ఈ శిక్షణ కార్యక్రమాలతో ముఖ్యంగా వేలాదిగా సరిహద్దు ప్రాంత యువత ప్రయోజనం పొందింది. కేడెట్ల సంఖ్య పెరగడాన్ని బట్టి ‘ఎన్‌సిసి’లో సంస్కరణల ఫలితాలు కూడా మనకు సుస్పష్టం అవుతున్నాయి. దేశంలో 2014 నాటికి కేడెట్ల సంఖ్య దాదాపు 14 లక్షలు కాగా, ఇవాళ 20 లక్షలకు చేరితే, వీరిలో యువతుల సంఖ్య 8 లక్షల దాకా ఉండటం మనకు గర్వకారణం. విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతోపాటు క్రీడా లోకంలోనూ కేడెట్లు విజయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రపంచంలో యూనిఫాం సహిత అతిపెద్ద యువజన సంస్థగా ‘ఎన్‌సిసి’కి లభించిన గుర్తింపుతో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది.

మిత్రులారా!

   ప్రస్తుత 21వ శతాబ్దంలో దేశాభివృద్ధితోపాటు ప్రపంచ ప్రగతిని నిర్ణయించేది భారత యువతే అనడంలో సందేహం లేదు. భారత యువతరం దేశానికొక బలం మాత్రమే కాదు.. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడగల కీలక శక్తి. ఈ వాస్తవాన్ని ప్రపంచం కూడా అంగీకరిస్తోంది. గత దశాబ్దంలో భారత యువత సాధించిన ఘనతను పత్రికా కథనాలలో ఇటీవల వెలువడిన ఒక నివేదిక వివరించింది. అందులో పేర్కొన్న అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది… మన యువతరం 1.5 లక్షల అంకుర సంస్థల ఏర్పాటు సహా 100కుపైగా ‘యూనికార్న్‌’ సంస్థలను సృష్టించిందని ఆ నివేదిక వెల్లడించింది. అంతేకాదు… అంతర్జాతీయ స్థాయిలో 200కుపైగా ప్రధాన కంపెనీలను నడిపిస్తున్నది భారత సంతతి నిపుణులే. ప్రపంచ ‘జిడిపి’కి ఆయా సంస్థలు రూ.కోటానుకోట్లు జోడిస్తుండటం మరో విశేషం. తద్వారా లక్షలాది ప్రజల జీవితాలను మెరుగుదిద్దడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇక ప్రపంచ పురోగమన వేగం ఇనుమడించడంలో భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉపాధ్యాయుల కృషి అమూల్యం. మొత్తంమీద రంగం ఏదైనా… భారత యువత సామర్థ్యం, ప్రతిభకు తావులేని ప్రపంచ భవిష్యత్తును ఊహించడం కష్టం. కాబట్టే, వారిని ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పడే శక్తిగా వారిని అభివర్ణిస్తున్నాను.

 

మిత్రులారా!

   దేశమైనా… వ్యక్తులైనా అవరోధాలను అధిగమించగలిగితేనే శక్తిసామర్థ్యాలు ఇనుమడిస్తాయి. అందుకు తగినట్లుగా గత 10 సంవత్సరాల్లో భారత యువత సామర్థ్యానికి ఎదురైన అనేక అవరోధాలను తప్పించాం. దీనివల్ల యువతలోనేగాక దేశ సామర్థ్యం కూడా మెరుగుపడటం నాకెంతో సంతృప్తినిస్తోంది. నేటి యువతరంలో అధికశాతం 2014 నాటికి దాదాపు 10-12 ఏళ్ల వయస్కులై ఉంటారు. అప్పటి పరిస్థితుల గురించి మీ కుటుంబ సభ్యులను వాకబు చేసి చూడండి… లోగడ అడ్మిషన్లు, పరీక్షలు, నియామకాల కోసం అర్హత పత్రాలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అవసరమయ్యేది. ఇందుకోసం అనేక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. మా ప్రభుత్వం యువత కష్టాన్ని తప్పించింది. మీమీద నాకెంతో నమ్మకం.. కాబట్టి, మీ పత్రాలను మీరే ధ్రువీకరించుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులకు ఉపకారవేతన నిధుల పంపిణీలోనూ అనేక సమస్యలు ఉండేవి. దరఖాస్తు సమర్పణ, ఉపకారవేతనం మంజూరు ప్రక్రియలలో నానా బాధలూ తప్పేవి కావు. మరోవైపు ఉపకారవేతన సొమ్ము విద్యార్థుల ఖాతాలకు చేరే బదులు భారీగా దుర్వినియోగం అయ్యేది. ఈ అవస్థలన్నిటికీ స్వస్తి చెబుతూ ప్రభుత్వం ఏకగవాక్ష (సింగిల్ విండో) పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇక పాఠ్యాంశాల ఎంపికలో లోగడ విద్యార్థులు నానా రకాల చిక్కులు ఎదుర్కొన్నారు. బోర్డు (10) పరీక్ష ఉత్తీర్ణత అనంతరం కోర్సులో ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకుంటే విద్యార్థి ఆ తర్వాత దాన్ని మార్చుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు కొత్త జాతీయ విద్యా విధానం కింద తమ అభిరుచికి తగిన పాఠ్యాంశాలకు మారే వెసులుబాటు విద్యార్థులకు లభించింది.

మిత్రులారా!

   ఓ దశాబ్దం కిందట బ్యాంకు రుణం పొందాలంటే యువత కచ్చితమైన పూచీకత్తు (హామీ) ఇవ్వడం తప్పనిసరి. రుణం కావాలంటే ముందుగా గట్టి హామీ చూపాలని బ్యాంకులు కచ్చితంగా చెప్పేవి.  ఈ పరిస్థితుల నడుమ 2014లో దేశ ప్రజలు ప్రధానిగా నాకు బాధ్యతలు అప్పగించాక యువతకు హామీ ఇచ్చే బాధ్యతను నేను స్వీకరించాను. తదనుగుణంగా ముద్ర యోజనను ప్రవేశపెట్టాం… తద్వారా హామీరహిత రుణ సౌలభ్యం కల్పించాం. ఈ పథకం కింద మొదట్లో రూ.10 లక్షలదాకా హామీరహిత రుణాలిస్తే, మా ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చాక ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. ముద్ర యోజన కింద గత పదేళ్లలో రూ.40 లక్షల కోట్లకుపైగా నిధుల పంపిణీ చేయడంతో లక్షలాది యువత సొంత వ్యాపారాలు ప్రారంభించే అవకాశం లభించింది.

 

మిత్రులారా!

   యువతరం భవిష్యత్తు విషయంలో ఎన్నికల వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఓ రెండు రోజుల కిందటే మనం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా చాలామంది యువకులు తొలిసారి ఓటర్లుగా మారారు. ఓటర్లు గరిష్ఠ స్థాయిలో తమ హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడమే ఓటర్ల దినోత్సవం ప్రధానోద్దేశం. ప్రపంచంలో అత్యంత భారీ ఎన్నికల ప్రక్రియను ఇటీవలే మన దేశం పూర్తిచేసింది. అయితే, కొన్ని నెలలకు ఒకసారి తరచూ ఎన్నికలు నిర్వహించాల్సి రావడం అనేక సవాళ్లకు దారితీస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించే సంప్రదాయం ఉండేది. ఈ విధానంలో మార్పుతో దేశానికి నేడు క్లిష్ట సమస్యలు తలెత్తుతున్నాయి. దేశంలో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల ఓటర్ల జాబితాల నవీకరణతోపాటు అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ముఖ్యంగా ఉపాధ్యాయుల విధులకు ఆటంకంతోపాటు విద్యార్థుల చదువులు-పరీక్షల సన్నాహాలపైనా దుష్ప్రభావం తప్పదు. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలకాంశంపై దేశంలో తరచూ చర్చ సాగుతోంది. దీనిపై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు, సంభాషణలు అవసరం ఎంతో ఉంది. అందరూ తమతమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడం అవశ్యం. కాబట్టే, “ఒక దేశం-ఒకే ఎన్నిక” నేడు ప్రధాన చర్చనీయాంశమైంది. లోక్‌సభ, శాసనసభల ఒక తేదీ నిర్ణయించి, ఐదేళ్లకొకసారి ఆ సమయానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి.

   ఈ చర్చలో ప్రత్యేకించి దేశ యువతరం చురుగ్గా పాలుపంచుకోవాలని కోరుతున్నాను. దేశవ్యాప్తంగాగల ‘ఎన్‌సిసి’ కేడెట్లు, ‘ఎన్‌ఎస్‌ఎస్‌’ మిత్రులు, ‘మై భారత్‌’ కార్యకర్తలు, ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్లాలని నా అభ్యర్థన. ముఖ్యంగా మీరు ముందుండి పెద్ద సంఖ్యలో ప్రజలంతా ఈ చర్చలో పాల్గొనేలా శ్రద్ధ వహించాలి. ఇది ప్రత్యక్షంగా మీ భవిష్యత్తుతో ముడిపడిన అంశం. చివరకు అమెరికా వంటి దేశాల్లో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికల నిర్వహణతోపాటు నిర్దిష్ట తేదీకల్లా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే విధానం అమలులో ఉంది. అంతెందుకు! మీ కళాశాలలు లేదా పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా ఏకకాలంలో పూర్తవుతుంటాయి. కానీ, నెలకోసారి.. ఏదో ఒక ఎన్నిక నిర్వహించాల్సి వస్తే విశ్వవిద్యాలయంలో లేదా కళాశాలలో మీ చదువుసంధ్యలు సవ్యంగా సాగుతాయంటారా? ఒక్కసారి ఆలోచించండి… అందుకే, “ఒకే దేశం-ఒకే ఎన్నిక”పై చర్చకు నాయకత్వం వహించాల్సింది మీరే. సరైన దిశలో పయనానికి నిర్ణయం తీసుకునేలా దేశవ్యాప్తంగా ఈ చర్చ సాగడం తప్పనిసరి.

మిత్రులారా!

   ప్రస్తుత 21వ శతాబ్దపు ప్రపంచం వేగంగా మారిపోతోంది. దానికి అనుగుణంగా శరవేగంతో ముందడుగు వేయడం అత్యావశ్యకమని కాలం స్పష్టం చేస్తోంది. ఈ రూపాంతరీకరణలో యావద్దేశ యువత పాత్ర అత్యంత కీలకం. కళలు, పరిశోధన లేదా ఆవిష్కరణ వంటి ఏ రంగంలోనైనా ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సృజనాత్మకతతో కొత్త శక్తి నింపేందుకు యువత ముందుకు రావాలి. ఈ క్రమంలో రాజకీయాలు కూడా అంతటి ప్రాముఖ్యంగల రంగమే. కొత్త సూచనలు, వినూత్న ఆలోచనలు, సరికొత్త శక్తితో యువత వీలైనంత ఎక్కువ సంఖ్యలో రాజకీయ రంగప్రవేశం చేయాలి. ఇది నేటి తక్షణావసరమని గుర్తించండి. కాబట్టే, లోగడ నేను ఎర్రకోట పైనుంచి ప్రసంగిస్తూ- లక్షమంది యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చాను. యువతరం శక్తిసామర్థ్యాలేమిటో “వికసిత భారత్: యువ నాయక చర్చాగోష్ఠి” కార్యక్రమంలో మనం చూశాం. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువత అమూల్య సూచనలిచ్చారు. వికసిత భారత్‌ సంకల్ప సాకారంపై తమ ఆలోచనలను పంచుకున్నారు.

 

మిత్రులారా!

   స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో వృత్తులతో నిమిత్తం లేకుండా ప్రజల్లో ప్రతి ఒక్కరూ దేశవిముక్తే ఏకైక లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా యువతరం ఎంతో ఉత్సాహంతో ఆ సమరంలో భాగస్వాములై, ఎన్నో త్యాగాలు చేశారు… జైళ్లలోమగ్గారు. అదేవిధంగా ప్రస్తుత అమృత కాలంలో యువతకు ‘వికసిత భారత్‌” ఏకైక లక్ష్యం కావాలి. మన ప్రతి నిర్ణయానికీ ఇదే ప్రమాణం కావాలి… ప్రతి కార్యాచరణకూ అదే గమ్యంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ‘పంచ ప్రాణ్‌’ మంత్రాన్ని గుర్తుంచుకోవాలి. అంటే- “వికసిత భారత్‌ నిర్మాణం, బానిస మనస్తత్వం నుంచి విముక్తం కావడం, మన వారసత్వంపై గర్వించడం, దేశ సమైక్యతకు కృషి చేయడం, నిజాయితీతో విధి నిర్వహణ” ప్రధానం. ఈ ‘పంచ ప్రాణ్’ సూత్రం ప్రతి భారతీయుడికీ మార్గనిర్దేశం చేసి, స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుత కార్యక్రమంలో భాగంగా మీరిచ్చిన సాంస్కృతిక ప్రదర్శన నన్నెంతగానో ఆకట్టుకుంది. దేశానికి ఎంతో బలమైన “ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్” స్ఫూర్తిని ఇది ప్రతిబింబించింది. ప్రయాగ మహా కుంభమేళా కూడా దేశంలో వెల్లివిరిసే ఐక్యతకు ప్రతీక. అందుకే దీన్ని ‘ఐక్యత కుంభ్’గా నేను అభివర్ణిస్తున్నాను. దేశ పురోగమనానికి ఈ సమైక్యత అత్యంత కీలకమనడం అతిశయోక్తి కాబోదు.

 

మిత్రులారా!

   మీరంతా మీమీ బాధ్యతలను సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది… దివ్య, భవ్య వికసిత భారత్‌ నిర్మాణానికి పునాది వేసేది ఈ కర్తవ్య నిబద్ధతే.

మిత్రులారా!

  ఈ రోజున నేను మీలో ఒకడినై మీ ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఈ నేపథ్యంలో యువతకు స్ఫూర్తినిచ్చే దిశగా నేను రాసిన కొన్ని అంశాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

అసంఖ్యాక భుజస్కంధాల శక్తి.. అణువణువునా దేశభక్తి పొంగిపొర్లుతున్నాయి.

మీరు త్రివర్ణాన్ని భుజానికెత్తి రెపరెపలాడించండి.. భారత సౌభాగ్యానికి బాటలు వేయండి

మీకు అసాధ్యమంటూ ఏదీ లేదు… మీరు పోగొట్టుకునేదంటూ ఏదీ ఉండదు

మీరంతా లేవండి.. సంఘటితమై కదలండి!

మీ సామర్థ్యాన్ని గుర్తించండి.. మీ కర్తవ్యాన్ని గ్రహించండి!

 

మిత్రులారా!

   మీ ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటూ మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు… అలాగే మీకు అనేకానేక ధన్యవాదాలు. నాతో గళం కలిపి దిక్కులు పిక్కటిల్లేలా నినదించండి-

భారత్‌ మాతా కీ జై.

భారత్‌ మాతా కీ జై.

 

భారత్‌ మాతా కీ జై.

వందేమాతరం... వందేమాతరం.

వందేమాతరం... వందేమాతరం.

వందేమాతరం... వందేమాతరం.

వందేమాతరం!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi inaugurates Northeast’s first Emergency Landing Facility in Moran. Why it matters?

Media Coverage

PM Modi inaugurates Northeast’s first Emergency Landing Facility in Moran. Why it matters?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to great social reformer Shri Sant Sevalal Maharaj
February 15, 2026

The Prime Minister, Shri Narendra Modi paid tributes to the great social reformer Shri Sant Sevalal Maharaj on his birth anniversary, today. “By spreading the message of truth, non-violence, and high moral values, he instilled a new consciousness in society. His inspiring life will forever continue to guide the people of the country”, Shri Modi said.

The Prime Minister posted on X:

“महान समाज सुधारक श्री संत सेवालाल महाराज को उनकी जयंती पर शत-शत नमन। सत्य, अहिंसा और उच्च नैतिक मूल्यों का संदेश देकर उन्होंने समाज में नवचेतना का संचार किया। उनका प्रेरणादायी जीवन सदैव देशवासियों का मार्गदर्शन करता रहेगा।

जय सेवालाल!”